[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-11: ఎగారికస్ మస్కేరియస్ (Agaricus Muscarius)
టోడ్ స్టూల్ ఫ్లై ఫంగస్ వృక్షజాతులపై ఉండే ఫంగై నుండి స్కెబెటర్ (SchBeter) మరియు స్టాఫ్ ఔషధ గుణాల్ని రాబట్టమైనది. ఇది కుక్క గొడుగు జాతిలోనిది. దీనిపై కూడా డా॥ హానిమన్ పరిశోధనలు చేయడమైనది.
స్థానాలు:
కండ్లు, పాదాలు, కాలేయం, ప్లీహం, నరాలు, మెదడు, చర్మం, జిగురు పొరలు, వెన్నెముక, రొమ్ము, చర్మంపై అధిక ప్రభావం చూపుతుంది.
వ్యాధులు:
పక్షవాతం, కొరియా, త్రాగుడు వల్ల కలిగే దుష్పరిణామాలకిది మంచి మందు.
కారణాలు:
అధిక సంభోగం, మంచు, భయం, మానసికోద్రేకం, కాఫీ, టీ, పొగాకు, త్రాగుడు, మానసిక ఒత్తిడి, చర్మం పొక్కులు అణచివేయడం వల్ల వచ్చే నర్వస్ ఎఫెక్ట్స్కి మంచిది.
స్వభావం:
లేతరంగు శరీరఛాయతో నీరసంతో బక్క పల్చగా మెత్తగా ఉండే రోగులు, స్థిమితం లేక రక్తప్రసారం మందంగా ఉండే వృద్ధులు, నర్వస్ టెంపర్మెంట్, సెన్సిటివ్నెస్ ఎక్కువగా ఉండే స్వభావం గలవారికి ఇది మంచి మందు.
పోలికలు:
బొవిష్టా, ఓపియం, కెన్నబిస్ ఇండికా, స్ట్రయోనియం, కాఫీ, సిక్యూటా, విరెట్రం ఆల్బం, ఆర్సెనికం ఆల్బం, సిమిసిఫ్యూగా, దీని తర్వాత వాడదగిన మందు టారెంట్యులా.
సహచరులు:
బెల్, కాల్కేరియా, మెర్క్సాల్, ఓపియం, పల్స్, రూస్టాక్ట్, సైలీషియా.
విరుగుళ్ళు:
కాఫీ, కాంఫర్, కాల్కేరియా కార్బ్, పల్సటిల్లా, రూస్టాక్స్, నూనె, వైన్, బ్రాంది.
ఉద్రేకం:
చల్లగాలిలో, బహిష్టులో, ఉదయాన, సంభోగానంతరం, గడ్డకట్టుకుని పోయేంత చలి, గాలి, భోజనానంతరం, చలిగాలి వల్ల ఆలోచించడం, ఉరుములతో కూడిన వాన వచ్చేముందు, సారావల్ల , వత్తిడి, తాకుట వల్ల ఎక్కువవుతుంది.
ఉపశమనం:
నెమ్మదిగా నడుచుట వల్ల, పడుకున్నప్పుడు, వేడి కాపడం, ఆరుబైట గాలి, ఎడమ పైభాగం, కుడివైపు క్రిందిభాగంపై పనిచేయు మందు.చలి భరించలేరు.
మోతాదు:
30 – 200 పొటెన్సీ.
కాలపరిమితి:
4 వారాలు.
మయాజమ్:
సిఫిలిటిక్, సోరా, చర్మవ్యాధులు మొదలగు వ్యాధుల్లో తక్కువ పొటెన్సీలో వాడాలి.
తత్త్వం:
శారీరకంగా, మానసికంగా వృద్ధి చెందనివారు, పొక్కులతో కూడిన చర్మవ్యాధి అణిచిపెట్టడం వల్ల వచ్చే మూర్ఛలు, కండరాలు, నరాల వ్యాధులతో, నిస్త్రాణ చెంది వున్నవారికి ఉపయోగపడే మందు.
