[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘ప్రేమేగా ప్రపంచం’ అనే నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]
[అనుకున్న ప్రకారం శంఖుస్థాపన కార్యక్రమం సజావుగా సాగిపోతుంది. కార్యక్రమానంతరం అందరూ శ్యామలరావు ఇంటికి వెడతారు. వసంత నిశ్చితార్థానికి సంబంధించిన చర్చలు జరుపుతారు. పెళ్ళి ప్రస్తావన వస్తుంది. గోవింద తండ్రి – తన ఇద్దరు కొడుకులు పెళ్ళిని సక్రమంగా జరిపిస్తారని చెప్తాడు. తరువాత ఆఫీసుకు వెళ్తాడు గోవింద. రామసుబ్బయ్య తనకు రవి పంపిన బెదిరింపు మెసేజ్ని చూపించి మాట్లాడుతుండగా, శ్యామల పెద్దమ్మ అక్కడికి వస్తుంది. రామసుబ్బయ్య ఆ మెసేజ్ని ఆమెకి చూపించగా, ఆమె చాలా బాధపడుతుంది. సుబ్బలక్ష్మి, నాగరాజులతో కలిసి కారులో కొచ్చిన్ చేరుతాడు గోవింద. వాళ్ళు బస చేసిన లాడ్జ్కి నాయర్ వచ్చి గోవిందని కలుస్తాడు, మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకు డా॥ టి.టి. చాకో గారితో అపాయింట్మెంటు ఫిక్స్ చేశానని చెప్పి ఉదయాన్నే కలుస్తానని వెళ్ళిపోతాడు. మర్నాడు ఉదయం డాక్టరు గారు నాగరాజు, సుబ్బలక్ష్మి కొన్ని ప్రశ్నలు వేస్తారు. అనంతరం వైద్య పరీక్షలు చేసి, ఇద్దరిలోనూ లోపం లేదని, త్వరలో సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్తారు. సుబ్బలక్ష్మిని పరీక్ష చేసిన లేడీ అసిస్టెంట్ ఎవరో తెలుసా అని నాగరాజు గోవిందాని అడిగితే, తెలియదంటాడు. ఆమె రవి మాజీ భార్య వసుధ అని చెప్తాడు. ఆశ్చర్యపోయిన గోవింద, తరువాత నాయర్ని అడిగి, వివరాలు తెలుసుకుని నాగరాజు చెప్పింది నిజమేనని ధృవీకరించుకుంటాడు. తరువాత వసుధ వాళ్ళింటికి వెళ్ళి ఆమెకి కృతజ్ఞతలు చెప్తారు. నాగరాజుకు, సుబ్బలక్ష్మి ప్రయాణ ఏర్పాట్లు నాయర్తో చేయించి, ఉదయం ఐదు గంటలకు అక్కడికి చేరిన రామసుబ్బయ్యతో కారులో మంగుళూరు వెళ్తాడు గోవింద. అక్కడ సైట్లో విచారించి, రవి ఉంటున్న ఇంటి అడ్రస్ కనుక్కుని అక్కడికి వెళ్తారు. బెల్ కొట్టగా దివ్య వచ్చి తలుపు తీస్తుంది. ఆమె ఒకప్పుడు రామసుబ్బయ్య వద్ద పనిచేసింది. విషయం తెలిసి రవి నిద్ర లేచి కిందకి వస్తాడు. డబ్బు గురించి, కంపెనీలో తన స్థానం గురించి రవికి గోవిందతో వాగ్వాదం జరుగుతుంది. ఎంత నచ్చజెప్పటానికి చూసినా, రవి గోవింద, రామసుబ్బయ్యల మాట వినడు. విచారంగా వాళ్ళు బయటకు వచ్చేస్తారు. – ఇక చదవండి.]
“గమ్యము, లక్ష్యమూ లేకుండా.. వెర్రి వ్యామోహంతో, అహంకారంతో తన బాధ్యతలను విస్మరించాడు. వాడి దృష్టిలో పుట్టిన వంశ గౌరవానికి.. తల్లి తోబుట్టువులు, అయిన వారి మీద ఎలాంటి ఆదరాభిమానమూ లేదు. తన భాగపు ఆస్తి పత్రాలను తనకు అందచేయవలసిందిగా రామసుబ్బయ్య గారిని ఆదేశించాడు. వాడు మన మాటలను వినిపించుకొనే స్థితిలో లేడు పెద్దమ్మా!..” రవిని చూచి, మాట్లాడిన తర్వాత నాకు అర్థమైన విషయాన్ని పెద్దమ్మకు చెప్పాను.
