Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు-14

[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

అధ్యాయం 7 – 1959-1967- రెండవ భాగం

1963

11.‘తుమ్హే హుస్న్  దేకే ఖుదా నే సితమ్‍ఘర్ బనాయా, చలో ఇస్ బహానే తుమ్హే భీ ఖుదా యాద్ ఆయా, జీ యాద్ ఆయా’-జబ్ సే తుమ్హే దేఖా హై (1963); సంగీతం దత్తారామ్

ఇది మరో ఆహ్లాదకరమైన ఖవ్వాలి, ప్రధాన జంట మధ్య మరో ప్రేమ పోరాటం. మరో శుభాశీస్సు. ఆ పాటలో శశి కపూర్, షమ్మీ కపూర్ మొదటిసారి కలిసి కనిపించారు.

12. ‘పీహు పీహు పపిహే నా బోల్, పాఁవ్ పడూఁ మై పపీహే తేరే, భేద్ నా మేరే ఖోల్, ముష్కిల్ థా పహలే సే జీనా, ఉస్ పే ఆయా సావన్ కా మహీనా’ – హాలిడే ఇన్ బాంబే (1963); సంగీతం ఎన్. దత్తా

ఈ పాటలో ఆనంద్ బక్షి – ‘తాను ప్రేమలో ఉన్నానని, తన రహస్యాన్ని అందరూ కనుగొంటారనే ఆ స్త్రీ పాత్ర ఆందోళన’ను వ్యక్తపరుస్తారు. ఋతుపవనాల రాకడ – ఆమె తన ప్రియుని కోసం మరింత తపించేలా చేస్తోంది. ఆమె తన భావాలను, ప్రార్థనను, ఋతుపవనాల రాకను, ప్రేమ ఋతువును ప్రకటించే పపిహా (common hawk-cuckoo) పక్షికి తెలియజేస్తోంది.

13. ‘చాంద్ ఆహేఁ భరేగా, ఫూల్ దిల్ థామ్ లేంగే, హుస్న్ కీ బాత్ చలీ తో, సబ్ తేరా నామ్ లేంగే’ – ఫూల్ బనే అంగారే (1963); సంగీతం కళ్యాణ్ జీ ఆనంద్ జీ

ఈ పాటలో, ఆనంద్ బక్షి – కథానాయిక సౌందర్యాన్ని – అత్యుత్తమంగా ఉన్న ప్రకృతితో పోలుస్తారు, ‘ఐసా చెహరా హై తేరా, జైసే  రోషన్ సవేరా, జిస్ జగహ్ తూ నహీఁ హై, ఉస్  జగహ్ హై అంధేరా.. ఆంఖ్ నాజూక్ సీ కలియాఁ, బాత్ మిసరీ కీ డలియాఁ, హోంఠ్ గంగా కే సాహిల్, జుల్ఫే  జన్నత్ కీ కలియాఁ, తేరీ ఖాతిర్ ఫరిష్తే, సర్ పే ఇల్జామ్ లేంగే.. చుప్ నా హోగీ హవా భీ, కుఛ్ నా కహేగీ ఘటా భీ, ఔర్ ముమ్‌కిన్ హై జిక్ర్ కర్ దే ఖుదా భీ ఫిర్ తో పత్థర్ భీ షాయద్ జబ్త్ సే కామ్ లేంగే’ అంటారు.

1961 సెప్టెంబర్ 12 న, ఈ పాట రికార్డింగ్ సమయంలో, ఆనంద్ బక్షికి కళ్యాణ్‌ జీ – ఆనంద్‌ జీ సహాయకులు లక్ష్మీకాంత్ – ప్యారేలాల్‌తో పరిచయం ఏర్పడింది. ఈ ముఖ్యమైన తేదీని బక్షి తన నోట్స్‌లో ప్రస్తావించారు. తరువాత వీరు దాదాపు 303 చిత్రాలలో కలిసి పనిచేశారు!

