Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నీతిగా బతుకు

[బాలబాలికల కోసం ‘నీతిగా బతుకు’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

వీరయ్య చదువుకోలేదు. ఏ పని చెయ్యడం వాడికి చేతకాదు. అదిగాక కష్టపడి సంపాదించడం మీద వాడికి ఆసక్తి లేదు. అందుకే ఊరి బయట రహదారిలో ఒంటరిగా వచ్చే పోయేవారిని తన వద్ద ఉన్న కత్తితో బెదరిస్తూ వారిని దోచుకునే వాడు.

ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం తన పంచలో కత్తి పెట్టుకుని బాటసారుల్ని దోచుకునేందుకు బయలుదేరాడు. అప్పటికి వాడికి ఎవ్వరూ కనబడలేదు! కానీ కొంత సేపటికి ఒక పండు ముసలి అతను వాడికి ఎదురు వచ్చాడు. ఆ ముదుసలి చిరిగిన పంచ కట్టుకుని చిరిగిన బనీను వేసుకుని ఉన్నాడు. మొహం అతి దీనంగా ఉంది. అతడిని చూడగానే ఏమీలేని బీదవాడని అర్థం అవుతున్నది. అటువంటి మసలి బీదవాడి దగ్గర దోచుకునేందుకు ఏమి ఉంటుందని వీరయ్య ఆలోచించసాగాడు. మెల్లగా ఆ ముసలాయన వీరయ్య వద్దకు వచ్చి తన పంచలో మూటకట్టుకున్న రెండు బత్తాయిల్ని తీసి “నాయనా, పొద్దుటనుండి ఏమీ తినలేదు. నేను వీటి తొక్క తీయలేను. నీ దగ్గర ఉన్న కత్తితో ఈ పండ్ల తొక్క తీయి నీవు ఒక పండు తీసుకో” అని దీనంగా అడిగాడు.

వీరయ్య దొంగ అయినా ఆ వృద్ధుడి బీదతనం, అడిగిన తీరు వీరయ్య మనసు కదిలించింది.

“ఇటుతే” అని పండ్ల తొక్క వలిచి, “నీవే రెండు పండ్లు తిను.. అసలే నీవు పొద్దుటనుండి ఏమీ తినలేదు” అని పండ్లు ఇచ్చివేశాడు.

వీరయ్య ఆ వృద్ధుణ్ణి చూసి ఈ విధంగా ఆలోచించాడు – ఇన్ని రోజులు కత్తి చూపించి దొంగతనానికి పాల్పడినపుడు నగలు,డబ్బు పోగొట్టు కున్నవారిలో భయం, కళ్ళలో వీరయ్య మీద కోపం వాడికి కనబడి చేస్తున్న పని తప్పు అని తెలిసినా తన కుటుంబ పోషణ కోసం రహదారి దొంగగా మారాడు. మరి ఇప్పుడు ఒక బీద ముసలివాడికి పండ్లు ఒలిచి సహాయం చేయడం వలన ఒక అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. ఆ క్షణాన వాడికి కొంత జ్ఞానోదయం కలిగంది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగతనం మానివేసి అడవి పక్కనున్న పట్టణానికి వెళ్ళి ఏదో ఒక బరువులు ఎత్తే పని అయినా దక్కించుకుని నీతిగా బతకాలని నిర్ణయించుకున్నాడు.

చూశారా మనం మంచి చేస్తే మనకు తెలియకుండానే ఎదుటివారు కూడా మంచిగా మారవచ్చు, వారిలో కూడా మంచి చేయాలనే ఆలోచన రావచ్చు. అది మంచి పనిలో ఉన్న శక్తి!

Exit mobile version