[బాలబాలికల కోసం ‘నిలువు గాడిద’ అనే చిన్న కథని అందిస్తున్నారు డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.]
సాయంత్రం తల్లి, పిల్ల రామచిలుకలు కోతి చెట్టు దగ్గరకు వచ్చాయి. కోతి కనిపించకపోవడంతో అక్కడ ఉన్న కుందేలును చూసిన పిల్ల చిలుక “కుందేలు మామా ఏడి మీ నిలువు గాడిద అల్లుడు?” అన్నది.
అప్పుడే పొదల మాటు నుండి వెలుపలకు వచ్చిన కోతి “మామా అందరు అడ్డగాడిద కదా అంటారు ఈ తిక్కల చిట్టి చిలుక ఏమిటి కొత్తగా నిలువు గాడిదా అంటుంది?” అన్నాడు.
“నాబిడ్డ ఆట, పాట, మాటా అంతా వెత్యాసమే” అన్నది తల్లిచిలుక.
“సరే ఇప్పపుడు మీరు ఎందుకు వచ్చారు?” అన్నాడు కుందేలు.
“మా అమ్మయికి కథ చెపుతాను అన్నావట కదా, అందుకు వచ్చాం. మంచి కథ చెప్పు” అన్నది తల్లి చిలుక.
“సరే ఈ రోజు మీకు చెట్ల వలన సమస్త ప్రాణకోటికి కలిగే ప్రయోజనం తెలియజేస్తాను. పర్యావరణ పరిరక్షణ అంటే మనల్ని మనం రక్షించుకోవడమే. నేడు మనం యింత ఎండలను భరిస్తున్నాము అంటే అది మన స్వయంకృత అపరాధం. విచక్షణారహితంగా చెట్లు నరకటం వలన ఈ పరిస్ధితి ఏర్పడింది. మనం నివసించే భూమిపై మూడు వంతులు చెట్లు ఉండేలా చూసుకోవాలి. అలా ఉంటేనే సకల ప్రాణకోటికి క్షేమం. లేదంటే అంతా క్షామం. మనిషి తన అవసరాలకు చెట్లను కొట్టడం వలన ప్రకృతి సమతుల్యత సన్నగిల్లింది.
మనిషి ఒక రోజుకు 12 నుండి 15 కిలోల గాలిని (ప్రాణవాయువును) శ్వాసిస్తాడు అనుకుంటే, ప్రతిమనిషి ఒక రోజుకు మూడు ఆక్సిజన్ సిలిండర్లు అవసరం ఐతే, ఒక ఆక్సిజన్ సిలిండర్ వెల 700/- మూడు సిలెండర్ల వెల 2100/- అవుతుంది. అంటే, ప్రతి సంవత్సరం ఆక్సిజన్ కొనాలి అంటే 7,66,000/- ఖర్చు అవుతుంది. మనిషి సగటు ఆయుష్షు 65 సంవత్సరాలు అనుకుంటే అతను ఆక్సిజన్ కొనడానికి దాదాపు 5 కోట్ల రూపాయలు కావాలి. మనకు చెట్ల వలన ప్రాణవాయువు ఉచితంగా లభిస్తుంది. యిలా మనకు ప్రాణదాతలైన చెట్లను మనం ప్రాణప్రదంగా పెంచాలి. చెట్టు పుట్టుక దాదాపు 41 కోట్ల 50 లక్షల సంవత్సరాలకు పూర్వం జరిగింది. భూమండలంపై రమారమి 4,25,000 రకాల చెట్లు ఉన్నాయి.
నేడు ప్రపంచం అంతటా నిమిషానికి 500ల ఎకరాల అడవి కోల్పోతున్నాం, అడవులు నరకడం ద్వారా కాని, అగ్నిప్రమాదాల వలన యిది జరుగుతుంది. ఈ భూభాగంపై 33శాతం అడవి ఉండాలనే నిభంధన ప్రపంచం అంతటా ఉంది. యిలా అడవులు నరకడం వలన వన్యప్రాణుల జీవనం కష్టతరంగా మారింది. ప్రకృతిసిధ్ధంగా ఒక అంగుళం మెత్తటి సారవంతమైన నేల రూపొందడానికి 300 నుండి 1000 ఏళ్ళు పడుతుంది. భారతదేశంలో ఏడాదికి 600 కోట్ల టన్నుల సారవంతమైన మట్టి సముద్రం పాలు అవుతుంది. దీన్ని నివారించగలిగితే పంటలు దిగుబడి అధికం అవుతుంది. మనదేశంలో ఏటా దాదాపు 15 లక్షల హెక్టార్ల అడవి నాశనం అవుతుంది. నేడు 33శాతం ఉండవలసిన అడవుల శాతం 17 శాతానికి దిగిపోయింది అంటే మానవాళికి ఎంతటి ముప్పు పొంచి ఉందో ఊహించండి. ఈ కారణంగా భూమిపై ఎడారి శాతం వేగంగా పెరుగుతుంది. పూర్తిగా ఎదిగిన చెట్టు ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని మనకు ఎన్నో లక్షల లాభాన్ని చేకూరుస్తుంది. ఒక చెట్టు సగటున 1500కు పైగా విభిన్న జాతులకు చెందిన పక్షులకు, కీటకాలు, సరీసృపాలు, పరాన్నజీవులు, క్షీరదాలు తదితరాదులకు జీవనాధారంగా నిలుస్తుంది. ఒక చెట్టు తన 55 ఏళ్ళ జీవిత కాలంలో 5.3 లక్షల విలువైన ప్రాణవాయువు అందిస్తుంది. 6.4 లక్షల విలువైన భూసారాన్ని కాపాడుతుంది. 10.5 లక్షల విలువైలన గాలిని శుభ్రపరుస్తుంది. 5.5 లక్షల విలువైన పండ్లు, పూలు అందివ్వడమే కాకుండా పకృతి సమతుల్యతను కాపాడుతూ వాతావరణాన్ని తన పరిసరాలను అహ్లదపరుస్తుంది. వర్షం కురిసే సమయంలో చెట్టు గాలి లోని తేమను నియంత్రిస్తుంది. ఇలా చివరకు చెట్టు వంటచెరకుగానో కలపగానో మనకు వినియోగపడుతుంది. చెట్టు పైభాగమే కాకుండా దాని వేర్లు భూమి లోనికి చొచ్చుకువెళ్ళి నేలకోతను అరికడతాయి. అలా భూమిలో సారత్వ పరిరక్షణ ఏర్పడుతుంది. చెట్లు పెంచడం ద్వారా పండ్లు, కూరగాయలు, తేనె, గింజలు, ఔషదాలు, లక్క, జిగురు, కుంకుళ్ళు వంటి వాటిని మనం పొందవచ్చు. సకాలంలో వర్షలు పడటానికి చెట్లు ఎంతో వినియోగపడతాయి. అలా సరైన సమయంలో వర్షాలు పడితే పంటలు బాగా పండి ప్రజలు అందరు సుఖంగా ఉంటారు. పల్లెల్లో పాడిపంటలు బాగుంటే పల్లె ప్రజలు పట్నాలకు తరలిపోరు. యిలా ఎన్నో లాభాలు చెట్లు పెంచడం వలన ఉన్నాయి. మనిషి ఆర్ధికతను ఓ విధంగా చెట్లే నిర్ణయిస్తాయి. సుడిగాలి మొదలు సునామిల వరకు వచ్చే ఆపదలను నివారించే శక్తి చెట్లకు మాత్రమే ఉంది. రేపటి తరం భావిపౌరులుగా రాబోయే ప్రమాదాన్ని నివారించే శక్తి మీ చేతుల్లో ఉంది. చక్కటి ఆరోగ్యకరమైన అహ్లదకర వాతావరణం ప్రకృతి మనకు ప్రసాదించింది. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అవసరం నేడు మన అందరిపైన ఉంది. కనుక అందరూ వీలైనన్ని చెట్లు నాటి చక్కగా వాటికి మన స్వాతంత్యసమర యోధుల పేర్లో లేక మీ పెద్దల, మిత్రుల, మీకు యిష్టమైన వారి పేర్లు పెట్టి పెంచండి. ఎవరైనా చెట్లు నరుకుతుంటే వారికి చెట్ల విలువ తెలియజేయండి. మన ఇంట జరిగే ప్రతి కార్యక్రమానికి ఓచెట్టు నాటి పెంచి, భవిష్యత్తులో మన బిడ్డలు ఆఫలాలు ఆరగించేలా చేయండి. నాడు-నేడు-ఏనాడు చెట్లు మన ప్రాణదాతలే అని మరువద్దు” నేడు దేశ భవిష్యత్తు మీరు తీసుకునే నిర్ణయంపై ఆధార పడి ఉంది.” అన్నాడు కుందేలు.
“అలాగే కుందేలు మామా ఇంటింటా మొక్క-ఊరూర వనం తప్పక ఉండేలా మా వంతుగా ప్రకృతి పరిరక్షణకు నిలబడతాం. చెట్లను విరివిగా పెంచేలా, భవిష్యత్తులో నీరు, ప్రాణవాయువు కొరత రాకుండా మేము అందరికి తెలియజేస్తాం” అన్నది రామచిలుక.
రచనలతో పాటు సంఘసేవకుడిగా ప్రసిద్ధిచెందిన బెల్లంకొండ నాగేశ్వరరావు 12-05-1954 నాడు గుంటూరులో జన్మించారు. వీరి నాలుగు వందలకు పైగా రచనలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. రాష్ట్రేతర బాలసాహితీవేత్తగా జాతీయస్థాయి గుర్తింపు పొందిన నాగేశ్వరరావుకి రావూరి భరధ్వాజ స్మారక తొలి పురస్కారం లభించింది. చెన్నైలో తెలుగులో చదివే బాలబాలికలకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు.