కాకితో కబురంపితే నే రాలేనని తెలిసి
కలంలోంచి ఈ కవితగా ఇప్పుడే నే వచ్చేసా..
వీడని బంధమై నీ వెంట ఉండలేనని తెలిసి
నిను వీడని నీడనై నేనెప్పుడో వచ్చేసా..
పరుగు పరుగున పరుగులెత్తి నే రాలేనని తెలిసి
పదే పదే నువ్వు తీసే శ్వాసలో నేనెప్పుడో నిండి ఉన్నా..
నీ కన్నీటి వరదలకి నే కట్ట వేయలేనని తెలిసి
కనికట్టు చేసి నీ కంటి కాటుకలో నే కలిసున్నా..
తలపు తలచినంతనే నీ చెంత చేరలేనని తెలిసి
తలపు తలపుల మధ్య నీలోని నిశ్శబ్దమై నిలిచున్నా..
మరణమే నిను కబళించిన నే చూడలేనని తెలిసి
కాలంతో కాళ్ళ బేరమాడి వైతరిణి ఈవలి ఒడ్డున నే వేచి ఉన్నా..
విస్సాప్రగడ వేంకట కృష్ణ సాయి స్వస్థలం ఏలూరు. సర్ సి అర్ అర్ కాలేజ్ లో పట్టభద్రులై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కొద్ది కాలం పనిచేసి, 1997 లో అమెరికా వలస వెళ్లి బోస్టన్ పరిసర ప్రాంతంలో స్థిరపడ్డారు. వృత్తి రీత్యా సమాచార సాంకేతిక (IT) రంగంలో చాలా సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. కాలేజీ రోజుల నుంచి కవితా సాహిత్యం పై మక్కువ. ఏవో చిన్న చిన్న పద కవితలు వ్రాసుకుని బంధువర్గం తోను మిత్రుల తోను పంచుకుని సంతోషపడేవారు. ప్రముఖుల రచనలు చదవడం ఇష్టం. బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం మరియు న్యూ ఇంగ్లాండ్ షిరిడి సాయి పరివార్ దేవాలయంలో స్వచ్ఛంద స్వేచ్ఛా శ్రమదానం చేయడం ఇష్టపడతారు.