[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన విజయారంగనాథం గారి ‘పునీత పునర్జీవితం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
గుడిలో పెళ్ళి చేసి ఇంటికి తీసుకొచ్చారు సుశీలను పాండురంగణ్ణి. పెద్ద ఆర్భాటాలు లేని కళ్యాణం. పది మంది కంటే లేని ఆహ్వానితులు. అందరూ ఆ వీధి వారే. పెళ్ళి కొడుకు తరపు వారెవరూ లేరు. కొత్త పెళ్ళి కూతురుగా ఎటువంటి ఉత్సాహం లేకుండా నిరాభావంగా ఉంది సుశీల. పెళ్ళి ఇష్టం ఉండటం లేక పోవటం అనే ప్రసక్తి లేదు. ఆడపిల్లకు పెళ్ళి చేయాలి కాబట్టి ఒక మగవాడిని కట్టబెట్టారు. అంతే.. దాన్లో ఆమె పాత్ర ఏమీలేదు.
ఎన్నో కొత్త కొత్త కలలు కనడానికి ఏమాత్రం అవకాశం లేని బతుకు సుశీలది. తాగుబోతు తండ్రి, చాలీ చాలని సంపాదన, ఉన్న ఇద్దరి ఆడపిల్లలకు కడుపు నింపలేని తల్లి అసహాయతా.. రోజూ చూస్తూనే ఉంది. ఇద్దరాడపిల్లలూ చూడ్డానికి తెల్లగా అందంగా ఉంటారు. అందంగా లేక పోతే, ‘పిల్ల అంత బాగా లేదంటారు’. బాగున్నా సరే కట్నాలు కానుకలు పెళ్ళిఖర్చులు తప్పవు. తనకేమి వద్దని, పెద్దమ్మాయి కారుణ్యని చేసుకుంటానని ఇంటి చుట్టూ తిరిగే జనార్దనం సంబంధం ఒప్పుకున్నాడు తండ్రి రామచంద్రయ్య. ఎంతో కష్టం మీద కారుణ్యని అతని చేతిలో పెట్టి పెళ్ళి అయిందనిపించాడు తండ్రి. ఒకరు తక్కువైనా కూడా మారని కుటుంబ పరిస్థితి. పైగా, అల్లుడి పేరిట అప్పుడప్పుడు ఆ ఇంట వారాల కొద్దీ తిష్టవేసేవాడు జనార్దనం. ఏ సంపాదన లేక, సంపాదించాలనే ఇష్టమూ లేక తరుచుగా అత్తవారింటికి రావటం, వెళ్ళేటప్పుడు అంతో ఇంతో మామాగారికి నుంచి దండుకోవటం తన హక్కుగా అలవాటు చేసుకున్నాడు. అప్పుడే రెండో అమ్మాయి పద్దెనిమిదేళ్ళ సుశీల, వయసు నిగనిగలు అతని మతి పోగొట్టాయి. అదను కోసం చూసి పంజా విసరాలని అహర్నిశల వేట. ఆ పులి కోరలనుండి తప్పుకోవటానికి ప్రయత్నం తప్ప ఎవరికీ చెప్పుకోలేక, నోరిప్పితే అక్క జీవితం ఏమవుతుందోననే భయంతో బిక్కచచ్చి పోయింది సుశీల. మానసికంగా పూర్తిగా క్రుంగిపోయింది. ఆమెని అదృష్టం దేవత కరుణిందేమో. బావ పశుత్వానికి బలికాకుండా చిన్న ఉద్యోగం రూపంలో ఇంట్లో ఉండే బాధ తప్పింది.
ఏడో తరగతి వరకు తప్ప సుశీల చదువు ముందుకు సాగలేదు. వానాకాలం చదువుకి, చదవటం రాయటం వచ్చు కాని దాని మీద ఆధారపడే ఎటువంటి ఉద్యోగం సంపాదించే ఆస్కారం లేదనుకుంది. కాని తన పరిస్థితులకు, చదువుకు తగ్గట్టుగా ఓ ప్రైవేటు కంపెనీలో పాకింగ్ పని దొరికింది.
ఇంటి పరిస్థితిని అర్థం చేసుకోగలిగినంత మంచి మనసుంది. కానీ అంత కంటే ఎక్కువ చుట్టూ ఉన్న మనుషుల్ని, వాళ్ళ మనసుల్ని, లోతుగా ఆలోచించుకుని తర్కించుకోలేనంత అమాయకత ఆమె అందమైన ముఖంలో కనబడుతుంది.
తాగుడుకు కోసం మాత్రమే సంపాదించే తండ్రి, కుటుంభానికి కడుపునిండా తిండి సమకూర్చలేనందుకు తనలో తనే బాధపడుతూ, చుట్టు పక్కల వాళ్ళకు అన్నింట్లో సహాయం చేస్తూ, కొందరిళ్ళల్లో పని చేస్తూ పదో పరకో సంపాదించి పిల్లలకు భర్తకు కడుపు నింపి అర్ధాకలితో పడుకునే తల్లి. ఇంటికి పెద్దదైనా ఈ విషయాలేవి పట్టకుండా పెళ్ళైనా కూడా భర్తతో ఇంటికి వచ్చేసి, అల్లుడి మర్యాదలు చేయాలంటూ ఇంటి పరిస్థితిని పట్టించుకోని అక్క. వీటిని చూస్తూ, వేసుకోకుండానే కుటుంబ బాధ్యత సుశీల పైన పడింది. తనకు తోచిన విధంగా సంపాదించాలనే అవసరం, తాపత్రయం దగ్గరలో ఉన్న చిన్న కంపెనీలో చదువుకు సంబంధం లేని పనికి ప్రయత్నం ఫలించింది. వచ్చే జీతంతో తాగుడికి డబ్బులు ఆశించే తండ్రి. అల్లుడి మర్యాదలకు పోనూ, మిగిలిన సంపాదన ఇంటి ఖర్చులకే సరిపోవు. అయినా కంపెనీలో అడిగి మరీ అదనపు పనులకు ఒప్పుకుని సంపాదన పెంచుకోవాలని చూసేది.
ఇక ఈ పెళ్ళి కోసం అక్కా బావ ఎక్కడెక్కడో వెతికి, అత్తగారిల్లు, ఎటువంటి బాదరాబందీ లేని ఈ సంబంధం తెచ్చారు. తను ఎక్కడికెళ్ళక్కర లేకుండా, తన సంపాదన బయటకు పోకుండా జాగర్త పడ్డాడు. దాంట్లో కూడా జనార్దనం తన అనువు చూసుకున్నాడు. సుశీలను తన చెప్పు చేతల్లో ఉంచుకోవచ్చనుకున్నాడు. అందరికీ చాలా నచ్చింది. పిల్లాడికి ఏదో చిన్న ఉద్యోగం. సన్నగా నల్లగా అమ్మవారి మచ్చలతో అందవికారంగా ఉంటాడు పాండురంగడు. ఆయనంత అందంగానే ఉండే మనసు కూడా తోడైంది. ముఖ్యంగా నా అన్నవారు లేరు. ఈ ఇంట్లోనే అల్లుడైన కొడుకులాగే ఇంట్లో ఉండిపోతాడని ఈ సంబంధం ఖాయం చేసానని అన్నాడు బావ. ఎవరైనా తనని అడుగుతే కదా అభిప్రాయం చెప్పేది. అడిగినా చెప్పలేనంత నిస్సహాయత. ముందే ఎదురు చెప్పొద్దని ఆదేశించిన బావ. మౌనంగా ఉండిపోయింది సుశీల. చిన్నప్పుటినుండి ఇంటి కష్టాల్లో ఓలలాడిన, బావ పెట్టే హింసకు బలవుతున్న సుశీలకు ఏ అభిప్రాయాలు లేక మౌనం ఆమెకి ఆభూషణ మైంది. కనీసం తనకు పెళ్ళౌతేనన్న బావ తనకు దూరంగా నైనా ఉంటాడని ఒక చిన్న ఆశ.
ఏ కోరికలూ మధుర స్మృతులు లేకుండానే గదిలోకి తోయబడింది సుశీల. మౌనంగా లోనికి నడిచి అమ్మ ఇచ్చిన నీళ్ళ పాలని భర్తకి ఇద్దామని తలెత్తి చూసింది. కింద వేసిన గొంగడి బొంత మీద తెల్లటి దోవతీ వేసిన పక్క మొత్తాన్ని ఆక్రమించుకుని పడుకుని ఉన్నాడు పాండురంగడు. దగ్గరగా వెళ్ళి తాను వచ్చిన సూచనగా గొంతు సవరించుకుంది. ఆ శబ్దానికి లేచి కూచున్నాడు. పాల గ్లాసు తీసుకుని గటగటా తాగేసి ఖాళీ గ్లాసుని పక్కన బెట్టి సుశీలను చేయి పట్టుకుని కూచో పెట్టాడు. “ఇంత అందంగా ఉన్నావు కదా. మరి నిజంగా నువ్వు ‘సు..శీల’ వేనా? ఉద్యోగం చేస్తున్నావు కదా. నాకు మొదటిసారిగానే నీ అందం స్వంత మవుతుందా? లేక ఎంగిలి భోజనమా?” అన్నాడు వెకిలిగా నవ్వుతూ. భరించలేని కల్లు కంపుతో ముఖం పక్కకు తిప్పుకుంది. ఏమని జవాబు చెబుతుంది. తను పవిత్రురాలినని, తన మనసు నిష్కళంకమని చెపితే నమ్ముతాడా? అతని కుత్సిత బుద్ధి బయట పెట్టుకున్నాడు. అయినా ఆమె జవాబు కోసం ఎదురు చూసే అవసరం తనకు లేదు. ఆమె ఇష్టాయిష్టాలతో పనిలేక పోయినా చిత్రవధ ఎలా ఉంటుందో నని తెలియ చెప్పే బాధని అనుభవించింది.
మరునాటి నుండి పని చేసే కంపెనీకి పోక తప్పలేదు. సుశీలకు కుటుంబంలోకి సంపాదించే మరొకరు తోడైయ్యారు. అయినా సరే నాలుగో వ్యక్తి ఖర్చు పెరిగింది. ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నా, పాండురంగడి సంపాదన ఇంటివరకూ రాలేదు. ఇన్ని రోజులనుంచి వచ్చే జీతంలో, ఉండే ఇంటి కోసం, తిండి కోసం ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఫ్రీ లాడ్జింగ్, బోర్డింగ్, అవసరమనుకున్నప్పుడు కోరికలు తీర్చుకోవటానికి ఓ ఆడది సమకూరాయి. ఇంకేం ఇక తన తాగుడు అలవాటుకి సంపాదన మొత్తాన్ని నిరాఘాటంగా వాడుకోవడం అతనికి కష్టమనిపించలేదు. సుశీలకు పెళ్ళైన మార్పులేని జీవితం అయింది. ఇంటి పనుల్లో తల్లికి వీలున్నంత వరకు సహాయం చేసి కంపెనీకి నడిచి వెళ్ళేది. పొద్దుటినుండి సాయంత్రం ఆరు వరకు కూచోటానికి వీల్లేని పని. ఇంటికి వచ్చేసరికి ఏడైపోయేది.
మూళ్ళెల్లు గడిచేసరికి వేవిళ్ళు మొదలైయ్యాయి. ఇంకో జీవి వస్తుందంటే ఖర్చు ఎలా అనే చింతలో పడింది సుశీల. ఏది ఆగదు. కంపెనీకి పనికి పోవటం తప్పలేదు. రాత్రి నరకాలు తప్పలేదు. ‘కడుపు రావటం అనేది నీ బాధ, నా అవసరాలకు అడ్డు చెప్పకు’ అంటూ చేయి చేసుకోవటం వరకూ వచ్చాడు పాండురంగడు. ‘కడుపెందుకు తెచ్చుకున్నావ్. నీ అందం తగ్గి పోకూడదు. నీవు నానుంచి తప్పించుకోలేవు. ఎన్నాళ్ళు నానుండి పారిపోతావ్. ఎవరికి చెప్పుకోలేవు. అందరూ నిన్నే అంటారు. అల్లుడిగా నన్నేమనరు. మీ అక్క జీవితం నాశనమవుతుంది నీ వల్ల.’ అంటూ బావ బెదిరింపుల మధ్య డెలివరీ అయ్యి పాప పుట్టడం, నెల తరువాత కంపెనీ పనుల్లో చేరటం జరిగిపోయింది. గవర్నమెంటు దవాఖానా వల్ల పెద్ద ఖర్చు లేని కాన్పు అయింది. సుశీల లాగే పుట్టిన బిడ్డ కూడా అందంగా ఉంది. గోదా అని పేరు పెట్టారు. ఆ పిల్ల నవ్వుల్లో, ముద్దు ముచ్చట్లో జీవితంలో మొదటి సారి కాస్త సేద తీరేది.
ఒకరి తరువాత ఒకరు వరుసగా తల్లి తండ్రీ, ఈ భూమి మీద తమ పని అయిపోయినట్టు కాలం చేసారు. ఆ ఇంటిలో తమకు కూడా భాగం ఉంటుందని ఇద్దరు కొడుకులను వేసుకుని అక్కాబావా ఆ ఇంటికి వచ్సారు. అప్పుడప్పుడు బెదిరింపులతో అనుభవించే చిత్రవధ, శాశ్వతంగా ఇంట్లో తిష్టవేసింది. బావ వచ్చిన వారం రోజులు ఎలాగో అలా అతనికి అవకాశం దొరకకుండా తప్పించు కునేది. ఇప్పుడు దిన దిన గండంగా మారింది. రెండు పెద్ద రూములు రెండు చిన్న రూములు ఉండటం వల్ల చెరిసగం పంచుకున్నారు. ఒక వరండాను ఇద్దరూ కామన్గా వాడుకోవచ్చు కాని ఎక్కువగా కారుణ్య కుటుంబమే సామాను సర్దుకుంది. ఇంటి సామానుల్లో మంచిగా ఉన్నవన్ని తీసుకుంది అక్క. అదే మౌనం, నిరాసక్తత రాజ్యమేలింది సుశీల ముఖంలో. ఇంటికవసరమైనవి, అక్క తీసుకున్న గిన్నెల స్థానంలో మట్టి వంట పాత్రలు వచ్చాయి.
రెండు సంవత్సరాలు వచ్చినా గోదాకి వినికిడి లోపం మాత్రమే కాక, మాటలూ రాలేదు. డాక్టరుకు చూపించే తాహతు లేదు. సుశీల రోజూ కంపెనీకి వెళుతూండటం వల్ల చాలా రోజులుగా పక్కింటి సరస్వతి, గోవిందయ్య వాళ్ళే గోదాని చూసేవారు. కావలసినంత ఆస్తిపాస్తులున్నా, సంతానహీనులైన వాళ్ళకీ, సుశీల వాళ్ళ పేదరికం తోడై పాపని తమ పిల్లలాగే పెంచుకోసాగారు. పాప కూడా వాళ్ళదగ్గరే ఉండటం ఇష్టపడేది. తన పరిస్థితులు ఎంత బాధ పెడుతున్నా గోదాని చూసుకొని కొంత ఉపశమనం పొందేది. కానీ, తనని దగ్గర తీసుకునే అవకాశం దొరికేది కాదు. పొద్దంతా పనికెళితే, ఇంటికొచ్చే సరికి గోదా నిద్రపోయేది. ఎప్పుడైనా మెలుకువతో ఉన్నా పాప ఇంటికీ, సుశీల ఒడిలోకీ రావటానికి ఇష్టపడేది కాదు. రాను రాను ఆమెని, పాండురంగడిని తల్లి తండ్రులనే విషయాన్ని మరచిపోయింది. సరస్వతి దంపతుల అవసరాన్ని ఆసరా చేసుకుని జనార్దనం ప్రోత్సాహంతో, ఎంతో కొంత ఆశించి బిడ్డని శాశ్వతంగా వదిలించుకోవాలనుకున్నాడు పాండురంగడు. వచ్చిన డబ్బుని ఇద్దరూ పంచుకున్నారు. సరస్వతి దంపతులు ఏదో చిన్న పూజ ఏర్పాటు చేసి, చిన్న కార్యక్రమం తోనే గోదాను, వాళ్ళ దత్త పుత్రికను చేసుకున్నారు. ఆ మాత్రం సంతోషం కూడా ఇద్దరూ కలిసి దూరం చేస్తే నిస్సహాయంగా ఎప్పటి లాగానే మౌనంగా రోదించింది సుశీల.
పాండురంగడు మాత్రం ఏ మార్పు లేదు. ఒళ్ళు మరిచేంత తాగుడు ఎక్కువైంది. దాంతో సుశీలకు రాత్రి నరకం తప్పింది. ఒకింత ఆనందం కలిగింది. భర్త దగ్గరగా వస్తే వంటిమీద తేళ్ళు జెర్రులు పాకుతున్నట్టు అనిపించేది అతని చేష్టలకు. ఒళ్ళు తెలియకుండా తాగి వచ్చి గొడ్డులాగా నిద్ర పోయేవాడు. ఉన్న ఉద్యోగం పోయింది. తాగటానికి డబ్బులకోసం సుశీలను బాదేవాడు. రోజూ తిట్లూ దెబ్బలతో విసిగి పోయేది. అక్క కూడా తన జీతం కోసం ఎదురు చూసేది. తిండికీ కష్టమయే పరిస్థితి వచ్చేసింది. ఇవన్నీ చూస్తున్న బావ దృష్టిలో చులకనై పోయింది. అతను అవకాశం కోసం తహతహ లాడేవాడు. వీలున్నంత వరకు తప్పుకుని తిరిగేది. కంపెనీ నుండి రాగానే తమ గదిలో కెళ్ళి తలుపు లేసుకునేది. ఎంత ప్రయత్నించినా జనార్దనం చేతికి చిక్కటం లేదు.
సుశీలకు దేనికోసం ఏడవాలో తెలిసేదికాదు. తన గురించి పట్టింపు లేని భర్త, ఆబగా చూసే బావ, తనకు దూరమైన కన్నబిడ్డ, అందరి అవసరాలు అయ్యాకా మిగిలిన జీతంతో ఇల్లు గడవనితనం. కంపెనీకి పనికోసం వెళితేనే కాస్త ఊరట కలిగేది. తనపని చక్కగా బాధ్యతగా చేసే సుశీల అంటే కంపెనీలో పనిచేసే వాళ్ళందరికి చాలా మంచి అభిప్రాయం ఉంది. ముఖ్యంగా మేనేజర్ బెనెర్జీకి. ఆమె పరిస్థితి పట్ల చాలా జాలి వేసేది. సుశీల ఏనాడు మనసు విప్పి చెప్పక పోయినా ఆమెని చూసి ఊహించుకోగలిగాడు. అప్పుడప్పుడు ఆర్థిక సహాయం చేసేవాడు. మళ్ళీ జీతం పడగానే అతనికి తిరిగి ఇచ్చివేసేది.
