Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లల రాజ్యం

కుటుంబంలో ఓ వేడుక సందర్భంగా ఆ ఇంటి పసిపిల్లలందరూ చేసిన సందడిని హాస్యభరితంగా వివరించారు పెయ్యేటి శ్రీదేవి “పిల్లల రాజ్యం” కథలో.

‘ఇక్కడ పండు అంటే ఎవరు?’

‘ఎవ్వడు కొడెతే దిమ్మ తిరిగి మైండు బ్లాకవుతుందో, వాడే పండుగాడు. నేనే ఆ పండుని. విషయం ఏమిటో చెప్పు’ అన్నాడు పండు అని పిలవబడే నాలుగేళ్ళ కృష్ణతేజస్వి, అప్పుడే అమెరికానించి వచ్చిన విష్ణుతో.

విష్ణు వాడి మాటలకి జడుసుకుని, ‘అమ్మా! ఎవరే ఈ పోకిరీ? వీడి గురించేనా ఫోన్లో బాదేస్తుంటావు?’ అడిగాడు విష్ణు.

“ఏరా పండూ! ఈయన నీకు మామయ్య అవుతాడు. మామయ్యని అలా అనవచ్చా? సారీ చెప్పు. నిన్న పోకిరి సినిమా టి.వి.లో వస్తే పిల్లలందరూ చూస్తారు. వీడు మహేష్ బాబు ఫేను.”

‘పోనీ అమ్మా, చిన్నపిల్లాడు, ఊరుకో. ఇంతకీ వీళ్ళ అమ్మేది? వీడు రమక్క కొడుకా, కమలక్క కొడుకా?’ అడిగాడు విష్ణు.

‘రమక్క కొడుకే గాని, ఔన్రా, అమెరికా వెళ్ళి నాలుగు సంవత్సరాలైంది. అప్పట్నించీ ఈ అమ్మను చూడాలన్న ధ్యాసే లేదేరా నీకు? అందుకే పిల్లలకి ఎవరెవరో పరిచయాలు చేయాల్సి వస్తోంది. పోనీలే, నాన్నగారి షష్టిపూర్తి ధర్మమా అని ఇప్పటికన్నా వచ్చావు. సంతోషం. రమక్క స్నానం చేస్తున్నట్టుంది. కమలక్క పక్కవాళ్ళేదో నోము నోచుకుంటున్నారు, వాయనం తీసుకోడానికెళ్ళింది. అవును, మీ ఆవిడా, పిల్లా ఏరీ?’ అడిగింది తల్లి విశాలమ్మ.

‘వాళ్ళ నాన్నగారు ఎయిర్‌పోర్టు నుంచే వాళ్ళింటికి తీసికెళ్ళారు. ఎల్లుండొస్తుంది.”

‘అదేమిటా? ముందర అత్తగారింట్లో దిగడం మర్యాద. తరవాతెలాగూ అక్కడే వుంటుంది కదా?’

‘ఏరా తమ్ముడూ! బాగున్నావా? ఎంత సేపైందిరా వచ్చి?’

‘బాగుందే, నువ్వడగడం! కనీసం ఎవరూ ఎయిర్‌పోర్టు కన్నా రాలేదు. పోనీ ఇంటికొచ్చాక ఎవరన్నా స్వాగతం పలికారా అంటే, ఇదుగో, ఈ పండుగాడు, నీ సుపుత్రుడేగా, ‘పండు’ అంటే ఎవరు అని ఆడిగిన పాపానికి, ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండు బ్లాకవుతుందో వాడే పండు. నేనే పండు. ఇంతకీ మీరెవరు?’ అంటూ నిజంగా దిమ్మ తిరిగి మైండు బ్లాకయ్యేలాగే, చాటి చెంపకాయ కొట్టినట్టు వాగాడు. ఇక అమ్మయితే, ‘మీ ఆవిడేదీ? ఇక్కడకు ముందు రావద్దా?’ అంటూ సతాయింపు! కమలక్కేమో ఎక్కడికో వాయినానికి వెళ్ళిందట! వచ్చిన సంతోషం లేకుండా పోయింది.’

‘ఛ! ఊరుకోరా. నాలుగేళ్ళ పిల్లాడు, వాడి మాటలేం పట్టించుకోకు. సారీరా తమ్ముడూ! కారువాడు ఫోను చేసినా రాలేదు. ఎలాగూ మీ మావగారు వెడతానన్నారు. ఒరేయ్ పండూ! విష్ణు నీకు మామయ్య అవుతాడురా. పిల్లలందరూ ఎటో వెళ్ళిపోయినా వీడు మాత్రం మామయ్య ఎప్పుడొస్తాడు అంటూ నీకోసం ఎదురు చూస్తూ ఇంటో వున్నాడు. ఏరీ మీ ఆవిడ, పాప?’

‘మళ్ళీ పురాణం చెప్పలేను తల్లీ. వాళ్ళ నాన్నగారింటి నించి రేపో ఎల్లుండో వస్తుందిలే. అందులోనూ వాళ్ళ చెల్లెలు రేపు సింగపూర్ వెళిపోతుంది. అందుకే అక్కడ దిగింది. ఇంతకీ షష్టిపూర్తి పెళ్ళికొడుగ్గారేరీ? అసలెంటో ఎవరూ కనిపించరేం?’

‘ఓ, నాన్నగారా? పూజలో వున్నారు. అక్క వాయినానికెళ్ళి, అక్కడి నించి షాపింగ్‌కని వెళ్ళి వస్తానంది. మేమూ వస్తామంటూ గొడవ చేసి పిల్లలందరూ ఆవిడ వెంట వెళ్ళారు.’

‘ఇదుగో, ముందర కాఫీ తాగరా విష్ణూ! తరవాత గీజర్లో వేడినీళ్ళున్నాయి. స్నానం చేసిరా. టిఫిన్ తిందూగానే.’ అంటూ తల్లి కాఫీ అందించింది.

‘మమ్మీ! ఈ పొడుగాటి ఆయనేనా మామయ్య?’ అడిగాడు పండు అనబడే కృష్ణతేజస్వి.