“నాన్నా!.. నీవెందుకు బాధ పడతావ్!.. వాడి ఖర్మను వాడు అనుభవించ వలసిందే. వాజి మీద నాకు ఎలాంటి ఆశలూ లేవు. రామసుబ్బయ్యగారికి చెప్పి, లాయర్ గారి వద్దవున్న వాడి భాగపు ఆస్తి పత్రాలను వాడికి పంపించేసెయ్యి. యికపై వాడికీ మనకూ ఎలాంటి సంబంధ బాంధవ్యాలు వుండబోవు. వుండకూడదు” ఆ క్షణంలో పెద్దమ్మ ముఖం ఎంతో గంభీరంగా వుంది.
“గోవిందా!.. పద, అమ్మా నాన్నలు నీ కోసం ఎదురు చూస్తూ వుంటారు. యీ రోజు వసంత నిశ్చితార్థం కదా!..” నవ్వుతూ అంది పెద్దమ్మ. కొన్ని క్షణాల తర్వాత.. “నాన్నా!.. మానవ జీవితానికి సంబంధించిన జనన మరణాలు మన యిష్టానుసారంగా జరగవు. ఓ వేళ నాకేదైనా జరిగితే.. రూపా దీపలను నీవు జాగ్రర్తగా చూచుకొంటావు కదూ!..” గద్గద స్వరంతో అడిగింది పెద్దమ్మ.
ఆమె కళ్ళల్లో నిండుతున్న కన్నీటిని చూచాను. నా మనస్సులో ఏదో బాధ. ఆమె చేతిని నా చేతిలోకి తీసుకొన్నాను. నా చేతిని ఆమె చేతిలో వుంచాను. “పెద్దమ్మా!.. మీరు నూరేళ్ళు చల్లగా వుంటారు. రూపా దీపల వివాహాలు మీ యిష్టానుసారంగానే జరుగుతాయి. మీకు నా చెల్లెళ్ళకూ నేను నా జీవితాంతం వరకూ అండగా, మీ బిడ్డగా, వారికి అన్నగా వుంటాను. మీరు గడచిన ఏ విషయాన్నీ తలచుకొని బాధపడకండి. ఏనాటికైనా రవి తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపంతో మన దగ్గరకు వస్తే.. వాడి శేష జీవితం ప్రశాంతంగా గడిచేదానికి తగిన ఏర్పాట్లను కూడా చేస్తానని మీకు మాట యిస్తున్నాను పెద్దమ్మా!..” ఆ కుటుంబానికి నాకు వున్న బాంధవ్య రీత్యా.. పెద్దమ్మకు నా మీద వున్న నమ్మకాన్ని అనుసరించి ఆమెతో అలా చెప్పాను. ఆమె అన్ని విధాలా ఆనందంగా వుండాలన్నదే నా ఆకాంక్ష.
నా మాటలకు పెద్దమ్మ ఎంతగానో సంతోషించింది. రూప, దీప, పెద్దమ్మ నేను మా వూరికి బయలుదేరాము. నాన్నగారు ఫోన్ చేశారు. గంటలోపల యింటికి చేరుతామని చెప్పాను.
రోడ్డు ఫ్రీగా వున్నందున కాలుగంట ముందుగానే.. వూరికి చేరాము. వూరి జనం అంతా అక్కడ చేరి వున్నారు. అన్ని అరేంజ్మెంట్సు గోపాల్ హారికా కలసి చేశారని నా చెల్లి వసంత చెప్పింది. మేము చేరిన యిరవై నిముషాలకు శ్యామలరావు మామయ్య.. సుందరి అత్తయ్య.. రాఘవ వారి బంధుమిత్రులు వచ్చారు. అందరినీ నేను, గోపాల్, నాగరాజు, సుబ్బలక్ష్మి హారిక సాదరంగా ఆహ్వానించాము.