ఇంటికి తాగివచ్చిన భర్తను చూసి బావ ఈసడింపుగా మాట్లాడేవాడు. అక్క లేంది చూసి “నీ మొగుడు రోజూ తాగివచ్చి నిన్ను పట్టించుకోవటం లేదు. ఇంత అందం అడవి కాచిన వెన్నెలేనా. నేనున్నాను కదా. ఎవరూ లేకపోతే అక్కమొగుడే దిక్కన్నారు కదా. నన్నెందుకు దూరం పెడతావు. నువ్వు దేనికి బాధ పడక్కరలేదు. అన్ని నేను చూసుకుంటాను. నీ మొగుడు ఉన్నా నిన్ను పట్టించుకునే స్థితిలో లేడు. ఏమంటావు” అని వెంటపడేవాడు. మౌనంగా గదిలో కెళ్ళి తలుపు వేసుకునేది. “ఏంటి కంపెనీలో ఎవర్నైనా పట్టావా? నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావ్” అంటూ వేదించేవాడు. గదిలో కూచుని కాసేపు ఏడ్చి తనను తాను సముదాయించుకునేది.
ఆ రోజు కంపెనీలో కరెంటు పోయి పనులు ఆగి పోయాయి. మేజర్ డిఫెక్టు వల్ల చాలా సేపు పనులు ఆగి పోయాయి. మిషను పక్కనే గోడవారగా కూచుండి పోయింది. కిందటి రాత్రి పాండురంగడు డబ్బుల కోసం కొట్టిన దెబ్బల వల్ల దెబ్బ తగిలి వాచిన చేతిని పమిట చెంగుతో కప్పుకుంది. నొప్పికి మరో చేత్తో రాసుకుంటూ అక్కడే కూచుంది. అందరు గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటున్నారు. సుశీల ఎక్కువగా మాట్లాడదు. అందుకే ఆమెని ఎవరూ డిస్ట్రబ్ చేయరు. దూరం నుంచి ఆమెనే గమనిస్తున్న బెనర్జీ “రండి క్యాంటీనులో టీ తాగుదాం” అని పిలిచాడు. సరేనని అతని వెంట వెళ్ళింది. టీ తాగుతుండగా “సుశీల గారు. నేను మా ఊరు కలకత్తా వెళిపోతున్నాను.” అన్నాడు. “అవునా.. ఇక్కడ పని వదిలేస్తారా?” అని ఆశ్చర్య పోతూ అడిగింది. ఉన్న ఒక్క స్నేహితుడు వెళ్ళి పోతున్నాడని కొంచెం. బాధ కలిగింది. “అవునండి. మా ఊళ్ళో వెతుక్కుంటాను. ఒంట వాడిని ఎక్కడైనా పనిచూసుకుని ఉండగలను. కాకపోతే అక్కడ నా స్నేహితులు ఉన్నారు. తెలిసిన, అలవాటైన చోటు. ఏదో అప్పుడు నా మిత్రుడితో పాటు హైదరాబాద్ వచ్చాను. వాడు కూడా ఇక్కడ పేపరు విలేకరిగా పని చేస్తున్నాడు. ఇద్దరం కలిసే ఉన్నాం ఇన్ని రోజులు. తనకు పెళ్ళి కుదిరింది. అందుకే కలకత్తా వెళ్ళి పోతున్నాడు. నేను ఒక్కడినే ఇక్కడేం చేస్తాను. అందుకే రిజైన్ చేసాను. ఈ నెల ఆఖరికి వెళ్ళి పోతున్నాను.” అన్నాడు.
“అలాగా” అంది ముబావంగా. “మీరే మనుకోనంటే మీతో కొంచెం మాట్లాడుతాను. మాట్లాడొచ్చా” అతనలా అడిగేసరికి ఆశ్చర్యపోయింది. ఏంటన్నట్టు చూసింది. “నేనిలా అంటున్నందుకు మరోలా భావించకండి. ఎన్నాళ్ళు మీరిలా మీవారి చేత దెబ్బలు తింటూ బతుకుతారు. నాకు తెలుసు నిన్న కూడా ఆయన మిమ్మల్ని కొట్టాడు కదా.”
అతను అడిగిన దానికి సుశీల కన్నుల్లో తిరిగిన నీటిపొరే జవాబైంది. “మీరు మాట్లాడండి. మీ బాధ ఏమిటో చెప్పండి. నేను వెళ్ళిపోతున్నాను. మీ బాధ పంచుకునేవారు కూడా ఎవరూ ఉండరు. మీరంటే నాకు చాలా అభిమానం. మీగురించి మీ పరిస్థితుల గురించి తెలుసుకోవాలి. చాలా వరకు మీ స్నేహితురాలు మంగళ ద్వారా మీ గురించి తెలుసుకున్నాను. వీలైతే, మీకు అభ్యంతరం లేకపోతే, నాకు చేతనైన సహాయం చేస్తాను. ప్లీజ్ మాట్లాడండి” మళ్ళీ ఇలాంటి అవకాశం రాదనే ఆతృత అతనిది.
కంపెనీలో తనతో పాటే పనిచేసే మంగళ మంచి నెచ్చెలి అయింది. తన మనసుకు తప్ప తన గోడుని ఏనాడు ఎవరికి పంచుకోని సుశీల, ఆమెకి మాత్రం తన బాధ చెప్పుకుని మనసు తేలిక చేసుకునేది. బెనర్జీ మాటలకు కళ్ళమ్మట నీటిని బలవంతంగా తొక్కి పట్టింది. కాసేపు మౌనంగా ఉండి. నిజమే అతను మంచి స్నేహితుడు. మంచి మనసున్నవాడు. ఆయన వెళ్ళిపోవటం తనకు చాలా బాధాకరమే.
బెనర్జీ బలవంతంతో, నెమ్మదిగా తన ఇంటి విషయాలు భర్త పెట్టే బాధలు, బావ సతాయింపు, పిల్ల మూగతనం అన్ని వివరించింది. “దీనిలో కొంతలో కొంత నయం పాపను పక్కవాళ్ళు దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. దాని బరువెందుకని నానుంచి దూరం చేస్తూ, బలవంతంగా వాళ్ళకు అమ్మి వేసారు భర్త, బావ. ఏదేమైనా ఇక దాని గురించి దిగులు లేదు. కాని మిగిలిన విషయాల్లో, మీరు నాకు చేసే ఏ సహాయమూ లేదు. మీరేం చేయగలుగుతారు. అందుకే నన్నిలా వదిలేయండి. నా గురించి బాధ పడకండి.” అంది. “మీకు అభ్యంతరం లేక పోతే నాతో కలకత్తా వచ్చేయండి. నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను. మంచి జీవితం గడుపుదాం. నేను మిమ్మల్ని మోసం చేయను. నన్ను మీరు నమ్మితే నాతో వచ్చేయండి. అక్కడ నాకు ఇల్లు పొలాలు ఉన్నాయి. నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. ఇంకా వారం రోజులుంది. ఆలోచించుకుని చెప్పండి. నాకు నిర్మొహమాటంగా, దాపరికం లేకుండా మాట్లాడ్డం అలవాటని మీకు తెలుసుగా. అందుకే నా మనసుకి అనిపించింది చెప్పాను.” స్థిరమైన కంఠంతో అతను అనే మాటలకు ఆశ్చర్యంగా చూసింది. “అమ్మో” అంది కళ్ళు పెద్దవి చేసి సుశీల.
“ఎందుకండి భయం. బాధ్యతలేని భర్తకు మర్యాద ఎందుకివ్వాలి. మిమ్మల్ని పశువులాగా కొట్టే ఆ మూర్ఖుడికి ఎందుకు కట్టుబడి ఉండాలి. కన్న కూతురు మీద ప్రేమాభిమానాలు వదిలేసి, పరాయి వాళ్ళకు అమ్మేసిన వాడు తండ్రి ఎలా అవుతాడు. అతను కట్టిన తాళికి గౌరవమివ్వాలంటారా? దాన్ని కూడా లాక్కుని తాగుడికి తీసుకెళ్ళిన వాడికి ఎందుకు తలవంచాలి. మీకు మనసు, ప్రేమ, ఆప్యాయతలు అవసరం లేదా. డబ్బు సంపాదించే మిషను కాదు కదా మీరు. మీ జీవితం ఇక ఇలాగేనా.. తాగి తాగి అతను ఆరోగ్యం పాడుచేసుకుంటాడు. లేదా మీ కూతురు లాగే మిమ్మల్నీ ఎవరికో అమ్మేస్తాడు. లేదా ఏదో ఒకనాడు మీ బావగారి బారిన పడాల్సి వస్తుంది. అతనూ మీమీద మనసు తీరగానే ఎవరికైనా అమ్మి డబ్బు చేసుకుంటాడు. మీ బావ మీ వెనకాల పడుతున్నాడని అక్కకు తెలిస్తే ఇంటినుంచి కూడా తరిమేస్తుంది. అప్పుడేమిటి మీ భవిష్యత్తు? ఆలోచించండి”. అతను అన్నవన్ని తనకు కనబడుతున్న వాస్తవాలు. తన కథను సినిమాలాగా కళ్ళముందుంచాడు. వింటూ ఉండి పోయింది.
ఆ పరిస్థితిలో, కరెంట్ వచ్చిందని, మిషన్లు స్టార్టయాయని ఎప్పుడు చెప్పారో.. ఎప్పుడు తాను పని చేయటానికి వెళ్ళిందో అర్థం కాలేదు. అప్పటివరకూ ఆగిన పనిని పూర్తి చేసిగాని వెళ్ళ డానికి వీల్లేదని అన్నాడు సూపర్వైజరు. పని పూర్తై ఇంటికెళ్ళే సరికి ఎనిమిది అయింది. అప్పటికే తాగి వచ్చేసిన పాండురంగడు కోపంతో చిందులేస్తున్నాడు. “ఎందుకు ఇంత లేటు. ఆరింటికి కంపెనీ అయిపోతే ఇప్పటిదాకా ఎక్కడ తిరిగి వస్తున్నావు. నాకు డబ్బు కావాలని, ఇంటికి త్వరగా రావాలని తెలియదా?” అంటూ పక్కనే ఉన్న చీపురు తీసుకుని చావబాదాడు. చీపురు తునాతునకలై పోయింది. సుశీల ఒళ్ళు హూనమైంది. ‘తొందరగా వండు’ అంటూ బాగులోంచి డబ్బులు తీసికొని మళ్ళీ తాగటానికి బయటకెళ్ళి పోయాడు. వంటి మీద దెబ్బలకు ఏడుపు కూడా రాలేదు. సొమ్మసిల్లి, అచేతనావస్థలో ఉన్న తనను జనార్దనం పాశవికంగా ఆక్రమించుకుంటూంటే ఆపే శక్తిని కోల్పోయింది. ఎన్నాళ్ళుగానో ఎదురుచూసిన తరుణాన్ని జారవిడుచుకోదలచుకోలేదు. అతని కబంద హస్తాల నుంచి విడిపించుకోలేక, అతని పశుత్వానికి బలైపోయి, శరీరపు అణువణువు బాధతో, పెదవులు చిట్లి రక్తం కారుతూంటే, శక్తి లేక స్పృహ కోల్పోయి, శవంలాగా పడిపోయింది. కన్నీళ్ళు ఇంకి పోయాయేమో అవీ దూరమయ్యాయి సుశీలకు. తెల్లవారి లేవలేక పోయింది. కానీ అక్క ఏడుస్తూ వచ్చి లేపడంతో బలవంతంగా లేచి బయటకు వచ్చి చూసింది. ముఖం నిండా గాయాల రక్తపు చారలు ఎండి పోయి, వంటిమీద దెబ్బలను, చిరిగిన జాకెట్టును చీర కొంగుతో దాచుకుంటూ వచ్చిన సుశీలను చూస్తూ వికటంగా తృప్తిగా నవ్వుకున్నాడు జనార్ధనం. వాకిట్లో పాండురంగడు పడి ఉన్నాడు. తాగి రోడ్డుమీద పడి పోయి ఉన్న అతనిని ఎవరో చూసి ఇంటికి తెచ్చారు. తీసుకొచ్చిన రెండుగంటల్లో ఊపిరి ఆగి, సుశీలతో ఇహలోక బంధాల్ని తెంపుకుని శాశ్వతంగా వెళ్ళిపోయాడు. జనార్దనం ముఖంలో ఒకింత తృప్తి కనిపించింది. ఇక తనకు అడ్డు కూడా లేదు అనుకున్నాడు. రెండు రోజుల తరువాత కంపెనీ పనులకు వెళ్ళింది. అందరూ సానుభూతి చూపారు. బెనర్జీ చాలా బాధపడ్డాడు సుశీల కష్టాల్ని చూసి. ధైర్యం చెప్పాడు కాని తన గురించి ఆలోచించావా అని అడగలేదు. ఆమె కొంత కుదుటపడాలి అనుకున్నాడు.
