లోకంలో ఆనందాన్ని
ఆకుపచ్చ తివాచీలా
పరచి హర్షాతిరేకంతో-
మరో రోజుకు
స్వాగతం పలికేదే-
ప్రభాత శుభోదయం!!
ఆ ఉషోదయ
భాను కిరణాలతో-
జగతిని మేలుకొలిపి
శోభాయమయమై,
సర్వానందానికి కారణభూతమై
కనులముందు నిలిచేది
ప్రకృతి అనే భగవత్ ప్రసాదం!!
రోజువారీ వ్యాపకాలతో
అలసి సొలసిన
దేహానికి, మనసుకు,
సాయం నీరెండతో
సేదదీర్చి,చల్లబరచి,
చల్లని సాయంత్రానికి-
బాటలు పరచే-
స్వాగతద్వారం
ఈ ప్రకృతి!!
వెన్నెల వెలుగులలో
దేదీప్య లోకానికి-
స్వాగతంపలకి
చంద్రుని వెలుగులతో
మైమరపించి-
నిద్రాదేవి ఒడిలో-
సర్వం మరపించే
సర్వరోగ నివారిణి
ఈ ప్రకృతి!!
ఇదే ప్రకృతి ప్రకోపిస్తే-
చేసే విలయతాండవం
అన్నిటా భయకంపితం-
సర్వం వినాశనం,
కాపాడే ప్రకృతి
కన్నెర్ర చేస్తే-
మనిషి ఎదుగుదల-
సృష్టి మనుగడ-
శూన్యం!!
సాగర్ రెడ్డిగారి పూర్తి పేరు పెనుబోలు విద్యాసాగర్ రెడ్డి. స్వంత ఊరు నెల్లూరు జిల్లా, నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామము. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య నెల్లూరుపల్లి కొత్తపాళెంలోని ప్రాదమిక మరియు జిల్లాప్రజాపరిషిత్ పాఠశాలలో పూరి చేశారు. ఎన్ బి కె ఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ నుంచి బికాం వరకు చదివారు. చెన్నై లోని విక్కీ ఇండస్ట్రీస్లో మార్కెటింగ్ విబాగంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నారు. కవితా రచనలు ప్రవృత్తి. ఇప్పటి వరకు 400 కవితలు రచించడం జరిగింది.