మానసిక లక్షణాలు:
మానసిక లక్షణాలు ఒకదాని తర్వాత ఒకటి కల్గుతూ ఉదయం ఎక్కువై, సాయంత్రం తగ్గును. వస్తువుల ఆకృతి చాలా పెద్దదిగా కన్పిస్తుంది. మానసికోద్రేకంతోపాటు శరీరబలం కూడా అధికమై ఎంతటి బరువైనను మోయును. విచారం, ఆందోళన, కలత, ఏ పని చేయుటకు హితవు లేకపోవుట. వ్యతిరేక స్వభావం, పనిలో అయిష్టత, నిర్భయత్వం, అతి వాగుడు, సంతోషం, ధైర్యం. సంధిలో కేకలు, గొణగడం, పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల సరిగా లేకపోవడం, నడవడం, మాట్లాడడం, ఆలస్యంగా రావడం, ఒకసారి తెలివిగా మందంగా ఉంటే మరొకసారి తెలివి తక్కువుగా ఉంటారు.
శారీరక లక్షణాలు:
తల:
ఎండలో నడుచుట వల్ల తల త్రిప్పుట, కూర్చొని వ్రాసే వారిలో ఎడమవైపు మైగ్రేన్ తలనొప్పి రావడం, వెచ్చదనంకై తలను కప్పుకొన వలెననుకోవడం, వెన్నుపాము వ్యాధుల వల్ల, జ్వరం, నొప్పితో కల్గు తదేక దృష్టితో కంటిని ఉపయోగించేటప్పుడు, వ్రాసేటప్పుడు తలనొప్పులు. కండ్లు చదువుతున్నప్పుడు అక్షరాలు కదులుతున్నట్లగుపడడం, నుదుటిలో మేకు కొట్టినట్లు నొప్పిగా ఉంటుంది.
కన్ను:
కనురెప్పలు అదరడం, ఒక వస్తువు రెండుగా కన్పించడం. దృష్టి మాంద్యం వల్ల కండ్లు చికిలించి చూడడం, కండ్లు ఎర్రగా, వాచి, బాధగా ఉండడం, పుసుర్లు కట్టడం, కంటి కండరాలు నిస్త్రాణచే రోగి దేనినైన నిదానంగా చూచినా కనుగ్రుడ్డు ముందు వెనుకకు ఊగుచున్నట్లు ఉంటుంది.
చెవి:
చెవుల్లో మంట, దురద, చెవుల్లో, ధ్వనులు కల్గడం, చెవులు విన్పించకపోవడం ఉంటుంది.
ముక్కు:
ముక్కు నుండి రక్తస్రావం కల్గడం, తుమ్ములు వచ్చిన తర్వాత దగ్గు తగ్గడం, దగ్గుతున్నంతసేపు తలనొప్పి, తిన్న తర్వాత దగ్గు ఎక్కువవడం, ఛాతీలో బరువు, ఆయాసం, ఊపిరి పీల్చలేక ముఖం మీద దురదలు, మంటలు బిగదీసుకు పోయినట్లుండడం చిగుళ్ళ వాపు, రక్తం కారడం, పంటినొప్పి, గొంతులో మంటగా ఉండి గుటక వ్రేయడం కష్టంగా ఉంటుంది.
కడుపు:
నాలుకపై తెల్లని పూత ఉండి ఆకలి ఎక్కువగా ఉంటుంది. అజీర్ణం వల్ల వికారం, ఎక్కిళ్ళు, కాలేయం వద్ద నొప్పి, పొట్ట ఉబ్బరం, త్రేన్పులు, తిన్న తర్వాత పొట్టలో బరువుగా ఉండి మంటగా ఉండడం, దుర్వాసనగా ఉండే అపాన వాయువులు ఆసనం దురదగా ఉంటుంది.