రెండు రోజుల్లో జనార్దనం పూర్తిగా బయట పడ్డాడు. ఆ రాత్రి భార్య కారుణ్య పడుకోగానే సుశీల దగ్గరికొచ్చాడు. పక్కనే ఉన్న కత్తిపీట అందుకుంది సుశీల. “నీకు అంత సీన్లేదు సుశీలా, నేను మీ అక్కను పిలిచానంటే, మరునిముషంలో వీధిలో ఉంటావు. పిలవనా.. ఆ కత్తిపీట పడేసి నా మాట విను. ఇప్పుడు నిన్ను నేనేం చేయను. నేను చెప్పినట్టు చేస్తే నిన్ను ఎవరూ ఏమీ అనరు.” అంటు దూరంగా కూచున్నాడు. మాట్లాడకుండా, కత్తిపీట వదలకుండా అలాగే కూచుంది. “చూడూ, నేను చెప్పింది నీవు వినక తప్పదు. లేక పోతే మీ అక్కకు చెడుగా చెప్పి నిన్ను బయటకు తోయిస్తాను. ఇక ఒకసారి కులట అనే పేరు ముద్రించ బడ్డాక, నీవు రోడ్డుమీద పడగానే నిన్ను నేను ఏమైనా చేయొచ్చు. తీసుకెళ్ళి ఏ బ్రోతల్ హౌజ్ కో అమ్మేస్తాను. అందంగా ఉన్నావుగా మంచి రేటు వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే నా మాట విను. నీవు కంపెనీ పని నుండి ఇంటికి వస్తున్నప్పుడు నా స్నేహితుడు మధ్య దారిలో కలిసి నిన్ను తన రూముకు తీసుకెళ్తాడు. అక్కడ చాలా సేఫే. ఎవరి భయం లేదు. అలా నీవు వారంలో రెండు మూడు సార్లు వెళితే, నాకూ మీ అక్క చూస్తుందన్న భయముండదు, వేరే నా స్నేహితులు కూడా వస్తారు. నీకు బోలెడంత డబ్బు. నీ కొచ్చే జీతం, నీ పై సంపాదన మనిద్దరికి సగంసగం. నీకు వీలైతే వారంలో ఇంకా ఎక్కువ సార్లే నీ బిజినెస్ చేయొచ్చు. నా స్నేహితుడికి చాలా మంది కస్టమర్స్ తెలుసు. ఎంతమందినైనా తెస్తాడు. ఏమంటావు? అది చెప్పటానికే వచ్చాను. నా మాట కాదనే అవకాశం నీకు లేదు. వీధిలో అందరికి నీ గురించి చెప్పి ఇక్కడనుంచి బయటకు పంపిస్తాను. నీవు చెడిపోయిన దానివని తెలియగానే సరస్వతి గోవిందయ్యలు నీ పిల్లను కూడా ఇంటి బయటకు పంపించేస్తారు. ఆ మూగదాన్తో ఉండడానికి ఇల్లు లేక ఎక్కడి కెళతావో ఆలోచించుకో. అప్పుడు నీతో పాటు నీ పిల్ల కూడా నాకు బోనస్ అవుతుంది. నీకు ఎల్లుండి దాకా టైమ్ ఇస్తున్నాను. ఎల్లుండి ఒక కస్టమర్ ఆ రూముకి వచ్చేలోగా నీవు వెళ్ళాలి. నీకు వేరే గత్యంతరం లేదు. లేదా.. నేను నీ పిల్లను ఎత్తుకు పోతాను, ముందు దాని పని కానిస్తే, నీవు చచ్చినట్టు నేను చెప్పినట్టు వింటావు. కాదని నే చెప్పిన చోటకు వెళ్ళకుండా ఇంటికి వచ్చావో నీ కూతురు ఇక్కడ ఉండదు. నీ పిల్లను వెతుక్కుంటూ నా కాళ్ళ దగ్గరికి నీవే వస్తావు. ఆలోచించుకో” అని కర్కశంగా నవ్వుతూ వెళ్ళి పోయాడు.
మనసు మూగగా రోదించింది. నేనెందుకు పుట్టానో ఎవరి ప్రేమలకి నోచుకోని బతుకు. భర్త కొట్టి ఒళ్ళు హూనం చేస్తే అక్క మొగడు తన పశుత్వానికి బలి చేసాడు. అతని మాట విని, సగం చచ్చినదాన్ని పూర్తిగా బలవ్వాలా, బజారు మనిషిని అవ్వాలా, లేదా మూగ పిల్లతో రోడ్డున పడాలా? నాతో పాటు పిల్ల జీవితాన్ని కూడా పాడు చేస్తాడు. ఏం చేయాలి? ఎలా…ఎలా… ఏది దారి? ఎవరూ నన్ను రక్షించలేరు. పోనీ బెనర్జీ చెప్పనట్టు అతనితో వెళ్ళిపోతే? తప్పుకాదా, ఇప్పటికే బావ తనను కులటగా సంఘం ముందు నిలబెట్ట చూస్తున్నాడు. భర్త పోయి నెల తిరక్కముందే ఎవడితోనో లేచి పోయిందని అందరూ అనరా? లోకం ఏమనుకుంటుంది? ఎవరో అనుకోవటం కాదు తన మనసు ఒప్పుకుంటుందా? నా పిల్లను వాళ్ళు లేచి పోయిందాని కూతురని వదిలేస్తే, గోదా బతుకు ఏమవుతుంది. నన్ను నేను ఎలా రక్షించుకోవాలి? పిల్ల జీవితం పాడుకాకుండా ఏం చేయాలి? ఏమైనా సరే తన వల్ల పిల్ల బతుకు పాడు కాకూడదు. ఇన్ని రోజులుగా తన మనసులో ఉన్న ఈ రహస్యాలన్ని బయటకు రాకూడదంటే నేనేం చేయాలి? నేనేంచేయగలను? తన చేతకాని తనానికి వెక్కివెక్కి ఏడవటం మినహా మరోదారి కనిపించలేదు.
