[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘ప్రకృతి కన్య’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
సముద్రం, చేపలు, పక్షులు, పువ్వులు
నదులు, జలపాతాలు పచ్చని ప్రకృతి,
మంచు దుప్పటి కప్పుకున్న కొండలు
అంటే ఇష్టం లేనివారు ఎవరు?
ఇష్టమైనదాన్ని సందర్శించే అవకాశం
కల్పించుకుంటాం కదూ!
అప్పుడు మనం పొందే అనుభూతికి
మాటలు వుండవు అవునా?
కళ్ళు కెమెరా ఐతే
హృదయం అనుభూతులను
దాచుకునే ఖజానా
సముద్రపు ఒడ్డున కూర్చుంటే
గలగలమంటూ సవ్వడితో
మనలను పలకరిస్తాయి కెరటాలు
ఇంటి బాల్కానీలో నిలబడితే
రివ్వుమని వచ్చి వాలుతాయి
పిడికిట్లో ఇమిడిపోయే పిచ్చుకలు
ఎక్కడైనా నీటిలో ఈదులాడే
రంగు రంగు చేపలను చూస్తే
మనలను కదలనీయవు
నదులలో నౌకా విహారాలు
ఆనందాల పరవళ్లు
గిలిగింతలు కలిగించే పరవశాలు
పచ్చని చెట్లతో
ఆహ్లాదం కలిగించే వనాలు
మదిని పులకింప చేసే మధురోహలు
వర్షం కురిపించిన
తుంటరి మేఘాలు
అదను చూసి దూసుకు వచ్చే
ఉదయకిరణాలు
పోటీ పడితే మంచు కరిగిన జలపాతం
మిడిసిపడుతూ ఎక్కడికో జారిపోతూ
దారులు వెతుకుతోంది
లోయలో మడుగులు కట్టి
సరిగంగ తానాలు చేయమని పిలుస్తుంది
గజ గజ వొణికించే చలిలో ఐనా
గడ్డకట్టిన కరిగిపోని సుందర దృశ్యాలు
చూసిన కొద్దీ చూడాలనిపించే
మంచుపూల వానలు
వయసుని మరపించిన కేరింతలు
ఓహ్ ఎంత అందమో ఆనందమో
చెప్పలేం మాటలతో
పంచుకునే తోడు వుండాలి అంతే
అదేమిటో మనమొస్తే చాలు
మరింత విరగబాటుతో
అందాలు ప్రదర్శిస్తుంది ప్రకృతి కన్య!
ఏ. అన్నపూర్ణగారిది కాకినాడ. వారి నాన్నగారు పిఠాపురం రాజావారి కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్గా పని చేశారు. ఇంట్లో చాలా అమూల్య గ్రంథాలూ నవలలు, మాసపత్రికలు, ఎన్నో పుస్తకాలు ఉండడం వలన చిన్నప్పటి నుంచే బాగా చదవడం అలవాటైంది. బాల సాహిత్యంతో పాటు ఇతర పుస్తకాలు చదివేవారు. ఆ తరువాత చదువు, పెళ్లి పిల్లలు జీవితంలో అందరిలాగే పరిణామాలు జరిగినా ఏనాడూ చదవడం మానలేదు. పిల్లలు బాగా చదువుకుని మెరిట్లో అమెరికా వెళ్ళాక తీరిక లభించి రచనలు చేయాలనే ఆలోచన వచ్చింది.
రంగనాయకమ్మ, వై.సులోచన రాణి, యండమూరి, మల్లాది అభిమాన రచయితలు. వారి ప్రభావమో ఉత్తరాలు రాసే అలవాటూ కలసి వారిని రచయిత్రిని చేశాయి. వారి మొదటి కథ ‘రచన మాసపత్రిక’లో వచ్చింది. మొదటి నవల ‘చతుర’లో ప్రచురితమయింది. వీరి రచనలను ఎక్కువగా – రచన, చతుర ప్రచురించాయి. ఏభై కథలు. మూడు చతుర నవలలు, ఇరవై అయిదు కవితలు వ్రాశారు. విపుల కథలు రెండు కన్నడంలో అనువదించారు. ఇంకా ఇతర పత్రికలు, వెబ్ మ్యాగజైన్లలోను ప్రచురితమయ్యాయి.
మాజీ ఐఏఎస్ ఆపీసర్ డాక్టర్.జయప్రకాశ్ నారాయణగారు తొంభై ఏడులో హైదరాబాదులో స్థాపించిన ‘ఉద్యమ సంస్థ’లో ఇరవై నాలుగేళ్లుగా కార్యకర్తగాను; సంస్థ మాసపత్రికలో వ్యాసాలు రాసే రచయిత్రిగా గుర్తిపు రావడం వారికి సంతృప్తినిచ్చింది! అటువంటి అత్యుత్తమైన గొప్ప అధికారితో పనిచేసే అవకాశం రావడం అన్నపూర్ణ గౌరవప్రదంగా భావిస్తారు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి భార్య ఇందిర అన్నపూర్ణగారికి మేనత్తగారే!
ఇప్పుడు గత ఆరు సంవత్సరాలుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. చదవడం రాయడంతో కాలం ఆనందంగా గడిచిపోతోంది. వారి భర్త మేథ్స్ ప్రొఫెసర్గా హైదరాబాదులో పనిచేశారు.