[శ్రీ చేకూరి రామలింగరాజు రచించిన ‘నిజం కాళ్ళ మనిషి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆ పార్కు స్థలానికి తప్పుడు సర్వే నెంబరు వేసి రిపోర్టు ఇవ్వడానికి రెవెన్యూ డిపార్టుమెంటు వాళ్ళనూ, రిజిస్ట్రేషన్ చెయ్యడానికి రిజిస్ట్రారునూ ఒప్పించాడు చక్రధర్. ఐదు వందల గజాల స్థలం. గజం ఇరవైవేల వరకూ పలుకుతోంది. లే ఔట్ ఓనర్ ఐదు వేలిస్తే చాలన్నాడు. రిజిస్ట్రేషన్ కాగానే, అపార్ట్మెంట్ పర్మిషన్ తెచ్చి, మిగతా ప్లాట్ల వాళ్ళు తెరుకునేలోపు బిల్డింగ్ కట్టేసి ఓ పదిమందికి అమ్మేస్తే, తరవాత వాళ్ళూ వాళ్ళూ పడతారు. తన లాభం ఓ ఏభై లక్షలు ఉంటుందని లెక్కేసుకున్నాడు. ఆ ఆనందంలో ఆ డిపార్టుమెంటు వాళ్లను పిలిచి ఓ బార్ అండ్ రెస్టారెంటులో పార్టీ ఏర్పాటు చేశాడు.
“మాకు ఇవ్వాల్సింది రేపు క్యాష్లో అరేంజ్ చెయ్యండి చక్రధర్ గారూ!” మాటల్లో అన్నాడు రెవెన్యూ క్లర్కు.
“అలాగేనండి! రేపు ఫస్ట్ అవర్లో మీరు ఎక్కడ అందజేయమంటే అక్కడ అందజేస్తాను” బదులిచ్చాడు చక్రధర్.
రాత్రి పదకొండవడంతో బై చెప్పుకుని ఇళ్ళకు బయలుదేరారందరూ. చక్రధర్ కారు స్టార్టు చేసుకుని తన ఇంటి వైపు వెళుతున్నాడు. ఇంట్లో క్యాష్ ఉన్నట్లు లేదు. రేపు ఉదయం రెవెన్యూ వాళ్ళకు ఇవ్వడానికి ఏటీయం నుంచి డ్రా చేసి పెట్టుకుంటే మంచిది. తనుండే కాలనీకి దగ్గరలో మెయిన్ రోడ్లో ఉన్న ఏటియంలో డ్రా చెయ్యొచ్చు అనుకున్నాడు.
అర్ధరాత్రి కావస్తుండటంతో పెద్దగా జనసంచారం లేదు. ఏటీయం దగ్గరకు రాగానే కారు కాస్త ప్రక్కగా ఆపి, డ్యాష్ బోర్డులో ఓ కవరుంటే తీసుకుని దిగాడు. ఏటీయం దగ్గర బయట చిన్న అరుగుపై గోడకు చేరబడి కూర్చొని ఉన్నాడు సెక్యూరిటీ గార్డు. కారు ఆగడం గమనించినట్టున్నాడు కాస్త సర్దుకుని నిటారుగా కూర్చున్నాడు. చక్రధర్ ఏటియం వైపుకు వెళుతూ ప్రకృతి పిలుపు రావడంతో, అనువైన చోటు కోసం చుట్టూ చూసాడు. ఏటియంకు కాస్త అవతల చెట్టు క్రింద చీకటిగా ఉంటే అక్కడకి వెళ్ళిపోయడానికి ఉపక్రమిస్తుండగా
“సారూ! కొంచెం దూరంగా ఎల్లండి. అందరూ అక్కడే పోసేత్తన్నారు. వాసనతో రాత్రంతా ఉండలేక పోతన్నాను” చెప్పాడు సెక్యూరిటీ గార్డు. చుట్టూ చూసాడు చక్రధర్. చెట్టు కింద తప్ప అంతా వీధి లైట్ల వెలుగు ఉంది. ఈ చెట్టు ఓ ఖాళీ స్థలం ప్రక్కన ఉండటంలో అందరూ ఇక్కడ కానిస్తున్నారు అనుకుంటూ.