మరునాడు కంపెనీకి వెళుతూ, బయట ఆడుకుంటున్న గోదాని చూసింది. పిలిస్తే పాపకు వినపడదని, అదెక్కడుందో తెలుసుకునేలాగా పాదాలకు గజ్జెలు వేసింది సరస్వతి. తల్లిని చూడగానే గల్లుగల్లున గజ్జెలు సవ్వడి చేస్తూ పరుగున దగ్గరికి వచ్చింది గోదా. అక్కున చేర్చుకుంది. కన్నీళ్ళొచ్చాయి. దాని బతుకన్నా బాగుంటే చాలు. “ఏమ్మా, కంపెనీకి వెళుతున్నావా? ఏంటి పాప గుర్తొచ్చిందా.” అంటూ సరస్వతి అంటూంటే ఆమెకి తన కన్నీళ్ళు కనబడకుండా ముఖం తిప్పేసుకుంది. “అవునత్తా, కంపెనీకి పనికి పోతున్నా. పాప బయట కనబడితే పలకరిస్తున్నా. వస్తానత్తా. గోదా జాగర్త అత్తా” అంది. “అదేంటమ్మా ఎటైనా పోతున్నావా? నాకు పాప జాగ్రత్తలు చెబుతున్నావ్?” అంది సరస్వతమ్మ. “లేదత్తా.. బయట రోడ్డుమీద ఆడుకుంటుందని అలా అన్నాను.” అంటూ బయలుదేరింది. కంపెనీలో కూడా అన్యమనస్కంగానే పని చేసింది. లంచ్ టైమ్లో బెనర్జీ వచ్చాడు. “సుశీలా, ఏమాలోచించావు? ఇపుడు నీకు ఏ బాధ్యతలు లేవు. నీవు కష్టపడి సంపాదించి పోషించుకోవాల్సిన నీ కన్న తల్లితండ్రులూ లేరూ, నీవు కన్న పాప బాధ్యత నీకు లేదు. తాళి కట్టిన పాపానికి పోషించాల్సిన భర్త కూడా లేడు. నీవు ఇప్పుడు ఏ బాధ్యతా లేని దానివి. ఇప్పుడు నీ బతుకు నీవు బతకగలిగే సర్వస్వతంత్రురాలివి. నీ జీవితాన్ని ఇకనైనా చక్కదిద్దుకో. నాతో వచ్చేసే నిర్ణయం తీసుకోవటానికి ఇంకా ఎందుకు మథన పడతావు?” సుశీల కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. “కాదండి. నేను మీకు తగిన దానిని కాను. భర్తతో అపవిత్రురాలిననే నిందను, సొంత అక్క మొగుడి చేతిలో బలై నిజం చేయబడ్డాను. నేను నా ఇంటి వాళ్ళకే కాదు నా దృష్టిలో కూడా ‘సు..శీ..ల…ను..’ కాను. నా గురించి బాధపడకండి. నా జీవితం ఇలాగే అంతమవాలి. మంచి అమ్మాయిని పెళ్ళి చేసుకొండి. మీ జీవితం బాగుండాలి. అదే నేను కోరుకునేది.” మళ్ళీ మాటకు తావివ్వ కుండా అక్కడ్నుంచి వెళ్ళి పోయింది.
సుశీల కోసం జనార్దనం ఎదురు చూస్తున్నాడు. రేపే తనని తీసుకుని తన స్నేహితుని రూము కెళ్ళాలి. రేపటినుంచి తన దశ మారబోతుంది. రెండు చేతులా సంపాదన…ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. కంపెనీలో పని ఎక్కువగా ఉంటే ఒక్కోసారి లేటవుతుంది తనకు. ఎంత రాత్రైనా సరే ఈ రోజు ఎలాగైనా సుశీలను వప్పించి రేపటికల్లా రెడీ చేయాలి. ఒప్పించట మేమిటీ, తాను కాదనే సమస్యే లేదు. వేరే గత్యంతరమూ లేదు తనకు.
ఇంతలో ఇంటిముందు పోలీస్ జీపు వచ్చి ఆగింది. కంగారుగా జనార్దనం కారుణ్య చూసారు. “సుశీల ఉండేది ఈ ఇల్లేనా?” ఇన్స్పెక్టర్ అడిగాడు. నోట మాట రాక తలూపుతూ అవునన్నాడు. “ఏమైంది.. ఎందుకడుగు తున్నారు” కొంచెం ధైర్యం చేసి కారుణ్య అడిగింది. “చెప్తాను. కారుణ్య, జనార్దనం అంటే మీరేనా?” కారుణ్యను అడిగాడు. “అవునండి.. మా చెల్లెలే సుశీల. తనకేమయింది.” భయంగా అడిగింది. “మీరు మాతో స్టేషన్కి రండి. మా ఎస్.ఐ. తీసుకు రమ్మన్నాడు. పదండి” అన్నాడు. “నేనెందుకు సార్. అసలు ఏమైంది చెప్పండి.” కారుణ్య ఏడుస్తూ అడిగింది. “మా సార్ స్టేషన్లో చెబుతాడు. పదండి. మీ ఆయన్ను కూడా రమ్మనండి.” ఇన్స్పెక్టర్ తొందర చేసాడు. జనార్దనానికి కాళ్ళలోకి వణుకు మొదలైంది. “నే..నే.. దుకు సార్.. నేనేం చేసాను” అంటూ వెనక్కి తగ్గాడు. పక్కనున్న పోలీసు అతన్ని జీపు ఎక్కించాడు. కారుణ్య కూడా బయలు దేరింది. చెల్లెలికి ఏమైందో.. ఏమి వినాల్సి వస్తుందో నని సుశీలకేమైనా అయితే ఆమె జీతం మీద ఆధారపడే తమ గతేంటి అని కంగారు పడుతుంది. స్టేషన్లోకెళ్ళగానే ఎస్.ఐ. కారుణ్యతో అన్నాడు. “మీ చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది. చెరువు దగ్గర ఈ బాగు, దాంట్లో ఈ ఉత్తరం రాసి పెట్టింది. ఆమె ఆధార్ కార్డ్ ఆధారంగా మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చాం. ఇంకా బాడీ దొరకలేదు. వెతుకుతున్నాం.. వరద జోరుగా ఉంది. ఎంత దూరం కొట్టుకు పోయిందో ఏమో.” “అయ్యో, మొన్ననే భర్తను పోగొట్టుకుంది. ఆ బాధతోనే చెరువులో దూకావా సుశీలా” అంటూ కారుణ్య వెక్కి వెక్కి ఏడ్చింది. “ఊరుకో అమ్మా.. ఆమె తానుగా చనిపోలేదు. మీ ఆయన పెట్టిన హింసల వల్లే ఆత్మహత్య చేసుకుంది.” ఇన్స్పెక్టర్ కోపంగా అన్నాడు.
