[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘ప్రేమేగా ప్రపంచం’ అనే నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]
[వసంత, గోపాల్లతో కారులో బయల్దేరుతాడు గోవింద. తన ఫ్రెండ్ ఒకడు తన కన్నా రెండేళ్ళు పెద్దయిన తన మేనత్త కూతురుని ప్రేమించాడనీ, వాళ్ళు పెళ్ళి చేసుకుంటే ఏమైనా ఇబ్బందులుంటాయా అని గోపాల్ అన్నని అడుగుతాడు. తనకి తెలిసిన సమాచారాన్ని చెప్తాడు గోవింద. పాలకేంద్రం దగ్గర గోవింద దిగిపోతాడు, గోపాల్ డ్రైవర్ సీట్లోకి వచ్చి వసంతని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. పాలకేంద్రం లోపలికి వెళ్ళగానే రామసుబ్బయ్య ఎదురొస్తారు. అక్కడి సిబ్బందిని అందరినీ పరిచయం చేస్తారు. అక్కడి మేనేజర్ పాండురంగ అడిగిన సాయం, తప్పకుండా చేస్తానని మాట ఇస్తాడు గోవింద. అక్కడి నుంచి రామసుబ్బయ్యతో కలిసి ఆఫీసుకి వెళ్తాడు. అప్పటికే అక్కడ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటులోని ఆరుగురు ముఖ్యులు వచ్చి ఉంటారు. వారి పేర్లు గోవిందకి చెప్పి, వారిలో సుబ్బారావు గారు, త్రివిక్రమ్, ఖాసింఖాన్ చాలా మంచివారనీ, వారి లెక్కల్లో ఎలాంటి తేడాలు లేవని, మిగతా ముగ్గురు, రవికి కావల్సినవాళ్ళనీ, దొంగబిల్లులతో డబ్బు కాజేస్తున్నారనీ చెప్తాడు. కాసేపటి తర్వాత వాళ్ళందరితో సమావేశమవుతాడు గోవింద. తన ఆలోచనలను స్పష్టంగా చెప్తాడు. నిజాయితీయే ముఖ్యమని అంటాడు. వారు మీరు చూచే ప్రాజెక్టుల మొత్తం వ్యాల్యూ.. యింతవరకూ అయిన పని వ్యాల్యూ, బిల్స్ చేసిన, చేయవలసిన వ్యాల్యూ.. మిగతా పని.. దానికి అయ్యే ఖర్చు.. పి.సి.ఎ, ప్రాజెక్టు కాస్ట్ అనలైజేషన్.. వివరాలను ప్రాజెక్టుల వారీగా స్టేట్మెంట్లు వేసి, మర్నాడు మధ్యాహ్నం మూడు గంటలకు కలవమంటాడు. ఆ మధ్యాహ్నం రూప, దీపలు ఆఫీసుకు వస్తారు. గోవిందతో కలిసి భోం చేస్తారు. ఈలోపు రామసుబ్బయ్య వచ్చి పది లక్షలు తన ఎకౌంట్లో వేయమని పంపిన మెసేజ్ని చూపిస్తారు. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే, శ్యామల ఫోన్ చేసి పాతికవేలు వేయమని చెప్తుంది. ఈలోపు గోవింద తండ్రి ఫోన్ చేసి, ఆ శుక్రవారం ముహూర్తం బాగుందని, తమ యింటికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించినట్లు చెప్తారు. మర్నాడు ఆఫీసుకు వెళ్ళేసరికి సుబ్బారావుగారు, ఖాసింఖాన్ వచ్చిఉంటారు. తాము చూస్తున్న ప్రాజెక్టు వివరాలన్నీ గోవిందకి చూపిస్తారు. కొన్ని కీలకమైన సూచనలు చేస్తాడు గోవింద. బాధ్యతా రహితంగా ప్రవర్తించే కొందరిని గుర్తించి వాళ్ళని రిజైన్ చేయమని అడమని చెప్తాడు. సుబ్బారావు అన్ని ప్రాజెక్టులను కో-ఆర్డినేటర్గా నియమిస్తాడు. భూపతి, రంగారావు, స్టేట్మెంట్లతో పాటు రిజిగ్నేషన్ లెటర్స్ కూడా ఇస్తారు. వెంటనే వారి రాజీనామాలను ఆమోదిస్తాడు. దొంగబిల్లులకు ఎకౌంట్ చేసిన కారణంగా వారిద్దరికీ ఒక నెల జీతం కూడా రాదని చెప్తారు రామసుబ్బయ్య. అవసరమైన పత్రాల మీద వాళ్ళ సంతకాలు తీసుకుని, పంపించేస్తాడు గోవింద. ఆఫీసు పనులన్నీ చూసుకోడానికి ఒక సీనియర్ పర్సన్ కావాలని గోవింద అంటే, ముకుందరావు అనే రిటైర్డ్ యస్.సి. పేరును సూచిస్తారాయన. ఆయనని జి.యం. ప్రాజెక్ట్స్ గా తీసుకోవాలని నిర్ణయిస్తాడు గోవింద. – ఇక చదవండి.]