ప్రియురాలిని పొగుడుతూ రాసిన పాటలే కాకుండా, అసలు జనాలు ఎందుకు ప్రేమలో పడతారని ప్రశ్నిస్తూ కూడా ఆయన పాటలు రాశారు. ‘మెహబూబ్ కి మెహందీ’ (1971) సినిమాలో: ‘జానే క్యూఁ లోగ్ మొహబ్బత్, కియా కర్తే హైఁ, దిల్ కే బదలే దర్ద్-ఎ-దిల్, లియా కర్తే హైఁ’.

ఫూల్ బనే అంగారే’లో ఆనంద్ ప్రకాష్ బక్షి సైనిక స్ఫూర్తిని ప్రతిబింబించే దేశభక్తి గీతం కూడా ఉంది: ‘వతన్ పే జో ఫిదా హోగా, అమర్ వో నౌజవాన్ హోగా, రహేగీ జబ్ తలక్ దునియా, యే అఫ్సానా బయాఁ హోగా.’ మాతృభూమి కోసం తన ప్రాణాలను త్యాగం చేయడానికి సైనికుడు సిద్ధంగా ఉండాలనే హృద్యమైన అభ్యర్ధనతో ఇది ప్రారంభమవుతుంది: ‘హిమాలయ్ కీ బులందియోం సే, సునో ఆవాజ్ హై ఆయీ, కహో మావోఁ సే దే బేటే, కహో బెహెనోం సే దే భాయ్’. సినిమా విడుదలైన కొన్ని సంవత్సరాల తర్వాత, 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం సందర్భంగా ఈ పాట  ప్రజాదరణ పొందింది.

14. ‘సంభల్ తో లే, దిల్ దీవానా, జరా ఠహర్ జానా, అభీ నా సామ్‍నే ఆనా, జరా ఠహర్ జానా’

ఫూల్ బనే అంగారే’ కోసం కళ్యాణ్‌ జీ – ఆనంద్‌ జీ స్వరపరిచిన ఈ పాట పెద్ద హిట్‌గా నిలిచింది. ఇందులో, ఆనంద్ బక్షి – తన ప్రియుడిని త్వరలో చూడాలనే ఉత్సాహాన్ని నియంత్రించుకోలేని నాయికని చిత్రించారు. ‘ఖుషీ భీ ఇత్నీ, అచానక్, మై సెహ్ నా పావుంగీ, మై అప్నే ఆప్ మే, బస్ ఆజ్ రెహ్ నా పావుంగీ, జో తుమ్సే కెహనా హై ముఝ్‌కో వో కెహ్ నా పావుంగీ, మై యాద్ కర్ లూఁ ఫసానా, జరా ఠహెర్ జానా’ అని అంటారు.

ఆనంద్ బక్షి ఇప్పుడు బొంబాయిలో తన కుటుంబాన్ని పోషించగలనని నమ్మకంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని తీసుకురావడానికి లక్నో వెళ్లారు. భార్య, కూతురు, కొడుకుతో 1963 మే 13 నాడు బొంబాయి చేరుకున్నారు, ఆ కుటుంబం ఖార్ వెస్ట్‌లోని హోటల్ ఎవర్‌గ్రీన్‌ లోని రూమ్ నంబర్ 26లో దిగింది.

