[మరింగంటి సత్యభామ గారు రచించిన ‘నవజాత’ అనే కవితని అందిస్తున్నాము.]
కళ్ళు అలసటతో వాలిపోతున్నాయి
మనసు పాపని చూడాలి
లేత గులాబీ చెక్కిళ్ళు తాకాలని తహతహ
వాలే కళ్ళు విప్పార్చి చూసింది ఆ తల్లి
నర్సులు పాపని తుడిచి తెల్లని మెత్తని
వస్త్రంలో చుట్టి పాలు పట్టీ పక్కలో
వెచ్చగా నిద్ర పక్కనే అపురూపంగా
మమకారపు జల్లులు కదలలేనేంటో
ఒకసారి తనివితీరా తాకితే అమ్మో
నిద్రాభంగం కాదా చేయెత్తి నెమ్మదిగా
వీపు రాసి అలసట నిద్ర మగతలో
సన్నని సడి వెంటనే చిన్నగా తర్వాత
హెచ్చు స్ధాయి ఏడుపు సంగీతంలా
ఎంత మధురంగా వుందీ పాప స్వరం
కదిలి లేచి నెమ్మదిగా పాప వేపు తిరిగి
పాపని తీసుకుని పక్క మార్చి
పడుకో పెట్టి నెమ్మదిగా జో కొడుతూ
ఉన్న నర్స్ అమ్మ అయి లాలించి
పాలు తాగించి మూతి మృదువుగా తుడిచి నిద్ర పుచ్చి
గమనిస్తూ కళ్ళు విప్పార్చి చూసింది
నిద్రలో పాప నవ్వులు, కొద్దిసేపటికే
బిక్కముఖం చిన్నవెక్కిళ్ళు చేయి
చాపి వెన్ను నిమిరి నా వేలు పట్టి నవ్వు
అమ్మని తెలిసిందా బంగారుపాపా
ముత్యాలవాకిళ్ళు నీ సిరినవ్వులు
ఎందుకమ్మ బెదిరి ఏడవబోతావు
ఏ గురుతులో నమ్మ చిన్నారి కూనా
చందురుని మించు అందాలపాపా
నిను చూడ నా మనసు పరవశించేనే
లేలేత మొగ్గవే నవజాత శిశువా
దైవమెచటో లేడు నీలోనే వున్నాడు
యోగి వలె నుండీ నిదురపోయెదవు
అమ్మ ఒడి నీవు వూగేటి ఊయల
అమ్మ హృదయమె మెత్తని పానుపు
అమ్మ పాలే నీకు అమృతపు క్షీరము
అమ్మ మనసే నీ దేవాలయము
అమ్మ మమతల తోడ మధురమే జీవనం
మదిలోని నా పాప తలపు లేనిండ
పాప లాలనను చూచు అమ్మ మా అమ్మ