ప్రకృతి ఒడిలో పెరిగాము
పొలం బడిలో చదివాము
ఈ నేలే మా పలక
ఈ నాగలే మా బలపం
తల్లిదండ్రీ, గురువు, దైవం
సర్వం తానై నిలిచెను పుడమి ॥ప్రకృతి॥
అరక దున్నడమే అ… అ…
‘అ’ అంటే అన్నం
ఆకు పొయ్యడమే ఆ… ఆ…
అన్నం పెట్టి ఆకలి తీర్చే
ఈ భూమాతంటే భుక్తి, భక్తి ॥ప్రకృతి॥
కారు మబ్బులను పిలిచాము
కాడి ఎడ్లనే నమ్మాము
ఈ ధాన్యపు గింజలలోనే
ధనాల రాశులు చూసాము ॥ప్రకృతి॥
నారు వెయ్యడం తెలుసు
నీరు పొయ్యడం తెలుసు
నమ్ముకున్న ఈ మట్టిలో
మణులు ఏరడం తెలుసు ॥ప్రకృతి॥
శ్రమలో సుఖాన్ని చూసాము
స్వేదం ధారవోశాము
చెమట చుక్కే జయ్యపు గింజై
కడుపుకు చల్లని గంజయ్యింది ॥ప్రకృతి॥
కొత్త వంగడా లేశాము
అధిక దిగుబడిని పొందాము
వివేకంతో విజ్ఞానాన్ని
ప్రపంచానికే పంచాము ॥ప్రకృతి॥

సాదనాల వేంకట స్వామి నాయుడు ప్రముఖ సినీ గేయ కవి, నటుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో బంగారు ‘నంది’ని బహుమతిగా అందుకున్నారు.
- భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ నుంచి వచన కవితకు జాతీయస్థాయి బహుమతిని 1994లో స్వీకరించారు.
- తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘కృష్ణాపత్రిక సాహిత్య సేవ’ లఘు సిద్ధాంత వ్యాసానికి బంగారు పతకాన్ని 1991లో అందుకున్నారు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు.
- 1989లో జీసీస్ క్లబ్ ‘అవుట్స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డు’, 1990లో ‘రోటరీ లిటరరీ అవార్డు’ లను పొందారు.
- దృశ్య కవితా సంపుటికి రెండు రాష్ట్రస్థాయి పురస్కారాలను అందుకున్నారు.
- ఆకాశవాణి ‘సుగమ్ సంగీత్’ జాతీయ కార్యక్రమంలో రెండు సార్లు సాదనాల రాసిన లలిత గీతాలు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమయ్యాయి.
- దక్షిణమధ్య రైల్వే నుంచి ఉత్తమ ఉద్యోగిగా సీనియర్ డి.పి.వో, డి.ఆర్.ఎం, సి.పి.వోల నుంచి పలుమార్లు అవార్డులను అందుకున్నారు.
- నాయుడు బావ పాటలు ‘గేయసంపుటి’ ‘పూలాచావ్లా’ పేరుతో ఒరియాలో సంపుటిగా ప్రచురింతమయ్యింది. ఆంగ్లభాషలోకి అనువదింపబడింది.
- తెలుగులో నాలుగు గ్రంథాలను ప్రచురించారు.
- రేడియో, టీ.వి, సినిమా, ఆడియో కేసట్లకు అనేక గీతాలు రాశారు.