పురోహితులు వేం చేశారు. ఉభయ వర్గాలు ఎదురెదురుగా కూర్చున్నారు. వారి మధ్యన రకరకాల పండ్లు.. పూలు.. స్వీట్సు.. టెంకాయలు పళ్ళాలల్లో క్రమంగా అమర్చారు సుబ్బలక్ష్మి హారికలు. అమ్మానాన్నా కూర్చున్నారు. వారికి ఎదురుగా శ్యామలరావు మామయ్య, సుందరి అత్తయ్య, తల్లి దండ్రుల మధ్యన పెండ్లి కొడుకు రాఘవ, పెండ్లి కూతురు వసంత కూర్చున్నారు. పురోహితులు లగ్న పత్రికను చదివారు. నాన్న.. మామయ్య సంతకాలు చేశారు. టెంకాయలు పూలు పళ్ళు వున్న తట్టను ప్రథమంగా నాన్నగారు మామయ్య చేతికి యిచ్చారు. తర్వాత వారు.. నాన్నగారికి యిచ్చారు. వధూవరులు.. ఉంగరాలను ఒకరికొకరు తొడిగారు. బంధుమిత్రులు అక్షింతలతో వారిరువురినీ ఆనందంగా ఆశీర్వదించారు.
మామయ్య సెల్ మ్రోగింది. లేచి ప్రక్కగా వెళ్ళి మాట్లాడసాగారు. కొన్ని క్షణాల తర్వాత నన్ను రమ్మని పిలిచారు. నేను వారిని సమీపించాను.
“గోవిందా.. మీ కంపెనీకి యింజనీర్లు కావాలని యాడ్ వేసారా!..”
“అవును మామయ్యా..”
“ఒక క్యాండేట్ శ్రీవాణి అప్లికేషన్ పంపిందట. అమెరికా రిటన్, చాలా తెలివైన పిల్ల. మా చిన్నాన్న గారి మనుమరాలు, మన బంధువు, పేరు నోట్ చేసుకో శ్రీవాణిని సెలక్టు చెయ్యి. సరేనా!..” అడిగారు మామయ్య.
“పేరూ!!!..” సాలోచనగా అడిగాను.
“శ్రీవాణి.. నోట్ చేసికో, మరచిపోతావేమో!..” నవ్వుతూ నా ముఖంలోకి చూచారు మామయ్య.
ఆ పేరు వినగానే నాలో కలవరం. మౌనంగా తల ఆడించాను. మామయ్య అత్తయ్య ప్రక్కకు వెళ్ళిపోయారు.
అమ్మా, నాన్నా పిలిచారు. భోజనాలు ఏర్పాట్లను చేయమని చెప్పారు. నాగరాజు, గోపాల్.. అదే పనిలో వున్నారు. నేనూ వారితో కలసి చేయవలసిన ఏర్పాట్లను యాంత్రికంగా చేయసాగాను. నా మనస్సు లయ తప్పింది. కార్య భారంతో నా తనువు తడబడుతూ వుంది.
నా ముఖంలోకి అప్రసన్నతను గమనించిన గోపాల్..
“అన్నయ్యా!.. ఏంటి అదోలా వున్నావ్. ఒంట్లో ఏదైనా సంకటమా!..” అని అడిగాడు.
‘సంకటం ఒంట్లో కాదురా మనస్సులో’ అనుకొని, “ఏం లేదురా.. బాగానే వున్నాను” అన్నాను. “మన చెల్లి మనకు త్వరలో దూరం కాబోతూ వుందని బాధగా వుందా!..” ఆ మాట అన్నప్పుడు నాకు వాడి కళ్ళల్లో నీళ్ళు కనిపించాయి.
వాడు కన్నీటిని కర్చీఫ్తో తుడుచుకొని “నాకూ బాధగానే వుందన్నయ్యా.. ఆ అయినా ఎంతో దూరం పోవడం లేదుగా, తలుచుకొంటే గంటలో పోయి చూడగలం” తన్ను తాను సంబాళించుకొని నన్ను ఓదార్చడానికి ప్రయత్నించాడు. గోపాల్.. నా పిచ్చి తమ్ముడు.
