[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
అధ్యాయం 6 – 1956-1959 – రెండవ భాగం
భలా ఆద్మీ
1956లో ఆనంద్ బక్షికి సినిమాల్లో అవకాశం ఇచ్చిన మొదటి భలా ఆద్మీ (మంచి మనిషి) భగవాన్ దాదా. బక్షి ఆయన కార్యాలయంలోకి వెళ్లి రాయడానికి అవకాశం అడిగారు. దాదాపు రెండేళ్ళు గడిచినా ‘భలా ఆద్మీ’ సినిమా విడుదల కాలేదు. తర్వాత, బక్షికి మెరైన్ లైన్స్ రైల్వే స్టేషన్లో మరొక భలా ఆద్మీ అనుకోకుండా కలిశారు – అక్కడికి కవితలు రాయడానికి కొన్నిసార్లు వెళ్ళేవారు బక్షి.
బొంబాయిలో రెండవసారి జీవితం పట్ల ఖిన్నుడయ్యారు, నిరాశ చెందారు, భ్రమ తొలగింది. ఓ సైనికుడిగా జనం నుంచి ఇంతటి తిరస్కారాన్ని, అవమానాన్ని బక్షి, ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఆశలుడిగిన బక్షి, మెరైన్ లైన్స్ స్టేషన్లో అస్థిమితంగా కూర్చుని, మదిలో మెదులుతున్న ఆలోచనలను రాసుకుంటూ, ఓడిపోయిన సైనిక-కవిగా ఇంటికి తిరిగి వెళ్ళాలని తలపోస్తున్నారు. ఆ సమయంలో వెస్ట్రన్ రైల్వే టికెట్ చెకర్ ఆయన దగ్గరికి వచ్చారు, సరైన ట్రావెల్ టికెట్ చూపించమని అడిగారు. బక్షి దగ్గర టికెట్ లేదు. స్టేషన్లో కాలయాపన చేస్తున్నందుకు జరిమానా చెల్లించమని అడిగారు. జరిమానా కట్టేందుకు బక్షి దగ్గర డబ్బు లేదు. బక్షి తన నోట్బుక్లో కొన్ని ఉర్దూ కవితలు రాసుకున్నారని టికెట్ చెకర్ గమనించి దాని గురించి అడిగారు. యాదృచ్చికంగా, ఆ టికెట్ చెకర్కి కవిత్వమంటే చాలా ఇష్టం, పైగా ఈ టికెట్ లేని వ్యక్తి కవితలు రాస్తున్నాడని తెలుసుకున్న తర్వాత, రాసిన వాటిని చదివి వినిపించమంటూ బక్షి పక్కన కూర్చున్నారు. బక్షి కవితలు ఆయనను ఆకట్టుకున్నాయి, మరికొన్ని వినిపించమని అడిగారాయన. విన్నవన్నీ ఆయనకి నచ్చాయి.
అప్పుడాయన “ఇక్కడ ఏం చేస్తున్నారు?” అని బక్షిని అడిగారు. పిండి నుండి ఢిల్లీకి శరణార్థులుగా తన కుటుంబం చేసిన ప్రయాణం గురించి, బొంబాయిలో సినిమా కళాకారుడిగా తన రెండవ ప్రయత్నం గురించి అన్నీ చెప్పేసి, భారం దించుకున్నారు బక్షి. అప్పుడు ఆశ్చర్యకరంగా, ఆ టికెట్ కలెక్టర్ బక్షికి టీ, సమోసా ఇప్పించారు. స్నాక్ పూర్తయ్యే సమయానికి, టికెట్ కలెక్టర్ అకస్మాత్తుగా, “బక్షి, మీరు బాగా రాస్తారు. తిరిగి వెళ్ళకూడదు. ఇక్కడే బొంబాయిలోనే ఉండండి. మీకు బ్రేక్ వస్తుందని నాకు నమ్మకం ఉంది. ఈ రోజు గొప్ప పేరున్న సినిమా గీత రచయితల మాదిరిగానే మీ కవితలు కూడా బాగున్నాయి” అని అన్నారు.