‘అవునా, నీకు మామయ్య, నాకు తమ్ముడు అవుతాడు. అమెరికాలో వుంటున్నాడు.’

‘నమస్తే మామయ్యా! అమెరికానించి నాకేం తెచ్చావు?’

‘నీకేమంటే ఇష్టం?’

‘నాకా? ఊ…. చాక్లెట్లు! అమెరికాలో చాక్లెట్లు బాగుంటాయని మా పక్కింటి ఆంటీ వాళ్ళబ్బాయి, మా ఫ్రెండు రవి చెప్పాడు. వాళ్ళ పిన్ని అమెరికానించి తెచ్చిందని నాకు రెండు పెట్టాడు.’

‘ఐతే పిల్లలందరూ రానీ. అందరికీ ఒక్కసారి పెడతాను. ఒకసారొకళ్ళకి, ఒకసారొకళ్ళకి పెడితే కొట్లాడుకుంటారు. ఈలోగా నే స్నానం చేసి వస్తా. సరేనా?’ అంటూ కాఫీ తాగడం పూర్తి చేసి స్నానం చేయడానికి వెళ్ళాడు విష్ణు.

పెద్దమ్మ కొడుకు ఎనిమిదేళ్ళ సాయితేజ, వాడి చెల్లెలు ఐదేళ్ళ శ్రీవల్లి, చిన్నమ్మమ్మ కూతురు కొడుకు ఆరేళ్ళ సూర్య, వాడి తమ్ముడు నాలుగేళ్ళ ప్రకాశ్, ఇంకా ఎంతమంది పిల్లలున్నారో అంతమందినీ పిలుచుకొచ్చాడు పండు.

అరగంటయాక విష్ణు తలస్నానం చేసి తల తుడుచుకుంటూ టవల్‌తో బాత్ రూమ్ నెంచి వచ్చేసరికి బాత్రూమ్ కడ్డంగా పదిమంది పిల్లలదాకా నుంచున్నారు. వాళ్ళందర్నీ చూసి విష్ణు కంగారుగా బాత్రూమ్ కోసం అనుకుని, ‘అమ్మా… అక్కా! ఈ పిల్లలంతా ఎవరు? ఇక్కడ కూడా బాత్రూమ్‌కి ‘క్యూ’ సిస్టమా?’ అని అరిచాడు.

‘కాదు మామయ్యా! మేం బాత్రూమ్ కోసం నుంచోలేదు. చాక్లెట్లు పిల్లలందర్నీ పిలుచుకొస్తేనే పెడతానన్నావుగా? అందుకే అందరూ వచ్చారు.’ అన్నాడు పండు.

‘ఒరేయి పండూ! ఉదయాన్నే చాక్లెట్లేమిటా? మామయ్యని ముందర టిఫిన్ చెయ్యనీ. మీరందరూ కూడా టిఫిన్లు తినండి. ఇప్పుడు పెట్టకురా విష్ణూ. భోజనాలయ్యాక సాయంత్రం పెట్టచ్చు. మళ్ళీ ఆకలి లేదంటూ అన్నాలు మానేస్తారు’ అంది విశాలమ్మ.

‘అదేం కుదరు. మాకు ఇప్పుడే చాక్లెట్లు కావాలి. మాకు టిఫిన్, భోజనాలూ వద్దు’ అన్నారు పిల్లలందరూ ముక్తకంఠంతో.

ఇంతలో తాతయ్య అనబడే రాఘవయ్యగారు పూజ పూర్తి చేసుకుని హాల్లోకొచ్చి కూచున్నారు. ‘ఏరా విష్ణూ! ప్రయాణం బాగా జరిగిందా?’ అంటూ విష్ణుని కుశలప్రశ్నలేసి పలకరించారు.

టేబుల్ మీద అందరికీ టిఫిన్లు ఏర్పాటు చేసింది వంటమనిషి సీతమ్మ.

విష్ణుతో కబుర్లు చెబుతూ రాఘవయ్యగారు టిఫిన్ పూర్తి చేసారు. పిల్లలు ముందర చాక్లెట్లమ్మని గొడవ చేసారు. టిఫిన్ తింటే గాని చాక్లెట్లు పెట్టనని గట్టిగా చెప్పేసరికి, గబగబా ఇష్టం లేకపోయినా నోట్లో కుక్కుకుంటూ టిఫిన్ తిన్నారు.

రాఘవయ్య షష్టిపూర్తి మహోత్సవానికి బంధువులు, మనవలు, మనవరాళ్ళు, ఆయన ఇద్దరు కూతుళ్ళు, అమెరికాలో వుండే కొడుకు విష్ణు, కోడలు పద్మ, వాళ్ళ రెండేళ్ళ కూతురు స్నిగ్ధ వచ్చారు. రెండో కొడుకు లాయరు అక్కడే వుంటాడు. ఇంకా రాఘవయ్యగారి అక్క, ఇద్దరు చెల్లెళ్ళు వచ్చారు. ఇంకా అల్లుళ్ళు, మిగతా బంధువులు షష్టిపూర్తి రోజుకి వస్తారు. రాఘవయ్యగారి అక్క జానకమ్మ కొడుక్కి ఆయన పెద్దకూతుర్నిచ్చి చేసారు. చెల్లెలు శాంతమ్మ కొడుక్కి రెండో కూతుర్నిచ్చారు. షష్టిపూర్తి రోజుకి ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తారు.

మళ్ళీ పండు అడిగాడు, ‘ఏం మామయ్యా, అందరం టిఫిన్లు తినేసాంగా? మరి త్వరగా చాక్లెట్లు పెట్టు.”

‘ఉండరా పండూ! లగేజ్ ఓపెన్ చెయ్యనీ’ అంటూ మిగతా పిల్లలూ ఆగేలా లేరని అన్నీ ఓపెన్ చేసాడు. కాని చాక్లెట్ పేకెట్ ఎక్కడా కనిపించలేదు. ‘ఉండరా, నా బేగ్‌లో లేవు. అత్త బేగ్‍లో ఉన్నట్టున్నాయి. అత్త వచ్చాక ఇస్తాను” అనగానే పండుతో సహా మిగతా పిల్లలందరూ ఇప్పుడే కావాలంటూ రాగాలాపన చేసారు.

పండు సముదాయించబోయేసరికి, ‘మాకు ఆకలేస్తోంది. ఇప్పుడే కావాలీ…. ఈ…..’ అంటూ మళ్ళీ రాగం అందుకున్నారు.

‘ఆకలేస్తే అన్నం తినండి. చాక్లెట్లు తింటే ఆకలి తీరుతుందర్రా?’ అంటూ తాతయ్య మందలించారు.

‘సరే, అత్త దగ్గరకెళ్ళి ఇప్పుడే తెస్తా. మరి నే వచ్చేలోగా అన్నాలు తినండి’ అంటూ కాఫీ తాగి మావగారింటికి స్కూటరేసుకుని బయలుదేరాడు విష్ణు.

ఈలోగా వాళ్ళని సముదాయించడానికి క్రితం రోజు చేసిన జంతికలు, సున్నండలు పెట్టింది విశాలమ్మ.

‘ఎప్పుడూ ఈ జంతికలేనా?’ అంటూ ఆవిడ చెయ్యి తోసేసి, ఏడుస్తూనే మళ్ళీ అపి తీసుకుని కరకరలాడించడం మొదలెట్టారు.

ఆ మర్నాడు వచ్చాడు విష్ణు చాక్లెట్ డబ్బాతో.

బతిమాలీ, బామాలీ ఎలాగో అన్నం తినిపిస్తున్న విశాలమ్మ చెయ్యి తోసేసి విష్ణు దగ్గిరకి పరిగెత్తారు చాక్లెట్లమ్మని.

‘ఉండండుండండి. అందరికీ తాతయ్య పెడతారు.’ అంటూ విష్ణు చాక్లెట్ల డబ్బా తండి రాఘవయ్యగారికిచ్చాడు.

రాఘవయ్యగారు మనవలు, మనవరాళ్ళు, ఇంకా మిగతా పిల్లలందరికీ తలో రెండు చాక్లెట్లు ఇచ్చారు. ఇంకా కావాలన్నారు. ఇంకోటిచ్చారు. అదీ తినేసి ఇంకా…. ఇంకా…. అని అడుగుతూనే వున్నారు. రాఘవయ్యగారు ఇంకోటి పెట్టి గమ్మున వాళ్ళు చూడకుండా ఎక్కడో దాచేసారు.

పండు తాతగారి దగ్గరకెళ్ళాడు. ఆయన పడక్కుర్చీలో కూర్చుంటే ఆయన కాళ్ళ మధ్యగా నుంచుని గారాలు పోయాడు ఇంకా చాక్లెట్లమ్మని.

‘చాక్లెట్లు ఎక్కువ తినకూడదు. పెద్దయాక సుగరు జబ్బులూ, అవీ వస్తాయి.’ అన్నారాయన.

‘మేం ఇంకా పెద్దవ్వలేదుగా? అందుకే ఇప్పుడే పెట్టు. పెద్దయ్యాక తినం. మరి నువ్వు చిన్నప్పుడు చాక్లెట్లు తినకపోయినా నీకు సుగరు ఎందుకొచ్చింది?’ అడిగాడు పండు.

తాతగారు ఎన్నో విధాల నచ్చచెప్పారు. ఎన్నో కథలు చెప్పారు. కథ వినడం ఐపోగానే మళ్ళీ చాక్లెట్లమ్మని అడిగారు.

ఇలా రెండు రోజులు ఆయన చాక్లెట్లివ్వడం, పిల్లలు ఇంకా కావాలని అడగడం…. ఆయనకి కోపం వచ్చి అందర్నీ కేకలేసారు. ఐనా పిల్లలు వాళ్ళ పట్టుదల వదలలేదు. వాళ్ళూ కోపం వచ్చి అలిగారు.

పండు అమ్మమ్మ విశాలమ్మ పెద్ద వెండికంచం నిండా వేడి వేడి అన్నం, వాళ్ళకిష్టమైన వాళ్ళకిష్టమైన టమేటో పప్పు ఇంత నెయ్యి వేసి కలిపి తీసుకువచ్చింది. ఎవరూ అన్నాలు తినకుండా మొహాలు ముడుచుకు కూర్చున్నారు.

ఇలా రెండు రోజుల్నించి అన్నాలు మానేసి గదిలో కూచున సమ్మె చెయ్యడం మొదలుపెట్టారు.

‘పెద్దాళ్ళ జులుం నశించాలి! పిల్లల కోరికలు పెద్దాళ్ళు తీర్చాలి! మాకు ప్రత్యేక చాక్లెట్లడబ్బా కావాలి! పిల్లలకి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కావాలి!’ అంటూ అట్టల మీద రాసి నినాదాలు చేయడం మొదలు పెట్టారు. దీనికంతటికీ పండు నాయకుడు.

ఇదేదో చిన్న పిల్లల ఆట అనుకోడానికి లేదు. పిల్లలు నిజంగా చాలా సీరియస్‌గానే టి.పి. వార్తా ఛానెళ్ళలో లాగా సమ్మె ప్రారంభించారు. దాంతో పెద్దవాళ్ళు కూడా చాలా సీరియస్సయ్యారు. పండునీ, కమల పదేళ్ళ కొడుకు శేఖర్‌నీ గట్టిగా కేకలేసారు..

‘ముందర అన్నాలు తినండి. అస్తమానూ చాక్లెట్లు తినకూడదు. ఆరోగ్యం పాడవుతుంది. పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి’ అంటూ తాతగారు, అమ్మమ్మ, విష్ణు కేకలేసారు.

‘ముందర మీ పెద్దాళ్ళే మామాట వినండి. అప్పుడు మీ మాట వింటాం.’ అంటూ పిల్లలు ఇంకా రెచ్చిపోయి, ‘పెద్దవాళ్ళ జులుం… నశించాలి! పిల్లల కోర్కెలు…… తీర్చాలి!’ అంటూ మళ్ళీ గట్టిగా నినాదాలు చేసారు.

తాతయ్య తన చెల్లెలి కొడుకు, టెన్త్ చదువుతున్న రాజాని మధ్యవర్తిగా పంపాడు.

‘తాతయ్య ముందు అన్నాలు తింటేనే చాక్లెట్లు ఇస్తామని చెప్పమన్నారు.’

‘మాకు ముందర చాక్లెట్లడబ్బా ఇచ్చెయ్యండి. అప్పుడే అన్నాలు తింటాం’ అన్నారు పిల్లలు ముక్తకంఠంతో.

ఈలోగా వాళ్ళ దగ్గర దాచుకున్న డబ్బులతో ఐస్‌క్రీములు, బిస్కట్లు తెచ్చుకుని తింటూ నిరాహార దీక్షకి కూచున్నట్టు కూచున్నారు ఓ గదిలో.

అప్పుడు రాజా వచ్చి, ‘మీ కోరికలేమిటో సరిగ్గా చెప్పమన్నారు తాతయ్య’ అన్నాడు.

‘మా కోరికలు ఎన్నిసార్లు చెప్పాలి? ప్రత్యేక చాక్లెట్లడబ్బా ఇమ్మని అడిగాం. అంతేకదా? డబ్బులడిగామా, బంగారాలడిగామా? సినిమాలకి తీసిళ్ళమని అడిగామా? ప్రత్యేకరాష్ట్రం ఇమ్మని అడిగామా? ఎన్ని శ్రీరాముడు ఆకాశంలోని చందమామని తెచ్చిమ్మని అడిగినట్లు మేమేమన్నా అడిగామా? ఏనుగులు, గుర్రాలు, విమానాలు అడిగామా? కనీసం కొత్త బట్టలైనా అడిగామా? ఆఫ్టరాల్, చాక్లెట్లడబ్బా ప్రత్యేకంగా ఇమ్మని అడిగాం. అదేదో గొంతెమ్మ కోరికైనటు మీ అధిష్టానం పెద్దలు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు? ఈమాతం పిల్లల కోర్కె తీర్చలేరా ఈ పెద్దాళ్ళు? వెళ్ళు… వెళ్ళి మీ అధిష్టానంతో చెప్పు.’

‘అధిష్టానం అంటే ఎవరు?’

‘అదే, మమ్మల్ని ఎవరు కట్టడి చేస్తున్నారో, వాళ్ళు! మాకు తాతగారు, అమ్మమ్మ. నీకైతే మామయ్య, అత్తయ్య. వాళ్ళే కదా అదిష్టానం? మాకు కథలు చెప్పి మరిపిద్దామనుకుంటున్నారేమో! ఆ పప్పులేం వుడకవు’ అన్నాడు పండు.

‘ఒరే పండూ! ఒకసారిలా రా నానా.’ ఉదయమే వచ్చిన రాఘవయ్యగారి చెల్లెలు శాంతమ్మ పిలిచింది.

‘ఎందుకు నానమ్మా?’

‘ఇదిగో, నీకిష్టమని బంగాళాదుంపల ఫళంగా కూర చేయించాను. రా, అన్నం కలిపి నోట్లో పెడతాను.”

‘వద్దు నానమ్మా. మేం అందరం నిహారాహాహార దీక్షలో వున్నాం.”

‘అంటే ఏమిటిరా?’

‘మా కోరికలు తీరకపోతే అన్నం మానేసి నిహారాహాహార దీక్ష చేయడం అన్న మాట!

‘మరి అన్నం మానేస్తే ఆకలౌతుంది కదరా? ఆరోగ్యం పాడవుతుంది.’

‘మరి మాకు చాక్లెట్ల డబ్బా ఇస్తేనే దీక్ష విరమిస్తాం.’

‘సరే. నేను ఇప్పిస్తాలే. ముందర అన్నం తిను.’

‘అదేం కుదర్దు. పిల్లల్ని మరిపించడానికి మీ పెద్దాళ్ళందరు ఇలాగే ఉట్టి కబుర్లు చెబుతారు.’

ఇంతలో రాజా వచ్చి, ‘పండూ! మిమ్మల్నందర్నీ అధిష్టానం చర్చలకి రమ్మంటోంది’ అని చెప్పాడు.

‘ఒరేయ్ రాజా! ఓ మూల వాడన్నం తినబోతుంటే వచ్చి చెడగొడతావేంరా? మీ అధిష్టానంతో ఇప్పుడు రావడం కుదరదని చెప్పు. ఇదిగో, కమ్మటి నెయ్యి వేసి బంగాళాదుంప కూర కలిపాను. బంగారుతండ్రివి కదూ! తిను నానా. బాగుంది కదూ? ఎవరికీ లేదు. నీకొక్కడికే చేసాను.”

‘నానమ్మా! ఇంకా తాతయ్య పుట్టినరోజు ఎన్నాళ్ళుంది?’

పదిరోజులుంది. తాతయ్య పుట్టిన రోజు, నీ పుట్టిన రోజు ఒకరోజే. మరి తాతయ్య పుట్టినరోజుకి ఇలాగే సమ్మెలు, దీక్షలు చేస్తారా?’

‘అబ్బ, చెయ్యంలే గాని, మరి తాతయ్య షష్టిపూర్తి ఎప్పుడు?’

‘పుట్టిన రోజునే చేస్తారా పండూ.”

‘ఏమిటి నానమ్మా, నన్ను మాటల్లో పెట్టి కూరేస్తున్నావు? నేను దీక్షలో వున్నాను.’

‘దీక్ష చెయ్యి. ఎవరొద్దన్నారూ? ఈ కొంచెం తినేసి దీక్షలో కూచో.’

‘అది తప్పు కదా? తిన్నాక నిహారారాహాహార దీక్ష ఎలా అవుతుంది?’

‘గంట నిరాహార దీక్ష కూడా చెయ్యచ్చు. దీక్షల్లో అనేక రకాలున్నాయి. రిలే దీక్ష, గంట దీక్ష, నాలుగురోజుల దీక్ష, వారం రోజుల దీక్ష, ఇలా ఎలాగైనా చెయ్యచ్చు. నువ్వు మరోగంట దాకా ఏం తినకు పోనీ. ఐనా మాటలు కూడా సరిగా రాక, నిరాహారదీక్ష అనడం కూడా చేతకాని చిన్నపిల్లలు, మీకు దీక్షలేమిటిరా? నాలుగేళ్ళ పిల్లాడివి, నీకు దీక్షలెందుకురా?’

