Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లలు లేని లోగిలి

[డా. చెంగల్వ రామలక్ష్మి గారు రచించిన ‘పిల్లలు లేని లోగిలి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

దయం ఏడు గంటలకు వర్ధని పూజ చేసుకుంటుంటే ఫోన్ మోగింది. తనకీ సమయంలో ఎవరూ చేయరే అనుకుంటూ ఫోన్ వంక చూసింది. చెల్లెలు వరలక్ష్మి. ఎంతో అవసరం అయితే గాని ఈ టైంలో చేయదు అనుకుంటూ తీసింది.

“అక్కా, నువ్వీ సమయంలో పూజలో ఉంటావని తెలుసు. అయినా చెయ్యక తప్పలేదు”, అంది వరలక్ష్మి.

“అయ్యో, ఫరవాలేదు చెప్పు వరం.”

“అక్కా! పద్మ, అల్లుడు ఇవాళ మీ ఇంటికి వస్తామన్నారు. కాసేపట్లో ఫోన్ చేస్తుంది.”

“మంచిదే, అది వచ్చి చాలా రోజులయింది.”

“అదే అక్కా, నేను చెపితే పట్టించుకోవట్లేదు. దానికి నువ్వంటే గురి. నీ మాట వింటుంది. పిల్లలు వద్దంటుంది. కెరీర్‌లో ముందు కెళ్ళాలంటే పిల్లలు అడ్డు అంటుంది. ఇంకా ఏవో కారణాలు చెపుతుంది. అల్లుడు దాని మాటకు తందాన తాన అంటాడు. పిల్లలు లేకుండా ఎంత డబ్బుంటే మాత్రం ఏం చేసుకుంటారు? జీవితానికి నిండుతనం ఏముంటుంది? తరవాత వీళ్ళని ఎవరు చూస్తారు? అస్సలు అర్థం చేసుకోదే!నేను చెప్పాననే మాట రాకుండా నువ్వు దానికి అర్థమయ్యేలా చెప్పు అక్కా” అంది వరలక్ష్మి.

“నీ కూతురు నా కూతురు కాదా వరం? ఇంతలా చెప్పాలా! దాని పద్ధతి నాకూ దిగులుగానే ఉంది. ఇవాళ నేను మాట్లాడి చూస్తాలే” అంది వర్ధని. వరలక్ష్మి ఫోన్ పెట్టేసింది.

వరలక్ష్మి, వర్ధనికి సొంత చెల్లెలు. వర్ధనికి ఒక కొడుకు. పెళ్లయి, భార్యాపిల్లలతో వేరే ఊళ్ళో ఉన్నాడు. ఏడాది క్రితం వరకు కలిసే ఉన్నారు. ట్రాన్స్‌ఫర్ అయి వెళ్లారు. వర్ధని గవర్నమెంట్ టీచర్‌గా చేసి రిటైర్ అయింది. సొంత ఇంట్లో ఒక్కతే ఉంటోంది. వరలక్ష్మికి ఒక కూతురు పద్మ. ఉన్న ఊళ్ళోనే అల్లుడు, కూతురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. పెళ్లయి మూడేళ్లయింది. చిన్నప్పుడు అక్షరాలు దిద్దించి, పద్యాలు నేర్పించిన పెద్దమ్మంటే ఇష్టం, గౌరవం పద్మకి.

పద్మ ఫోన్ చేసింది. భోజనానికే వస్తామని చెప్పింది. వర్ధని సంతోషంగా ఆహ్వానించింది. వాళ్ళకిష్టమైనవన్నీ చేయటానికి సిద్ధం చేసుకుంటోంది. అన్నం ఒక్కటీ వాళ్ళు వచ్చాక వండుకుని, మిగతావన్నీ చేసేసుకుంటే వచ్చాక కూర్చుని తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అని మొదలుపెట్టింది. అన్నీ అయ్యేటప్పటికి రానే వచ్చారు.

“మరీ నల్లపూసవై పోయావే పద్మా” అంది వర్ధని, అల్లుణ్ణి పలకరించాకా.

“ఏం చేయమంటావు పెద్దమ్మా! అస్సలు ఖాళీ ఉండట్లేదు. ఆఫీస్‌లో పని ఎక్కువగా ఉంటోంది. ఈ రోజుల్లో ఇలా పరుగులు పెడితేనే గాని ముందుకు వెళ్ళలేం. నెల్లాళ్ళ నుంచి అనుకుంటుంటే ఇప్పటికి కుదిరింది” అంది పద్మ.

కాసేపు ఆ కబుర్లు,ఈ కబుర్లు అయ్యాక వినీత్ టీ.వి. పెట్టుకున్నాడు. పెద్ద హాలులో,  సగభాగంలో డైనింగ్, ఇంకో సగ భాగం సోఫా, కుర్చీలు ఉన్నాయి.

“ఇంకా ఏమిటి కబుర్లు పెద్దమ్మ, నీ ఆరోగ్యం ఎలా ఉంది? అన్నయ్య ఫోన్ చేస్తున్నాడా?” అంది పద్మ.

“నా ఆరోగ్యం చాలా బాగుందే! అన్నయ్య రోజూ ఫోన్ చేస్తాడు. గుడికి వెళ్ళటం, ఇంట్లో పూజలు, ఇంటి దగ్గర ఆశ్రమానికి వెళ్లి అందరితో భగవద్గీత చదవటం, ఇలా గడిచిపోతోంది. అవునూ, ఒక పిల్లనో, పిల్లవాణో కనిస్తే మీ అమ్మకు, నాకూ కాలక్షేపం. మీ అన్నయ్య పిల్లలిద్దరు పెద్దవాళ్లయి స్కూళ్ల కెళ్ళాక పసి పిల్లల సందడే లేదు” అంది వర్ధని.

“మొదలు పెట్టావా నువ్వు కూడా! అమ్మ దగ్గర కెళ్ళినా ఇదే గోల. ఇదిగో, పెద్దమ్మా! మమ్మల్ని ఆ మాట అడగొద్దు. మేం పిల్లలు వద్దనుకున్నాం. మా కెరీర్‌లో ఇంకా చాలా ముందుకెళ్లాలి. ఇప్పుడు పిల్లల్ని కంటే అడ్డం” అంది పద్మ.

“అంటే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతారా?” నెమ్మదిగా వినీత్ కూడా వచ్చి పద్మ పక్కన కూర్చున్నాడు.

“ఆ.. ఉండిపోతాం! పిల్లల్ని కని, పెంచి పోషిస్తే వాళ్ళేం ఉద్ధరిస్తున్నారు? వృద్ధాశ్రమాలు నిండిపోతున్నాయి తెలుసా?” అంది పద్మ ఆవేశంగా.

“మరి, మీ అన్నయ్య నన్ను వృద్ధాశ్రమానికి పంపలేదు కదా!15రోజులకోసారి చూసి వెళ్తాడు. వాడి దగ్గరకు వచ్చేయమని ఎప్పుడూ చెపుతూనే ఉంటాడు. వదిన కూడా ప్రేమగా ఉంటుంది” అంది వర్ధని.

“అది, అన్నయ్య లాంటి వాళ్ళు ఒకరో, ఇద్దరో!”

“పద్మా, నువ్వు చెప్పిన రెండు కారణాలు అర్థం లేనివి. ఎప్పుడో వాళ్ళు చూడరని ఇప్పుడు కనటం మానేస్తావా!  కెరీర్‌లో ముందు కెళ్లాలని జీవితంలో సంతోషాలని పణంగా పెడతావా? పిల్లలు లేకుండా అమ్మ అనిపించుకునే ఆనందం లేకుండా, ఇంట్లో పసిపిల్లలు తిరుగాడకుండా, వాళ్ళ ముద్దు మాటలు, ఎదుగుదల చూడకుండా, డబ్బు లక్షలు, కోట్లు సంపాదించి ఏం చేస్తారు? ఇప్పుడు బాగానే ఉంటుంది ఈ ఉరుకుల పరుగుల జీవితం. నీ తోటి వాళ్లంతా పిల్లా పాపలతో చక్కగా గడుపుతుంటే అప్పుడు ఆ వెలితి నీకు తెలుస్తుంది. ఈ వయసు, ఈ ఓపిక, ఈ ఉడుకు రక్తం ఎల్ల వేళలా ఉంటాయా? ఇంకో పదేళ్ల తర్వాత కావాలనుకుంటే పిల్లలు వస్తారా? వయసు పైబడుతుంటే, ఆరోగ్యం క్షీణిస్తుంటే, ఒంటరితనం బాధిస్తుంటే ఈ డబ్బు మీకు తోడవుతుందా?

మీ అమ్మకి కాస్త బాగా లేదంటే కంగారుగా పరుగులు పెడతావు, నాకవసరమైతే అన్నయ్య ఆగమేఘాల మీద వస్తాడు. వినీత్, వాళ్ళ అమ్మానాన్నలను కంటికి రెప్పలా చూసుకుంటాడు. మరి, మీ వృద్ధాప్యంలో మీకెవరుంటారు?” అంది వర్ధని.

“పద్మా! మీ దంపతులే కాదు, ఈ మధ్య పెళ్లయిన చాలా జంటలు ‘మాకు పిల్లలొద్దు, కెరీర్ ముఖ్యం’ అంటున్నారు. ఇలా ఈ తరమంతా పిల్లలొద్దు అంటే, దేశానికీ భావి భారత పౌరులెలా వస్తారు? దేశాన్ని ముందుకు నడిపించే యువత ఎలా తయారవుతుంది? ఇదే కొనసాగితే, ఇంకొన్నాళ్ళకి దేశంలో ముసలివాళ్ళే మిగులుతారు. పద్మా! పిల్లలు వద్దనుకోవటం మీ వ్యక్తిగతంగానే కాదు, దేశానికీ కూడా తీరని నష్టం. మేధావులు, విద్యావంతులు ఈ విషయం మీద డిబేట్ చేస్తున్నారు. వ్యాసాలు రాస్తున్నారు. భవిష్యత్తులో దేశం ఎదుర్కొనబోయే తీవ్ర పరిణామాన్ని, దేశానికి జరగబోయే నష్టాన్ని విశదపరుస్తున్నారు. మీరు చదువుతూనే ఉంటారు. పిల్లలు లేకుండా ఉండటం ప్రాథమికంగా కుటుంబ సమస్యే. నిజమే. కాని సామాజికంగా ఎదిగి, విశ్వరూపం దాలిస్తే దేశ సమస్య. అవునా? నాకన్నా బాగా చదువుకున్నవారు. ఆలోచింగలవారు మీరు.

మీకు పెంచటానికి తీరిక లేకపోతే, కని మీ అమ్మ దగ్గరుంచు. మీ అమ్మ, నేనూ పెంచుతాం. నిన్ను, మీ అన్నయ్యని మీ అమ్మ, నేనూ కలిసి పెంచలేదూ! అప్పుడు పక్క పక్కన ఇళ్లలో ఉండేవాళ్ళం. మీరిద్దరూ అక్క చెల్లెళ్ళ పిల్లల్లా కాక సొంత అన్నా చెల్లెళ్ళలా పెరిగారు. మీ నాన్న, పెదనాన్న సొంత అన్నదమ్ముల్లా ఉండేవారు. పెంచటానికి తీరిక లేదని, పెద్దయ్యాక పిల్లలు చూడరని పిల్లలు వద్దనటం అవివేకం పద్మా!

నువ్వు నాణేనికి ఒక వైపే చూస్తున్నావు. ఎక్కడో, ఎవరో తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసారని అందరూ అలాగే వుండాలని రూలేం లేదు. దానికి మనిల్లే ఉదాహరణ.

పద్మా! పిల్లలు వద్దనే మీ నిర్ణయానికి ఈ మధ్య మీ అమ్మ, నేనూ చాలా బాధ పడుతున్నాం. జీవితం అంటే అన్నీ ఉండాలి. కెరీర్‌లో ముందుకెళ్లాలి. గుర్తింపు తెచ్చుకోవాలి. డబ్బు సంపాదించుకోవాలి. వీటితో పాటు ప్రతి వారికీ కుటుంబం ఉండాలి. కుటుంబ ఐక్యతే దేశ సౌభాగ్యం! మీ ఆనందం!

పిల్లలు లేని లోగిలికి నిండుతనం ఉండదు. పిల్లల ఆలనా పాలనలో తల్లి తనను తాను మర్చిపోతుంది.

వాళ్ళ కోసమే తల్లిదండ్రులు బతుకుతారు. మరి మీరెవరికోసం బతుకుతారు? తండ్రి పనిచేయలేనప్పుడు నేనున్నాను నాన్నా, నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పే కొడుకో, కూతురో ఉంటే ఆ తండ్రి కెంత ధైర్యం! తల్లికి ఒంట్లో బాగుండకపోతే దగ్గరుండి వైద్యం చేయించే పిల్లలుంటే ఆ తల్లికెంత భరోసా!

పద్మా! ఏ పనికైనా సరైన సమయం ఉంటుంది. మీరు పిల్లల్ని కనకుండా ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకనైనా మీ నుంచి అనుకూలమైన మాట కోసం మీ అమ్మ, నేను, వినీత్ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నాం. బాగా ఆలోచించండి ఇద్దరూ!” అని “భోజనాలు చేద్దాం రండి” అంటూ కుర్చీలో నుంచి లేచింది వర్ధని.

పద్మ టేబుల్ మీద కంచాలు, మంచి నీళ్ల గ్లాసులు పెడుతోంది. వినీత్, వండిన పదార్ధాలు వడ్డిస్తున్నాడు. వర్ధని ముచ్చటగా చూస్తూ, “పిల్లలుంటే పెద్ద వయసులో ఇలా సహాయంగా ఉంటారు కదూ!”, అంది.

“నిజమే పెద్దమ్మా”

“నిజమే అత్తయ్యా”

అన్నారిద్దరూ ఒకేసారి సాలోచనగా!

Exit mobile version