బొంబాయిలో ఉండేందుకు బక్షి దగ్గర డబ్బు లేదని, బక్షి తండ్రిగారు, మామగారు ఇకపై ఆయనకి సాయం చేసేందుకు నిరాకరించారని తెలియగానే, ఆ టికెట్ చెకర్ – “నేను బోరివలిలో ఒంటరిగా నివసిస్తున్నాను. నా కుటుంబం ఆగ్రాలో ఉంటోంది. ఒంటరితనమెంతగానో వేధిస్తుంది, అందుకని నేను మీ సహవాసాన్ని కోరుకుంటున్నాను. మీరు నాతో ఉండండి, ఎటువంటి అద్దె ఇవ్వనవసరం లేదు. మీరు మీ కవితలను నాకు వినిపిస్తూ ఉండండి. మీకు పని దొరికినప్పుడు, మీరు మీ స్వంత బసని వెతుక్కోవచ్చు” అని సూచించారు. అదే రోజు, మే 1958లో, టికెట్ కలెక్టర్ చితర్ మల్ స్వరూప్ – బక్షి అనే అపరిచితుడిని బొంబాయిలోని బోరివలి వెస్ట్లోని ఎస్.వి. రోడ్లోని జావాలా ఎస్టేట్లోని 24 హెచ్ అనే నెంబరుగల తన ఇంటికి తీసుకెళ్లారు.
తర్వాత మూడు నాలుగు సంవత్సరాలు ఈ అపరిచితుడిని ఆయన తన ఇంట్లోనే ఉంచుకున్నారు! ఆయన నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, ఏ సహాయం కూడా అడగలేదు. తినడానికి, నిర్మాతలు, దర్శకులను కలిసి పని అడగడానికి వెళ్ళేందుకు ప్రయాణపు ఖర్చులకి రోజూ రెండు రూపాయలు పాకెట్ మనీ ఇచ్చేవారు. డబ్బు అడగడం బక్షికి అవమానంగా అనిపించకూడదని – కొన్నిసార్లు బక్షి ఖాళీ పర్సులో ఒకటి లేదా రెండు రూపాయలు ఉంచేవారు. ‘నా నుండి డబ్బు వసూలు చేయకుండా లేదా నేను కెరీర్లో స్థిరపడిన తర్వాత తిరిగి చెల్లించమని అడగకుండా ఆయన నాకు ఎందుకు సహాయం చేశాడని నేను ఎప్పుడూ అడగలేదు, తెలుసుకోలేదు. ఆయన నా జీవితంలో అత్యంత కఠినమైన సమయంలో సహాయం చేయడానికి నా బన్సీ వాలే పంపిన ఫరిస్తా (దేవదూత)’ అన్నారు బక్షి.
ఛితార్ మాల్ అంకుల్ సంవత్సరంలో సుమారు మూడుసార్లు మా ఇంటికి వచ్చేవారు. నాన్న కోసం, మాకోసం ఆయన ఎప్పుడూ ఆగ్రా కా పేఠా తెచ్చేవారు. నాన్న తన జీవితంలో ఎవరినీ ‘ఉస్తాద్’ అని సంబోధించడం నేను ఎప్పుడూ వినలేదు. ఛితార్ మాల్ అంకుల్ని తప్ప. ఆయన నాన్నను ‘బక్షిజీ’ అని పిలిచేవారు. 90ల చివరలో, నాన్న తన ఉస్తాద్కు ఋణపడి ఉన్న డబ్బును తిరిగి చెల్లించడానికి ప్రయత్నించారు. 60 ఏళ్ల వయసులో రైల్వేల నుండి పదవీ విరమణ చేసిన తర్వాత ఛితార్ మాల్ అంకుల్ మనసులో ఉన్న ఏవైనా వ్యాపార ఆలోచనలుంటే, వాటికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు నాన్న. ఉస్తాద్ ఛితార్ మాల్ తన ప్రియమైన స్నేహితుడి ముఖం మీదే – ‘పదవీ విరమణ చేసిన తర్వాత నా కోసం ఎలాంటి వ్యాపారం ఏర్పాటు చేసుకోవడంలో నాకు ఆసక్తి లేదు. ఇంకెప్పుడూ ఇలాంటి ప్రతిపాదన చేయద్దు. నేను అప్పట్లో మీ కోసం ఏమి చేశానో దానికి నేను మీ నుండి ఏ ప్రతిఫలం ఆశించలేదు. మనం కలుసుకోవటం విధి నిర్ణయం. దానికి మించినది ఏమీ లేదు.’ అన్నారు.
అందుకే, ఆనంద్ బక్షికి ఇద్దరు అమ్మలు ఉన్నారని నేను నమ్ముతున్నాను, వారిలో ఒకరు ఆయనకి జన్మనిచ్చిన సుమిత్ర బాలి, రెండో వారు ఉస్తాద్ చితార్ మాల్. ‘చితర్ మాల్ నన్ను ఢిల్లీకి లేదా సైన్యానికి తిరిగి వెళ్ళకుండా ఆపి ఉండకపోతే – నేను, వివాహితుడిని, రెండేళ్ల పాపతో, ఇంటికి తిరిగి వెళ్లి ఉండేవాడిని; మూడవ ప్రయత్నం చేయడానికి నాకు మార్గం, సంకల్పం లేదా ధైర్యం ఉండేది కాదు.’ ఆనంద్ బక్షి 2002లో మరణించే వరకు ఆయన మార్గంలో లభించిన ప్రతి సినిమా అవకాశానికి ఈ భలా ఆద్మీ బాధ్యత వహించారు. చితర్ మాల్ అంకుల్ 2001లో మరణించారు.
