ఉ(యు)గాది..!
తెలుగుజాతి తొలి పండుగ!!
విశాల విశ్వంలో
జాతి జనసమూహం ఎక్కడ ఉన్నా..
సంస్కృతి సంప్రదాయాలను
ఆచరణాత్మకం చేస్తూ..
హృదయానందముతో నీకు స్వాగతం పలుకుతారు!
అలాగే ఇప్పుడు కూడా
ఆనంద నర్తనంతో..
పట్టు పీతాంబరాలతో..
తెలుగువారి సంప్రదాయ
పిండివంటల ఘుమఘుమలతో..
పంచాంగ శ్రవణానంద లహరితో..
కవిశ్రేష్ఠుల కవితాగాన మధురిమలతో..
సభాప్రాంగణములు వేయివేల వెలుగులుతో శోభిల్లువేళ..
‘శ్రీ శోభకృతు’ నామ ‘ఉగాది’కి
నిండుగుండెతో స్వాగతం పలకాలని..
యావత్ తెలుగుజాతి
సంబరాల ఏర్పాట్లులో మునిగిపోయిన వేళ..
ఏమిటీ అపశృతి..?
చడీ చప్పుడు లేకుండా
అకారణ ద్వేషముతో
అకాల వర్ష రూపమై
ఉభయ తెలుగు రాష్ట్రాలపై
వరుణుడు విరుచుకుపడగా..
వరుణుడికి వాయువు తోడయి
బీభత్సం సృష్టించిన వేళ..
అన్నదాత రైతు రెక్కల కష్టం
నీటిపాలై బురదలో కలిసిపోయింది!
అమ్మా..!
‘శ్రీ శోభకృతు’ నామధారి
‘ఉగాది’ మాతా..
నీ రాకకు ముందే..
ఈ అపశకునములు ఏమిటి తల్లీ!?
నీ సోదరి ‘శ్రీ శుభకృతు’ నేతృత్వంలో..
ప్రజానేతల పాలన అస్తవ్యస్తమై
తృప్తి రహిత జీవనంలో
వేదనా భరిత బతుకును చవిచూశాము!
అయినా..
నీ ఆగమనంతో శుభకామనలను ఆశిస్తూ
ఆశగా బతుకుబండిని లాగుతూ ఉన్న వేళ..
చైత్రమాసం వసంతనవరాత్రిళ్లు
ప్రారంభానికి ముందే..
తెలుగు భూములలో పండించిన..
మామిడి పిందెలు.. వేపపూత.. చెరుకుపంట..
వగైరా వగైరా..
నోటికందిన పంటలు అన్నీ..
రాళ్ల(వడగళ్ల)వాన పాలై పోయె!
మా గుండెలు వేదనతో బండబారిన వేళ..
మా హృదయం లోగిలిలో
కన్నీటి చెలమలు నిక్షిప్తమైన దుస్థితిలో..
ఆశావహ దృక్పథంతో..
బండబారిన అంతరంగంతో
స్వాగతం పలుకుతూ..
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.