Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పరిశుద్ధ భక్తుడు

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘పరిశుద్ధ భక్తుడు’ అనే రచనని అందిస్తున్నాము.]

భగవద్గీత 12వ అధ్యాయం( భక్తి యోగం) లోని 17వ శ్లోకం ఈ విధంగా వుంది:

యో న హృష్యతి న ద్వేష్టి, న శోచతి న కాంక్షతి।
శుభాశుభపరిత్యాగీ,భక్తిమాన్యః (స్) స మే ప్రియః॥

ఓ అర్జునా, ఏ మానవుడైతే సంతోషకర పరిస్థితులలో ఉప్పొంగుట, ప్రతికూల పరిస్థితులలో దుఃఖించుట, ఎటువంటి సమయంలోనైనా శోకించడం లేదా దేనినైనా కలలో కూడా వాంఛించడం తెలియనివాడు, శుభాశుభములను రెండింటినీ సమానంగా త్యాగం చేసేవాడు, దేనియందు ద్వేషము లేనివాడు, సుఖదుఃఖాలకు ఒకే రీతిగా స్పందించువాడు, శుభాశుభకర్మల ఫలితాలను త్యజించిన వాడు, దేనినీ ఆశించని వాడు నా ప్రియభక్తుడు అని పై శ్లోకం యొక్క భావం.

భగవంతుడు అర్జునుడిని నిమిత్తం చేసుకొని తనకు ఎటువంటి భక్తుడు మిక్కిలి ఇష్టుడో పై శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు.

భగవంతునికి ఇష్టమైన ప్రియ భక్తులు లౌకిక సుఖముల పట్ల ఆనందించరు లేదా ప్రాపంచిక దుఃఖాల పట్ల నిరాశ చెందరు. ఉదాహరణకు మనం చీకటిలో ఉన్నప్పుడు ఎవరైనా దీపము చూపించి సహాయం చేస్తే, సహజంగానే మనం ఆనందిస్తాము. కాని ఎవరైనా అదే దీపాన్ని ఆర్పేస్తే మనము ఆందోళన చెందుతాము. చీకటిలో మనకు ఎలాంటి ఆపద సంభవిస్తుందోనని భయపడతాము. అదే మనకు మధ్యాహ్న సూర్యుని వెలుగులో ఉన్నప్పుడు, ఎవరైనా దీపము చూపించినా లేదా ఆర్పినా మనకు ఏమీ తేడా తెలియదు. ఎందుకంటే అనుపమానమైన సూర్యకాంతి ముందు దీపపు కాంతి అత్యంత అల్పంగా అనిపిస్తుంది. అదే విధముగా, భగవంతుని యొక్క భక్తులు, భగవానుని యొక్క దివ్య ప్రేమలో సంతుష్టి చెంది, ప్రాపంచిక ఆనందానికి, నిరాశకీ అతీతముగా ఎదుగుతారు. భగవంతుని కృప ముందు ఈ లౌకిక, భౌతిక కష్టనష్టాలు అల్పాలని వారికి అనిపిస్తాయి. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్లు, ఈ సృష్టిలో ఆ సృష్టికర్త అనుజ్ఞ లేనిదే ఏ ఒక్క అతి చిన్న సంఘటన కూడా జరగదు. ఇచ్చేది, తీసుకునేది, అనుభవించేది, అనుభవింపజేసేది అంతా ఆ భగవంతుడే అన్న పరిపూర్ణ జ్ఞానం కలిగిన భక్తులు అనుక్షణం తమ మనస్సును ఆ భగవంతుని పాదారవిందారముల యందే కేంద్రీకరించి వుంచుతారు. భగవంతుడు తప్పితే మిగిలిన ఏ యొక్క విషయం వారికి అంటదు.

శుద్ధ భక్తుడైన వాడు విషయపరంగా లాభనష్టాల యందు హర్షశోకాలను అనుభవించడు మరియు ప్రదర్శించడు. తనకు మిక్కిలి ఇష్టమైనది భగవంతుని యందు అనురక్తి కలిగి వుండడమే. భగవంతుని నోరారా కీర్తించలేని సందర్భంలో మాత్రమే అతను బాధపడతాడు. లౌకికంగా సంభవించే అటువంటి ఏ నష్టానికైనా అతడి కించిత్తు కూడా బాధపడడు. భగవంతుని అనుభవించడానికి, ఆయన అనుపలభ్యమైన కృపను పొందడానికి తన సర్వ శక్తులు ఒడ్డి కృషి చేసాడు. అతని భక్తి నిర్వహణలో ఎలాంటి అవరాధాలు వచ్చి యోధుడై యుద్ధం చేస్తాడు.

పరిశుద్ధ భక్తుడి మనస్సులో ఒక శాంతమైన, దివ్యమైన వ్యక్తిత్వం వుంటుంది. ఆయన భగవంతుని పట్ల అపారమైన ప్రేమతో, స్వార్థరహితంగా జీవిస్తాడు. లోకసుఖాలు, అనుభవాలు అతనికి తాత్కాలికంగా మాత్రమే కనిపిస్తాయి. ఆయన మనస్సు ఎప్పుడూ భగవంతుని ధ్యానంలోనే లీనమై ఉంటుంది. ఇతరుల పట్ల కరుణతో, ద్వేషరహితంగా, సమభావంతో ప్రవర్తిస్తాడు. తన జీవితాన్ని సేవగా, ప్రార్థనగా, ప్రేమగా మలుచుకుంటాడు – అందుకే ఆయన జీవితమే ఒక జీవితం పాఠశాలలా మారుతుంది.

నారద భక్తి సూత్రాలలో 5వ సూత్రం ఈ భగవంతునికి ఇష్టులైన భక్తుల గురించి ఈ విధంగా పేర్కొంటోంది: “భగవంతుని పట్ల దివ్య ప్రేమను పొందిన తరువాత, భక్తుల మనస్సు లోకవిషయాల పట్ల ఆసక్తిని కోల్పోతుంది. ఆనందమయమైన వస్తువులు వారిని ఆకర్షించవు, వాటిని కోల్పోయిన వేళ బాధ అనిపించదు. తమకు హాని చేసే వారిపై వారు ద్వేషాన్ని కలగనివ్వరు. భౌతిక సుఖాల పట్ల వారికి కోరిక ఉండదు; సామాజికంగా పై స్థాయికి ఎదగాలనే తపన వారికి కనిపించదు. ఎందుకంటే, వారు భగవంతుని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు – ఆ పరమానందంతో పోలిస్తే లోకసుఖాలన్నీ అత్యల్పంగా అనిపిస్తాయి.”

Exit mobile version