‘ఏంకాదు. కొన్ని రోజుల్లో నాకు ఐదేళ్ళొస్తాయి నానమ్మా.”

‘సరేలే. అప్పటికి, ఇప్పటికి మహా పెద్దవాడివి ఐపోవు. నువ్వింకా చిన్నవాడివే. దీక్షలంటూ అన్నం మానేస్తే , ఎదుగుదల ఆగిపోయి ఎప్పటికీ చిన్నపిల్లాడిగానే వుంటావు. తెలివితేటలు కూడా పెరగవు. అన్నం మానేసే టైము ముందరుంది. అప్పుడు తినాలనున్నా తినలేవు. తినడం మానేస్తేనే బెటరు. తినమని నన్నెవరూ బతిమాలరు. ఇప్పుడు మానేస్తే ఆరోగ్యం దెబ్బతినే డాక్టర్లచుట్టు తిరగాలి. వాళ్ళేమో చేదుమందులు, ఇంజక్షన్లు ఇస్తారు. అది నీకు మంచిదా?’ నోట్లో అన్నం కూరుతూ చెప్పింది శాంతమ్మ.

‘ఒట్టొదు. తింటాలే. మరి బుజ్జి, ఎట్టి, రమ్య, ఇంకా బోల్డుమంది పిల్లలున్నారు. పాపం, వాళ్లకీ తినిపించు.’

‘వాళ్ళందరూ శుబ్బరంగా బాగానే ఉంటున్నారులే. తినకపోతే వాళ్ళ అమ్మలూరుకోరు. మీ అమ్మంటే పట్టించుకోదు. నువు ఆనంటూ ఎటో వెళ్లిపోతుంది. అందుకే నన్నుగాని, మీ అమ్మమ్మని గాని పెట్టమంటుంది. నువ్వెన్ని చిరుతిళ్ళు తిన్నా, అన్నం తినకపోతే బలం రాదు. ఇదిగో, ఈకొంచెం తిను.”

ఇంతలో రాజా వచ్చి, ‘ఒరే పండూ! నేను బజారుకెడుతున్నాను. మామయ్య, అదే, మీ తాతయ్య ఏదో పట్టుకురమ్మన్నారు.’

‘ఎలా వెడుతున్నావు?’

‘స్కూటరు మీద. ఏం, అలా అడిగావు?’ స్కూటరు స్టార్ట్ చేస్తూ అడిగాడు.

పిల్లలందరూ స్కూటరు కడ్డంగా నిలబడి, ‘ఇవాళ రాస్తా రోకో. అందుకని ఇవాళ ఏ వాహనాలూ మనింటి నించి కదలడానికి వీల్లేదు. అలానే మీ అధిష్టానానానికి చెప్పు.”

రాజా వెళ్ళి పండు అన్న మాటలు మామయ్యతో చెప్పాడు.

‘రాజా! ఇవాళ్టినించి 144వ సెక్షను విధిస్తున్నాం. ఇంట్లో ఎవరూ గుంపులు గుంపులుగా గానీ, ఇద్దరేసి గానీ వుండకూడదు. అలా వున్నట్టయితే గదిలో పెట్టి బంధిస్తాం. ఈ విషయంలో అధిష్టానం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పు. ఇందాక చర్చలకి రమ్మంటే రాలేదు. సాయంత్రంలోగా అధిష్టానంతో చర్చలకి వస్తే సరి. లేకపోతే తీవ్రమైన చర్యలు తీసుకోవలసి వస్తుంది’ అని తాతయ్య అందరికీ వినబడేలా గట్టిగా చెప్పాడు.

‘షష్టిపూర్తి ఫంక్షనులోగా అందరూ కలిసిపోయి సరదాగా వుండాలని చెప్పు రాజా! రాస్తా రోకో అంటూ ఎవరడ్డగిస్తారో చూస్తాను. నువ్వు వెళ్ళు. పిల్లలందరి కొలతలూ సరిగా తీసుకున్నావు కదా? ఏవి ఎవరి కొలతలో పేర్లు కూడా రాసుకో. మంచి క్వాలిటీవీ చూసి పట్రా. పెద్ద వాళ్ళందరూ రేపు వెళ్ళి తీసుకోండి.’

రాజా స్కూటరు మీద వెళ్ళాడు. ఈ సారి ఎవరూ అడ్డగించలేదు. తాతయ్యకి మరీ కోపం వచ్చిందని తెలుసుకునే భయంతో అందరూ కిక్కురుమనకుండా కూచున్నారు.

‘ఇదిగో విశాలీ! ఈరోజు పిల్లలందరికీ అన్నాలు కలిపి పెట్టు. వాళ్ళు తినకపోతే నేనూ తినను. రాజకీయనాయకుల్లా ఇప్పట్నించీ పిల్లలకి సమ్మెలు, నిరాహార దీక్షలు ఏమిటసలు? పిల్లల మాట పెద్దవాళ్ళు వినాలా, పెద్దవాళ్ళ మాట పిల్లలు వినాలా? పిల్లలకి అడిగిందల్లా కొనిచ్చి, అతిగారాబం చేస్తే ఇలాగే పెద్దవాళ్ళనెదిరించి క్రమశిక్షణ లేకుండా పెరుగుతారు.’

‘తాతయ్యా! మమ్మల్ని ఏ తిట్లన్నా తిట్టుగాని, రాజకీయ నాయకులతోను, మంత్రుల తోను మాత్రం పోల్చదు’ అన్నారు పిల్లలందరూ.

‘ఏం ఎందుకు? వాళ్ళేం పాపం చేసారు?’

‘ప్రజల సొమ్ము అన్యాయంగా మేసి, హత్యలు చేస్తూ, అన్యాయంగా కోట్లు సంపాదించి జైళ్ళకెళుతున్నారు. నీకు తెలీదా? టి.వి.ల్లో చూడటల్లేదా?’

‘ప్రజలకి మంచిపనులు చేస్తే ఎందుకు జైల్లో పెడతారు?’

‘ఏంత మంచిగా వున్నా, చెడుదార్లకి మళ్ళిస్తూ, డబ్బాశ చూపి, వాళ్ళకి కూడా కేసుల్లో ఇరికిస్తారు. అందుకే మేము ఆ నీచ రాజకీయ నాయకులం అవం.’

‘మరేం చేద్దామనుకుంటున్నారు?’

‘డాక్టరో, ఇంజనీరో చదివి, సినిమా హీరోలవుతాం.’

‘టి.వి.ల ప్రభావం బాగానే ఒంట పట్టించుకున్నారు. రేపట్నించే టి.వి.లు చూడకండి. టి.వి. కనెక్షను తీయించేస్తాను. రాజా స్కూటరు మీద వెళ్ళబోతే రాస్తారోకోలంటూ అడ్డగిస్తారా? రాజాని చూసి నేర్చుకోండి ఎంత బుద్ధిగా వుంటాడో. ప్రతిరోజు ఐదుగంటల కల్లా లేచేస్తాడు. లేవడంతోటే దేముడికి దణ్ణం పెట్టుకుని, డేటు క్యాలండరు చింపి ఆరోజు డేటు పెడతాడు. బ్రష్ చేసుకుని, స్నానం చేసి, దేముడి స్తోత్రాలు చదువుకుని, టిఫిన్ తిని, స్కూలు బుక్సు చదువుకుంటాడు. సాయంత్రం స్కూలునించి వచ్చి, స్కూలు డ్రస్సు మార్చుకుని, చేతులు, కాళ్ళు కడుక్కుని, కాసేపు ఆడుకుంటాడు. తర్వాత పదిగంటల దాకా చదువుకుని, పెందరాళే పడుకుంటాడు. టి.వి.లో మంచి పోగ్రాంలు ఐతేనే చూస్తాడు. మీకులా అడ్డమైన చెత్త చూసి, సమ్మెలు, దీక్షలు అంటూ అన్నం మానెయ్యడు. రోజూ వాళ్ళ అమ్మ, నాన్నల పాదాలకి నమస్కారం చేస్తాడు. పెద్ద వాళ్ళనెదిరించడు. పెద్దలు చెప్పిన మాట వింటాడు. ప్రతిరోజు కమశిక్షణతో పద్ధతిగా వుంటాడు. అందుకే వాడికి చదువులో కూడా ఫస్టుక్లాసులే వస్తాయి.”

‘మరి తాతయ్యా, నువ్వెంతో రాజాబాబాయిని మెచ్చుకుంటావుగానీ, ఇందాక నే చూసా. రాజాబాబాయి దగ్గర అక్రమార్జన చాలా వుంది. ఎన్ని కోట్లున్నాయో మరి! జేబుల్లో కూరుకోడం చూసా.’

‘ఎంత డబ్బుందిరా?’

‘ఏమో చాలా కోట్లే వున్నాయి. చొక్కా జేబుల్లో కొన్నుంటాయి. ఫేంటు జేబుల్లో కొన్నుంటాయి. బేక్ పేకెట్లలో కొన్నుంటాయి. అవన్నీ ఎలా వచ్చాయంటావు? ఉద్యోగం కూడా లేకుండా, చదువుకునే బాబాయికి అంత డబ్బెక్కడిది? నేను బాబాయి మీద ఎబిసిడి ఎంక్వైరీ పెట్టిద్దామనుకుంటున్నాను.’

‘నీ మొహంలే! తిక్క తిక్కగా వాగకు. పైగా ఎబిసిడి ఎంక్వైరీ పెట్టిస్తావా? నిన్న గాక మొన్న పుట్టిన నీకిన్ని తెలివి తేటలెలా వచ్చాయిరా? రాజాకి డబ్బిచ్చి ఏవో కొనమని నేనే పంపాను. డబ్బు పెట్టుకోడానికి బేగు తీసికెళ్ళమంటే బేబుల్లో కుక్కుకున్నట్టున్నాడు. రాజాబాబాయినే అనుమానిస్తారా మీరు? వాడు నిజంగా రాజాలాంటి వాడు. వాడ్ని చూసి పిల్లలే కాదు, పెద్దాళ్ళు కూడా నేర్చుకోవల్సినవి ఎన్నో వున్నాయి.’

‘అలాగే మేం కూడా రాజాబాబాయిలాగే బుద్ధిగా వుంటాం తాతయ్యా. రేపట్నించి రాజాబాబాయి కంటే ముందరే లేచి, డేటు కేలండి చంపి, ఆ రోజు డేట్ పెడతాము.”

‘మరీ… మరీ…”

“ఏమిటో చెప్పండి.”

‘మాకు… మాకు ప్రత్యేక చాక్లెట్లు కావాలి.’

‘ఇంత చెప్పినా మీ పట్టుదల వదలరు. నిజంగా లేవురా. మామయ్య కొన్నే తెచ్చాడు.”

‘ఇవిగోనర్రా. నేనింకా తెచ్చాను. నా దగ్గరున్నాయి’ అంటూ కోడలు పద్మ చేతిలో తెల్లటి అమెరికా బొమ్మని ఎత్తుకుని లోపలికొచ్చింది. కారుడ్రైవరు సామాన్లు లోపల పెట్టాడు.

‘రండి బావగారూ!’ అంటూ విశాలితో అరిచాడు, ‘ఏమేవ్! కోడలు, వియ్యంకుడుగారు, అమెరికా మనవరాలు వచ్చారు.’

విశాల హడావిడిగా లోపల్నించి వచ్చి, ‘ఉండమ్మా, లోపలికి రాకు. దిష్టి తీస్తా’ అంటూ మళ్ళీ లోపలికెళ్ళి పారాణినీళ్ళు తెచ్చి కోడలికి, మనవరాలికి దిష్టి తీసి లోపలికి ఆహ్వానించింది.

పాపని అత్తగారి చేతికిచ్చి, అత్త గారికి, మామగారికి పాదాలకి నమస్కారం చేసి, వాళ్ళ క్షేమసమాచారాలు కనుక్కుంది.

‘ఎంత బాగుందిరా విష్ణూ నీ కూతురు! తెల్లగా బొద్దుగా అచ్చం అమెరికా బొమ్మలాగే వుంది’ అని ముద్దులాడుతూ, ‘నీ పేరేమిటి చిట్టితల్లీ?’ అడిగింది విశాల పాపని.

‘చిత్తి తల్లీ కాదూ…. నా… పేరూ’ అంటూ తల పైకి పెట్టి, ‘…..ఇస్‌స్‌స్ … సిగ్….’ అని పలికి, ‘ధ’ అనే గట్టిగా వత్తి పలుకుతు తల కిందకి దించి, తల అటూ ఇటూ తిప్పి, దానిమ్మ గింజల్లాంటి చక్కని పలువరసతో ‘హి….హి…హి….’ అంటూ చిలకలా నవ్వేసింది.

స్నిగ్ధ – అని ఆ పేరు చెప్పిన విధానానికి పిల్లలు, పెద్దలు అందరూ పగలబడి నవ్వేసారు.

‘నీ పేరేంటమ్మా?’ అని మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చెప్పించుకుని ఆ చిన్నారిని ముద్దులతో ముంచేసారు.

కోడలు పద్మ బేగ్ లోంచి చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలలో చాక్లెట్లు నింపి, ‘ప్రత్యేక చాక్లెట్ల డబ్బా కావాలని అన్నాలు తినకుండా తాతగారి మీద, అమ్మమ్మ మీద అలిగి దీక్షలు చేపట్టారట కదా? అందుకే మీకందరికీ తలో చాక్లెట్ల డబ్బా తెచ్చాను. ఇవిగో, తీసుకోండి. ఏడీ, పండు అంటే నువ్వేనా?’ అంటూ వాడికి రెండు డబ్బాలిచ్చి ముద్దులాడింది పద్మ. ఆడపడుచుల్ని, మరదుల్ని, అందర్నీ పేరు పేరునా పలకరించింది.

ఇల్లంతా ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. ఈలోగా రాణా పెద్ద పెద్ద బట్టల పేకెట్లతో లోపలి కొచ్చాడు. పిల్లలందరికీ తీసుకున్న కొలతల ప్రకారం డస్సులు కొని తెచ్చాడు.

‘రాజా బాబాయ్! పాపం మాకు బట్టలు తేవడానికి వెళ్ళావా? ఇందాక పాపం నిన్ను రాస్తారోకో అని ఆపేసాం.’ అన్నాడు పండు.

‘అవునూ, అన్యాయంగా కోట్లు సంపాదించానని తాతయ్యతో చెప్పారట జేబులో నోట్లు చూసి? అందుకే తాతయ్య కంగారుగా ఫోను చేసారు డబ్బు జాగ్రత్త అని. పైగా నామీద ఎబిసిడి ఎంక్వైరీ పెట్టిస్తానన్నారట? అందుకే మీమీద కోపం వచ్చింది.’

‘సారీ బాబాయ్! తెలియక అన్నాము. తాతయ్య నిన్ను మెచ్చుకుంటూ నీగురించి చాలా బాగా చెప్పారు. ఇక నీ అడుగుజాడల్లోనే నడుస్తాం.’

ఆ రాత్రీ అన్నం కలిపి పిల్లలందరికీ తినిపించింది. అందరూ పెట్టినవన్నీ బుద్ధిగా ఉన్నారు.

ఆ మర్నాడు పిల్లలందరూ లేవగానే, ఒకళ్ళ తరవాత ఒకళ్ళు, ఒకరికి తెలియకుండా మరొకరు డేటు కేలండర్లో డేట్లు చంపేస్తారు. రాజాలా బుద్ధిగా త్వరగా స్నానాలు చేసి, దేవుడి స్తోత్రాలు చదువుకున్నారు. బుద్ధిగా బోర్నవీటా తాగారు. తాతయ్య లేచాక, తాతయ్యకి, అమ్మమ్మకి నమస్కారాలు చేసారు..

పండు తాతయ్యతో గొప్పగా చెప్పాడు, ‘తాతయ్యా! చూడు. ఇవాళ నీకంటే కూడా త్వరగా లేచి, స్నానాలు చేసేసి, దేవుడికి దణ్ణం పెట్టుకుని, బాబాయి కన్నా ముందరే బోర్నవీటా కూడా తాగేసాం. అందరం డేటు కూడా చింపేసాం. నీ షష్టిపూర్తి పుట్టిన రోజు ఇక రెండు రోజులే వుంది.’ అని.

ఇవాళ ఇరవైనాలుగవ తారీకు. కాదు, ఒక రోజుందని, కాదు, కాదు, నాలుగు రోజులుందని, మూడు రోజులుందని.. ఇలా పిల్లలందరూ రాఘవయ్యగారి షష్టిపూర్తి రోజు పిల్లలందరూ వాళ్ళు చింపిన డేట్సు ప్రకారం లెక్కలేసి చెప్పారు.

రాఘవయ్యగారు ఏమిటా అని కింద చూస్తే కేలండర్ లోని డేటు కాగితాలన్నీ కుప్పలుగా పడున్నాయి!

‘మంచి గుణాలు నేర్చుకోవాలని రాజాసి ఉదాహరణగా తీసుకుని మీకు అర్థమయ్యేలా చెప్పినందుకు డేట్సు అందరూ తలోకటి చెంపేసారర్రా. ఏకంగా పదిరోజుల కాగితాలన్నీ ఒక్కరోజులోనే చింపేసారు.

‘తాతయ్యా! మలేమో నీ పుట్టిన్లోజు తొరగా వచ్చేయాలని నేనూ ఒకటి చంపేసా. మరి మల్లీ మేం అమెరికా వెలిపోవాలికదా? అందికే చింపేసా.’.

చిన్నారి స్నిగ్ధ మాటలకి అందరూ నవ్వేసారు.

‘మరి నువ్వేకదా తాతయ్యా, రాజాని చూసి నేర్చుకోవాలన్నావు?’ అన్నాడు పండు.

‘సర్లెండి. రేపట్నుంచే డేటు ఎవరూ మార్చకండి. రాజా! నువు కూడా పొరబాట్న చింపేవు! ఎవరూ 25వ తేదీ దాకా ఎవరూ చింపకండి.’

