[ప్రముఖ రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘ప్రేమేగా ప్రపంచం’ అనే నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]
అమెరికా నుండి నా ప్రయాణం జన్మభూమి భారతావనికి. రేపు నా వారినందరినీ చూడబోతున్నందుకు మనస్సులో ఎంతో ఆనందం.
2008లో ఇండియా నుంచి ఉద్యోగరీత్యా అమెరికాకు వచ్చాను. గత కొన్ని సంవత్సరాల్లో.. మూడు సార్లు మన దేశానికి వచ్చి నెలరోజులు వుండి తిరిగి వెళ్ళిపోయాను.
ఈసారి.. నా వారి ఎదుట నా జన్మభూమిలో శాశ్వతంగా వుండాలనే నిర్ణయంతో ఉద్యోగానికి రాజీనామా యిచ్చి బయలుదేరాను.
నేను పుట్టింది మధ్య తరగతి కుటుంబం. మా నాన్నగారి పేరు పరంధామయ్య. మా అమ్మ లక్ష్మి.. నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లి, గోపాల్.. వసంత.
ఆ సరస్వతీ మాత కటాక్షంతో చదువులో.. మొదటినుంచీ.. అందరి కన్నా ముందుండేవాణ్ణి. నా గురువులు నన్ను ఏకసంథాగ్రాహి అని పిలిచేవారు. నా తోటివారు, వారి సందేహాలను నన్ను అడిగి తీర్చుకొనేవారు. సాయంత్రం సమయంలో నేను నా క్రింది తరగతుల వారికి టీచింగ్ ఉచితంగా చేసేవాణ్ణి. ఆడమగ దాదాపు యిరవై మంది పిల్లలు నా దగ్గర చదువుకొనేవారు.
నా ఉద్దేశంలో.. అన్ని దానాల కన్నా.. విద్యాదానం గొప్పది. దొంగ.. తలుచుకొంటే ఎదుటివారి నుండి, సమయం చూచి దేన్నయినా దొంగిలించుకోగలడు. కానీ.. విద్యావిత్తాన్ని దోచుకోలేడు కదా!..
నేను బి.యి.సి.యస్, యం.యస్. యం.బి.ఎ చదివాను. స్టేట్సులో నాకు మంచి ఉద్యోగం. గడచిన ఆరు సంవత్సరాల్లో నాకు మూడు ప్రమోషన్స్. ఆ సంస్థ యాజమాన్యానికి నాపై ఎంతో నమ్మకం. వారి దృష్టిలో నాకు ప్రత్యేక గుర్తింపు.
నెలకు రెండు లక్షలు నాన్నగారికి పంపేవాణ్ణి. వారానికి నాలుగైదు సార్లు ఫోన్ చేసి వారి యోగక్షేమాలను తెలుసుకొనే వాణ్ణి. నాన్నగారు పొలం తాకట్టు పెట్టి.. నా చదువులకు, ఉద్యోగానికి చేసిన ఋణం తీరిపోయింది మూడు సంవత్సరాల క్రిందట.
తమ్ముడు గోపాల్.. బి.ఇ. ఎలక్ట్రికల్ చదివి ఎలక్ట్రికల్ డిపార్టుమెంటులో ఎ.ఇ. గా వున్నాడు. చెల్లి వసంత బి.యస్.సి సెకండ్ ఇయర్ చదువుతూ వుంది. అమ్మానాన్నలు ఆనందంగా ఆరోగ్యంగా వున్నారు. ఇక మీదట అమెరికాకు వెళ్ళనని ఫోన్లో చెప్పినప్పుడు వారిరువురూ ఎంతగానో సంతోషించారు. వారికి చేరువలో వుండి.. అండగా వుండాలనేది నా నిర్ణయం.
ధనార్జనలో పడ్డవాడికి ముందు చూపే తప్ప.. వెనక చూపు వుండదంటారు. కానీ నా తత్వం దానికి వ్యతిరేకం. నేను నా గత చిన్ననాటి జీవితాన్ని.. నా తల్లిదండ్రులు నా మీద చూపిన ఆదరాభిమానాలను.. వారు నా చదువు నా ఇష్టానుసారంగా సాగే దానికి పడ్డ కష్టాలను నేను మరువలేదు. మరువలేను.
