[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
అధ్యాయం 2 – 1944-1947:
జో బట్ నహీ సకా, వహ్ రహ్ గయీ
జూలై 12, 1944న కరాచీలోని HMIS దిలావర్లో ‘ఆనంద్ ప్రకాష్’ పేరుతో, నంద్ – ర్యాంక్ ‘బాయ్ 1’ (రేటింగ్)♣ తో చేరారు. 1945 ఏప్రిల్ 4 వరకు అక్కడే సేవలందించారు, ఆ తర్వాత ఆయనన్ని HMIS బహదూర్కు బదిలీ చేశారు.
‘మొదటి రోజే, మమ్మల్ని మిలిటరీ తరహా హెయిర్ కట్ కోసం షిప్ లోనే ఉన్న ఒక బార్బర్ వద్దకు పంపారు – జుట్టుని సైడ్స్ నుంచి కత్తిరించారు, పైభాగంలో కొద్దిగా జుట్టు ఉందంటే ఉంది అన్నట్టుగ ఉంచారు. దినచర్య ఉదయం 4 గంటలకు ప్రారంభమవుతుంది, మేము తయారవటానికి, యూనిఫాం ధరించడానికి ముప్పై నిమిషాల సమయం తీసుకునేవాళ్ళం. ఉదయం 4.45 గంటలకు మేము తీవ్రమైన శారీరక శిక్షణా వ్యాయామాల కోసం ఒకచోట చేరేవాళ్ళం. మా చదువులు ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం భోజనం వరకు కొనసాగేవి. భోజన సమయం ముప్పై నిమిషాలు. మా తరగతులు మధ్యాహ్నం 2 గంటలకు ముగిసేవి. సాయంత్రం 3 గంటలకు, మేము మైదానంలో ఏదో ఒక ఆట ఆడాలి, మా చదువులు మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు కొనసాగేవి. రాత్రి భోజనం 7.00 గంటలకి మొదలై 7.30 గంటలకి ముగిసేది. మంచం మీద వాలగానే నిమిషాల్లో నిద్ర పట్టేసేది. మొదట్లో మెస్లో పెట్టే ఆహారం రుచి బావుండేది, కానీ చివరికి, కాలక్రమేణా, ఆ రుచి మారిపోతుంది, ఆ తర్వాత అందరూ మెస్ని ద్వేషించి, తరువాతి సెలవు రోజున, ఒడ్డుకు చేరి, స్థానిక స్టాళ్లలో లభించే ఆహారాన్ని తినేవాళ్ళం. మా సముద్రయానం మూడేళ్ళ తర్వాతే మొదలవుతుంది, దాని కోసం మేము ప్రత్యేక శిక్షణ పొందవలసి వచ్చింది. నేను త్వరలోనే బొంబైకి, నా సినీ కలల ప్రపంచానికి, వెళ్తానని అనుకున్నాను.’
శిక్షణార్థి, క్యాడెట్ ఆనంద్ ప్రకాష్ తన ఓడ త్వరలోనే బొంబాయి నౌకాశ్రయానికి చేరుకుంటుందన్న ఆశతో కొన్ని నెలలు గడిపారు. అయితే, 1944 నుండి 1946 వరకు అతన్ని పోస్ట్ చేసిన రెండు నౌకలు కరాచీ నౌకాశ్రయాన్ని విడిచిపెట్టలేదు! ‘నేవీ రూట్’ ద్వారా బొంబాయి చేరుకోవాలన్న ఆయన ఆశయం నెరవేరలేదు. అయితే, మరింత నాటకీయమైనది ఏదో రాసిపెట్టి ఉంది. ఆయన నావికాదళం తిరుగుబాటులో చిక్కుకున్నారు! అది కలకత్తా నుండి ఉద్భవించి ఫిబ్రవరి 1946 నాటికి బొంబాయి, కరాచీ నౌకాశ్రయాలకు వేగంగా వ్యాపించింది.