“నాకేం తెల్వదు సార్.. మేమే ఆమెని చూసుకుంటున్నాము. భర్త ఉన్నప్పుడు కూడా ఆమె కష్టపడింది. రోజూ తాగి కొట్టేవాడు సార్. మేమే ఆమెని కాపాడే వాళ్ళం సార్” ధైర్యం చేసి చెప్పాడు జనార్దనం. “నోర్ముయ్.. మా కంతా తెలుసు. ఆమె నీ గురించి అన్నీ రాసింది. నీవల్లే ఆమె ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకుంది. ఆమెని బలత్కరించావని, నీ స్నేహితులతో ఆమెని, పిల్లని వేశ్యవృత్తిలోకి దింపాలనుకున్నావని, ఆ తరువాత వాళ్ళిద్దరిని బ్రోతల్ హౌజ్కి అమ్మేస్తానని చెప్పావని ఆమె రాసింది. ఆమె చావుకి నువ్వే కారణమని ఆమె మరణ వాంగ్మూల సాక్ష్యంతో నిన్ను అరెస్టు చేస్తున్నాం. ఆఫీసుకెళ్ళే దారిలో ఆమెని బాధపెట్టిన నీ స్నేహితుల్ని కూడా తీసుకొచ్చాం నీకు తోడుగా.” అంటూ అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. కారుణ్య “అయ్యో ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్. మాకేమి సంబంధం లేదు సుశీల ఆత్మహత్యతో. ఆయన్ని వదిలేయండి సార్.” అంటూ బతిమిలాడింది.
“లేదమ్మా. మీ ఆయన మంచి గ్రంథసాంగుడు. ఏమేమి చేసాడో. ఆమెకి రోజూ ఎంత నరకం చూపించాడో, ఆమెని ఎలా దందాలోకి దింపాలని చూసాడో అన్నీ లెటర్లో రాసి ఆయన బారి నుండి తన కూతురుని కాపాడలని ఈ ఉత్తరం రాస్తున్నానని తెలుపుతూ సుశీల ఆత్మహత్య చేసుకుంది. నిజానికి మీ ఆయనే కారణం ఆమె చావుకి. అందుకే ఇక కటకటాల వెనకే తన బతుకు.” జనార్దనం పోలీసు లాఠీల దెబ్బలతో ములుగుతున్నాడు. కారుణ్యని పంపేసారు. చెల్లెలి చావు ఒక వేపైతే, దానికి కారణం తన భర్తే అవటం జీర్ణించుకోలేకపోతుంది. తన చాటుగా చెల్లెలుని అంత బాధకు గురి చేసిన జనార్దనం అంటే అసహ్యం వేసింది. అరెస్టు అవటమే అతనికి తగిన శాస్తి అనుకుంది.
ఆఫీస్లో రిజైన్ చేసి సొంత ఊరికి ట్రైన్లో కూచున్న బెనర్జీ సీటులో వనక్కి వాలి నిశ్చింతగా, సంతోషంగా కళ్ళు మూసుకున్నాడు.
“మనం తీసుకున్న నిర్ణయం సరైనదేనా..” ఇంకా సంశయంగా అడిగింది అతనికి ఎదురుగా ముడుచుకుని కూర్చున్న సుశీల.
“మరి నీవు తీసుకున్న నిర్ణయం సరైందా.. ఎందుకో నాకు నీ గురించి డౌట్ వచ్చి నీ వెనక రావటం, సమయానికి కాపాడుకోగలిగాను. ఏ మాత్రం లేటైనా నాకు దక్కేదానివి కాదు. పుట్టినప్పటి నుండి నీవు అనుభవించిన, ఎదుర్కొన్న కష్టాలు నీవు చేసిన తప్పుల వల్ల కావు కదా. అంతా ఆర్థిక ఇబ్బందులే. వాటివల్లే మీ తల్లితండ్రులు నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వలేక పోయారు. దాని ఆసరాగా మీ బావ మోసానికి, స్వార్థానికి బలైయ్యావు. వీటన్నిటిలో నీవు చేసిన తప్పెక్కడుంది? నీవెలా అపవిత్రురాలవవుతావు. నీవు ఏ తప్పు చేయలేదు సుశీల.. బాధ పడకుండా కొత్త జీవితంలోకి అడుగు పెట్టు. నీకు నేనున్నాను. మనకు బంగారు భవిష్యత్తు ఉంది.” అన్నాడు.
‘‘నీవు కల్మషం అంటని ‘పునీత’వు. చనిపోవటం తప్ప గత్యంతరం లేని పరిస్థితిని కల్పించాడు జనార్దనం. నీవేం బాధపడకు. అతను సరైన శిక్షే అనుభవిస్తాడు.” నర్మగర్భంగా అంటూ.. సుశీల చేత, తాను రాయించిన ఉత్తరం వల్ల ఇప్పుడు సుశీల ఇంటి దగ్గర ఏం జరుగుతుందో ఊహించుకుని నవ్వుకున్నాడు బెనర్జీ. అతను రాయించిన పచ్చి నిజాల ఉత్తరం వల్ల ఏం జరుగుతుందని తెలియని అమాయకత ఆమెది. బెనర్జీ కూడా చెప్పలేదు.
నదిలో దూకుతున్న తనను హఠాత్తుగా వచ్చి, రక్షించాడు. నచ్చచెప్పి ఆత్మహత్యను మాన్పించిన బెనర్జీ చూసి బోరున ఏడ్చేసింది. ఓదార్చి తనతో రావటానికి ఒప్పించాడు. ఆ అయోమయంలోనే, ఆయన చెప్పినట్టు ఉత్తరం రాసింది. ఆ విషయాలన్నీ ఏమీ ఆలోచించుకోదలచుకోలేదు. అంతా మరచి కొత్త జీవితం లోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. అతనకింకేమి బాధ కలిగించదలుచుకోలేదు. అతన్ని తన జీవితంలోకి నిర్భయంగా ఆహ్వానిస్తూ, ధైర్యంగా అతని పక్కన కూచుంది, భుజంమీద తలవాల్చి జీవితంలో ఎప్పుడు పొందలేని ప్రశాంతతని అనుభవిస్తూ నిద్రలోకి జారుకుంది సుశీల. కలకత్తా వేపు దూసుకు పోతోంది ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్.