మనిషిని మనిషి మనసుతో పలకరించుడే
మహా ఔషధం
సానుభూతితో కాదు
సహానుభూతిచే స్నేహిస్తే చాలు
అన్ని బాధలూ, సకల వ్యాధులు కడు దూరం
అనారోగ్యం చెలిమిలో తిరుగాడే మనిషి
చికిత్స అనంతర కాలంలో రూపాంతమైన ఋషి
విశ్రాంతి పర్ణశాలలోనే మనిషికి స్వస్థత
మనిషంటే
కనబడే శరీరమే కాదు
కనిపించని గేహం కూడా మిత్రమా!
ప్రేమ పొంగే పరామర్శలో
స్నేహం కట్టలు తెంచుకుంటుంది
మనసు ఉల్లాసం నొంద
ఉద్వేగం, ఉద్రేకం శూన్యత చేరుతుంది
పరుషములన్నీ సరళములుగా మారిన
మాటా మంతీ గుండె గొంతుకే
తవ్విపోసుకున్న బతుకులో
పరామర్శ
ఓ దీప స్తంభపు వెలుగు
మరో కదిలే మైలురాయి
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.