వారు నా తల్లిదండ్రులయినందుకు.. తమ బాధ్యతను నా విషయంలో వారు సక్రమంగా నెరవేర్చారు. నేనూ బాగా కోరిన రీతిగా ఎదిగాను. ప్రయోజకుడనయ్యాను. ఇప్పుడు నేను.. నా వారికి దగ్గరగా వుండాలి. వారి శేష బాధ్యతలలో పాలు పంచుకోవాలి. వారికి విశ్రాంతిని కలిగించాలి. నాన్న వయస్సు డెబ్బయి సంవత్సరాలు అమ్మ వయస్సు అరవై సంవత్సరాలు. వారి భావి జీవిత కాలంలో వారు అన్ని విధాలా సంతోషంగా వుండాలి. వారిని అలా వుండేలా చేయడం నా కర్తవ్యం.. నా ధర్మం.. నా ఆశయం. అందుకే.. నా యీ తిరుగు పయనం.
***
హుస్టన్ ఎయిర్పోర్టు నుంచి అరేబియన్ ఏర్లైన్స్ ఫ్లయిట్ బయలుదేరింది. సమయం రాత్రి పదకొండు గంటలు. హుస్టన్ నుండి దుబాయికి పదిహేడు గంటల ప్రయాణం. అక్కడ ప్లయిట్ మారి యిండియాకు చేరేదానికి నాలుగు గంటలు. అంటే మన టైమ్ ప్రకారం రాత్రి పదకొండు గంటలకు చెన్నై చేరుతాను.
ఏర్ హెూస్టర్ విస్కీని ఆఫర్ చేసింది. గ్లాసును చేతికి తీసుకొన్నాను. చిప్ చేశాను. ముందున్న టీవీని ఆన్ చేశాను. తెలుగు ప్రోగ్రాం సెట్ చేశాను. కీర్తిశేషులు అక్కినేని నాగేశ్వరరావుగారి ప్రేమనగర్ సినిమాను చూడసాగాను. చిన్నతనం నుంచీ నా అభిమాన నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.. నట సామ్రాట్ అక్కినేని. ఆ సినిమాను నా చిన్న వయస్సులో పదిసార్లు చూచాను.
నా గ్లాస్ ఖాళీ అయింది. మరో గ్లాస్ అందుకొన్నాను. సముద్ర మట్టం నుండి పంతొమ్మిది వేల అడుగుల ఎత్తున విను వీధిలో పయనం. ఎక్కడ నెల్లూరు జిల్లా అల్లూరు?.. ఎక్కడ అమెరికా?.. పది సంవత్సరాల క్రిందట కలలో కూడా వూహించని దశ. మనస్సున బాల్య స్మృతులు. టీవీని ఆఫ్ చేశాడు. కళ్లు మూసుకొన్నాను.
***
రవిబాబు, నాగరాజు, బాబూరావు, నేను గోవింద్.. ప్రాణ స్నేహితులం. ప్లస్టు వరకూ ఒకే స్కూల్లో కలసి చదువుకొన్నాము.
రవి బాబు నాన్న ఆ ఊరికి యిల్లరికపు అల్లుడు. రవి తాతగారు.. వాడి తల్లి శ్యామల, చిన్నపిల్లగా వుండగానే చనిపోయారు. అమ్మమ్మ నారయణమ్మ శ్యామలను పెంచి పెద్ద చేసింది. తన అన్నయ్య కొడుకు ముకుందాన్ని తనకు సాయంగా వుంచుకొని, వ్యవసాయాన్ని సాగిస్తూ, కూతురు యుక్తవయస్కురాలు కాగానే అల్లుడు ముకుందానికి యిచ్చి పెండ్లి చేసింది నారాయణమ్మ. రవికి యిద్దరు చెల్లెళ్ళు. రూప, దీప. కవలలు. వాడికి వీరికి పన్నిండేళ్ళ వ్యత్యాసం.
రవి హైస్కూలు చదువు ముగిశాక ముకుందం.. ఊర్లో వున్న పొలాలు, తోటలు, యిల్లు అమ్మేసి.. నెల్లూరులో యిల్లు, టింబర్ షాప్ ఏర్పాటు చేసికొన్నాడు. రవిని కాలేజీలో చేర్పించాడు. యిద్దరు ఆడపిల్లలను స్కూల్లో చేర్పించాడు. రెండు మూడు సంవత్సరాల్లో అతని వ్యాపారం వృద్ధి చెందింది. రాజకీయనాయకుల సాయంతో లిక్కర్ ఏజన్సీని సంపాదించాడు. పాల వ్యాపారాన్ని ప్రారంభించాడు. కాలం కలిసొస్తే పట్టిందల్లా బంగారం అవుతుందన్న పెద్దల వాక్కు ముకుందం విషయంలో ఫలించింది.
రవి బి.ఏ. పూర్తి చేసి.. ముకుందానికి సాయంగా అన్ని వ్యాపారాలూ చూచుకోసాగాడు. రెండు సంవత్సరాల క్రింద వచ్చినప్పుడు వాణ్ణి కలిశాను. త్వరలో పెండ్లి చేసుకోబోతున్నానని తప్పక రావలసిందిగా కోరాడు. సరే అన్నాను.
చిన్ననాటి ఆ రవికి.. రొండేళ్ళ క్రిందట నేను చూచిన రవికి, ఎంతో మార్పు. మనిషి బాగా ఎదిగాడు. వాడి తత్వంలో ఎంతో మార్పు వచ్చింది. వాడికి నాకు మధ్యన జరిగిన సంభాషణలో నాకు అర్థం అయింది.. ‘డబ్బు.. డబ్బు..’ దాన్ని ఆర్జించడమే వాడి లక్ష్యం అన్న విషయాన్ని నేను గ్రహించాను.
వాడి వివాహ విషయాన్ని నాకు తెలియజేశాడు ఒకటిన్నర సంవత్సరం క్రింద. నాకు వీలుకానందున నేను రాలేకపోయాను. గ్రీటింగ్స్ పంపాను. ఫోన్లో అభినందనలను తెలియజేశాను.
నాగరాజు.. వీడు చిన్నతనం నుంచీ మహా పిరికివాడు. పైగా ప్రతి విషయాంలోనూ సందేహం. ఆ రోజుల్లో నేను అనేవాణ్ణి – “సందేహానికి మించిన వ్యాధి మనిషికి మరొకటి లేదు. నీవు నీ తత్వాన్ని మార్చుకో. లేకపోతే భావి జీవితం నీకు నరకం అవుతుంది. సమస్యను గురించి ఆలోచించాలి. ధర్మాధర్మ విచక్షణ చేయాలి. గాలి కబుర్లును నమ్మకూడదు. స్వబుద్ధిని వుపయోగించి సరైన నిర్ణయం తీసుకొని ముందుకు ధైర్యంగా నడవాలి” అని.
పోయినసారి వచ్చినప్పుడు వాడినీ కలిశాను. యం.ఎ, బి.యి.డి పూర్తి చేసి మా వూరు హైస్కూల్లో టీచరుగా పని చేస్తున్నాడు. నన్ను చూడగానే ఎంతో ఆదరాభిమానాలతో కౌగలించుకొన్నాడు. ‘నీ మాటలను నేను మరచిపోలేద’న్నాడు.
మా యింటికి వచ్చి తన వివాహ శుఖలేఖ యిచ్చి నీవు నా పెండ్లి జరిపించి.. తర్వాతనే అమెరికాకు పోవాలని చెప్పాడు. దైవనిర్ణయంగా నా తిరుగు ప్రయాణానికి వారం రోజుల ముందే వాడి వివాహం.
వీడికి ఒక అక్క వసుంధర. ఆమె వివాహం జరిగి చాలా కాలం అయింది. వీళ్ళ నాన్న పురుషోత్తం.. వారు హైస్కూలు టీచరు. తల్లి రుక్మిణి. అన్యోన్య దాంపత్యం. చూచేదానికి శివపార్వతుల్లా వుంటారు.
నెల్లూరులో రుక్మిణమ్మ అన్నయ్య కాలేజీ లెక్చరర్. వారికి ఒక్కగానొక్క కూతురు సుబ్బలక్ష్మి. పొత్తు పొత్తులో కలవాలని, అన్నీ వుద్యోగాల కన్నా ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించేది టీచర్ వుద్యోగమేననీ.. తన మేనల్లుడికి కూతుర్ని యిచ్చి వివాహాన్ని ఘనంగా జరిపించాడు పురుషోత్తం.
సుబ్బలక్ష్మి యం.టెక్ సివిల్. పి. డబ్ల్యు డిపార్టుమెంటులో ఎ.ఇ.గా పని చేస్తూ వుంది.
నేను మా నాన్నగారు, అమ్మ, తమ్ముడు, చెల్లి అందరం ఆ వివాహానికి హాజరైనాము. వాడి పెళ్ళి జరిగిన వారం రోజుల తర్వాత నేను అమెరికా వెళ్లిపోయాను.
బాబూరావు.. మంచి మాటకారి.. కవితలు కథలు వ్రాసేవాడు ఆ రోజుల్లోనే.. కొన్ని తిరిగి వచ్చాయి. రెండు మూడు ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతిలలో అచ్చయినాయి.
వీడి తండ్రి సాంబయ్య మా గ్రామ సర్పంచ్. తల్లి తాయారమ్మ. వీడికి ఒక అక్కయ్య పార్వతి. ఆమెకు వివాహం అయింది. పెద్దయ్యాక రాజకీయ నాయకుడిగా కావాలని కలలు కనేవాడు.
నాటి పార్టీలు.. రాజకీయ పరిస్థితులూ నచ్చని సాంబయ్య వీడికి బుద్ధి చెప్పి, తన పలుకుబడితో యం.బి.బి.యస్ చదివించాడు. డాక్టర్గా నెల్లూరులో ప్రాక్టీస్ ప్రారంభించాడు. పోయిన సారి నేను వచ్చినప్పుడు.. “పెళ్లి ఎప్పుడు రా?” అని అడిగితే.. “నేను సాధించాల్సింది యింకా వుంది. పెండ్లి యిప్పట్లో చేసికోను” అన్నాడు. నేను ఆశించింది ఒకటి, జరిగింది మరొకటని విచారపడ్డాడు రాజకీయ నాయకుడిగా కానందుకు.
“కలలు కనడం మానవ సహజం.. కన్న కలలన్నీ నిజాలు కావు. బ్రహ్మదేవుడు వ్రాసిన తల వ్రాతకు మారుగా ఎవరి విషయంలోనూ.. ఏదీ జరగదు. నీ యోగాన.. నీవు డాక్టర్ కావాలని వుంది అయ్యావు. వృత్తిరీత్యా.. పేదలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకొని ఆనందించరా” అన్నాను. “నీ సలహాను తప్పక పాటిస్తాను” అన్నాడు నవ్వుతూ బాబూరావు.
అమ్మకు జ్వరంగా వున్న కారణంగా.. ఆమెను వాడి హాస్పటల్కు తీసుకొని వెళ్ళాను. అమ్మను చెక్ చేసి “మామూలు జ్వరమేరా.. యిది శీతాకాలం కదా!.. ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుంది. మా ఆంటీ సెంచరీ కొడుతుందిరా భయపడకు” అని నా భుజం తట్టి చెప్పాడు. మందులు వ్రాసి యిచ్చాడు.
వాడు.. నర్స్ లిల్లీని నాకు పరిచయం చేశాడు. ఆమె చాలా అందగత్తె. తెల్ల దుస్తుల్లో లిల్లీ ఫేరీలా నాకు కనిపించింది. మా వాడికి సాయంగా ఆ హాస్పటల్లోనే పనిచేస్తూ వుంది.
నాలుగేళ్ళ క్రితం వచ్చినప్పుడు మేము నలుగురము, మా జూనియర్స్ పదిమంది కలసి ‘ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్’ స్థాపించాము. స్కూల్లో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి.. అందరం చందాలు వేసికొని.. స్కూలుకు కావలసిన వస్తువులను కొనవలసిందిగా హెడ్మాస్టార్ గారికి ఎనభై వేలు యిచ్చాము.