చితర్ మాల్ స్వరూప్ ఆశ్రయం పొందిన బక్షి ఎట్టకేలకు ఆ పరాయి నగరంలో తనకు అవసరమైన తాత్కాలిక స్థిరత్వాన్ని పొందారు. పని కోసం పోరాటం మరో సంవత్సరం పాటు, బక్షి ప్రఖ్యాత సంగీత దర్శకుడు రోషన్ గారిని కలిసే వరకు కొనసాగింది. బక్షి తన మొదటి రెండు హిట్ పాటలను సృష్టించడం కోసం రోషన్ గారిని కలవడం ఆయన ప్రారంభ సంవత్సరాల్లో మరో మలుపు. అత్యంత సవాళ్ళతో కూడిన ఈ కాలంలో బక్షి కలిసిన మరో ప్రసిద్ధ స్వరకర్త ఎస్. మోహిందర్ (మొహిందర్ సింగ్); తర్వాత వారు కలిసి చాలా సినిమాలు చేసి గొప్ప స్నేహితులు అయ్యారు. నాలుగు సంవత్సరాల క్రితం మోహిందర్జీ ఈ సంఘటనను నాకు గుర్తుచేశారు, ‘ఒక రోజు, మీ నాన్న నేనూ బాగా తాగాము, రాత్రయింది, కానీ ఇంటికి వెళ్ళడానికి నిరాకరించాడు, అతన్ని ఇంటికి తీసుకెళ్లే లోకల్ ట్రెయిన్ను ఎక్కడానికి తిరస్కరించాడు. నేను అతనికి వీడ్కోలు చెప్పడానికి స్టేషన్కు వెళ్ళాను. ప్లాట్ఫారమ్పై, అతను తదుపరి లోకల్ ట్రెయిన్ ఎక్కి ఇంటికి వెళ్లాలని నేను బ్రతిమాలుతూనే ఉన్నాను, కానీ మీ నాన్న మరికొంత సమయం గడపాలని అనుకున్నాడు. “చల్ మేరే భాయ్, తేరే హాత్ జోడ్తా హూఁ, పాఁవ్ పఢ్తా హూఁ, చల్ మేరే భాయ్ అబ్ ట్రైన్ పె చఢ్ జా.” అని వేడుకున్నాను. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ‘నసీబ్’ సినిమా కోసం రిషి కపూర్, అమితాబ్ బచ్చన్ లపై తీసిన పాటలో బక్షి ఈ లైన్ను ఉపయోగించాడు. ఆ పాట విన్నప్పుడు, నేను బిగ్గరగా నవ్వుకున్నాను, మా డ్రింకింగ్, మొఘలాయ్ ఫుడ్ సెషన్లు కలిసి కొన్ని గొప్ప పాటల రికార్డింగ్లను పోస్ట్ చేశాయని గుర్తుచేసుకున్నాను’.
***
‘రస్తా బనా లే అప్నా’
50లలోని అగ్రశ్రేణి సంగీత స్వరకర్తలలో రోషన్ లాల్ నాగ్రథ్ ఒకరు. విజయవంతమైన స్వరకర్తలను కలవడానికి చేసిన అనేక ప్రయత్నాలు విఫలమైన తర్వాత, బక్షి 1959లో గోరేగావ్లోని ఫిల్మిస్తాన్ స్టూడియోలో రోషన్ గారిని కలిశారు. గీత రచయితగా బక్షి కోరికని అంగీకరించి, శాంతాక్రూజ్లోని తన ఇంటికి వచ్చి కవితలు వినిపించమని అడిగారు రోషన్. అయితే, తేదీ సమీపిస్తున్న వేళ, రోషన్ సాబ్ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. ఇలా తరువాతి కొన్ని వారాలలో మూడు లేదా నాలుగు సార్లు జరిగింది. దీనితో బక్షి ఆయనను కలవాలని, తన కవితలను వినిపించాలని మరింత తహతహలాడారు. రోషన్ సాబ్ చాలా డిమాండ్ ఉన్న స్వరకర్త, చాలా బిజీగా ఉండేవారు. ఒకరోజు, ఆయన బక్షికి అపాయింట్మెంట్ ఇచ్చారు: ‘బక్షి, తుమ్ నా ఐసా కరో, కల్ సుబా దస్ బజే మేరే ఘర్ పర్ ఆ జానా. తుమ్హారే గానే సునూంగా (బక్షి, ఒక పని చెయ్యి, రేపు ఉదయం పది గంటలకు మా ఇంటికి రా. నేను నీ పాటలు వింటాను).’