***
బగావత్: భారత నావికాదళ తిరుగుబాటు
ఆనంద్ ప్రకాష్ రెండు నౌకల్లో ఒకదానిలో ఉన్నప్పుడు, నావికాదళం తిరుగుబాటు మొదలైంది: అతని సహచరులు, సీనియర్లు బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
మేము చిన్నప్పుడు సాయంత్రాలు మా బాంద్రా ఇంటి బాల్కనీలో కూర్చుని పిల్లలం కోకా కోలా తాగేవాళ్ళం, నాన్న తనకి ఇష్టమైన రెడ్ లేబుల్ డ్రింక్ తాగుతూ ఎన్నో కబుర్లు చెప్పేవారు. ఓ సాయంత్రం నాన్న మాతో ఇలా చెప్పారు:
‘తిరుగుబాటుదారులకు ఒక చురుకైన బెంగాలీ కుర్రవాడు నాయకత్వం వహించాడు. నా ఓడను త్వరలోనే బ్రిటిష్ కమాండింగ్ ఆఫీసర్ ఎ.సి. మూర్, అతని దళం స్వాధీనం చేసుకున్నాయి. నా ఓడలోని కమాండింగ్ ఆపీసర్ – ప్రక్కనే ఉన్న ఓడలోని బెంగాలీ కుర్రాడిని లొంగిపోవాలని కోరాడు. నేను, నా సహచరులు కూడా, ఆ ఓడలో ఉండాలనుకున్నాము. బ్రిటిష్ అధికారిని మోసం చేసి ఆ ఓడలోని తిరుగుబాటుదారులతో చేరాలని నిర్ణయించుకున్నాను. తిరుగుబాటును అణిచివేయడానికి నియమించబడిన బ్రిటిష్ దళం కన్నుగప్పగలమని నేను భావించాను. వందలాది మంది భారతీయ నావికులు, అధికారులు ‘జై హింద్’, ‘ఆజాదీ’ (స్వేచ్ఛ) అంటూ నినాదాలు చేస్తున్నారు. వాతావరణం జాతీయవాద స్ఫూర్తితో, దేశభక్తితో నిండిపోయింది.
మా బ్రిటిష్ కమాండింగ్ ఆఫీసర్తో నేను, “సర్, నాకు ఆ బెంగాలీ అబ్బాయి తెలుసు. అతను నా మంచి స్నేహితుడు. మీరు నన్ను ఈ ఓడ దిగి అతని ఓడ ఎక్కడానికి అనుమతిస్తే, నేను అతన్ని లొంగిపోయేలా ఒప్పించగలను” అన్నాను. కమాండింగ్ ఆఫీసర్, బహుశా నా చిన్న వయస్సు వల్ల లేదా నేను ‘అమాయకం’గా కనిపించటం వల్లనో ఒప్పుకుని, తిరుగుబాటుదారుల ఓడ ఎక్కేందుకు నన్ను అనుమతించాడు. నేను తిరుగుబాటుదారుల ఓడ ఎక్కిన తర్వాత, బ్రిటిష్ రాజ్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంలో నా సహచరులతో చేరాను. విదేశీ శక్తి చేత పాలించబడటం నేనెప్పుడూ అవమానకరంగానే భావించాను. మా పెద్ద కుటుంబంలో చాలామంది సాయుధ దళాలలో ఉండటంతో, బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, ఇంకా ఇతర ప్రదేశాలలో జరుగుతున్న స్వాతంత్ర్య పోరాటం గురించి వారు మాట్లాడుకోవడం నేను కొన్నిసార్లు వినేవాడిని. అయితే నేను నా దేశం కోసం పోరాడటానికి నావికాదళంలో చేరలేదు; బొంబాయి నౌకాశ్రయానికి వెళ్ళడానికి చేరాను. అయితే, ఆ క్షణంలో నేను ప్రతిదీ మర్చిపోయాను, ఇప్పటిదాకా నేను అనుభవించిన దానికంటే చాలా పెద్ద దానిలో భాగం కావాలని కోరుకున్నాను! నేను నౌకాదళంలో చేరిన తర్వాతే నాలో దేశభక్తి మేల్కొంది. తాతగారు, ఇతర కుటుంబ సభ్యులు ఎప్పుడూ – భారతీయులు బయటి వ్యక్తులచే ‘పాలించబడటాన్ని’ ద్వేషించేవారు. అకస్మాత్తుగా, నేను వారిలా ఉండాలనుకున్నాను!
అయితే, మా ఆవేశాన్ని నిర్దాక్షిణ్యంగా త్రొక్కేశారు. నావికాదళం తిరుగుబాటు కొద్ది రోజులలోనే అణిచివేయబడింది. మమ్మల్ని, అంటే తిరుగుబాటుదారులను అరెస్టు చేసి, నేను మోసం చేసిన అదే బ్రిటిష్ కమాండింగ్ ఆఫీసర్ ఎ.సి. మూర్ ముందు నిలబెట్టారు. ఆశ్చర్యకరంగా, ఆయన నన్ను గుర్తించాడు. నా వయసు పదిహేనేళ్లని తెలుసుకున్నాడు. నాతో, “అరెస్టు చేసి జైలులో శిక్షించడానికి నువ్వు చాలా చిన్నవాడివి. నేను అలా నిజంగానే చేయగలను, బహుశా నీ జీవితం ముగిసిపోతుంది. కానీ నేనలా చేయను, నిన్ను సర్వీసు నుండి డిస్మిస్ చేస్తాను” అన్నాడు.’