అదే ప్రకారంగా గడచిన మూడు సంవత్సరాలూ కొనసాగించాము. జూనియర్స్లో ఒకడైన సునీల్ను ప్రెసిడెంట్గా నియమించాము.
మా నలుగురి.. మిగతా సభ్యుల ఆశయం ఆ మా స్కూల్లో చదివే బాల బాలికలు.. అన్ని వసతులతో బాగా చదివి.. స్కూలుకు మంచి పేరు తెచ్చి, వారు వృద్ధిలోకి రావాలని.
ఆ గత జ్ఞాపకాలన్నీ నా మనస్సుకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. మనస్సుని నిర్మలంగా వుంచుకొని, సద్భావాలు కలిగి వుంటే.. ఎవరికైనా మంచే జరుగుతుందన్న సత్యం, నేను అనుభవపూర్వకంగా తెలుసుకొన్నది.
నా ఊరు.. నా వారినందరినీ తలుచుకొంటూ ఎప్పుడు నిద్ర పోయానో నాకు తెలియదు.
***
చెన్నై ఏర్పోర్టు నుంచి బయటికి వచ్చాను. నా తమ్ముడు గోపాల్.. చెల్లి వసంత మా మేనత్త కొడుకు రాఘవ ఆత్రుతతో నా రాకకు ఎదురు చూస్తుండడాన్ని నేను దూరాన్నుంచే గమనించాను.
ముగ్గురూ ఆనందంగా నన్ను సమీపించారు. నా తమ్ముడు.. “అన్నయ్యా వచ్చావా!..” అంటూ నన్ను చుట్టుకొన్నాడు.
“అన్నయ్యా!..” నా ఎడం చేతిని పట్టుకొని నా చెల్లి నా భుజంపై వాలిపోయింది.
“బావా!..” అంటూ రాఘవ నా కుడిచేతిని పట్టుకొని తన తలను నా భుజంపై వుంచాడు.
ఆ ముగ్గురూ నాకు ఎంతో ఆత్మీయులు. నా వారు నా చేతులతో వారిని నా హృదయానికి హత్తుకొన్నాను. కొన్ని క్షణాలు మా మధ్య మాటలు లేవు. భావావేశపు భావనలు తప్ప.
“బావా బయలుదేరుదామా!” అత్తయ్యా మామయ్యలు నీ రాక కోసం ఎదురు చూస్తూ వుంటారు.” అన్నాడు రాఘవ.
వారు ముగ్గురూ నా లగేజీని తమ చేతుల్లోకి.. తీసుకొన్నారు. కారును సమీపించి డిక్కీలో.. నా లగేజ్ని, రాఘవ, గోపాల్ సర్ది మూశారు. నా చెల్లి నా చేతిని పట్టుకొనే వుంది.
రాఘవ డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు.
“కూర్చొండి బావా!..” అన్నాడు.
నేను చెల్లి వెనక సీట్లో కూర్చున్నాము. గోపాల్ రాఘవ ప్రక్కన కూర్చున్నాడు. రాఘవ కారును స్టార్ట్ చేశాడు.
“అమ్మా నాన్నల ఆరోగ్యం బాగుందా అమ్మా!..” నా చెల్లి ముఖంలోకి చూస్తూ అడిగాను.
“చాలా బాగున్నారన్నయ్యా!.. కారణం నీవు త్వరలో వారి దగ్గరకు వస్తున్నావని” ఆనందంగా నవ్వింది వసంత.
ఆ క్షణంలో నేను నా చెల్లి కళ్ళల్లో కన్నీటిని చూచాను. నా ముఖ భావాలను గమనించిన చెల్లి.. “అన్నయ్యా!.. ఇవి ఆనందబాష్పాలు.” నవ్వుతూ పవిటతో కన్నీటిని తుడుచుకొంది నా చెల్లి.
