[సత్యగౌరి మోగంటి గారు రచించిన ‘నీలో.. నేనై..!!’ అనే కవిత పాఠకులకి అందిస్తున్నాము.]
ఆకు నీడన చేరిన పువ్వులా,
నీ నీడన నేను –
గాలి తట్టినప్పుడల్లా
తెరిపె కోసం తొంగి చూసే పూవులా
నీ కోసమే చూస్తుంటా..!
నేల కురిసిన వాన –
భూమిలో ఇంకినట్టు,
నీలో ఇంకిపోయిన నేను
నవ్వులు చిందిస్తూ నువ్వు..!
నింగి నుండి రవి కిరణాలు
మెల మెల్లగా..
గరిక కొసల మీద,
ఉదయిస్తున్నట్టు –
నీ కనుల నిండా నేను..
ప్రతి కిరణ –
వర్ణాలద్దుతున్న అందం!
నీ కనులలో,
నా రూపు చూసిన –
మహాదానందం
మన మనసునద్దం పడుతూ
ప్రకృతి సౌందర్యం..!
ఎన్ని మెరుగులున్నా..
ఒదిగి ఉండాలని,
మౌనంగా ప్రేమను పంచాలని,
ప్రేమకు తలవొంచనిదేదీ లేదని,
మనం ప్రకృతి ఒడిలో..
ఒకరికొకరమై..
ఆ దైవం ఆధీనంలో ఉన్నామని
ప్రమాణంచేసుకుందామా..!!
కవయిత్రి సత్యగౌరి మోగంటి వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ఎమ్.ఎ; బి.ఎడ్, బి.ఎల్. చదువుకున్నారు. కాకినాడకు చెందిన వీరు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పదవీ విరమణ చేశారు. తెలుగు సాహిత్యం లోనూ, రచనావ్యాసంగంలోను అభిరుచి వున్న శ్రీమతి సత్యగౌరి, రేడియో ప్రసంగాలు, అడపాదడాపా వివిధ ప్రక్రియల్లో రచనా వ్యాసంగం చేస్తూ ప్రస్తుతం హైదరాబాదులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు.