[ప్రపంచ జానపద కథలలో భాగంగా, బాలబాలికల కోసం డా. ఎం. హరికిషన్ అందిస్తున్న కథ ‘పశువుల కాపరి’.]
ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. అతనికి చాలా అసూయ. అహంకారం. రాజ్యంలో తనకంటే ఎవరు గొప్పగా ఉండకూడదు అనుకునేవాడు. తనకంటే మంచి ఇల్లు కట్టుకున్నా, బట్టలు వేసుకున్నా, నగలు పెట్టుకున్నా అస్సలు తట్టుకునేవాడు కాదు. వెంటనే వాళ్లను రాజభవనానికి పిలిపించి ఏదో ఒక శిక్ష వేసేవాడు. దాంతో జనాలంతా భయపడి తమ దగ్గర ఎంత సొమ్ము ఉన్నా బయటకి మాత్రం మామూలుగానే సాదాసీదాగా కనపడేవాళ్ళు.
ఆ ఊరిలో ఒక నగల వర్తకుడు ఉండేవాడు. అతను దేశ దేశాల్లో వ్యాపారం చేసేవాడు. కాలం కలిసొచ్చి విపరీతంగా సంపాదించాడు. కానీ ఎంత సంపాదించినా ఏం లాభం. ఒంటిమీద మంచి బట్ట గానీ, తినడానికి మంచి తిండి గానీ, ఉండడానికి చక్కని ఇల్లు గానీ ఆ రాజ్యంలో కష్టం కదా.. దానితో బయట మామూలు బట్టలు వేసుకున్నప్పటికీ ఇంట్లో మాత్రం మంచి మంచి బట్టలు, నగలు వేసుకొని తిరిగేవాడు. పెళ్ళాం బిడ్డలకు కూడా కావలసినవన్నీ కొని పెట్టాడు. అతనితో వ్యాపారంలో పోటీ పడలేని కొందరు వర్తకులు ఆ విషయాన్ని గోరంతలు కొండంతలు చేసి రాజు చెవిన వేశారు. అంతే రాజు అసూయతో రగిలిపోయాడు. కోపంతో బుసలు కొట్టాడు. వెంటనే సైనికులని పంపించాడు. వాళ్లు ఆ వర్తకుణ్ణి బంధించి రాజు ముందు ప్రవేశపెట్టారు.
రాజు కోపంగా ఆ నగలవర్తకుణ్ణి చూస్తూ “ఈ రాజ్యంలో ఎవరూ నా కన్నా అద్భుతమైన బట్టలు, నగలు వేసుకోకూడదని తెలుసు కదా.. మరి ఎలా వేసుకున్నావు” అన్నాడు.
ఆ మాటలకు ఆ వర్తకుడు వినయంగా “రాజా అదంతా నిజం కాదు. ఆకాశంలో సూర్యునిలా మెరిసే మీ బంగారు పట్టుబట్టలు ఎక్కడ.. రంగురాయిలా తలతల మెరిసే నా బట్టలు ఎక్కడ. గిట్టనివాళ్లు చెప్పే చెడు మాటలు నమ్మకండి. నేను సంపాదించిన ధనం మీ కాలి గోటికి కూడా సరిపోదు. నేనింతవరకు న్యాయంగా సంపాదించిన సొమ్మును తప్ప వేరేది ఏది నా కోసం ఖర్చు పెట్టలేదు” అన్నాడు.
ఆ మాటలు వింటూనే రాజు మరింత రగిలిపోయాడు. “అంటే.. నేను అన్యాయంగా సంపాదిస్తున్న సొమ్ముతో జల్సాలు చేస్తున్నానంటావ్. ఎంత ధైర్యం నీకు” అన్నాడు.
“రాజా నేను ఆ ఉద్దేశంతో ఆ మాటలు అనలేదు. మిగతా వర్తకుల లాగా ఎవరికీ ఎటువంటి అన్యాయము చేయడం లేదు. అవినీతికి పాల్పడడం లేదు. చాలా న్యాయంగా నిజాయితీగా బతుకుతున్నా అంటున్నా. మీరంటే ఎంతో గౌరవం, భక్తి ఉన్నాయి. నేను ఎదగడం ఇష్టం లేని వాళ్లు ఎవరో మీకు నా గురించి చెడుగా చెప్పారు” అన్నాడు.
కానీ రాజు ఆ వర్తకుని మాటలు పట్టించుకోలేదు. “నా రాజ్యంలో నా ఆజ్ఞను ధిక్కరించిన వారికి ఈ భూమ్మీద నివసించే హక్కు లేదు. నీకు ఉరిశిక్ష తప్పనిసరి. కాకపోతే ఒక్క అవకాశం ఇస్తాను. నేను అడిగే మూడు ప్రశ్నలకు గనుక నీవు సరైన సమాధానాలు చెబితే నీ తప్పును మన్నించి ఈ ఒక్కసారి వదిలేస్తాను. లేదంటే నీకు ఇదే ఆఖరిరోజు అవుతుంది” అన్నాడు. ఆ నగల వర్తకునికి వేరే దారి లేక “అలాగే మహారాజా.. అడగండి” అన్నాడు.
రాజు మూడు ప్రశ్నలు అడిగాడు.
- నా విలువ ఎంతో సరిగ్గా ఒక్క కానీ కూడా తేడా లేకుండా చెప్పాలి?
- ఈ ప్రపంచమంతా తిరిగి రావడానికి సరిగ్గా నాకు ఎంత సమయం పడుతుంది?
- ఇప్పుడు ఈ క్షణంలో నేను నా మనస్సులో ఏమి అనుకుంటా ఉన్నాను?
రాజు అడిగిన మూడు ప్రశ్నలకు ఎంత ఆలోచించినా ఆ వర్తకునికి సమాధానం దొరకలేదు. దాంతో “రాజా.. దయచేసి నాకు ఒక పది రోజులు సమయం ఇవ్వండి. అంతలోపు తెలుసుకొని చెబుతాను” అన్నాడు.
దానికి రాజు “సరే అలాగే.. కానీ ఈ పది రోజులు నువ్వు రాజ్యం విడిచి ఎక్కడికీ పోకూడదు. సైనికులు నీ వెన్నంటే కాపలాగా ఉంటారు. సరిగ్గా పదవరోజు సరైన సమాధానాలతో ఇక్కడ అడుగు పెట్టాలి” అన్నాడు.
నగలవర్తకుడు ‘సరే’ అంటూ బయలుదేరాడు. సమాధానాల కోసం అనేకమంది పండితుల దగ్గరికి పోయాడు. గొప్ప గొప్ప న్యాయాధికారులను కలిశాడు. కావలసినంత సొమ్ము ఇస్తానన్నాడు. ప్రాణాలు కాపాడమన్నాడు. కానీ ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోయారు. నెమ్మదిగా పది రోజులు గడిచిపోయాయి. ఇక తనకు చావు తప్పదని దిగులుగా ఇంటికి చేరుకున్నాడు.
ఆ ధనవంతుని ఇంటిలో ఒక పశువుల కాపరి ఉన్నాడు. వానికి లక్ష్మీదేవి దయ చూపకున్నా సరస్వతీ దేవి మాత్రం కరుణించింది. ఏమాత్రం సమయం దొరికినా గ్రంథాలయాలకు వెళ్లి అనేకమైన పుస్తకాలు చిన్నప్పటినుంచీ తెగ చదివేవాడు. గొప్ప గొప్ప వాళ్ళు నగరానికి వచ్చినప్పుడు వాళ్లు చెప్పే ఉపన్యాసాలు వినేవాడు. చర్చలలో పాల్గొనేవాడు. వానికి జరిగిన విషయం అంతా తెలిసింది. దాంతో ధనవంతుని దగ్గరికి పోయి “అయ్యా.. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీ బదులుగా మీలాగే వేషం వేసుకొని రాజు ముందుకు నేను వెళతాను. పశువుల కాపరిని కదా అని తక్కువ చేసి చూడకండి. సరస్వతికి ధనికా పేదా తేడా ఉండదు. ఆకలైనప్పుడు కావలసింది ఆకలి తీర్చే ఆహార పదార్థమే గానీ విందు భోజనం కాదు” అన్నాడు. దానికి ఆ ధనవంతుడు చిరునవ్వు నవ్వి “సరే.. ఎలాగూ ఇదే నాకు చివరి రోజు. ఇంతవరకు సమాధానం నాకు దొరకలేదు. ఉత్త చేతులు ఊపుకుంటూ పోయి చావడం కన్నా చివరి ప్రయత్నంగా నిన్ను పంపడమే మేలు గదా.. ఏం కావాలో చెప్పు సమకూరుస్తా.. నన్ను కాపాడితే నీ ఇంటి నిండా లక్ష్మీదేవితో వెలుగులు నింపుతా” అన్నాడు.
దానికి ఆ పశువుల కాపరి “అయ్యా.. మీరు ధరించే ఖరీదైన బట్టలు నాకు ఇప్పించండి. అలాగే మీ గుర్రం, సేవకులను కూడా నాకు తోడు పంపించండి” అన్నాడు. ధనవంతుడు ‘సరే’ అన్నాడు. తర్వాతరోజు ఆ పశువుల కాపరి అచ్చం ధనవంతుని లాగానే పట్టుబట్టలు, తలపాగా ధరించి.. సేవకులను వెంటబెట్టుకొని.. గుర్రం మీద రాజభవనానికి చేరుకున్నాడు. రాజు ఆ నగల వర్తకుణ్ణి అంతకుముందు ఒక్కసారి మాత్రమే చూసి ఉండడం వల్ల గుర్తుపట్టలేకపోయాడు.
“మహారాజా మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధం” అన్నాడు నగలవర్తకుని వేషంలో ఉన్న పశువుల కాపరి వినయంగా నమస్కరించి.