“అందరూ ఇక్కడే పోస్తున్నట్టున్నారు కదా! నువ్వు నాకొక్కడికే చెబితే ఏం లాభం. అందర్నీ మానిపించు అప్పుడు చూద్దాం” అని నవ్వేసి, మాట లెక్కచేయకుండా అక్కడే పనికానిచ్చి వచ్చేసాడు.
“అందరికీ చెబుతున్నాను సారూ! అందరూ మీరన్నట్టే అంటున్నారు. ఏం జేత్తం సారు!” అన్నాడు నిట్టూర్పుగా.
ఏటియం రూమ్ గ్లాస్ తలుపులు తోసుకుని లోపలికి వెళుతూ పరిశీలనగా చూసాడు అతని వైపు. పెద్ద వాడే. అరవై డబ్భై మధ్యనుండొచ్చు వయసు.
సన్నగా ఉండటం వలన సెక్యూరిటీ కంపెనీ డ్రెస్సు వదులుగా వేలాడుతోంది. రోజూ ఉదయాన ఆ రోడ్లో తను వాకింగ్కి వెళ్ళేటప్పుడు కనిపిస్తూ ఉంటాడు. ఆ పరిసరాల్ని చెత్తలేకుండా శుభ్రం చేస్తూ, రోడ్డు పక్క చిన్నవీ, ఎండిపోతున్న మొక్కలకు దగ్గరలోని కుళాయిలో నీళ్లు పట్టి పోస్తుంటాడు. అది చూసి తను అనుకుంటూ ఉంటాడు, అవన్నీ మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు కదా! ఈ ముసలోడికి ఎందుకో ఈ పురాకులు అని.
ఏటియం రూంలో మెషిన్ దగ్గరకు వెళ్ళి మొత్తం లక్ష రూపాయలు కావాలి అనుకుంటూ, తన కార్డుకు ఆ పరిమితి ఉండడంతో దాన్ని మెషిన్లో పెట్టి స్క్రీన్ మీద ప్రాంప్ట్ వచ్చాకా పిన్ ఎంటర్ చేశాడు. ఒకసారి నగదు ఇరవై వేలకు మించి రాదు కాబట్టి, ఇరవై వేలు ఎంటర్ చేసాడు. మెషీన్ దానిని ప్రాసెస్ చేసి ఎమౌంట్ వచ్చాకా దాన్ని లెక్కపెట్టుకుని మెషీన్పై ఉంచుకుని, మరో మారు కార్డు పెట్టి మళ్ళీ ఇరవేలు ఎంటర్ చేశాడు. మళ్ళీ మెషీన్ ప్రాసెస్ చేస్తున్న శబ్దం వస్తోంది. ఈలోపు వెనక, ఏదో శబ్దమవుతుంటే వెనుదిరిగి చూసాడు.
రూం బయట సెక్యూరిటీ గార్డు దోమల్ని కొట్టుకుంటున్నాడు. వచ్చిన ఎమౌంటు తీసుకుని మెషీన్ పై పెట్టుకుని మరోసారి మొత్తం ఎంటరు చేశాడు. అలా అయిదో ధఫాతో లక్షా పూర్తవడంతో లెక్క పెట్టుకుని కవర్ పెట్టుకుని బయటకు వస్తూ గార్డు వైపు చూసాడు. ముఖంలో ఏ భావం లేకుండా చుట్టూ పరిశీలిస్తున్నాడతడు. ఏదో చెప్పాలనుకుని వాడితో నాకు మాటలేంటి అనుకుని కారు వద్దకు వెళ్లి ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు.
ఇంటికి చేరాకా డబ్బు కవర్ని కబోర్డులో పెట్టి భార్య ఇచ్చిన మజ్జిగ తాగి నిద్రపోయాడు.
