[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘నిప్పుల సెలయేరులో మంచుపల్లకి!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆ సాయం సంధ్య మసక బారిన వేళ..
వెన్నెల వెలుగులతో
రేయి తళతళా మెరిసిపోతుంటే
గులాబీలా విరబూసిన నీ మేను
నా కౌగిలి స్వర్గంలో సేద దీరుతోంది!
ఆ నిశ్శబ్ద కలయికతో
నా ఎద లోయల నుండి
ఓ సౌందర్య శీతల ప్రభావం జాగృతమై
అగ్నిధార లొలికిస్తున్న వర్షంలా..
నీ హృదయాన్ని ముంచెత్తుతోంది ప్రేయసీ!
నిండు పున్నమి రేయి
నిలకడగా ప్రవహిస్తోన్న
సెలయేరు లాంటి నీ నగుమోము..
రసోజ్వల భావనా వీచికలకు నిలయమై
నిండుగా అలరారుతున్న నీ కురులు..
నా ప్రియమైన కవితా గీతికల కన్నా
అత్యంత సుందరంగా కనిపిస్తున్నాయి!
నా ముఖిబింబంపై వాలిన
నీ కనురెప్పల సౌందర్యంతో..
నును సిగ్గులతో తలదించుకొని
నా హృదయ సౌందర్యాన్ని వీక్షిస్తోన్న
ఓ అప్సరసే కనిపించి
నా కన్నులకు విందు చేస్తోంది.
ఆ రేయి వెన్నెల వర్షంలో
చల్లగాలులు వీస్తున్నా.. తనువంతా అగ్గి రాజుకుంది!
ఈ అందమైన అగ్నిని ఎదలో పొదుగుకొని
పుష్పమయమైన పాన్పుపై
మన సంయోగపు రేయిని
హాయిగా అనుభూతించి
యవ్వన మధురిమను ఆస్వాదిద్దాం!
అయితే..
ఇక్కడ నీకో షరతు సుమా!
నువ్వు మళ్ళీ మునుపటిలా
మాయమైపోయి..
కలకాలం నిలిచివుండే
ఈ ఆనందానుభూతిని
భ్రమగా.. కలగా మార్చి
నన్ను విషాద సాగరంలో
ముంచెయ్యకు ప్రియ సఖీ!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.