మనస్సు.. పెద్దవారైన నా తల్లిదండ్రులను చూడాలని ఆరాటపడుతూ వుంది. యీ ఆరాటం అమెరికాలో ఉండగా లేదు. నా వారు తలపు రాగానే వెంటనే ఫోన్ చేసి మాట్లాడేవాడిని. వారి మాటలు నా మనస్సుకు ఎంతో శాంతిని కలిగించేవి. వారితో మాట్లాడిన ప్రతిసారీ నాలో ఏదో కొత్త శక్తి కలిగేది. ఆనందంగా నా దినచర్యను ముగించేవాణ్ణి. యిదే రక్తసంబంధంలో వున్న మహిమ అని, అనుకొనేవాణ్ణి.
“బావా! మన వూరు చేరేదానికి ఎన్ని గంటలు పడుతుంది?..” తమ్ముడు గోపాల్ రాఘవను అడిగాడు.
“నాలుగు గంటలు.” రాఘవ జవాబు. అతని దృష్టి రోడ్డు మీద వుంది.
“నీవు బాగా డ్రైవ్ చేస్తానన్నావుగా.. మూడు గంటల్లో తీసుకొని వెళ్లలేవా.. బావా!..” అమాయకంగా అడిగింది వసంత.
“ప్రయత్నిస్తాను వసూ.” క్రీకంట ఆమె ముఖంలోకి చూచి చెప్పాడు రాఘవ.
“నాలుగు టోల్ బూత్లు వున్నాయిగా!.. ఆ కారణంగా కొంత ఆలస్యం అవుతుంది.” అన్నాడు గోపాల్.
“యస్. యు ఆర్ రైట్.” నవ్వుతూ చెప్పాడు రాఘవ.
రాఘవ, బి.యల్ పూర్తి చేసి నెల్లూరులోనే ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర రెండు సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. నా మాటంటే వాడికి వేదవాక్యం. నేను గతంలో యిండియాకు వచ్చినప్పుడల్లా నాతో ఎక్కువ సమయం గడిపేవాడు. నేను తిరిగి వెళ్లేటప్పుడు.. “ఈ నెలరోజుల్లో నీ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను బావా!..” అనేవాడు. వాడికి ఏ దుర అలవాటూ లేదు. భోజనప్రియుడు. వసంతను వాడికి యిచ్చి వివాహం చేయాలని నా కోరిక. మరి.. అమ్మా నాన్నల ఉద్దేశం ఎలా ఉందో..
యథార్థం చెప్పాలంటే.. ఆమెకు పెండ్లి చేసిన తర్వాతనే నేను చేసికోవాలని నా నిర్ణయం. యిందుకు.. అమ్మా నాన్నలు ఏమంటారో నాకు తెలియదు. ఊరికి చేరిన తర్వాత వారు నాతో యీ విషయాన్ని గురించి తప్పక ప్రస్తావిస్తారు. వసంత చదువు మరో సంవత్సరంలో పూర్తి అవుతుంది. అప్పటికి నా వయస్సు యిరవై తొమ్మిదవుతుంది. బ్రహ్మచారి ముదిరినా.. బెండకాయ ముదిరినా ఎందుకూ.. పనికి రావనే సామెత మనకొకటి వుంది. నా నిర్ణయాన్ని విని అమ్మా నాన్నలు అదే మాట అంటారేమో!.. అంతేకాదు, లోకులు కాకులు. ఎవరికి తోచిన రీతిలో వారి వ్యాఖ్యానాలు ప్రారంభిస్తారు. ఎదుటివారి విషయంలో ఆ రీతిగా మాట్లాడుకొనుటలో వారికి ఆనందం. గురివింద గింజకు తన క్రింది నలుపు తెలియదన్నట్లు.. వారి సంసార సమస్యలను మరచి యితరులను గురించి తప్పుగా మాట్లాడుతూ, ఆత్మానందాన్ని పొందుతారు కొందరు. ఇలాంటి మాటలు నా తల్లిదండ్రుల చెవులకు సోకితే వారు బాధపడతారు యీ వయస్సులో వారికి నా మూలంగా ఏ కష్టమూ కలుగకూడదు. వారి ఆనందమే నా ధ్యేయం. వారి యిష్టానుసారంగా నడుచుకోవడం నా కర్తవ్యం.
“బావా!.. సూళూరుపేట రాబోతూ వుంది. టీ త్రాగుదామా!..” అడిగాడు రాఘవ.
“తాగుదాం బావా!..” అంది వసంత నాకంటే ముందుగా.