ఆయన కుటుంబం 1956 నుండి 1963 వరకు ఆయనకి దూరంగా ఉంది. కాబట్టి ఆయన భార్యాపిల్లలు ఆయనని చాలా మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఆయన కూడా తరచు వాళ్ళు ఏం అనుభవిస్తున్నారో ఊహించుకుంటూ వుండాలి, వాళ్ళని మళ్ళీ చూడాలని ఎదురుచూస్తూ ఉన్నారు. తఖ్‌దీర్ (1968) సినిమా కోసం ఒక పాటలో, ‘సాత్ సముందర్ పార్ సే, గుడియోం కే బజార్ సే, అచ్చీ సీ గుడియా లానా, గుడియా చాహే నా లానా, పాపా జల్దీ ఆ జానా’ అని రాసిన వాక్యాలు ఆయన మనసుకి అద్దం పడతాయి. ఈ పాట నన్నెప్పుడూ కదిలిస్తుంది: ‘తుమ్ పర్‍దేశ్ గయే జబ్ సే, బస్ యే హాల్ హువా తబ్ సే, దిల్ దివానా లగ్‌తా హై, ఘర్ వీరానా లగ్‍తా హై, ఝిల్‍మిల్ చాంద్ సితారోం నే, దర్వాజాం దివారోంనే, సబ్ నే పూఛా హై హమ్ సే, కబ్ జీ ఛూటేంగే గమ్ సే?, కబ్ హోగా ఉన్‍కా ఆనా, పాపా జల్దీ ఆ జానా.’

కుటుంబానికి దూరంగా ఉండడం, చివరికి కలుసుకోడం గురించి, ‘ఆమ్నే సామ్నే’ లో బక్షి రాసిన మరొక పాటని గుర్తుచేసుకోడం సందర్భోచితం: ‘కభీ రాత్ దిన్ హమ్ దూర్ థే, దిన్ రాత్ కా అబ్ సాథ్ హై, వో భీ ఇత్తేఫాక్ కీ బాత్ థీ, యే భీ ఇత్తేఫాక్ కీ బాత్ హై.’

దేశవిభజన తర్వాత నాన్న ఆర్థికంగా ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నారో నాకు తెలియదు, ఎందుకంటే ఆ సంవత్సరాల గురించి ఆయన ఎప్పుడూ వివరంగా మాట్లాడలేదు, దేశవిభజన తర్వాత తాను, అమ్మా ఇద్దరూ చాలా గడ్డు రోజులు చూశామని పిల్లలమైన మాకు చెప్పడం తప్ప. కానీ ఒకసారి, వారి గత ఆర్థిక సవాళ్ల గురించి నాకు అవగాహన వచ్చింది. ఇది 90ల ప్రారంభంలో జరిగింది. నేను అప్పుడే నా వృత్తిని ప్రారంభించాను – నా స్వంత చిన్న వ్యాపారం. ఓ రోజు ఉదయం, మేము అల్పాహారం తీసుకుంటున్నాం, నేను నా ప్లేట్‌లోని గుడ్లు తినడం పూర్తి చేయలేదు. నా ప్లేట్‌లో ఉన్నవన్నీ నేను ఎందుకు తినలేదని నాన్న అడిగారు. నేను, ‘నాకు ఆకలిగా లేదు, పైగా త్వరగా వెళ్ళాలి’ అన్నాను. నాన్న ‘ఒక్కో గుడ్డు ధర ఎంత?’ అని అడిగారు. 25 లేదా 50 పైసలు ఉంటుందని నేను చెప్పాను. అప్పుడు నాన్న, ‘మీరు నలుగురూ చాలా చిన్నగా ఉన్నప్పుడు, నువ్వు, నీ చెల్లి మరీ పసిపిల్లలుగా ఉన్నప్పుడు, మీ అమ్మ ఒక గుడ్డు కొని, దానిని ఉడకబెట్టి నాలుగు ముక్కలుగా చేసేది, తద్వారా మీ అందరికీ మంచి పోషకాహారం సమానంగా లభించింది. ఆమె తనకోసం ఎప్పుడూ కొనలేదు. గుడ్ల ధర ఎంతైనా, ప్రియంగా ఉన్నా లేక చౌకగా ఉన్నా; కానీ మాకు, గుడ్డు ధర ఎల్లప్పుడూ మీ అమ్మ మీ అందరికీ ఒకే గుడ్డు తినిపించడానికి చెల్లించిన ధర అవుతుంది. దానిని ఎప్పటికీ మర్చిపోవద్దు, ఇకపై ఆహారాన్ని వృథా చేయద్దు’ అని చెప్పారు. తరువాత నేనెప్పుడూ ఆహారాన్ని వృథా చేయలేదు. నూనెలో వేయించిన పకోడీ తింటే, నేను ప్లేట్‌లోని నూనెని కూడా నాకేస్తాను.