నా బాధను నేను ఎదుటివారికి చెప్పలేనిది. అది నా అనుమానమేనా!.. శ్రీవాణి పేరు వినగానే నాలో భయం. నాకు అమెరికాలో పరిచయం అయిన శ్రీవాణి.. మామయ్య చెప్పిన శ్రీవాణి ఒకరేనా!.. లేక వేరేనా!.. వేరయితే నేను బాధపడడం అనవసరం. ఒకటే అయితే.. బాధపడక తప్పదు. ఆమె సి.వి.ని చూస్తే నా సందేహానికి.. భయానికి పరిష్కారం కలుగుతుంది. రేపు ఆఫీస్కు వెళ్ళగానే ఆమె సి.వి.ని చూడాలి. యిప్పుడు అర్థంలేని ఆలోచనతో మనస్సును వికలం చేసుకొని సతమతమవడం.. అందరిచేతా ‘ఏం అదోలా వున్నావ్’ అని అడిగించుకోవడం.. అనవసరం.
మనస్సులో వున్న శ్రీవాణి పేరును ప్రక్కకు నెట్టి జరుగుతున్న కార్యక్రమంలో గోపాల్ నాగరాజు తదితరులతో కలసిపోయాను.
భోజనానంతరం వూరివారందరూ వెళ్ళిపోయారు. మా కుటుంబం.. మామయ్యగారి కుటుంబం కలిసి భోంచేశాము. ఎంతగా నటించినా.. మనస్సులో ఏదో అనుమానం. భయం. సరిగా భోంచేయలేకపోయాను.
తదనంతరం.. అమ్మ నాన్న.. అత్తయ్య మామయ్యలు.. నెలలో జరగబోయే రాఘవ వసంతల వివాహాన్ని గురించి మాట్లాడుకోసాగారు. మాటల మధ్య వారు నన్ను అడిగిన ప్రశ్నలకు ‘అవును.. అలాగే’ అనే సమాధానాలను చెప్పాను. మనస్సు ఏకాంతం కావాలని కోరుతూ వుంది. కాలం చాలా భారంగా నడుస్తున్నట్లు అనిపించింది. ప్రక్కకు నెట్టిన శ్రీవాణి ఆలోచనలో మనస్సును ఆక్రమిస్తున్నాయి. ఒంటరిగా వుంటే మందు కొట్టి హాయిగా నిద్ర పోయేవాణ్ణి. కానీ దానికి ఆస్కారం లేని సన్నివేశం.
సాయంత్రం ఐదు గంటలయింది. మామయ్య అత్తయ్య రాఘవ నెల్లూరికి బయలుదేరేదానికి అన్నీ సర్దుకున్నారు. మామయ్య నన్ను పిలిచారు. దగ్గరకు వెళ్ళాను. “గోవిందా!.. నీతో మాట్లాడాలి. రా, అలా తోటలోకి వెళదాం” అన్నారు. యిరువురం మా యింటి వెనకన వున్న తోటలో ప్రవేశించాము. మామిడి చెట్టు క్రింద మామయ్య కూర్చున్నారు. నేను వారికి ఎదురుగా కూర్చున్నాను. వారు నా ముఖంలోకి చూచారు. వారి వదనం అప్రసన్నంగా వుంది.
“చెప్పండి మామయ్యా!..” మెల్లగా అన్నాను.
“నేను చెప్పబోయే విషయాన్ని నీవు నీ మనస్సులోనే వుంచుకోవాలి గోవిందా!..”
“అలాగే మామయ్యా!..”
‘వారు చెప్పబోయే విషయం శ్రీవాణి గురించా.. లేక వేరెవరిదోనా!.. యింతకూ విషయం ఏమిటో!..’ అనుకొన్నాను.
“ఆ శ్రీవాణి.. నాకు కూతురు వరస అవుతుంది. ఆమె తల్లిదండ్రులు ఆమె వివాహాన్ని.. ఐదు నెలల క్రిందట ఎంతో ఘనంగా చేశారు. అబ్బాయి ఆమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్.
వివాహం అయిన ఐదవరోజే ఆ యిరువురూ అమెరికా వెళ్ళిపోయారు. అతనికి ముగ్గురు చెల్లెళ్ళు చదువుకొంటున్నారు. వారికి తల్లి లేదు. మేనత్త విడో.. వారి యింట్లోనే వుంటూ, యీ పిల్లలనందరినీ సాకింది. పెద్ద చేసింది.
ఆ అబ్బాయి పేరు వినోద్.. చాలా మంచివాడు. కానీ.. అతనికి పురుషత్వం లేదు. యింపోటెంట్. అమెరికాలో చికిత్స చేయించుకోగలననే నమ్మకంతో శ్రీవాణిని వివాహం చేసికొన్నాడు. కానీ అక్కడ అతని ప్రయత్నాలు.. ఫలించలేదు.