రాజు మొదటి ప్రశ్న అడిగాడు.
“నా విలువ ఎంతో సరిగ్గా ఒక్క కానీ కూడా తేడా లేకుండా చెప్పు” అన్నాడు.
దానికి ఆ పశువుల కాపరి “మహారాజా.. మన రాజ్యంలో ఎన్నో నాణాలు చలామణిలో ఉన్నాయి. అన్నిటికన్నా చిన్నది ‘కానీ’ అయితే అన్నిటికన్నా పెద్దది ‘బంగారు వరహా’. రాజ్యంలో ఉండే ఈ నాణాలలో వేటిపైనా మీ పేరు గానీ, బొమ్మ గానీ లేదు. ఒక్క బంగారు వరహా మీద తప్ప. కాబట్టి మీ విలువ ఒక బంగారు వరహా. ఎందుకంటే దాన్ని మించి విలువైనది ఈ రాజ్యంలో మరొకటి లేదు” అన్నాడు. ఆ సమాధానం రాజుకు ఎంతో నచ్చింది. సభలో ఉన్న జనాలు కూడా సంబరంగా చప్పట్లు కొట్టారు.
రాజు మొహంలో కొంచెం కోపం తగ్గి ప్రశాంతంగా తయారయింది. “సరే.. ఇక రెండో ప్రశ్న విను” అంటూ “ఈ ప్రపంచమంతా తిరిగి రావడానికి నాకు ఎంత సమయం పడుతుంది” అన్నాడు.
దానికి ఆ పశువుల కాపరి “మహారాజా.. మీరు గనుక ఉదయమే సూర్యునితో పాటు నిద్ర లేచి, అంతే వేగంగా, ఎక్కడా ఆగకుండా అలసిపోకుండా వెళ్లగలిగితే 24 గంటల్లో ఈ లోకమంతా చుట్టి రాగలరు” అన్నాడు.
ఆ చక్కని జవాబు విని మహారాజు ఆశ్చర్యపోయాడు. మొహంలో కోపం పూర్తిగా తొలగిపోయి పెదాలపై చిరునవ్వు వచ్చి చేరింది. “శభాష్ నగల వర్తకుడా.. సమాధానం భలే సరదాగా అద్భుతంగా ఉంది” అంటూ ఆనందంతో చప్పట్లు కొట్టి “సరే ఇక చివరి ప్రశ్న. దీనికి సరైన సమాధానం చెబితే నీకు ఉరిశిక్ష రద్దు చేయడంతో పాటు మంచి బహుమతి కూడా ఇస్తాను” అంటూ “ఇప్పుడు ఈ క్షణంలో నా మనసులో ఏమి అనుకుంటున్నానో సరిగ్గా ఊహించి చెప్పు” అన్నాడు.
దానికి ఆ పశువుల కాపరి చిరునవ్వు నవ్వి “మహారాజా.. ఇప్పుడు ఈ క్షణంలో మీరు నన్ను నగల వర్తకుడు అనుకుంటూ ఉన్నారు. కానీ నేను మీరు అనుకుంటున్నట్టు నగలవర్తకుణ్ణి కాదు. అతని సేవకుణ్ణి మాత్రమే. నా యజమానిని కాపాడమని వేడుకోవడం కోసం అతని వేషంలో వచ్చాను” అంటూ తన వేషం తీసి రాజు కాళ్ళముందు పెట్టి నమస్కరించాడు.
అది చూసి రాజుతో పాటు సభలోని వాళ్ళంతా ఆశ్చర్యపోయి సంబరంగా చప్పట్లు కొట్టారు. రాజు ఆ పశువుల కాపరి తెలివితేటలకు మెచ్చుకొని అతని యజమానికి ఉరిశిక్ష రద్దు చేయడంతో పాటు ఎంతో విలువైన కానుకలు ఇచ్చి పంపించాడు.
వృత్తి రీత్యా తెలుగు ఉపాధ్యాయులైన డా. ఎం. హరికిషన్ ప్రసిద్ధ బాలసాహితీవేత్త. 19 మే 1972 నాడు ప్రస్తుత నంద్యాల జిల్లా లోని పాణ్యంలో జన్మించారు. ఎస్.కృష్ణవేణమ్మ, ఎం. హుసేనయ్య తల్లిదండ్రులు. పెరిగినది, చదివినది, ఉంటున్నది, ఉండబోతున్నది – కర్నూలు నగరం. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు.
బాలసాహితీ రత్న (2011), అజో విభొ కందాళం విశిష్ట బాలసాహితీ రచనా పురస్కారం (2023), తెలుగు బంధువు పురస్కారం 2023, రాష్ట్ర ప్రభుత్వ గిడుగు భాషా పురస్కారం 2023, మంగాదేవి బాలసాహిత్య పురస్కారం 2024, చిన్న బుచ్చి నాయుడు స్మారక పురస్కారం 2025, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం – 2025 వంటి పురస్కారాలు లభించాయి.
సెల్ నంబర్: 94410 32212