మూత్రావయవాలు:
మూత్రావయావాలలో పోటు, బాధ, ఆపుకోలేని మూత్ర విసర్జన, ముట్లాగి పోయేటప్పుడు గర్భసంచి దిగజారినట్లుగా ఉంటుంది. స్త్రీలలో దురదతో కూడిన తెల్లమైల, నొప్పి ఉండి, సంభోగేచ్ఛ ఎక్కువుగా ఉంటుంది. బహిష్టులు త్వరగా, ఋతుస్రావం ఎక్కువగా, నొప్పితో వస్తుంది.
రుమాటిజమ్:
మెలకువగా వున్నప్పుడు కండరాలు అప్రయత్నంగా అదరడం వల్ల శరీరమంతా అదురుతుంది. నిద్ర పోయేటప్పుడు ఉండదు. కండరాల అదురు వల్ల ఏ వస్తువును రోగి పట్టుకోలేడు (క్రింద పడేస్తారు). కొరియా నరాల వ్యాధిలో శరీర మంతట వణుకు, కాళ్ళు చేతుల్లో పక్షవాతం, తిమ్మిరితో కూడిన బాధలు, మొద్దుబారినట్లు, చచ్చుగా ఉండడం, ముఖ్యంగా పాదాలు, ఎడమ చేయి, కుడికాలు, కండరాలు ముడుచుకొని పోవడం, కీళ్ళు వంగకపోవడం, నడకలో నిలకడ వుండక త్రోవలో ఏదో అడ్డు వచ్చినట్లు తూలిపోవడం, నిలబడినపుడు చితక కొట్టినట్లు నొప్పి, మానసిక పరిశ్రమ ఎక్కువగా చేయడం వల్ల రోగ లక్షణాలు అధికమవుతాయి.
ఉదయం పూట వెన్నుపాముని తాకిన బాధ, నడుంలో, నడుం క్రింది భాగంలో పుండువలె బాధ, కూర్చున్నప్పుడు, అలిసిపోయినప్పుడు ఎక్కువవుతుంది. అధిక జననేంద్రియ లోలత్వంచే వెన్నుపాము నీరసం, సంభోగం తర్వాత నాడీ మండల నిస్త్రాణ వల్ల సొమ్మసిల్లినట్లుండి మెడ, నడుంలో కలుక్కుమన్నట్లుండడం, మంచు వంటి చల్లని సూదులతో గ్రుచ్చినట్లుంటుంది. శరీరంను కదిల్చినప్పుడు, ముందుకు వంగినప్పుడు వెన్నుపాము నందు నొప్పి, చీమలు ప్రాకినట్లు కదిలిన, శరీరం త్రిప్పినపుడెల్లా, వెన్నుపాము నొప్పి రావడం ఉంటుంది. చల్లగాలి ఏమాత్రం సహించ లేరు. కూర్చున్నప్పుడు నొప్పి ఎక్కువగా ఉండి కాళ్ళకు వ్యాపించడం వల్ల నడుస్తున్నప్పుడు కాళ్ళు ఈడ్చుకొని నడుస్తూ దారిలో ఉన్న వస్తువుల్ని తన్నడం వుంటుంది.
చర్మం:
తేమలో నానడం వల్ల పాదాలు ఒరిసిపోవడం, మంట, దురద వల్ల చెవులు, ముక్కు, చేతులు, ముఖం ఎర్రగా ఉబ్బి వేడిగా మంట ఉంటుంది. చర్మ వ్యాధులణగారడం వల్ల మూర్ఛలు, కొరియా వంటి నరాల వ్యాధులు కల్గుతాయి. నిద్రలేమి ఉంటుంది. చర్మంలోనికి చల్లని సూదులు గ్రుచ్చినట్లుంటుంది. శరీరం నందనేక భాగాలందు మంచుగడ్డ తగిలినట్లు జివ్వుమంటుంది. మూర్ఛలు ప్రతి ఏడు రోజులకొకసారి వస్తాయి. శరీరం చలిచే కొయ్యబారినట్లుండే వారికి ఇది మంచి మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.