[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘నీ దరహాసం..’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]
నీ దరహాసం..
ఆకాశంలో చుక్కలను కోసి
సిగలో తురిమినట్టుంది
నీ దరహాసం..
దానిమ్మ ఫలం గింజలను ఒలిచి
దోసిళ్ళలో పోసినట్టుంది
నీ దరహాసం..
విరిసిన మల్లెలను ప్రోగు చేసి
పడకపై వెదజల్లినట్టుంది
నీ దరహాసం..
వసంత ఋతువును పిలిచి
పచ్చని పచ్చిక పరిచినట్టుంది
నీ దరహాసం..
నా మనో ఫలకంపై నిలిచి
తేనె సంతకం చేసినట్టుంది