నా మస్తిష్కంలో పరుగిడే ఆలోచనలను ప్రక్కకు నెట్టి.. “అలాగే.” అన్నాను.
రాఘవ హైవేకి ప్రక్కగా వున్న టీ స్టాల్ ముందు కారును ఆపాడు. నలుగురం కారు దిగాము. స్టాల్ ముందున్న కుర్చీలల్లో కూర్చున్నాము.
“అన్నయ్యా!.. బిస్కెటు తింటావా?..” అడిగాడు గోపాల్.
“నాకు కావాలి” అంది వసంత.
“నాకూ కావాలిరా” అన్నాడు రాఘవ.
స్టాల్లోకి వెళ్లి, ప్లేట్లో రెండు రకాల బిస్కెట్సుతో తిరిగి వచ్చాడు గోపాల్. ప్లేటును టేబుల్పై పెట్టాడు. బిస్కెట్స్ తిని నలుగురం టీ త్రాగాము.
“బావా!.. గంట ఒకటిన్నర. నాలుగున్నర కల్లా యింటికి చేరుతాం.”
“అంటే.. కోడి కూతకు బదులుగా నీ హారన్తో ఊర్లో జనాన్ని లేపుతావన్న మాట” నవ్వుతూ అంది వసంత.
“వసూ!.. కోళ్ళు వాటి పనిని అవే చేస్తాయి. నేను ఊర్లోకి ప్రవేశించాక హారన్ కొట్టను. అత్తా మామయ్యకు నేను సర్ప్రైజ్ యివ్వబోతున్నాను” ఓరకంట వసంత ముఖంలోకి చూస్తూ అన్నాడు రాఘవ.
వారి సంభాషణకు నాకు నవ్వొచ్చింది. ఆనందంగా నవ్వుకొన్నాను. ‘భగవాన్!.. వీరిరువురూ భార్యాభర్తలు కావాలి. నిండుగా నూరేళ్ళు చల్లగా సిరిసంపదలతో మంచి బిడ్డలతో ఆనందంగా జీవించాలి’ అనుకొన్నాను మనస్సులో.
నలుగురం కారెక్కాము. రాఘవ కారును స్టార్ట్ చేశాడు. రోడ్డు ఫ్రీగా వుంది. బొలీరోను నూరు కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నాడు రాఘవ.
“అన్నయ్యా!.. నాకు నిద్ర వస్తూ వుంది. పడుకొంటాను.” అంది వసంత.
“అలాగే అమ్మా!.. నా తొడపై తలపెట్టుకొని పడుకో.” డోర్ ప్రక్కకు జరిగాను వసంత పడుకొంది. నా కళ్ళల్లోకి చూచింది. “నేను చిన్నప్పుడు నీ దగ్గర యిలాగే పడుకొనేదాన్ని కదన్నయ్యా.” నవ్వుతూ అంది.
చిరునవ్వుతో “అవునమ్మా!..” అన్నాను. ఆమె ఆనందంగా కళ్ళు మూసుకుంది.
(ఇంకా ఉంది)
సిహెచ్. సి. ఎస్. శర్మ అనే కలం పేరుతో రచనలు చేసే శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి జననం నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా ఊచగుంటపాళెంలో జరిగింది. ప్రాథమిక విద్య పెయ్యలపాళెం, బుచ్చిరెడ్డిపాళెంలోనూ, ఉన్నతవిద్య నెల్లూరులోనూ.
సివిల్ ఇంజనీరుగా రాష్ట్రంలోని పలు సంస్థలలో వివిధ హోదాలలో పని చేసి చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరక్టర్ స్థాయికి ఎదిగారు.
చిన్ననాడు బామ్మగారు చెప్పిన కథలతో ప్రేరణ పొంది బాల్యం నుంచే రచనలు చేశారు. మిత్ర రచయితల ప్రోత్సాహంతో రచనా రంగంలో విశేషంగా కృషి చేశారు. 20 నవలలు, 100 కథలు, 12 నాటికలు/నాటకాలు, 30 కవితలు రాశారు.
వివిధ సాహితీ సంస్థల నుంచి పలు పురస్కారాలు పొందారు.