[శ్రీ అవధానుల మణిబాబు రచించిన ‘ఒక ఆగమన దృశ్యం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
మూడున్నర కిలోల గులాబీ పువ్వును
మురిపెంగా గుండెలకు హత్తుకున్నదామె.
అది – అయిదు రోజుల క్రితం అర్థరాత్రి వేళ
తనకు అమ్మమ్మగా పదోన్నతినిచ్చిన ఆర్డర్ కాపీ.
ఎగిరి గంతేయాలన్న సంబరాన్ని
ఎత్తుకున్న బాధ్యత అడ్డుకుంటుంటే
నెమ్మదిగా నడుస్తూనే
అమ్మై ఇంటికోస్తోన్న
అమ్మాయివైపు చూస్తోంది.
***
ఊతం లేకుండా నడిస్తే కాలు తడబడుతోంది
పలకరింతలకు బదులివ్వాలంటే
నోరు పొడిబారిపోతోంది.
ఐనా, కన్నుల్లో గర్వరేఖ
పళ్ళెంలో హారతితో పోటీ పడుతోంది.
గడపలో అడుగుపెడుతూ
నాన్నేడీ? అని చెల్లెలిని అడిగింది.
***
ఆరు నెలలుగా పిలిచిన వెంటనే పలికిన
ఆటో అబ్బాయికి మరీ మరీ థాంక్స్ చెప్పి
సంచులు దింపి, డబ్బిచ్చి పంపి
అదనపు బాధ్యతలు స్వీకరించిన అధికారిలా
హడావిడిగా మరో జాబితాతో బజారుకి బయలుదేరుతూ
ఓసారి కిటికీలోంచి వసారాలోకి చూశాడు
***
ఇప్పటి దాకా స్పిరిట్ వాసన తప్ప తెలియదేమో!
వెల్లుల్లి బీరకాయ్ గానుగ నూనెలో మగ్గుతుంటే
పాతచీరల బుజ్జిబొంతలో
కొత్త శిశువు కమ్మగా నిద్రపోతోంది.
అవధానుల మణిబాబు కవి, విశ్లేషకులు, వ్యాసకర్త.
1982 జనవరి 29న పుట్టిన మణిబాబు ఎమ్మెస్సీ (రసాయన శాస్త్రం), బి.ఇడి., పూర్తి చేశారు. 2004 నుంచీ రహదారులు మరియు భవనముల శాఖలో పనిచేస్తున్నారు. కాకినాడలో నివాసం.
బాటే తన బ్రతుకంతా.. (కవితా సంపుటి, 2013), అన్నవి.. అనుకొన్నవి.. (సాహిత్య వ్యాసాలు, 2015), అందినంత చందమామ (డా. ఆవంత్స సోమసుందర్ సాహిత్యంపై సమీక్షా వ్యాసాల సంపుటి, 2016), స్ఫురణ.. స్మరణ.. (సాహిత్య వ్యాసాలు, 2017), నాన్న.. పాప.. (కవితా సంపుటి, 2018), నేనిలా.. తానలా.. (దీర్ఘ కవిత, 2019), పరమమ్ (మధునాపంతుల పరమయ్యగారి సాహిత్యజీవితంపై దీర్ఘవ్యాసం, 2020), లోనారసి (సాహిత్య వ్యాసాలు, 2022), నింగికి దూరంగా… నేలకు దగ్గరగా (కవితా సంపుటి, 2023) వంటి పుస్తకాలు ప్రచురించారు. ‘మధుశ్రీలు చదివాకా’ వీరి తాజా పుస్తకం.
సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ (పిఠాపురం) పురస్కారం, అద్దేపల్లి రామ్మోహనరావు కవితా పురస్కారం (విజయవాడ), సోమనాథ కళాపీఠం (పాలకుర్తి, తెలంగాణ) పురస్కారం, డా. ఎన్. రామచంద్ర జాతీయ విమర్శ పురస్కారం (ప్రొద్దుటూరు), దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం (బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్), ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ – విశిష్ట సాహిత్య పురస్కారం (2024) అందుకున్నారు.