ఉదయం తొమ్మిది గంటలకే తయారయ్యాడు చక్రధర్. రెవెన్యూ క్లర్కుకు ఫోన్ చేశాడు, ఎక్కడ కలవాలో తెలుసుసుకుందామని. అతడు స్థలం చెబుతూ ఒక గంటలో కలుద్దామని చెప్పాడు. కబోర్డులోని డ్రాలో పెట్టిన డబ్బు కవరు తీసుకొని ఒక్కసారి డబ్బు సరిచూసుకుందామని తెరిచాడు. ఏమిటీ! ఇంత తక్కువగా ఉంది అనుకుంటూ లెక్క చూసుకున్నాడు. ఇరవై వేలు మాత్రమే ఉంది. గతుక్కుమన్నాడు. ఎక్కడ పారపాటు జరిగిందీ? అనుకుంటూ రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకోసాగాడు. అప్పుడు గుర్తొచ్చింది. తాను రాత్రి ఏటియంలో డ్రా చేసిన అమౌంట్లో మెషీన్ మీద పెట్టిన డబ్బు అక్కడే మరిచిపోయానన్న విషయం. ఆఖరి ఇరవై వేలు మాత్రం కవరులో పెట్టుకు వచ్చేసాడు.
కంగారు పుట్టింది. గబుక్కున లేచి బయలుదేరి “ఇప్పుడే వస్తాను” అంటూ చెప్పాడు భార్యకు, కారు తీసి బయటకు వెళుతూ. ఏటియం దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ క్యాష్ కోసం ఓ నలుగురు లైన్లో నిలబడి ఉన్నారు. సెక్యూరిటీ గార్డు కనిపించలేదు.డ్యూటీ ముగిసి వెళ్లి పోయినట్టున్నాడు.
“ఒక్క నిమిషం” లైన్లో ఉన్నవాళ్ళను రిక్వెస్ట్ చేసి ఏటియం రూమ్ లోకి వెళ్ళాడు. మెషీన్ పై చూస్తే అక్కడ ఏ డబ్బూ కనిపించక పోయేసరికి నిరాశకు గురయ్యాడు.. ఇప్పుడేం చెయ్యాలి?, బ్యాంకులో కంప్లయింటు ఇస్తే, వాళ్ళు ముందు పోలీసు కంప్లైంటు ఇవ్వమంటారు. ఆ డబ్బు తనకు ఓ అనామతు ఖాతా నుండి వచ్చింది. ఆ లెక్కలన్నీ అందరికీ చెపాల్సి వస్తే తన వ్యాపారంలో గుట్టుగా చేస్తున్న తప్పులు బయటపడతాయి. ఇక చేసేదేం లేదు అనుకుని ఉస్సురంటూ ఇంటికి చేరుకున్నాడు.
రెవెన్యూ వాళ్లకు ఇవ్వాల్సిన మొత్తాన్ని వేరే విధంగా ఏర్పాటు చేసుకుని పని పూర్తి చేసుకున్నాడు. ఆ సాయంత్రం ఇంటికి వస్తూ ఏటియం దగ్గర ఆ వైపు చూసుకుంటూ వెళుతుంటే సెక్యూరిటీ గార్డు కనిపించలేదు. ఇంటికి వెళ్ళి భోజనం అయింతర్వాత మరోసారి వచ్చినప్పటికీ ఇంకా రాలేదా సెక్యూరిటీ గార్డు. వీళ్ళ డ్యూటీ రాత్రి పదకొండు తర్వాత అనుకుంటాను మళ్లీ వద్దాం అనుకుని ఇంటికి వెళ్లి అలసటగా అనిపించడంతో త్వరగా నిద్రపోయాడు.
మరునాడు ఉదయాన్నే వాకింగుకు బయలుదేరాడు చక్రధర్. అప్పుడు కనిపించాడు సెక్యూరిటీ గార్డు. ఏటియం దగ్గర రోడ్డుకు ఇవతలి వైపు కొత్తగా నాటిన మొక్కలకు నీళ్ళు పోస్తున్నాడు. తనను చూడగానే “సారూ! మీ కోసవే చూత్తన్నాను రండి” అంటూ ఒకెట్ పక్కన పెట్టి, పరుగున ఏటియం రూమ్ లోకి వెళ్ళిన ఓ మూలన దాచిపెట్టిన పేపరు చుట్టిన పొట్లం ఒకటి తెచ్చి చేతికిచ్చాడు.