‘తాతయ్యా! సరే, డేటు ఎవరూ చింపం గానీ…. మరి నీ పుట్టిన రోజా, నా పుట్టినరోజా 26నే కదా? మరి నువ్వు షష్టిపూర్తి చేసుకుంటున్నావు కదా? నేనూ షష్టిపూర్తి చేసుకుంటాను.”

పండు మాటలకి అందరూ గొల్లున నవ్వారు.

‘నీ మొహం! నీకు నాలుగేళ్ళి ఐదేళ్ళొస్తాయి. షష్టిపూర్తి అరవై ఏళ్ళు నిండాక చేసుకుంటారు. నువ్వు కూడా అరవై ఏళ్ళు నిండాక, తాతయ్యవయాకా అప్పుడు చేసుకుందువు గాని’ అంది విశాలమ్మ.

‘ఊ…. ఊ… నేను తాతయ్య నవను. నేను పండుగానే వుంటాను.’

ఇలా వారం రోజులు పిల్లల ఆటపాటలు, ముద్దు ముద్దు మాటలు, దీక్షలు, వాళ్ళ చిట్టి చిట్టి కోపాలతో వారం గడిచిపోయింది.

షష్టిపూర్తి రోజుకి అల్లుళ్ళు, మిగతా బంధువులు అందరూ వచ్చారు.

రాఘవయ్య, విశాలమ్మ గార్ల షష్టిపూర్తి మహోత్సవం ఘనంగా, పెళ్ళంత వైభవంగా జరిగింది. వాళ్ళ మధ్యన పుట్టినరోజు పెళ్ళికొడుకు షేర్వాణీ సూటుతో, మెడలో బంగారు గొలుసు, నుదుట పొడుగ్గా నామంతో కూచున్నాడు పండు. షష్టిపూర్తి దంపతులకి అందరూ బట్టలు పెట్టారు. పండుకి కూడా అందరూ డ్రస్సులు, ఆడుకునే బొమ్మలు ఇచ్చారు.

ఇక మర్నాడు విష్ణు, ‘పండూ! మొత్తానికి తాతయ్యని, అమ్మమ్మని దీక్షల పేరుతో బలే ఆడించావురా.” అన్నాడు విష్ణు.

‘నాక్కొంచెం తిక్కుంది. కానీ దానికో లెక్కుంది’ అన్నాడు పండు కాలరెగరేస్తూ.

‘ఈ డైలాగు ఏ సినిమాలోది నాయనా? ఇదీ మహేష్ బాబుదేనా?’ అడిగాడు విష్ణు.

‘కాదు. ‘గాబర్ సింగ్’ లో పాన్ కయలాణ్డి.’

ముందర వాడి మాట అర్థం కాక, తరవాత అర్థమై ‘గబ్బర్ సింగ్’లో పవన్ కళ్యాణ్‌దా? అన్నాడు.

అందరూ గొల్లున నవ్వారు వాడి వచ్చీరాని మాటలకి.

ఇంట్లో అందరికీ వాడో హీరో అయిపోయాడు.

పిల్లల సందడి, తండ్రి షష్టిపూర్తి మహోత్సవం వీడియోలో చిత్రీకరించుకుని, తీపి జ్ఞాపకాలతో అమెరికా ప్రయాణమై బయలుదేరుతున్నారు విష్ణు, కోడలు పద్మ, చిన్నారి స్నిగ్ధ .

తల్లి విశాలమ్మ కొడుకు, కోడలు, స్నిగ్ధని పట్టుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. రాఘవయ్యగారు గంభీరంగా వుండిపోయారు.

అందరూ బాధతో వీడ్కోలు చెప్పారు.

పండు, ‘మామయ్యా! నువ్విక్కడే వుండిపో.’ అంటూ ఏడ్చాడు.

‘మళ్ళీ త్వరలో చిన్నమామయ్య పెళ్ళికి వస్తాంలే.’ అంటూ విష్ణు పండుని ముద్దు పెట్టుకున్నాడు.

***

విష్ణు అమెరికాలో జరిగే తానా ఉత్సవాల్లో తను చిత్రీకరించిన వీడియో వేసి చూపించాడు అందరికీ. అందరికీ చాలా నచ్చింది. తానా ఆహ్వానం మీద ఇండియా నించి ఎంతోమంది కళాకారులు, గాయనీ గాయకులు, సంగీత దర్శకులు, సినీనిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు.

ఎన్నాళ్ళనంచో పిల్లల మీద సినిమా తీయాలనుకుంటున్న ప్రఖ్యాత సినీనిర్మాత మోహనకృష్ణకి ఆ వీడియో ఎంతో నచ్చేసింది. వెంటనే విష్ణు అనుమతితో పండుని హీరోగా పెట్టి ‘పిల్లలరాజ్యం’ అన్న సినిమాని తీసాడు. ఎంతో విజయవంతమైన ఆ సినిమా ఆస్కార్‌కి కూడా ఎంపికైంది.

ఇప్పుడు అన్ని సినిమాల్లో పండు ముఖ్య పాత్రధారి! పండు లేని సినిమా లేదు. పండు వుంటే ఆ సినిమా సూపర్ హిట్! పండుకెన్నో అవార్డులు వస్తున్నాయి.

పండు ప్రతి అవార్డు ఫంక్షనుకి రాఘవయ్యగారు, విశాలమ్మ హాజరవుతారు. ‘వాడు నా మనవడే’ అంటూ విశాలమ్మని చూసి మీసం మెలేస్తూ వుంటారు.

కానీ వాడి అల్లరితనానికి మందలించిన రాఘవయ్యగారికి ఇప్పుడు ఇంత చిన్న వయసులోనే పండు సాధిస్తున్న విజయాల్ని చూసి మైండు బ్లాకవుతోంది! అలా ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా……ఇంకా…….అలా……..ఆయన మైండు బ్లాకవుతూనే వుంది!

ఇప్పుడు పండు సినిమాల్లో పెద్ద బిజీ హీరో!

రాజా అమెరికాలో పెద్ద డాక్టర్!!

Exit mobile version