***

1964

15. ‘ఆజ్ హమ్‍కో హఁసాయే నా కోయీ, ఆజ్ రోనే కో జీ చాహ్‍తా హై, ఔర్ భీ ముస్కురాయే నా కోయీ, ఆజ్ రోనే కో జీ చాహ్‍తా హై, హోంఠోం పే నా ఆయే కోయీ, ఆజ్ రోనే కో జీ చాహ్‍తా హై’ – బాద్షా (1964); సంగీతం ఎన్. దత్తా

16. ‘మేరే మహబూబ్ కయామత్ హోగీ, ఆజ్  రుస్వా  తేరీ గలియోం మే మొహబ్బత్ హోగీ, మేరీ నజరేం తో గిలా కరతీ హైఁ, తేరే  దిల్ కో  భీ సనమ్ తుజ్‌సే షికాయత్ హోగీ’ – మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే (1964); సంగీతం లక్ష్మీకాంత్ – ప్యారేలాల్

ఇది లక్ష్మీకాంత్-ప్యారేలాల్‌తో నాన్న మొదటి పాట, దీనిని జూలై 29, 1963న రికార్డ్ చేశారు. కిషోర్ కుమార్ దీనిని తనకు అత్యంత ఇష్టమైన పాటలలో ఒకటిగా పేర్కొన్నారు.

ఆనంద్ బక్షి కథానాయకుడి అనాలోచిత ప్రేమ వల్ల కలిగే వేదనని, కటుత్వాన్ని వ్యక్తం చేస్తారు. ఈ పాటలో కథానాయకుడు తన ప్రేయసిని ఉద్దేశించి: ‘మేరీ తరహ్ తు ఆహేం భరే, తూ భీ కిసీసే ప్యార్ కరే, ఔర్ రహే వో తుఝ్‌సే పరే, తూనే ఓ సనమ్, ఢాయే హై సితం, తో యే తు భూల్ నా జానా; కి నా తుజ్‌సే భీ ఇనాయత్ హోగీ, ఆజ్ రూస్‍వా తేరీ గలియోం మే మొహబ్బత్ హోగీ’ అని అంటాడు. అంతేకాదు, ఆమె ప్రేమ కూడా ఏదో ఒకరోజు తిరస్కరించబడుతుందని శపిస్తాడు.

తరువాతి నాలుగు దశాబ్దాలలో, కొత్త, పాత సంగీత స్వరకర్తలు, నటులు, గాయకులు, దర్శకులు, నిర్మాతలతో బక్షి చేసిన అనేక పాటలు, సినిమాలు ఘన విజయాలు సాధించాయి. ఉదయించే సూర్యుడిని ఆరాధించే పరిశ్రమలో, సహజంగానే, చాలా మంది చిత్రనిర్మాతలు ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకున్నారు.

ఇది ఆయన మూడవ సంతానం ‘దాబూ’ జన్మించిన సంవత్సరం, అది నా ముద్దుపేరు. నేను మార్చి 16, సోమవారం రాత్రి 10.30 గంటలకు జన్మించాను. నాన్న రెండో కూతురు రాణి (కవిత, ఆయన మాటల్లో, ‘మేరీ దూస్రీ బడీ కవితా’) మరుసటి సంవత్సరం, అంటే 1965 లో పుట్టింది. కూతుళ్ళు తమ తండ్రులకు గొప్ప అదృష్టాన్ని తెస్తారని ఆయన నానమ్మ చెప్పిన మాటలు మరోసారి నిజమయ్యాయి. ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’ దేశవ్యాప్తంగా హిట్ అయిన ఆయన మొదటి అద్భుతమైన విజయంగా నిలిచింది.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version