ఆ కారణం.. తన స్థితిని శ్రీవాణికి చెప్పి.. తన మూలంగా ఆమె నూరేళ్ళ పండంటి జీవితం నాశనం కాకూడదని.. విడాకుల పేపర్ల మీద సంతకాలు చేసి.. ఆమెను ఇండియాకు పంపించేశాడు. ఆమె తండ్రి.. అంటే నాకు అన్నయ్య వరస రాజగోపాల్ నన్ను కలిసి తన బిడ్డ, యీ కన్నీటి కథను నాకు చెప్పాడు.
కారణాంతరాల వల్ల.. మగవాడు ఎలా రెండవ వివాహాన్ని చేసుకొని హాయిగా శేషజీవితాన్ని గడుపుతాడో.. అలాగే శ్రీవాణి కూడా, చెడిపోయిన తన మొదటి వైవాహిక జీవితాన్ని మరచి.. మరొకరిని మనువాడి ఆమె కూడా.. మగవారిలా ఆనందంగా తన శేష జీవితాన్ని.. బిడ్డ పాపలతో హాయిగా గడపాలని నేను ఆశిస్తాను.
ఏ పనీ లేకుండా వుంటే మనస్సుకు తగిలిన గాయం ఏ వ్యక్తినైనా, అతిగా వేధిస్తుంది. బాధ్యతాయుతమైన వ్యాపకం అంటూ ఒకటి వుంటే.. ఆ వ్యక్తి తన మనోవేదనను కాలక్రమేణా మరిచిపోగలడు. భవిష్యత్తుపై కొత్త ఆశలతో ఆనందంగా జీవన యాత్ర సాగించగలడు. అందుకే క్వాలిఫికేషన్ వున్న ఆ పిల్లకు నీ ఆఫీస్లో ఉద్యోగాన్ని యివ్వవలసిందిగా నీతో చెప్పాను. ఆమె సి.వి.ని మీ ఆఫీసు పంపిందట. శ్రీవాణి రేపు యిక్కడికి వస్తూ వుంది. చెప్పానుగా ఆమె నా కూతురని. ఆమె భవిష్యత్తును చక్కదిద్దడం నా బాధ్యత. యిందులో నీవు చేయదగిన సహాయం.. ఆమెకు ఉద్యోగాన్ని కల్పించడం గోవిందా..” ఎంతో ఆవేశంగా చెబుతూ వచ్చిన మామయ్య, చెప్పడం ఆపేశారు. వారి వదనంలో ఎంతో విచారం.
మామయ్య చెప్పిన ప్రతి మాటా నాకు వడగళ్ళ వానలా వినిపించింది. నా తల దిమ్మెక్కిపోయింది. గొంతులో తడి ఆరిపోయింది. హృదయంలో కంపనం. మనస్సులో బాధ.. భయం. కారణం, యీ శ్రీవాణి.. నాకు అమెరికాలో పరిచయమైన శ్రీవాణి ఒక్కరే.
మామయ్య లేచి నిలబడ్డారు. నేనూ యాంత్రికంగా అదే పని చేశాను. “శ్రీవాణికి సాయం చేస్తావా గోవిందా!..” మెల్లగా అడిగాడు మామయ్య.
“చేస్తాను మామయ్య” మెల్లగా చెప్పాను.
అంతవరకూ నా మదిలో వున్న అనుమానం తీరిపోయింది. యిప్పుడు మనస్సు నిండా వున్నది భయం, ఆవేదన.
ఇరువురం యింటి వరండాలోకి వచ్చాము. వరండాలో అమ్మానాన్న గోపాల్, సుందరి అత్తయ్య, రాఘవ వున్నారు.
“అయినాయా.. మామాఅళ్ళుళ్ళ ముచ్చట్లు!..” అంది సుందరి అత్తయ్య నవ్వుతూ.
“ఏమిటి బావా విషయం?..” నాన్నగారి ప్రశ్న.
“ఏం లేదు బావా!.. మనకు కావలసిన ఒక క్యాండిడేట్ వుద్యోగ విషయాన్ని గురించి సాయం చేయమని గోవింద్ చెప్పాను” నవ్వుతూ చెప్పారు మామయ్య. గోపాల్ వారి లగేజీని వాళ్ళ కార్లో సర్దాడు.
