[మెగాస్టార్ ‘చిరంజీవి’కి భారత ప్రభుత్వం ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’ అవార్డు ప్రకటించిన సందర్భంగా శ్రీ విడదల సాంబశివరావు రచించిన కవిత.]
జీవన పోరాటంలో
అలుపెరగక శ్రమించి
ఎత్తుపల్లాలెన్నింటినో అధిగమించి
స్వయంకృషితో
జీవన గమ్యాన్ని చేరి
కళామతల్లి ముద్దుబిడ్డగా
నటరాజు చరణ కమలముల చెంత
సేద దీరిన మానవతామూర్తివి నువ్వు!
ఎంత ఎత్తుకు ఎదిగినా
వామనమూర్తిగ్లా ఒదిగి ఉండే
నిర్మల వినమ్రమూర్తివి కూడా నువ్వే!!
అహంకారానికి ఆమడ దూరంలో వుండే
సామాన్య, సౌమ్య, సాధు స్వభావం
నీకు మాత్రమే సొంతమైన
ఓ వజ్ర సమాన ఆభరణం!
నీ చుట్టూ పరిభ్రమించే..
సినీ మాయా ప్రపంచంలోని బడుగు జీవులు
ఆకలి బాధలతో అలమటిస్తుంతే
కలతలతో, కష్టాలతో విలవిల లాడుతుంటే
నీ మనసు ద్రవించి
ఆపన్నహస్తమందించిన వేళ..
ఆ అభాగ్యులందరికీ
నువ్వు దేవతామూర్తి వయ్యారు!
ప్రేమ, సహనం..
నీ సహజ స్వభావాలు
నిన్ను నిందించే నీచ మానవులను సైతం
ప్రేమతో హృదయంలో నిలుపుకొని
అజాత శత్రువువైనావు!
అసూయాపరుల..
అవమానాలను.. అవహేళనలను
సుగంధ పరిమళాలు వెదజల్లే
మల్లెల మాలలుగా స్వీకరించి..
పర్వత శిఖరమంత ఓర్పు
నీకే సొంతమని రుజువు చేసి..
శిఖరాగ్ర సమానుడవై
తెలుగు ప్రజల హృదయ మందిరాలలో
దైవంలా కొలువై వుండిపోయావు!
పురస్కారాలు.. సన్మానాలు..
నీ మహోన్నత ‘వ్యక్తిత్వం’ ముందు
గీటురాళ్ళేనని సకల మానవాళికీ తెలుసు!
ఈవేళ..
నిన్ను వరించి వచ్చిన..
ఈ ‘అవార్డు కన్య’ అందం
ద్విగుణీకృతమై వెలుగులీనుతోంది!
ఆమెను స్వీకరించి.. ముచ్చట తీర్చి..
సినీ వినీలాకాశంలో
‘చిరంజీవి’గా వర్ధిల్లు!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.