“మొన్న రాత్రి, మీరు వచ్చినరోజు, పొద్దున్నే నా డ్యూటీ అయిపోయాకా ఇంటికెళ్లే ముందు మిషను గదిలోకెళ్ళాను. మెషిను మింద డబ్బు కనిబడింది. ఆయాల నేను డ్యూటీకి ఒచ్చినప్పుడు లేదు. ఆ ఎనకాల ఒచ్చింది మీరొక్కరే సారు! తరవాత ఇంకెవరూ రాలేదు. మీదే అయ్యుంటుందని, ఇక్కడే కనపడతా ఉంటారు కదా! కనపడినప్పుడు ఇచ్చెయ్యొచ్చని జేగత్త పెట్టి మీకొసం చూత్తన్నాను” చెప్పాడు సెక్యూరిటీ గార్డు. ఆనందాశ్చర్యాలతో ఆ కవరు అందుకుని చూసుకున్నాడు. మొత్తం ఎనభైవేలూ ఉన్నాయందులో.
“ఈ డబ్బు ఎంతుందో చూసావా!” అడిగాడు చక్రధర్.
“సూళ్ళేదు సారు. నాకు లెక్కలు తెలీవు సారూ!”
ఆశ్చర్యపోతూ “నీ పేరేంటి పెద్దోడా!” అడిగాడు చక్రధర్.
“నర్సింహం సారూ!” చెప్పాడు.
“నర్సింహం! అంత డబ్బు కనబడితే ఎవడయినా – మొత్తం దాచేద్దామనే అనుకుంటాడు. కనీసం అంతా ఎందుకివ్వాలి, కొంతయినా అబద్ధం చెప్పాలని అనుకుంటారు ఈ రోజుల్లో.. నీకలా అనిపించలేదా!” అడిగాడు.
“అందరూ తప్పు సేత్తన్నారని మనవూ అలాసేత్తే ఇంక మంచెక్కడుంటంది సారూ!” అన్నాడు నర్శింహం చాలా మామూలుగా.
ఒక్క క్షణం మెదడు మేల్కొన్నట్లయింది చక్రదర్. కాసేపు రెప్ప వేయకుండా నర్సింహం వైపు చూస్తూ ఉండిపోయాడు.
ఎంత తేడా! ‘ఎంతసేపూ ఎవరి భూమి కబ్జా చేద్దాం!, ఏ విధంగా ప్రభుత్వాన్నో, జనాల్నో మోసం చేసి డబ్బు సంపాదించాలి అని ఆలోచించే తనలాంటి వాళ్లకూ, చదువు లేకున్నా మంచితనం, కష్టం నమ్ముకుని బ్రతికే నర్సింహం లాంటి వాళ్ళకూ..’ అనుకున్నాడు.
ఎదురుగా నర్సింహం బకెట్లోకి నింపుకుని మొక్కల వద్దకు వెళుతున్నాడు.
తన పని కాకపోయినా తను పనిచేసే పరిసరాలు శుభ్రంగా, అందంగా ఉండాలని శ్రమిస్తున్న అతడిని అద్భుతంగా చూస్తున్నాడు. గబుక్కున చేతిలోని డబ్బు ఈ పొట్లం జేబులో పెట్టుకుని పరుగున అతని దగ్గరకి వెళ్ళి బకెట్టు అందుకోబోయాడు.
“అయ్యో! మీకెందుకు సారూ! నేను పోస్తాను కదా!” అన్నాడు నర్సింహం వారిస్తూ.
“మంచి పనిలో నన్ను కూడా కాస్త పాలుపంచుకొనీ నర్సింహం” అన్నాడు చక్రధర్.
బకెట్ తీసుకుని మొక్కల వైపుకు వెళ్లి వాటికి నీళ్లు పోస్తూ ఉంటే ఈ వేకువ వెలుతురులో లేత చిగుళ్లు అందంగా మెరుస్తున్నాయి.
చేకూరి రామలింగరాజు గారి సొంత ఊరు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోనసీమ లోని కొమరగిరి గ్రామం. నివాసం కాకినాడ. బాల్యం గోదావరి లంక గ్రామంలో గడవటం వలన సహజమైన ప్రకృతి అందాలు మెదడులో ముద్రపడి తలుపుకు వచ్చినప్పుడల్లా తెలియని ఆనందం కలుగచేస్తాయి. ఆనాటి మనుషుల వ్యవహారాలు, మాటలు ఇప్పుడు అర్థమయ్యి అపురూపంగా తోస్తున్నాయి. ఇవి కథలుగా వ్రాసి మిత్రులలో సహానుభూతిని భావించి కలుగచేయగలనని వ్రాయడం మొదలు పెట్టారు.