మంచివాళ్ళు….. చెడ్డవాళ్లు .
అని…… ఎదుటివారిని
చూడగానే… ‘తెలిస్తే’
అసలు వివాదమే ఉండదు
వాళ్ళ ముఖం మీద
వీళ్లు మంచివాళ్లు…
వీళ్లు చెడ్డవాళ్ళు
అని వ్రాసి ఉండదు.
అలా వ్రాసి ఉంటే
సృష్టిలో సమస్యే ఉండదు
మరి ఎలా ??
మనం…మన మనసు పొరను
కుదిపి కదిపి ప్రశ్నిస్తే
‘అది’.. ఖచ్చితంగా చెప్తుంది .
చెప్పాలంటే.. మన మనసు
చాలా ఉత్తమమైనది
మహోన్నతమైనది కూడా!
కానీ కానీ … మనం
‘మనసే లేకుండా’
బ్రతికేస్తున్నాం.. .
అక్కడ వచ్చిందన్నమాట
అసలు చిక్కు!!
ఇది చాలా పెద్ద చిక్కు!!!
అందుకే
ఈ క్షణం నుండి అయినా
మన తప్పును తెలుసుకుందాం
మనసుతో బ్రతుకుదాం!
మనసుపెట్టి మాట్లాడదాం!!
మనసుపెట్టి ప్రతి పని చేద్దాం!
మనసు పెట్టి ప్రేమిద్దాం,
మనసు పెట్టి స్నేహం చేద్దాం!!!!
ఇక ఇప్పుడు….
ఓ పెద్ద తమాషా జరుగుతుంది!!
ఎదుటి వాళ్ళలో చెడ్డవాళ్ళు ఉన్నా
మన దగ్గరకు వచ్చేసరికి
‘మంచి వాళ్ళుగా’… వాళ్లంతట వాళ్లే మారిపోతారు.
మారకపోయినా మనకు
అలా కనబడతారు!!
ఇది మన మనసు చేసే
గారడీ అన్నమాట!!
ఇలా చేసి చూడండి
ప్రయత్నించండి
చేయగలరా ?
ప్రయత్నించండి… ప్రయత్నించండి …
మళ్లీ మళ్లీ ప్రయత్నించండి !
ప్రయత్నిస్తూనే జీవించండి !!
ఇక అప్పుడు మన జీవితం అంతా
పూల పరిమళాల బాట అవుతుంది!!
నల్లబాటి రాఘవేంద్రరావు కవి, కథకులు. నాటక రచయిత. తల్లిదండ్రులు సుబ్బారావు, వీరభద్రమ్మ గార్లు తనకు సాహితీ గురుదేవులని అంటారు రచయిత. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 15 రేడియో నాటికలు ప్రసారం చేసి, రచయితగా నమ్మకాన్ని కలిగించిందంటారు. 1975లో తొలికథ ‘బుద్ధిలేని మనిషి’ ఆంధ్రసచిత్రపత్రికలో ప్రచురితం. తొలి బహుమతి అప్పటి సినిమా పత్రిక విజయచిత్ర వారిచ్చారు. తాను రచయితనవడానికి ప్రేరణ తన మిత్రుడు, ఇప్పటి కథారచయిత, సినీ దర్శకుడు పసలపూడి బామిరెడ్డి అంటారు రచయిత.
ఇప్పటివరకు 900 కథలు రచించగా, వాటిలో 200 కథలకు వివిధ బహుమతులు లభించాయి. 300 కవితలు వ్రాయగా, అందులో 60 కవితలకు పలు బహుమతులు అందుకున్నారు. 20 రేడియో నాటికలు ప్రసారం కాగా, 10 స్టేజి నాటికల రచన, నటన, దర్శకత్వం, ప్రదర్శన.
200 షార్ట్ స్కిట్స్ వివిధ గ్రూపులలో ప్రదర్శించారు. 200 సూక్తులు, 100 గేయాలు రాశారు. 20 యూట్యూబ్ గ్రూపులలో యాక్టివ్ మెంబర్. 50 కథ, కవిత సంకలనాలలో భాగస్వామి. 6 టెలి ఫిల్ములు, 6 బహుమతి కథల సంపుటులు, 2 కవితల సంపుటులు, 4 నవలలు వెలువరించారు. 5 సంవత్సరాల నుండి యూట్యూబర్. యూట్యూబ్లో 100 కథలు,100 కవితలు,300 షార్ట్స్ అందించారు. 2 సంవత్సరాల నుండిSpotify vloger గా 30 కథలు. యూట్యూబ్ వివిధ ఛానళ్లల్లో పాడ్ కాస్ట్ స్టోరీలు 250 పైగా.
మొత్తంగా బహుమతులు 250, వందలాది ప్రశంసాపత్రాలు, 30 బిరుదులు పొందారు.
వివిధ ప్రదేశాలలో అనేక సన్మానాలు జరిగాయి. అందుకున్న పురస్కారాలలో మైలురాళ్ళవంటివి – అప్పాజ్యోసుల విష్ణుభట్ల ఫౌండేషన్ పురస్కారం, ఆటా పురస్కారం, తానా కవితాలహరి ప్రశంస, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పత్రికా ప్రశంస, కదలిక టెలిఫిలిం నిర్మాణం ప్రశంసలు, నిమ్స్, సి.పి. బ్రౌన్, ఆప్కో లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల పురస్కారాలు.
వీరి బహుమతి కథల కథా సంపుటి ‘స్వర్ణశిఖరాల’కు 2024వ సంవత్సరం జాతీయ స్థాయి అత్యుత్తమ గ్రంథంగా పెందోట సాహితీ సంస్థ శ్రీవాణి పరిషత్తు వారి అవార్డు రివార్డు సన్మానం. అదే గ్రంథానికి చదువుల సాహిత్య వేదిక వారు విశిష్ట గౌరవ పురస్కారం అందించారు. అదే గ్రంథం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గ్రంథాలయ గౌరవానికి ఎన్నిక కాబడటం, అదే గ్రంథ గౌరవంగా పుట్టిన ఊరులో స్వసంఘీయుల తరపున ఘన సన్మాన సత్కారం, అవార్డు రివార్డు అందుకోవడం గొప్ప చారిత్రాత్మక విషయంగా భావిస్తారు.