[అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా శ్రీ బొడ్డపాటి చంద్రశేఖర్ గారి ‘ప్రేమామృతధార’ అనే రచనని అందిస్తున్నాము.]
అమ్మ.. మమకారం, అనురాగానుభూతుల సమాగమం.
అమ్మ.. ఆత్మీయత, పారవశ్యతలను చవి చూపే అద్భుతస్పర్శ.. వాటిని మన అనుభూతి లోకి తెచ్చేది అమ్మే. ‘అ..మ్మ’ మధురాతి మధురమైన ఈ రెండక్షరాల అపురూప పదం ప్రతిప్రాణికి తొలిస్పర్శ, చూపు, వినికిడి.
తల్లి బిడ్డకు స్తన్యమిస్తూ, ముద్దు మురిపాలు కుమ్మరిస్తూ, బిడ్డడి చిరునవ్వుకు పరవశిస్తూ అలౌకానందం పొందే ప్రేమైకమూర్తి. తన ఆకలి దప్పులను, సుఖసంతోషాలను బిడ్డలోనే చూసుకుంటూ పెంపకమే తన లోకంగా చేసుకునే నిస్వార్థ జీవి. ప్రతిఫలాపేక్ష రహిత ప్రేమను పంచుతూ, దానిలోని నైర్మల్యాన్ని, పవిత్రతను, నిష్కపటతను చాటే అద్వితీయ వ్యక్తి. తల్లి ఒక ప్రేమామృత అక్షయధార.
నవమాసా దీక్షా తపస్సమీక్షణం చేసే తాపసి తల్లి. ఆ సమయంలో, బిడ్డ ఆరోగ్యదృష్ట్యా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ. జిహ్వను నియంత్రించుకుంటుంది. నెలలు పెరిగేకొద్దీ శారీరకంగా వచ్చే
మార్పులను స్వాగతిస్తుంది. ఆందోళన, ఉత్సాహం, ఆనందాలకు లోనవుతూ ఎంతో మానసిక ఒత్తిడిని తట్టుకొంటూ ఆ శుభఘడియ కోసం ఎదురుచూడాలి. ఎంతో ప్రసవవేదనను అనుభవిస్తూ చావు, బతుకుల ఊగిసలాటను దాటి బిడ్డకు ఊపిరి పోసి, ఈ భూతలానికి తెచ్చే సహనశీలి ఆమె. ఇదంతా ఆ మాతృత్వపు మాధుర్యాన్ని కోసమే కదూ! ఇంతటి వేదనను.. లేలేత గులాబీ రంగులో, తరగని చీకటి కన్నులతో, గుప్పిళ్లు మూసుకున్న చేతులతో శిశువు ఆమె పక్కన చేరి, ఆమె ఎదను తాకుతున్నవేళ ఇట్టే మరచిపోతుంది. ఏ స్త్రీకైనా మాతృత్వ భావన దాని పారవశ్యం అనుభవంలోకి వచ్చేది ఆ అద్భుత క్షణాలలోనే! ఈ నవమాస దీక్షాసమీక్షణ ఆ బంగరు పాపడి కోసమే.
తల్లి బిడ్డను పెంచటంలో పొందే ప్రేమ వర్ణనాతీతం. గోరు ముద్దలు తినిపిస్తూ, జోలపాట పాడుతూ, బిడ్డకు మాటను, నడకను, నడతను నేర్పుతుంది. వాడి ఆలన, పాలన ఆమె జీవిత ఏకైక లక్ష్యంగా భావిస్తుంది. తల్లి బిడ్డ మలమూత్రాలను శుభ్రం చేస్తుంది. అదే రక్తస్పర్శ. మది రోయని ప్రేమపూరిత ఊడిగమది.
మాతృవియోగం ఆదిశంరులంతటి అవతార పురుషుణ్ణే ఎంతగానో కదలించింది. ఉత్తరక్రియలు చేసే క్షణాన ఆమె ప్రేమ, ఆయన జన్మదినాన ఆమె ప్రసవవేదన ఆయన మనస్సులో మెదిలి శోకతప్తులై ఐదు శ్లోకాలను చెప్పారు. అవి.. ‘మాతృ పంచకం’గా ప్రసిద్ధమయ్యాయి.
“నువ్వు చిరంజీవిగా వుండాలి. అని నన్ను ప్రేమగా పిలిచిన నీ నోటిలో ఈనాడు కేవలం యిన్ని శుష్కమైన బియ్యపు గింజలు వేస్తున్నాను. నన్ను క్షమించు.. నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను. ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా? నీకు నమస్కారం చేస్తున్నాను అమ్మా.. నీ మరణ సమయంలో కొంచెం నీళ్లు కూడా నేను గొంతులో పొయ్యలేదు.. శ్రాద్ధ విధిని అనుసరించి ‘స్వధా ను’ యివ్వలేదు. ప్రాణము పోయే సమయములో నీ చెవిలో తారకమంత్రాన్ని చదవలేదు. నన్ను క్షమించి, నాయందు దేనితో సమానము కానీ దయ చూపించుము తల్లీ!” ఇది వాటి సారం.
మనిషి విధిగా తీర్చుకోవలసిన రుణాలలో మాతృరుణం ఒకటి. ఎలా?.. అసలు సాధ్యమేనా? ఆమె ప్రేమను ఆమెకు ఇవ్వటం వల్లనే అది సాధ్యమవుతుంది. నిజానికి తల్లి రుణాన్ని తీర్చుకోవటం ఆమెకు మనం తల్లి కాగలిగినపుడే!! అంటే ఆ ప్రేమ తత్వాన్ని మనం అలవరుచుకున్నప్పుడే!