అందరం ఆ ఉదయం ఆరున్నరకల్లా మా ప్లాటు దగ్గర సమావేశం అయ్యాము. అమ్మా నాన్న గోపాల్ వసంతలతో కలసి హారిక కూడా వచ్చింది. పురోహితులు వేదమంత్రాలు చదవగా, అమ్మానాన్నలు భూమి పూజ చేశారు. నూతన గృహానికి శంకుస్థాపన జరిగింది.
మాస్టారు రామకోటయ్యగారు, మ్యానేజర్ రామసుబ్బయ్యగారు, శ్యామల పెద్దమ్మ, రూప, దీప, నాగరాజు, సుబ్బలక్ష్మి కూడా వచ్చారు.
అనుకున్న ప్రకారం సకాలంలో కార్యక్రమం పూర్తయింది. అమ్మా నాన్నలకు ఎంత సంతోషం.
కార్యక్రమానంతరం అందరం శ్యామలరావు మామయ్య యింటికి వెళ్ళాము. అందరం కలసి ఆనందంగా బ్రేక్ఫాస్ట్ చేశాము.
పెద్దల మధ్యన వసంత నిశ్చితార్థానికి సంబంధించిన చర్చలు.. వివాహానికి సంబంధించిన విషయాల ప్రస్తావన జరిగింది.
చివరగా నాన్నగారు.. “నాకు ఒక్కగానొక్క ఆడబిడ్డ, ఆమె ఎవరో కాదు మా అమ్మ, అందరికీ ఆనందం కలిగేలా.. ఆమె వివాహాన్ని జరిపించడం నా కర్తవ్యం. నా తోడుగా నా మగబిడ్డలు గోవింద్ గోపాల్.. వున్నారు. అందరి మన్ననలను పొందేలా వారు తమ చెల్లెలి వివాహాన్ని జరిపిస్తారు” ఎంతో ఆనందంగా వారు చెప్పారు.
తర్వాత అమ్మా నాన్న, హెడ్మాస్టారు రామకోటయ్య, నాగరాజు సుబ్బలక్ష్మి, మా వూరికి.. వసంత, రూప, దీపలు కాలేజీలకు, గోపాల్ హారికా నేను ఆఫీస్లకు వెళ్ళిపోయాము.
నేను ఆఫీసు చేరిన అరగంట తర్వాత పెద్దమ్మ శ్యామల ఆఫీస్కు వచ్చింది. ఆ సమయంలో రామసుబ్బయ్యగారు, తనకు రవిబాబు పంపిన మెసేజ్ని చూపించి మాట్లాడుతున్నారు.
“ఏరా ముసలి పీనుగా!.. నీవు నాకు పాతిక వేలు బిచ్చం ఏస్తావా?.. నిన్ను గురించి నీవు ఏమనుకుంటున్నావ్?.. నేను అక్కడికి వస్తే నిన్ను చంపుతాను. మర్యాదగా పది లక్షలు నా అకౌంటుకు క్రెడిట్ చెయ్యి” యింగ్లీష్లో వున్న యీ మెసేజ్ని చూచి నేను ఆశ్చర్యపోయాను. ఆ క్షణంలోనే పెద్దమ్మ నా క్యాబిన్లో ప్రవేశించింది.
రామసుబ్బయ్యగారు, ఆ మెసేజ్ను పెద్దమ్మకు చూపించారు. ఆమె నిశ్చేష్టురాలయింది. కళ్ళల్లో నీళ్లు. వదనంలో ఆవేశం.
“వాడు నా కొడుకు కాదు. ఏనాటి పాపమో నా కడుపున రాక్షసుడిగా పుట్టి.. నన్ను చంపాలని నిర్ణయించుకొన్నాడు” గద్గద స్వరంతో అంది పెద్దమ్మ. ఆమె మాటలకు నా మనస్సులో మూగ బాధ. తమాయించుకొని.. “బాధపడకండి పెద్దమ్మా!.. నేను వెళ్ళి వాణ్ణి కలుస్తానుగా. నచ్చచెప్పి వాడి మనస్సు మారేలా చేస్తాను.” ఆమెకు ఓదార్పు కలగాలని చెప్పాను.
“వాడు భ్రష్టుడైపోయాడు. యిక వాడిలో మార్పు రాదు” రామకోటయ్యగారి ముఖంలోకి చూచి “అయ్యా!.. మీరు వాడికి యికపై పైసా కూడా పంపకండి” కసిగా చెప్పింది పెద్దమ్మ.
కొద్ది నిముషాలు కూర్చొని లేచి.. “గోవిందా!.. యిది నీ ఆఫీస్. నీ మాటను కాదన్నవారెవరైనా సరే బయటికి పంపెయ్యి. నేను యింటికి వెళుతున్నాను నాన్నా” చెప్పి పెద్దమ్మ వెళ్ళిపోయింది.
***
కరీమ్ నా కారు డ్రైవర్. చెప్పిన టైమ్కి వచ్చి నా ముందు నిలుచున్నాడు. అరగంట ముందు నాగరాజు, సుబ్బలక్ష్మిలు పెద్దమ్మ యింటికి వచ్చారు. నేను పెద్దమ్మకు చెప్పి.. కేరళ ప్రయాణానికి సిద్ధంగా వున్నాను.
వారిరువురూ పెద్దమ్మ పాదాలు త్రాకి ఆశీర్వాదాన్ని తీసుకొన్నారు. మేము ముగ్గురం కార్లో కొచ్చిన్కి బయలుదేరాము. రాత్రి పది గంటలకు కోయంబత్తూరు చేరి నైట్ హాల్టు చేసి ఆదివారం ఉదయాన్నే బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకు కొచ్చిన్ చేరాము.
మేము దిగిన లాడ్జికి నాయర్ వచ్చాడు. రేపు ఉదయం తొమ్మిది గంటలకు డా॥ టి.టి. చాకో గారితో అపాయింట్మెంటు ఫిక్స్ చేశానని చెప్పి ఉదయాన్నే కలుస్తానని వాడు వెళ్ళిపోయాడు.
సోమవారం ఉదయాన తొమ్మిది గంటలకు మేము డాక్టర్ గారి క్లినిక్కి వెళ్ళాము. నాయర్ అదే సమయానికి వచ్చాడు. నాగరాజు సుబ్బలక్ష్మిల సమస్యను వారి భాష.. మళయాళంలో డాక్టర్ గారికి వివరించాడు నాయర్.
వారు నాగరాజును, సుబ్బలక్ష్మిని వేరువేరుగా కొన్ని ప్రశ్నలను అడిగారు.
నాగరాజును డాక్టర్ గారు.. సుబ్బలక్ష్మిని వారి శిష్యురాలు పరీక్షించారు. రెండు నెలలు వాడవలసిందిగా చెప్పి.. చూర్ణాలను, ద్రవాలను మందులుగా యిచ్చారు. మీలో ఎవరిలోనూ ఏ లోపమూ లేదని.. త్వరలో మీకు సంతాన ప్రాప్తి కలుగుతుందని డాక్టర్ గారు వారికి చెప్పారు.
మేము బయలుదేరే ముందు డాక్టర్ గారి అసిస్టెంట్ వరండాలోకి వచ్చింది. సుబ్బలక్ష్మికి బెస్టు విషెష్ చెప్పింది.