తిరుగుబాటు జరిగిన రెండు నెలల్లోనే, 1946 ఏప్రిల్ 5న ఆనంద్ ప్రకాష్ను రాయల్ ఇండియన్ నేవీ నుండి తొలగించారు.
హెరిటేజ్ టైమ్స్ నివేదిక ప్రకారం, ‘HMIS బహదూర్ పై ఉన్నసుమారు నలభై మంది కేడెట్లు – క్వార్టర్ డెక్ వద్దకు వెళ్లి, ఆ జెండాను కిందకి దింపి, చించేసి, దాని స్థానంలో, ‘జై హింద్’ జెండాను ఎగురవేశారు. తర్వాత వారు రాడార్ శిక్షణా పాఠశాల అయిన HMIS చమక్ వైపు వెళ్ళారు. అయితే, వారు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు, చమక్ లో ఉన్న కుర్రాళ్ళు ప్రతిఘటించారు, కానీ కొంత సమయం తర్వాత లొంగిపోయారు. ఆ తర్వాత ఈ కేడెట్ల సమూహం HMIS హిమాలయ వైపు వెళ్లింది, అది కూడా ఇదే విధంగా ఆక్రమించబడింది. 1946 ఫిబ్రవరి 23న కరాచీలో తిరుగుబాటు ముగిసినప్పుడు, ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది బ్రిటిష్ సైనికులతో సహా 33 మంది గాయపడ్డారు’.♠
‘గతంలోకి తిరిగి చూసుకుంటే, చాలా సంవత్సరాల తర్వాత ఆ రోజు గురించి నేను తలచుకున్నప్పుడు, అప్పటి అధికారులు ఎ.సి. మూర్, డేవిస్ విల్ఫ్రెడ్ జాన్ విలియమ్స్లకు నేను కృతజ్ఞతలు చెప్పుకోకుండా ఉండలేను. సరిగ్గా గుర్తు చేసుకుంటే, వారిద్దరూ మా బాయ్ రేటింగ్లకు బాధ్యత వహించారు – మైనర్ నావల్ క్యాడెట్ను శిక్షించకుండా వదిలివేయదం వారి విజ్ఞతకీ, దయకు నిదర్శనం. ఎందుకంటే నన్ను శిక్షించకుండా వదిలివేయడమే నాకు జీవితంలో రెండవ అవకాశం కల్పించింది. ఒకవేళ నాకు శిక్ష పడి ఉంటే, నేను జైల్లో చనిపోయేవాడినో లేదా బతికేవాడినో ఎవరికి తెలియదు. కానీ ఆయన నన్ను జైల్లో వేసి ఉంటే, నా జీవితం చాలా భిన్నమైన మార్గంలో నడిచేదనీ, బహుశా నేను బొంబాయి చేరుకుని గీత రచయిత అయ్యేవాడిని కాదని నేనిప్పుడు భావిస్తున్నాను.’
1983లో, సాయుధ దళాలకు గర్వంగా సేవ చేసిన బంధువుల ఒత్తిడితో ఆనంద్ బక్షి స్వాతంత్ర్య సమరయోధుడి హోదా కోసం దరఖాస్తు చేసుకున్నారు, కానీ తిరుగుబాటుదారులలో ఒకడని రుజువు లేకపోవడంతో 1986లో హోం మంత్రిత్వ శాఖ ఆయన దరఖాస్తును తిరస్కరించింది.
***
‘మై ఫిల్మ్ పే ఫిల్మ్ దేఖ్తా థా’
పిండికి తిరిగి వచ్చాకా, గత వైఫల్యాల గురించి విలపించే బదులు, నాన్న తన అభిరుచి కోసం, ఏదో ఒకవిధంగా తన కలకి (సినిమా) దగ్గరగా ఉండాలనే ఆశతో ముందుకుసాగారు.
1946లో, నౌకాదళం నుండి తొలగించబడిన తర్వాత, నంద్ రావల్పిండిలోని ఒక సినిమా థియేటర్లో టికెట్ బుకింగ్ క్లర్క్గా ఉద్యోగంలో చేరారు, తద్వారా అక్కడ సినిమాలు ఉచితంగా చూడవచ్చు. నాన్న ఉన్నత విద్య లేదా కెరీర్ కోసం వాళ్ళ తాతాగారేం ప్రణాళికలు వేశారో నాకు తెలియదు. సరిగ్గా గుర్తుంటే, నాన్న రావల్పిండిలోని రోజ్ సినిమా థియేటర్లో పనిచేశారు. ఈ ఉద్యోగాన్ని ఆయన తన కుటుంబం నుండి ఎలా రహస్యంగా ఉంచగలిగారో నాకు తెలియదు.
‘సినిమాల్లో మొదట పాటలు, యాక్షన్ సన్నివేశాలు నన్ను ఆకర్షించేవి. నా యుక్తవయస్సు తర్వాత కథ నాకు బాగా నచ్చడం ప్రారంభించింది. తాతగారు పంజాబ్లోని జైళ్ల పర్యటనలకు వెళ్లినప్పుడు, మా నాన్న పని కోసం వెళ్లిపోయినప్పుడు నేను మా ఇంటి సందులో గంటల తరబడి పంజాబీ జానపద పాటలు, హిందీ సినిమా పాటలు పాడుతూ గడిపేవాడిని. నా స్నేహితులు, అటుగా వెళ్ళే బాటసారులు, ఇంకా తమ తమ వస్తువులు అమ్ముకోడానికి వచ్చినవాళ్ళు కూడా ఆగి పాటలు వినేవారు; నా స్నేహితులు కృతజ్ఞతగా ‘వాహ్ జీ వాహ్!’ అనేవారు. అయితే, తాతగారు, నాన్న వాళ్ళ ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్ళిన తర్వాతే నేను పాటలు పాడేవాడిని, సినిమాలోని సన్నివేశాలను నటించి చూపించేవాడిని. బొంబాయికి వెళ్లి సినిమాల్లో ఏదో ఒక పని చేయడం తప్ప నాకు వేరే కల లేకపోవడంతో నేను ఎంచుకున్న పద్ధతి అది. ఈ ఉద్యోగంలో, నేను చెత్త సినిమాలు కూడా మళ్లీ మళ్లీ చూశాను. నేను యాక్షన్ సినిమాలను, పాటలను ఎక్కువగా ఆస్వాదించాను. ఈ పదే పదే చూసే సెషన్ల ద్వారానే పాటలు – సినిమా దృశ్యాలు, కథ, పాత్రలతో – సంక్లిష్టంగా అనుసంధానించబడి ఉన్నాయని గ్రహించి, మనసులోనే నేర్చుకోవడం ప్రారంభించాను. రెండు దశాబ్దాల తర్వాత, సంగీత దర్శకుడు ఎస్.డి. బర్మన్ నాతో, “బక్షి, ఫిల్మ్ కా కహానీ ఠీక్ సే సునో. కహానీ మే గానా హై!” (బక్షి, సినిమా కథని జాగ్రత్తగా వినండి. పాటలు కథలోనే ఉన్నాయి) అని అనేవారు. నేను రాసిన చాలా పాటల్లో ఆ సినిమా స్క్రిప్ట్ నాలుగు కవితల్లో కుదించబడి ఉండేది. (రావల్పిండిలోని సినిమా థియేటర్లో పని చేసిన) రెండు సంవత్సరాలలో, నా చిన్న ప్రపంచం శాశ్వతంగా నాశనం చేయబడింది. ఒక తుఫాను వచ్చింది, అది నన్ను, నా కలలను మాత్రమే కాకుండా, లక్షలాది మందిని మా పూర్వీకుల భూమి, ‘హమారీ జమీన్, హమారీ మిట్టీ’ నుండి కూకటివేళ్ళతో సహా పెకిలించివేసింది.’
***
1947వ సంవత్సరం. పిండిలో హిందువులు ఎక్కువగా ఉండేవారు – వారు అనేక వ్యాపారాలను నడిపేవారు. పిండి చుట్టుపక్కల గ్రామాల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. దోపిడీలు, దుకాణాలను, ఇళ్లను తగలబెట్టడం, బహిరంగంగా ఉరితీయడం, మహిళలను అపహరించడం లాంటివన్నీ విభజనకు ముందే ప్రారంభమయ్యాయి. సరిహద్దు వెంబడి ఇలాంటి హింస జరుగుతుందని పుకార్లు కూడా విన్నాము. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న చాలా మంది విభజన తేదీకి ముందే ‘బయటివారిగా’, తమ పూర్వీకుల భూమిలోనే శరణార్థులుగా మారారు. మగవారిని చంపేశారు, ఆడవాళ్ళని చెరబట్టారు. ఈ హింసాకాండ చాలా మటుకు ముందుగా ప్రణాళికలు వేసి అమలు చేసినదే. దుండగులలో ఎక్కువ మంది పిండి ప్రజలు కాదు, వారు సమీప గ్రామాల నుండి వచ్చినవారు లేదా ‘భారతదేశం’ నుండి వచ్చినవారు, వాళ్ళంతా తమ శక్తి మేరకు దోచుకున్నారు. అల్లర్లనీ, మహిళలను అత్యాచారం చేయడాన్ని; ఆడవారిని, మగవారిని చంపి చెట్లకు, దీప స్తంభాలకు వేలాడదీయడాన్ని నంద్ కళ్ళారా చూశారు. మగవాళ్ళ చేతులు నరికివేటాన్ని చూశారు. పంజాబ్ నుండి తరిమివేయడానికి – తమ కుటుంబాలను భయపెట్టడానికి తన బంధువులు, స్నేహితుల ఇళ్ళు, దుకాణాలను తగలబెట్టడం నంద్ చూశారు. ఈ హింస ఆయనని జీవితాంతం ప్రభావితం చేసింది. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న చాలామందిలో తప్పించుకోగలిగిన ప్రజలు కట్టుబట్టలు తప్ప ఏమీ తీసుకెళ్ళలేకపోయారు.
నాన్న చనిపోయిన తర్వాత నేను ఒకసారి నటుడు ధర్మేంద్రను కలిశాను, ఆయన నాతో, “మీ నాన్నగారు పిండిలో తాను గడిపిన సంవత్సరాల గురించి తరచుగా మాట్లాడేవారు, అది నాకు ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’ సినిమాలోని ‘యహాఁ మై అజ్నబీ హూఁ’ పాటను గుర్తుచేసింది” అన్నారు. నాన్న చిన్ననాటి జ్ఞాపకాలు, ఆ పాటలోని ‘ముఝే యాద్ ఆ రహా హై, వో ఛోటా సా షికారా’ అనే వాక్యంలో ప్రతీకాత్మకంగా దాగి ఉన్నాయి.
బక్షిలు తమ జన్మస్థలం నుండి పారిపోవడానికి గల పరిస్థితులను నేను మునుపటి అధ్యాయంలో వివరించాను. నంద్ తాతగారు పంజాబ్ జైళ్లలో పోలీసు సూపరింటెండెంట్గా ఉండటం వల్ల లక్షలాది మంది అవస్థలా కాకుండా తన కుటుంబానికి సురక్షితమైన మార్గాన్ని ఏర్పాటు చేయగలిగారు. వారు ప్రయాణించిన డకోటా విమానం – వారి మొత్తం కుటుంబం, బహుశా కొంతమంది ఇతర శరణార్థులు, ఇంకా పోలీసు అధికారుల కుటుంబాలతో నిండిపోయింది. వీరు ‘అదృష్టవంతులు’. తమ ఇల్లు, ఇతర విలువైన వస్తువులను కోల్పోయినా; కనీసం బక్షి కుటుంబంలో అందరూ ప్రాణాలతో మిగిలారు, కలిసే ఉన్నారు.
విభజనకు ముందు వారాలలో తాను చూసిన దాని గురించి, నాన్న ఒకసారి తన ప్రియమైన స్నేహితుడు పి.ఎన్. పూరీతో చెప్పారట. 1960లలో బొంబాయిలో తన తొలినాటి రోజుల నుండి ఆయన నాన్నకి మంచి స్నేహితుడు. నాన్న దీని గురించి మాతో, అంటే తన పిల్లలతో ఎప్పుడూ మాట్లాడలేదు. పూరీ గారికీ, నాన్నకీ మధ్య ఈ సంభాషణ, నాన్న మరణించిన సంవత్సరంలోనే జరిగింది. నాన్న మరణం తర్వాత, నాన్నతో ఉన్న అనుబంధాన్ని, నాన్నతో గడిపిన క్షణాలను రికార్డు చేయడానికి నేను నాన్న స్నేహితులను, బంధువులను, సినిమా నిర్మాతలను కలవడం ప్రారంభించాను. పూరీగారు నాతో, “నీకు తెలుసా, బేటా, మీ నాన్న ఒంటరిగా ఉండటం, వదిలివేయబడటం వంటి కొన్ని భయాలు, ఆందోళనలతో బాధపడ్డాడు. భారతదేశ విభజన సమయంలో అతను చూసిన భయంకరమైన హింస కొంత మేరకు ఇందుకు కారణం. ప్రజలను హత్య చేయడం, స్త్రీలను అత్యాచారం చేయడం, సజీవ దహనం చేయడం తాను కళ్ళారా చూశానని, ఆ దృశ్యాలు తనని జీవితాంతం వెంటాడాయని మీ నాన్న నాకు చెప్పాడు. వారి గ్రామంలో అతనికి తెలిసిన ఒక కుటుంబం లోని సభ్యులు – తల్లి తలను నరికేశారు, వారి టీనేజ్ కుమార్తెలను అబ్బాయిలుగా కనిపించేలా వారి పొడవాటి జుట్టును కత్తిరించారు – ఎందుకో తెలుసా, ‘బయటివాళ్ళు’ వచ్చినప్పుడు మరింత దారుణమైన పరిస్థితులు జరగవచ్చు. ఈ ఆందోళన వల్లనే – సుదూర రైలు ప్రయాణాల సమయంలో తనతో పాటు రమ్మని మీ నాన్న – నన్ను, లేదా తన స్నేహితులలో ఒకరైన డాక్టర్ నానావతిని, లేదా కార్ డీలర్ చోక్సేని, లేదా రైల్వే స్నేహితుడు చితర్ మాల్ను – ఎప్పుడూ అడిగేవాడు” అని చెప్పారు.
అల్లకల్లోలంగా ఉన్న సరిహద్దు దాటిన బక్షిల ప్రయాణం విషయానికి తిరిగి వెళితే – వారిని గూర్ఖా రెజిమెంట్ నడిపే ట్రక్కులో సురక్షితంగా ఎయిర్ స్ట్రిప్కు, ఆపై ఢిల్లీకి తరలించారు. నాన్న చెప్పినట్లుగా, ‘ఔర్ ఫిర్ హమ్ దిల్లీమే బస్ గయే’ (ఆపై మేము ఢిల్లీలో స్థిరపడ్డాము). వారు 1947 అక్టోబర్ 2న భారతదేశానికి చేరుకున్నారని ఆయన నాకు చెప్పారు. (కొన్ని సంవత్సరాల తరువాత, 1955లో, ఇదే తేదీన ఆయన వివాహం జరిగింది.) వారు వచ్చిన రెండు వారాలలోపు, 1947 అక్టోబర్ 14న, బక్షిలు పూనాలోని రెఫ్యూజీ రిజిస్ట్రేషన్ బ్రాంచ్లోని డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ కార్యాలయంలో శరణార్థులుగా నమోదు చేయబడ్డారు. శరణార్థి రిజిస్టర్లో వారి పేర్లపై సంతకం చేసి, వారి మునుపటి చిరునామాను పేర్కొనవలసి వచ్చినప్పుడు మాత్రమే తాను, తన కుటుంబం ‘శరణార్థులు’ అయ్యామని ఆనంద్ ప్రకాష్ గ్రహించారు.
దీపావళికి వారం ముందు, నవంబర్ 3న ఆనంద్ ప్రకాష్కు శరణార్థి సర్టిఫికెట్ మంజూరు చేయబడింది. ఆ దురదృష్టకర సంవత్సరం దీపావళి సందర్భంగా ఆనంద్ ప్రకాష్కు ఆ ఒక్కటే సంతోషం కలిగించి ఉండాలి. కానీ చుట్టూ చూస్తే, తాము ఇతరులకన్నా చాలా మెరుగ్గా ఉన్నామని ఆయనకి అనిపించింది. భారీ నష్టం, అభద్రత, ఆర్థిక పతనం, అనిశ్చితి, భయంతో నిండిన ఆ క్షణంలో వారందరూ కలిసి ఉన్నారు. మేము పిల్లలుగా ఉన్నప్పుడు, నాన్న తరచుగా ‘చుట్టూ చూడండి, మీరెంత నయమో గ్రహించండి’ అని మాకు చెప్పేవారు.
***
‘దునియా మే కిత్నా ఘమ్ హై, మెరా ఘమ్ కిత్నా కమ్ హై, లోగోంకా కా ఘమ్ దేఖా తో, మై అప్నా ఘమ్ భూల్ గయా’ – అమృత్
సంపద, హోదా పోవడం, వారి గౌరవం రాత్రికి రాత్రే నాశనమవడంతో, బక్షిలు పీలికలయిన కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
భూమికి బదులుగా శరణార్థులుగా నగదు పరిహారం పొందాలని వారు ఎంచుకున్నారు. సానుభూతితో, సహాయకారిగా ఉండే ఒక స్థలం నుండి మరొకదానికి, ఒక అద్దె స్థలం నుండి మరొకదానికి మారారు. తరువాతి కొన్ని సంవత్సరాలు వారు 1954లో ఢిల్లీలోని వెస్ట్ పటేల్ నగర్లో; 1961లో నేతాజీ నగర్, కల్కాజీలో; 1971లో కమలా నగర్లో; మరియు చివరికి 1972లో బస్తీ సారాయ్ రోహిల్లాలో తాత్కాలికంగా నివసించడం ప్రారంభించారు.
చివరికి తాము పిండికి తిరిగి వెళ్ళలేమని వారికి అర్థమైంది, ఎందుకంటే ఆ నగరంలో వారు ఇప్పుడు అవాంఛిత బయటి వ్యక్తులుగా పరిగణించబడ్డారు, వారి ఇంటిని కొంతమంది అపరిచితులు ఆక్రమించారు. నంద్ తాతగారు, నానమ్మ ఇంటికి తాళం వేసి, నమ్మకమైన పొరుగువారికి తాళాలు ఇచ్చి, ‘ఈ ఉన్మాదం ముగిసిన తర్వాత మేము త్వరలో తిరిగి వస్తాము’ అని చెప్పారు. డకోటా విమానంలో బయలుదేరే ముందు నంద్ తాతగారు టార్మాక్ను ముద్దాడారు. ఓ ఔషద పదార్థాల గాజు సీసాని ఖాళీ చేసి, అందులో పిండి మట్టి నింపి, తనతో పాటు తీసుకెళ్లారు నంద్; అది ఆయన జీవితాంతం గోద్రేజ్ అల్మారాలోని స్టీల్ వాల్ట్లో ఉంది.
నిరాశకు గురైన, భయపడిన, గాయపడిన కుటుంబానికి భరోసా బాధ్యతను నంద్ నానమ్మ స్వీకరించారు. ఆమె వారితో, ‘హిందుస్తాన్ మే తుమ్హే నయే లోగోంకీ, నయే రిష్తోంకీ, ఔర్ నయే రివాజోంకీ ఆదత్ పడ్ జాయేగీ. ఘబ్రానే కీ కోయీ జరూరత్ నహీఁ’ (మీరు భారతదేశంలో కొత్త వ్యక్తులకు, కొత్త సంబంధాలకు, కొత్త ఆచారాలకు అలవాటు పడతారు; చింతించాల్సిన అవసరం లేదు) అని చెప్పారు.
ఫిబ్రవరి 2002లో, నాన్న చనిపోవడానికి ఒక నెల ముందు, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత, ఒకప్పుడు సింధ్ నుండి శరణార్థిగా వచ్చిన తన ప్రియ స్నేహితుడు, న్యాయవాది శ్యామ్ కేశ్వనీతో కలిసి – పిండిని సందర్శించడానికి ప్రణాళికలు వేసుకున్నారు. కానీ అది జరగలేదు. దీర్ఘకాలిక ఆస్తమా కారణంగా నాన్న ఊపిరితిత్తులు క్రమంగా బలహీనపడటంతో ఆ ప్రణాళిక అమలవలేదు. ఒక నెలలోనే ఆయన మరణించారు. కానీ ఆయన పాటలు సరిహద్దులకు అతీతంగా చిరస్థాయిగా నిలిచాయి; ముఖ్యంగా ‘మేరీ పిండి, మేరా పిండ్’ (నా రావల్పిండి, నా గ్రామం) పాట నేటికీ సజీవంగా ఉంది.
నాన్న రాసిన ‘రావల్పిండి’ అనే కవితలో, శరణార్థిగా ఆ ఊరిని విడిచిపెట్టవలసి వచ్చినందుకు బాధను వ్యక్తపరిచారు. కానీ ఈ కవిత – తమదైన అందమైన దాని నుండి విడిపోవాల్సి వచ్చిన ఎవరికైనా వర్తిస్తుందని నాకు అనిపిస్తుంది.
రావల్పిండి
సానేహా యే మేరీ జిందగీ సహ్ గయీ
మై యహాఁ ఆ గయా, ఓ వహాఁ రహ్ గయీ.
కుఛ్ నా మై కర్ సకా, దేఖ్తా రహ్ గయా
కుఛ్ నా వో కర్ సకీ, దేఖ్తీ రహ్ గయీ.