“ఏరా!.. మామయ్యకు ఏం సమాధానం చెప్పావ్?..”
“నాన్నా!.. మామయ్యగారి మాటను నేను ఎలా కాదనగలను!.. ఆఫీస్కు మనుషుల అవసరం వుంది. తప్పకుండా తీసికొంటానని చెప్పాను”
“మామయ్య రెకమెండ్ చేశారంటే.. ఆ క్యాండిడేట్ సూపర్ క్యాండిడేట్ అయ్యి వుంటాడు. నీకు బాగా పనికొస్తాడు” నవ్వుతూ అన్నాడు గోపాల్.
ఎవరి మాటలు వినాలని కాని.. మాట్లాడాలని కానీ.. అనిపించడం లేదు. మనస్సు ఏకాంతాన్ని కోరుతూ వుంది. ఆవేదన.. భయం కారణంగా.
“సరే బావా!.. యిక మేము బయలుదేరుతాం” చెప్పి మామయ్య కార్లో కూర్చున్నారు. సుందరి అత్తయ్య వారి ప్రక్కన కూర్చుంది.
వసంత వచ్చి.. వాకిట్లో నిలబడి వుంది. రాఘవ కళ్ళు.. ఆమెనే వెదుకుతున్నాయి. నాలుగు కళ్ళూ కలిశాయి. నవ్వి రాఘవ ముందు కూర్చున్నాడు. శ్యామల పెద్దమ్మ వాడి ప్రక్కన కూర్చుంది. వారి కారు కదిలి వెళ్ళిపోయింది.
అమ్మా నాన్నలకు పని వుందని చెప్పి.. రూప దీప రామసుబ్బయ్యలతో నేనూ బయలుదేరాను. పిల్లలనిద్దరినీ యింటి దగ్గర దించి.. నేను రామసుబ్బయ్య ఆఫీస్కు వెళ్ళాము.
ఈమెయిల్లో వచ్చిన సి.వి. లన్నింటినీ తీసికొని హోటల్కు వెళ్ళాను. గదిలో ల్యాప్టాప్ను, అప్లికేషన్ల కవర్లను టీపాయ్ పై వుంచి మంచంపై వాలిపోయాను.
మనస్సులో వేదన.. త్రాగాలనిపించింది. విస్కీని ఆర్డర్ చేశాను. బాయ్ ఫుల్ బాటిల్ జానివాకర్ విస్కీ.. ఐస్ క్యూబ్స్, వాటర్ బాటిల్సు, క్యాజూ.. తెచ్చి టీపాయ్ పై వుంచాడు.
“ఓపెన్ చేసి ఓ గ్లాస్ యివ్వనా సార్!..” నవ్వుతూ ఎంతో వినయంగా అడిగాడు. తల ఆడించాను.
బాయ్ నా చేతికి గ్లాస్ అందించి.. “ఏమైనా కావాలంటే బెల్ కొట్టండి సార్!.. వస్తాను” చెప్పి వాడు వెళ్ళిపోయాడు.
శ్రీవాణిని తలచుకొంటూ సిప్.. చేశాను. గ్లాసు ఖాళీ చేసి మరో గ్లాసు కలుపుకొని రెండు ఊపుల్లో త్రాగేశాను. శరీరం తిమ్మిరెక్కింది. హృదయదర్పణం మీద శ్రీవాణి ప్రతిబింబం.
కవర్ను చేతికి తీసుకొన్నాను. సి.వి.లను ఒకదాని తర్వాత ఒకటిని చూచాను. ఆరవది.. శ్రీవాణి. సి.వి. ఫోటోలో ఆమె నవ్వుతూ వుంది. ఆమె నవ్వు.. చూచేదానికి ఎంతో అందంగా, ఆనందంగా వుంటుంది. శ్రీవాణి నా కళ్ళ ముందు నిలిచింది. మనస్సు గతంలోకి పరుగెత్తింది.
రామసుబ్బయ్యగారు ఫోన్ చేసి లాయర్ని కలిసి రవిబాబుకు డాక్యుమెంట్సు పంపానని చెప్పారు. కానీ వారి మాటలను శాంతంగా ఆలకించే స్థితిలో నా మనస్సు లేదు.
(ఇంకా ఉంది)
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 20 నవలలు, 100 కథలు, 12 నాటికలు/నాటకాలు, 30 కవితలు రాశారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.