ఆమెను చూచి నాగరాజు ఆశ్చర్యపోయాడు. నా వంక చూచాడు. నాకు వాడి ఫీలింగ్స్ ఏమీ అర్థం కాలేదు. నాయర్ కారు నడుపుతున్నందు వల్ల వాడిని నేను ఏమీ అడగలేకపోయాను. లాడ్జికి చేరాము. అర్జంటు పని వుందని, భోజనానికి తన యింటికి రావలసిందని, అరగంటలో వస్తానని నాయర్ వెళ్ళిపోయాడు.
“బావా!.. సుబ్బును చెక్ చేసింది ఎవరో తెలుసా!..” వాడి మాటల్లో ఎంతో ఆశ్చర్యం.
“ఆడమనిషి” అన్నాను.
“ఆమె ఎవరో కాదు, మన రవి బాబుగాడి భార్య వసుధ. ఆమె నన్ను సరిగా గుర్తించలేదు!..” ఆశ్చర్యంతో చెప్పాడు.
“నాగూ, నీవు చెప్పింది నిజమా?..” ఆశ్చర్యం యీసారి నా వంతయింది.
“అవును బావా, నా మాట నమ్ము” బల్లగుద్దినట్లు తన అభిప్రాయాన్ని చెప్పాడు నాగరాజు.
వాడు ఆ మాట అన్న తర్వాత.. ఆమె ఎవరన్నది నాయర్ని అడిగి తెలుసుకోవాలనుకొన్నాను. ఆమెను ఒకసారి కలవాలనుకున్నాను.
“ఓరేయ్!.. వీళ్ళకు ఓ పాప వుంది కదూ!..” నాగరాజును అడిగాను.
“వుంది. పేరు పల్లవి. యిప్పటికి ఒకటిన్నర సంవత్సరం బిడ్డ అయ్యి వుంటుంది. ఆ పాప చాలా అందంగా వాళ్ళ అమ్మలాగే వుంటుంది బావా!..” వారితో నాగరాజు ఆ మాట అనగానే.. నేను ఆమె రూపును గుర్తు చేసుకోసాగాను.
తెల్లని శరీరం, విశాలమైన నేత్రాలు, నవ్వు ముఖం, విశాలమైన ఫాలభాగం, మాటల్లో ఎంతో సౌమ్యత. గొప్ప అందగత్తె అని చెప్పాలి. నా వంకే ఆశ్చర్యంగా చూస్తూ వున్న సుబ్బలక్ష్మి ముఖంలోకి చూచాను. నా చూపులు, ఆమె చూపులతో కలసేటప్పటికి ఆమె ముఖాన్ని నవ్వుతూ ప్రక్కకు త్రిప్పుకొంది.
“అమ్మా!.. సుబ్బు.. నీ సమస్య పరిష్కారం అయినట్లే.. నేను రేపు యిక్కడి నుంచి మంగుళూరు వెళతాను. నీవు వీడు రేపు తిరువనంతపురం వెళ్ళి అనంత పద్మనాభస్వామి వారిని దర్శించి.. రెండు రోజులు జాలీగా వుండి వూరికి బయలుదేరండి. నాయర్ చేత టికెట్లు బుక్ చేయిస్తాను. ఏరా నాగూ!.. సరేనా!..” అడిగాను.
“అలాగే బావా!..”
“సరే అన్నయ్యా” ఆనందంగా అంది సుబ్బు.
నాయర్ వచ్చాడు. వారి యింటికి వెళ్ళాము. తమ్ముడు, చెల్లి, అమ్మ వాడి కుటుంబం. వారంతా మమ్మల్ని ఎంతో ఆదరాభిమానాలతో యింతకు ముందు పరిచయం వున్న వారితో మాట్లాడే రీతిలో మాతో హిందీలో మాట్లాడారు.
అందరం కలసి ఒకటిగా కూర్చొని భోం చేశాము. సుబ్బలక్ష్మి నాయర్ చెల్లి, తల్లితో ఓ గదిలోకి వెళ్ళిపోయింది.
నేను నాయర్ నాగరాజు వాకిటి ముందున్న వరండాలో కూర్చున్నాము. “నాయర్.. డాక్టర్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న అమ్మాయి పేరేమిటి?..” అడిగాను.
“ఆమె అమ్మాయి కాదు. మ్యారీడ్. ఒక పాప కూడా వుంది. పేరు వసుధ” నవ్వుతూ చెప్పాడు నాయర్.