లోగ్ కెహ్తే హైఁ తక్సీమ్ సబ్ హో గయా
జో నహీఁ బట్ సకీ చీజ్ వో రహ్ గయీ.
ఇన్ జమీనోం నే కిత్నా లహూ పీ లియా
యే ఖబర్ ఆస్మానోం తలక్ హై గయీ.
రాస్తే పే ఖడీ హో గయీ సరహదేఁ
సర్హదోం పే ఖడీ బేబసీ రహ్ గయీ.
యాద్ పిండి కీ ఆతీ హై అబ్ కిస్లియే?
మేరీ మిట్టీ థీ ఝీలమ్ మే వో బహ్ గయీ.
దే గయీ ఘర్, గలీ, షహర్ మెరా కిసే
క్యా పతా కిస్ సే బక్షి వో క్యా కహ్ గయీ.
***
హౌస్లా
ఆరేళ్ల వయసులో తన తల్లిని కోల్పోవడం, టీనేజర్గా గురుకులాన్ని మధ్యలో వదిలి వెళ్ళడం, గాయకుడిగా ఉద్యోగం వెతుక్కుంటూ లాహోర్లో ఎటువంటి పురోగతి సాధించకపోవడం, నౌకాదళం నుండి అప్రతిష్ఠాత్మకంగా తొలగించబడడం, పదిహేడేళ్ల వయసులో తన సొంతూరు పిండికి దూరమవడం – ఈ విషాదాలన్నో ఒక దాని తరువాత ఒకటిగా, ఒకే దశాబ్దంలో సంభవించాయి, ఇవన్నీ నంద్ జీవితంలోని సవాలుతో కూడిన దశకు నాంది పలికాయి. అదృష్టవశాత్తూ, ఆయన భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతి సవాళ్లను ఎదుర్కొంటారు, తట్టుకుంటారు; వాటన్నింటినీ నేరుగా ఎదుర్కొంటారు! తన ధైర్యాన్ని (హౌస్లా) మాత్రమే తన సహచరుడిగా ఉంచుకున్నారు.
ఈ సుదీర్ఘమైన మరియు కష్టతరమైన ప్రయాణంలో నంద్ తన దృఢమైన సహచరులుగా – తన నుంచి ఎవరూ వేరుచేయలేని సహచరులుగా ఉన్న తన ధైర్యం, సాహసం, ప్రతిభ, అవసరం, క్రమశిక్షణ, బన్సీ వాలే (శ్రీకృష్ణుడు), తన కవితలు, తన స్వంత బాణీలను సృష్టించి వాటిని పాడగల సామర్థ్యం, తరువాత రాబోయే తన కుటుంబం (మేము) పై దృఢమైన విశ్వాసం ఉంచారు. మంచి రోజులను చూడటానికి, మొదట తన విషాదకరమైన వర్తమానాన్ని అంగీకరించి, దానితో సరిపెట్టుకోవాలని ఆయనకి తెలుసు, ఆయన అలాగే చేశారు.
వారి కొత్త దేశంలో, శరణార్థులు, బక్షిలకు పని అవసరం. ఎట్టకేలకు నంద్ తాతగారికి అంబాలాలో పోలీసు ఉద్యోగం వచ్చింది, నాన్నగారికి ఢిల్లీలోని ఒక బ్యాంకులో ఉద్యోగం దొరికింది. స్థానభ్రంశం చెందిన కుటుంబానికి అదనపు మద్దతు ఇవ్వడానికి, నంద్ తన మోహ్యాల్ వంశం గర్వించదగిన వృత్తి అయిన భారత సైన్యంలో చేరారు. వారు భారతదేశానికి వచ్చిన నలభై రోజులలోపు నంద్ ఆ పని చేశారు.
‘దునియా మే రహనా హై తో కామ్ కర్ ప్యారే, ఖేల్ కోయ్ నయా సుబాహ్-ఓ-షామ్ కర్ ప్యారే’ – హాథీ మేరే సాథీ
(మళ్ళీ కలుద్దాం)
♣ రేటింగ్ అనేది వారెంట్ లేదా కమిషన్డ్ ఆఫీసర్ కాని జూనియర్ ఎన్లిస్టెడ్ సభ్యుడు. HMIS బహదూర్ అనేది కరాచీ నౌకాశ్రయానికి దక్షిణంగా ఉన్న ఒక చిన్న ద్వీపకల్పమైన మనోరాలో ఒడ్డున ఉన్న బాలుర శిక్షణా సంస్థ.
♠ https://heritagetimes.in/royal-indian-navy-mutiny-1946
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.