[వి. నాగజ్యోతి గారు రచించిన ‘ప్రేరణ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


మనిషిలోని భావతరంగాలు
మాటవినక వెల్లువౌతూ
కవితో గేయమో తెలియని
అక్షర రూపమై నిలుస్తాయి
తనకు తానై తొలుత కవిననుకోడు
వేదన తగ్గించుకునే దారిలోనో
పట్టరాని సంతోషం కలిగినపుడో
లిఖించే ప్రతీ పదమూ
తనగుండే లోతుల్లోంచి వెలువడి
ఒక గేయమై అమరినపుడు
పరుల మనసును కదిలించినపుడు
తనకు కవి అనే బిరుదు లభిస్తుంది
దోషాలనెంచి సవరించే వారుంటే
ఆ రచన రంగవల్లికలా మెరుస్తుంది
కవి మనసు ఆనంద సాగరమౌతుంది
పరుష మాటలతో దూషిస్తే
మౌనరాగ మాలపిస్తూ
మానసిక వేదనతో ఆ కవే
తనదైన లోకంలో విహరిస్తాడు

శ్రీమతి వరికేటి నాగజ్యోతి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు. పదవ తరగతి వరకే చదువుకున్న నాగజ్యోతి గారు దక్షిణ భారత హిందీ పరీక్షలలో భాషాప్రవీణ, హిందీ టైపింగ్ పరీక్షలు లోయర్, హైయ్యర్ పాసయ్యారు. వివాహానంతరం ఢిల్లీకి వచ్చి గృహస్థురాలి బాధ్యత స్వీకరించారు. సాహిత్యాభిలాషి. వీరు రాసిన కథలు, కవితలు, పద్యాలు పలు అంతర్జాల పత్రికలలో ప్రచురించబడ్డాయి.
పుస్తక సమీక్షలు కూడా చేస్తూ వుంటారు. ఇన్నేళ్ళ తరువాత కోవిడ్ కాలంలో శ్రీ పూసపాటి గురువుగారు, శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి ద్వారా పద్య రచన, ప్రాథమిక వ్యాకరణం నేర్చుకున్నారు. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి సహకారంతో – ఆప్త మిత్రులు శ్రీ ధరణిగారు, సన్నిహితులు, తమ శ్రీవారి ప్రోత్సాహం వలన ‘చిట్టి తల్లి’ పద్య శతకం రాసారు.
గత పదిహేను సంవత్సరాలుగా ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ నివాసి.
1 Comments
శ్రీధర్ చౌడారపు
భలే కవిత మీది.
కవితకూ, కవికీ నిర్వచనం చెప్పేశారు. కవిత పుట్టుకకూ కారణాలు, మెప్పుపొందేందుకు కారణమయ్యే చర్యలు భలేగా తెలియజేశారు.
స్పష్టమైన కవిత ఇది. బాగుందండీ నాగజ్యోతి గారూ