ఎందుకో మా వూరు వెళ్ళాలనిపించడం లేదు.
ఆ మనుషులని కలవాలనిపించడం లేదు.
ఊర్లో అడుగుపెట్టగానే వినిపించే ఆత్మీయ పలకరింపులు
రచ్చబండల దగ్గర క్షేమ సమాచారాలు కరువైపోయాయి.
మనసుల మధ్య అంతరాలు, అహంభావాలు పెరిగిపోయాయి.
బళ్ళు ఓడలై, పెద్ద పెద్ద మేడలై
నడమంత్రపు సిరికి నిలయాలై
బంధాల మధ్య అడ్డుగోడలై
అపహాస్యం చేస్తున్నాయి.
భూదందాలు, గూండాగిరీలు, సెటిల్మెంట్లు
గిరి గిరి వ్యాపారాలు ఎక్కువైపోయాయి.
పీడించుకు తినడమే పెద్ద వ్యాపకమై
ధన వ్యామోహమే ఏకైక వ్యాపారమై
దర్జా వెలగబెడుతున్నాయి!
పెద్దరికాలు, వావి వరుసలు మాయమైపోయాయి
ఉమ్మడి కుటుంబాలు ఛిన్నాభిన్నమై
అనురాగ బంధాలు ఛిద్రమై
అనాదరణకు చిహ్నాలై నిలిచాయి.
ఎక్కడ చూసినా –
రాజకీయ రచ్చలూ, వైషమ్యాల చిచ్చులూ రగులుతున్నాయి.
కోడి పందాలు కుల విద్వేషాలై
ఎడ్ల పందాలు ప్రాంత విభేదాలై
మనుషుల రక్తం కళ్ళ జూస్తున్నాయి.
నా ఊరి రహదారులన్నీ మురికి కూపాలయ్యాయి.
ఊరివాళ్ళ మనసులన్నీ గబ్బు కంపు కొడ్తున్నాయి
అందుకే –
మా ఊరు వెళ్ళాలనిపించడం లేదు.
ఆ మనుషులను చూడాలనిపించడం లేదు.
సాదనాల వేంకట స్వామి నాయుడు ప్రముఖ సినీ గేయ కవి, నటుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో బంగారు ‘నంది’ని బహుమతిగా అందుకున్నారు.
- భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ నుంచి వచన కవితకు జాతీయస్థాయి బహుమతిని 1994లో స్వీకరించారు.
- తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘కృష్ణాపత్రిక సాహిత్య సేవ’ లఘు సిద్ధాంత వ్యాసానికి బంగారు పతకాన్ని 1991లో అందుకున్నారు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు.
- 1989లో జీసీస్ క్లబ్ ‘అవుట్స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డు’, 1990లో ‘రోటరీ లిటరరీ అవార్డు’ లను పొందారు.
- దృశ్య కవితా సంపుటికి రెండు రాష్ట్రస్థాయి పురస్కారాలను అందుకున్నారు.
- ఆకాశవాణి ‘సుగమ్ సంగీత్’ జాతీయ కార్యక్రమంలో రెండు సార్లు సాదనాల రాసిన లలిత గీతాలు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమయ్యాయి.
- దక్షిణమధ్య రైల్వే నుంచి ఉత్తమ ఉద్యోగిగా సీనియర్ డి.పి.వో, డి.ఆర్.ఎం, సి.పి.వోల నుంచి పలుమార్లు అవార్డులను అందుకున్నారు.
- నాయుడు బావ పాటలు ‘గేయసంపుటి’ ‘పూలాచావ్లా’ పేరుతో ఒరియాలో సంపుటిగా ప్రచురింతమయ్యింది. ఆంగ్లభాషలోకి అనువదింపబడింది.
- తెలుగులో నాలుగు గ్రంథాలను ప్రచురించారు.
- రేడియో, టీ.వి, సినిమా, ఆడియో కేసట్లకు అనేక గీతాలు రాశారు.