నాగరాజు ‘ఇప్పుడైనా నా మాటను నమ్ముతావా’ అన్నట్లుగా చిత్రంగా నా ముఖంలోకి చూచాడు.
“ఆమె భర్త ఎవరు?..”
“వాడిది మీ ప్రాంతమే. నెల్లూరు. కోటీశ్వరుడట.”
“ఈమెను రైలు ప్రయాణంలో చూచి ప్రేమించి పెళ్ళి చేసుకొన్నాడు. ఒక బిడ్డ పుట్టగానే మోజు తీరి.. తనకు యిష్టమైన వాళ్ళతో తిరుగుతూ, ఒక్కోసారి వారితో యింటికి వస్తూ.. వసుధకు నరకాన్ని చూపించాడట.
అతని దగ్గర పనిచేసే డ్రైవర్ అనంత్ కేరళ వాడే. అతని సాయంతో ఆమె కేరళకు వచ్చింది. అనంత్కు వివాహం అయ్యి ఒక రెండేళ్ళ బాబు. ఆమె వాడితో యిక్కడికి వచ్చిన నెలరోజుల్లో కాన్పు సమయంలో వాడి భార్య ఆ బిడ్డ చనిపోయారు.
ఆ సమయంలో వసుధ.. తనకు సాయం చేసిన అనంత్కు సాయం చేసింది. వాడి మగబిడ్డను చేరదీసింది. అనంత్ కోరగా.. ఆ యిద్దరి బిడ్డల భవిష్యత్తును చక్కగా తీర్చి దిద్దాలనే ఉద్దేశంతో వసుధ అనంత్ను పెళ్ళి చేసికొంది. అనంత్ ఐ.ఎ.యస్కు సెలక్టు అయ్యాడు. కొద్ది రోజుల్లో ఏదో ప్రాంతానికి కలెక్టర్ కాబోతున్నాడు. ఆ
బిడ్డలతో ఆ దంపతులు ఆనందంగా వున్నారు. ప్రస్తుతానికి అనంత్ టాక్సీ నడుపుతున్నాడు. ఆమె ఆయుర్వేదంలో డిప్లమా పాసైయున్నందున డాక్టర్ గారి వద్ద అసిస్టెంట్గా పని చేస్తూ వుంది. డాక్టర్ ఆమెను కన్న కూతురులా చూచుకొంటారు. యిదీ వసుధ కథ” నాయర్ చెప్పడం ముగించాడు.
వసుధ.. రవి ముఖాలు నా కళ్ళ ముందు నిలిచాయి. ‘అప్సరసలాంటి వసుధ ఆ దరిద్రుడు, దురాశాపరుడు, డబ్బుకోసం తన యిల్లాలి.. తార్చాలనుకొన్న హీనుడికి అబ్బుతుందా!.. కొద్దిరోజుల్లో కలెక్టర్ అర్ధాంగిగా పిలవబడబోతున్న ఆమె సౌశీల్యానికి.. మానవతావాదానికి.. హృదయంలో జోహార్లు తెలియజేశాను. ఆమెను ఒక్కసారి చూచి పలకరించాలని నాలో కోరిక. ఆ విషయాన్ని నాయర్తో చెప్పాను.
“అయిదున్నరకల్లా యింట్లో వుంటుంది. వెళదాం” అన్నాడు నాయర్.
ఆరు గంటలకల్లా నేను నాగరాజు సుబ్బు నాయర్ వసుధ యింటికి వెళ్ళాము. ఆ సమయంలో అనంత్ కూడా యింట్లోనే వున్నాడు. నాయర్ మళయాళంలో వీరు మిమ్మల్ని చూచేదానికి వచ్చారని చెప్పాడు.
సుబ్బలక్ష్మి ఆనందంగా వసుధ ప్రక్కకు వెళ్ళి “అక్కా! మీకు నా ధన్యవాదాలను తెలియజేయాలని వచ్చాను” హిందీలో చెప్పింది.
అనంత్ అందరినీ కూర్చోమన్నాడు. రెండేళ్ళ అనంత్ మగబిడ్డ ఒకటిన్నర సంవత్సరం వసుధ బిడ్డ చూడముచ్చటగా కనుపించారు. యిద్దరినీ నేను నాగు సుబ్బు ఎత్తుకొన్నాము. ముద్దులాడాము. పదివేలు అనంత్ చేతికి బలవంతంగా యిచ్చి బిడ్డలకు ఏదైనా కొని యివ్వండని చెప్పాను. నాయర్ చెప్పగా అనంత్ తీసికొన్నాడు. వసుధ యిచ్చిన బిస్కెట్సు, టీ తీసుకొన్నాము.
“త్వరలోనే మీకూ యిలాంటి బిడ్డ పుట్టబోతుంది” మనసారా చెప్పింది వసుధ.
నాగరాజు సుబ్బు సంతోషించారు. లాడ్జికి వచ్చేశాము.
నాయర్కు నేను చెప్పిన ప్రకారంగా, నాగరాజుకు సుబ్బలక్ష్మికి తిరువనంతపురానికి మరుదినం.. వెళ్ళేదానికి, రెండు రోజుల తర్వాత తిరువనంతపురం టు నెల్లూరుకు రైలు టిక్కెట్స్ ఏర్పాటు చేసి మనిషి ద్వారా రాత్రి తొమ్మిది గంటలకు పంపాడు.
భోజనానంతరం వారిరువురూ వారి గదికి వెళ్ళిపోయారు. నేను నా గదిలో మంచంపై వాలాను. నా మనస్సు నిండా.. రవిబాబును గురించిన తలపులే.. వాడు రామసుబ్బయ్య గారికి పంపిన మెసేజ్.. దాన్ని చూచి పెద్దమ్మ అన్న మాటలు.. ఆమె ఆవేదన గుర్తుకు రాసాగాయి.
‘వాడు యిప్పుడు ఎక్కడ వున్నట్లు?.. ఆతృతతో నా దగ్గర వున్న నెంబర్కు కాల్ చేశాను. నో రెస్పాన్స్. విసిగిపోయి సెల్ను ప్రక్కన పెట్టాను. కానీ వాడిని గురించిన తలపులు మస్తిష్కం నుంచి మాయం కానంటున్నాయి. యిప్పటికి వారురం రోజులుగా వాడికి అనేకసార్లు ఫోన్ చేశాను. కానీ వాడు లిఫ్టు చేసిన పాపాన పోలేదు. వాడి పట్ల మనస్సులో కోపం, కసి. ‘మహారాజులా బ్రతకవలసినవాడు, అందాల బొమ్మలాంటి వసుధను, చిన్నారి పాపను ఎలా నిర్లక్ష్యం చేయకలిగాడు?.. వసుధలో లేని ఏ క్రొత్త అందాలను వాడు ఆ దివ్యలో చూడగలిగాడు. ఆమె వివాహిత. వీడితో కలిసి వుందంటే అది కేవలం డబ్బు కోసమా!.. లేక నిజమైన ప్రేమాభిమానాలతోనా!.. ఒకవేళ నేను వాడిని కలిస్తే నా మాటలను విని నాతో వూరికి వస్తాడా!.. పోరా అని నన్ను ఆసహ్యించుకొంటాడా!.. అన్నీ ప్రశ్నలే.. వాణ్ణి చూచి మాట్లాడితేగాని జవాబులు దొరకవు’ నిద్రాదేవికి నమస్కరించి బలవంతంగా.. కళ్ళు మూసుకొన్నాను.
***
“‘కర్మాదీనం మానవ జీవితం. యీశ్వరాధీనం జగత్ సర్వం’ ఎప్పుడో ఎక్కడో ఎవరో అనగా విన్నాను. బాబూ!.. యీ మాట యథార్థం. రవిబాబు ఖర్మను మార్చేదానికి మీరు నేను ఎంతటి వారం?” విచారంగా అన్నారు రామసుబ్బయ్యగారు కార్లో కూర్చుంటూ.
క్రిందటి రాత్రి పదిన్నరకు నేను మంగుళూరికి కార్లో చేరాను. వేకువన ఐదుగంటలకు వారు చేరారు. ఎనిమిదిన్నరకు యిరువురం బయలుదేరి, మంగుళూరు సైట్ ఆఫీస్కు వెళ్ళి రవిబాబు ఎక్కడ వుండేది కనుక్కొని.. పది గంటలకు వాడి నిలయానికి చేరాము.
దివ్య తలుపు తీసింది. మమ్మల్ని చూచి ఆశ్చర్యపోయింది. ఆమె రామసుబ్బయ్యగారి క్రింద అకౌంట్సు డిపార్టుమెంటులో పని చేసింది. “అమ్మా దివ్యా!.. రవిబాబుగారు వున్నారా?” అడిగారు రామసుబ్బయ్యగారు. వారి ప్రశ్నకు ఆమె వెంటనే జవాబు చెప్పలేకపోయింది. తలను దించుకొంది.
“వీరి పేరు గోవింద్. రవిబాబుగారి బంధువు. స్నేహితుడు. వారిని కలవాలని వచ్చారు.”
“నిద్ర పోతున్నారు” అంది మెల్లగా దివ్య.
“లోన కూర్చుంటాము. వారిని నిద్రలేపమ్మా”
రామసుబ్బయ్యగారు యీ మాట అనడంతో తెలిసిన వారైనందున, వారిని త్రోసి పుచ్చలేక ఆమె.. “రండి..” మెల్లగా అని లోనికి నడిచింది.
మేమిరువురం.. హాల్లో వున్న కుర్చీలల్లో కూర్చున్నాము. ఆమె ప్రక్కనున్న గదిలోకి వెళ్ళిపోయింది.
పదిహేను నిముషాల తర్వాత మా రవిబాబు మా ముందుకు వచ్చాడు. రాత్రి సేవించిన మధువు ఛాయలు వాడి కళ్ళల్లో స్పష్టంగా వ్యక్తమౌతున్నాయి.
“రవీ!.. ఎలా వున్నావురా!..” దగ్గరగా వెళ్ళి కరచాలనం చేయబోయాను. నా వైపు తీక్షణంగా చూచి, దూరంగా వున్న మరో కుర్చీలో కూర్చున్నాడు. “రామసుబ్బయ్యగారు!.. మీ గురించి మీరేమనుకొంటున్నారు?” వారి ముఖంలోకి తీక్షణంగా చూస్తూ అడిగాడు.
“నేను నా గురించి అనుకొనేదానికి ఏముంది బాబు. మన మధ్య వున్న సంబంధం రీత్యా నేను మీ ఆఫీస్ అకౌంట్సు మ్యానేజర్ని. లేట్ ఛైర్మన్ గారు చెప్పినట్లుగా నేను నా విధులను నిర్వహించాను. వారి తర్వాత మీ అమ్మగారు చెప్పినట్లుగా నా పనిని నేను చేస్తున్నాను” ఎంతో సహనంగా జవాబు చెప్పారు.
“పది లక్షలను పంపమంటే.. పాతికవేలు ఎందుకు పంపారు?..”
“అమ్మగారి మాట ప్రకారం అలా చేశాను”
“నేనెవరో మరిచిపోయారా!..”
“ఎలా మరువగలను?.. మీరు కంపెనీకి పోయిన వారం దాకా యం.డి. గారు కదా!..”
“పోయిన వారం దాకానా?..” వాడి యీ ప్రశ్నలో ఎంతో ఆశ్చర్యం నిండివుంది.
“అవును. ప్రస్తుతం యం.డి. వీరు. మీ హితులు. మీకు యీ విషయం తెలియదు కదూ!..”
“ఏమిటి మీరంటున్నది?..” ఎంతో ఆవేశం నిండి వున్న ప్రశ్న అది.
“నేను చెప్పింది యథార్థం. మీకు సందేహంగా వుంటే మీ అమ్మగారికి ఫోన్ చేసి కనుక్కోండి” అనునయగా చెప్పారు రామసుబ్బయ్యగారు.
“ఏరా!.. నీవు నా స్థానాన్ని ఆక్రమించావా?..” నా ముఖంలోకి తీక్షణంగా చూస్తూ అన్నాడు రవి.
