మృత్యువు విశ్వరూపం దాల్చి
నీ చుట్టూ పరిభ్రమిస్తోందని తెల్సినా
నీ పక్కనే నిలబడి
పులిలా పంజా విసురుతోందని తెల్సినా
వైరస్ ఒక విలయమై
విధ్వంసం సృష్టిస్తోందని తెల్సినా
ఎంత నిబద్ధత, ఎంత బాధ్యత
ఎంత సేవాతత్పరత నీది !
ఎంత గుండె ధైర్యం నీకు–
చావుకెదురేగి సవాల్ విసురుతున్నావు !
చూపులను చూరుకు వేలాడదీసి
కుటుంబమంతా నీకోసం ఎదురు చూస్తున్నా
మృత్యు కుహరంలో
ప్రాణవాయువై పరిమళిస్తున్నావు.
ఊహించని ఉపద్రవం ఉసురులు తీస్తూ
మానవాళికి సవాల్ విసురుతోంటే
శ్వేత కపోతమై, స్వేద సింధువై
శౌర్య జవానువై శత్రు సంహారానికి సన్నద్ధమయ్యావు.
ప్రాణదీపం ఆరిపోతుందేమోనని
కళ్ళతోనే అర్థించే రోగులు దైన్యం చూస్తూ
కర్తవ్య పాలనలో కఠోరంగా శ్రమిస్తూ
ఆశాజ్యోతివై, కరుణామయుడివై
వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నావు.
ఓ సేవా సైనికుడా !
ఇప్పుడు–
బతకడానికి ఏం కావాలో తెలిసింది!
ప్రపంచానికి ఎవరు అవసరమో అర్థమయ్యింది !!
సాదనాల వేంకట స్వామి నాయుడు ప్రముఖ సినీ గేయ కవి, నటుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో బంగారు ‘నంది’ని బహుమతిగా అందుకున్నారు.
- భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ నుంచి వచన కవితకు జాతీయస్థాయి బహుమతిని 1994లో స్వీకరించారు.
- తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘కృష్ణాపత్రిక సాహిత్య సేవ’ లఘు సిద్ధాంత వ్యాసానికి బంగారు పతకాన్ని 1991లో అందుకున్నారు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు.
- 1989లో జీసీస్ క్లబ్ ‘అవుట్స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డు’, 1990లో ‘రోటరీ లిటరరీ అవార్డు’ లను పొందారు.
- దృశ్య కవితా సంపుటికి రెండు రాష్ట్రస్థాయి పురస్కారాలను అందుకున్నారు.
- ఆకాశవాణి ‘సుగమ్ సంగీత్’ జాతీయ కార్యక్రమంలో రెండు సార్లు సాదనాల రాసిన లలిత గీతాలు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమయ్యాయి.
- దక్షిణమధ్య రైల్వే నుంచి ఉత్తమ ఉద్యోగిగా సీనియర్ డి.పి.వో, డి.ఆర్.ఎం, సి.పి.వోల నుంచి పలుమార్లు అవార్డులను అందుకున్నారు.
- నాయుడు బావ పాటలు ‘గేయసంపుటి’ ‘పూలాచావ్లా’ పేరుతో ఒరియాలో సంపుటిగా ప్రచురింతమయ్యింది. ఆంగ్లభాషలోకి అనువదింపబడింది.
- తెలుగులో నాలుగు గ్రంథాలను ప్రచురించారు.
- రేడియో, టీ.వి, సినిమా, ఆడియో కేసట్లకు అనేక గీతాలు రాశారు.