“ఆక్రమణ చేసేది శత్రువులు. నేను నీకు శత్రువుని కాదు. వరసకు నీ తమ్ముడిని. పెద్దమ్మ కోరిక మీద నేను ఆ బాధ్యతను స్వీకరించాను. రెండు సంవత్సరాల నీ గత చరిత్రను.. నాకు చెప్పింది. నీ నిర్వాకం సరైన దారిన సాగలేదని నాకు తోచింది. నా వారైన నా పెద్దమ్మ చెల్లెళ్ళ క్షేమం కోసం.. ఆమె కోరికను నేను తీర్చాలనుకొన్నాను. ఆ ఆఫీస్లో యం.డి.గా కాలు పెట్టాను. నీకు అన్ని విధాలా మేలు చేయాలనే సద్భావన తప్ప.. నాలో మరే యితర ఆలోచనా లేదు. తప్పు చేయడం మానవ సహజం. నీవు నాతో బయలుదేరిరా. నీ స్థానంలో నీవు కూర్చో. నీ ఆఫీస్ యం.డి హోదా నాకు అనవసరం. నేను చెప్పినట్లుగా నీ నిర్వాకాన్ని సాగించు. ఆ తల్లికి ఆనందాన్ని కలిగించు” వాడు మాట్లాడిన ధోరణిని అనుసరించి కాస్త అవేశంగానే చెప్పాను.
“నీ నుండి నీతి పాఠాలు నేర్చుకోవలసిన ఖర్మ నాకు పట్టలేదు. అమెరికాలో ఆరేళ్ళు వున్నంత మాత్రాన నీవు గొప్పవాడివనుకోకు.” రామసుబ్బయ్యగారి వైపుకు తిరిగి.. “రామసుబ్బయ్యగారు!.. నా భాగపు ఆస్తి పత్రాలు నాకు కావాలి. నేను అక్కడికి రాను. మీరే వాటిని నాకు తెచ్చియివ్వాలి” శాసించినట్లుగా ఆవేశంతో చెప్పాడు రవిబాబు.
వాడు మాట్లాడేటప్పుడు వాడి చేతుల్లో వణుకు. ముఖం నిండా చెమట. కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా వున్నాయి.
నేను నా కుర్చీని వాడికి దగ్గరగా లాక్కొని కూర్చున్నాను.
“రవీ!.. బంధుత్వం కన్నా.. నేను స్నేహాన్ని గొప్పగా గౌరవిస్తాను. మనం ఒకప్పుడు ఎలా వుండేవాళ్ళమో మరచిపోయావా?.. నీ జీవిత గమనం.. తాను ఆశించిన రీతిగా సాగడం లేదని పెద్దమ్మ.. మన చెల్లెళ్ళు రూప దీప ఎంతగానో బాధపడుతున్నారు. యింటికి పెద్దవాడివి. వారి మంచి చెడ్డలను చూచుకొంటూ వారికి ఆనందాన్ని అందించడం నీ కర్తవ్యం కాదా!.. పాడు గతాన్నంతా మరచిపో. నాతో వూరికి రా. క్రొత్త జీవితాన్ని అందరికీ ఆనందం కలిగేలా ప్రారంభించు. నీకు అండగా ప్రతి విషయానికి ఆ శ్రీరామునికి లక్ష్మణుడు వున్నట్లుగా నేనుంటాను. నా మాటను నమ్ము. మాతో బయలుదేరిరా!..” ఎంతో ఆప్యాయంగా నా మనోభావాన్ని చెప్పాను.
“నీ సలహాలు.. సహాయం నాకు అనవసరం. యిక యీ జన్మకు ఆ యింట్లో కాలు పెట్టను. త్వరలో నా భాగపు ఆస్తి పత్రాలు నాకు చేరేలా చెయ్యి. మాట్లాడింది చాలు. యిక బయలుదేరండి”
“ఆవేశంలో తీసుకొనే నిర్ణయాలు అనర్థాలకు దారి తీస్తాయి. మరొక్కసారి సావధానంగా ఆలోచించు బాబూ!..” ప్రాధేయపూర్వకంగా చెప్పాడు రామసుబ్బయ్య.
వాడు లేచి లోనికి వెళ్ళిపోయాడు. మేమిరువురం విచారవదనాలతో ఆ యింటి నుంచి బయటికి నడిచాము.
(ఇంకా ఉంది)
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 20 నవలలు, 100 కథలు, 12 నాటికలు/నాటకాలు, 30 కవితలు రాశారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.