ఉత్సాహంగా బక్షి బోరివలిలోని తన బసకి తిరిగి వచ్చి, ఈ సమావేశం మళ్ళీ రద్దు కాకూడదని ప్రార్థించారు. ఆ రాత్రి, పెద్ద వర్షం కురిసింది, ఉదయాకి నగరం మునిగిపోతుందేమోనని బక్షికి అనిపించింది. లోకల్ ట్రెయిన్స్, బెస్ట్ బస్సులు నడవడం ఆగిపోయాయి. నగరం నీట మునిగింది. తెల్లారేసరికి, రోషన్ సాబ్ను కలవకుండా వర్షం తనను ఆపడానికి ప్రయత్నిస్తోందని, విధి తనపై కుట్ర చేస్తోందని బక్షి భయపడ్డారు. అయితే తనను తాను ఓ సిపాయిగా భావించారు, తను పొందిన సైనిక శిక్షణను గుర్తు చేసుకున్నారు, ఈ రోజు శత్రువును (అది వర్షం అయినా లేదా విధి అయినా) గెలవనివ్వకూడదని నిర్ణయించుకున్నారు.
బోరివాలి వెస్ట్ నుండి శాంటాక్రూజ్ వెస్ట్లోని రోషన్ సాబ్ నివాసానికి నడవడానికి కనీసం మూడు గంటలు పడుతుందని లెక్కించి ఆ మాజీ సిపాయి వ్యూహరచన చేశారు. మాజీ పదాతిదళ సిపాయికి నడక పెద్ద విషయం కాదు. సైన్యం ఆయనకి ఎక్కువ దూరం జాగింగ్ చేయడంలో శిక్షణ ఇచ్చింది. సమావేశ సమయం ఉదయం 10 గంటలకు, అందుకు నాలుగు గంటలు ముందుగానే బయలుదేరారు బక్షి. తన కవితల డైరీని ఓ తువ్వాలుతో కప్పి, గొడుగు తీసుకొని ఆ తుఫాను వర్షంలో శాంతాక్రూజ్కు నడవడం ప్రారంభించారు.
నిర్ణీత సమయానికి ముందే శాంతాక్రూజ్ చేరుకున్నారు! ఆ అలవాటు దశాబ్దాలుగా ఆయన పాటించారు. చిత్రనిర్మాత సుభాష్ ఘాయ్ నాతో ఓసారి, ‘మీ నాన్నగారి ఉత్తమ లక్షణం సరళమైన, రోజువారీ పదాలలో లోతైన ఆలోచనలను వ్రాయగల సామర్థ్యం కాదు, కానీ ఆయన క్రమశిక్షణ, సమయం పట్ల గౌరవం. నేను రాయమని అడిగిన ఒక్క పాటను కూడా ఆయన ఎప్పుడూ ఆలస్యం చేయలేదు.’ అని అన్నారు.
1959 నాటి బక్షి గారి సంగతికి తిరిగి వద్దాం. గాలి ఉధృతికి గొడుగు విరిగిపోయింది, తోలు చెప్పులు నీళ్ళల్లో కొట్టుకుపోయాయి, పాటల డైరీ వర్షపు నీటితో తడిసిపోయింది. అయినప్పటికీ, తను రాసిన పేజీలు, పదాలు చెక్కుచెదరకుండా ఉండటం చూసి ఆయన సంతోషించారు. వర్షం నుండి తన డైరీని కాపాడుకోవడానికి విరిగిన గొడుగును ఉపయోగించి, విజయం సాధించారు. తన కలల నగరం బొంబాయికి రెండవసారి వచ్చినప్పుడు తనతో తీసుకెళ్లిన అరవై కవితలు ఈ డైరీలో ఉన్నాయి.
దాదాపు పంతొమ్మిది కిలోమీటర్లు నడిచారు. రోషన్ సాబ్ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి బెల్ కొట్టారు. రోషన్ సాబ్ తడిసిపోయిన బక్షిని చూడగానే, ‘అరె బక్షి, తుమ్ ఆద్మీ హో యా భూత్? తుమ్ ఐసీ తూఫానీ బర్సాత్ మే క్యూఁ ఆయే? తుమ్హారా ఆనా ఇత్నా జరూరీ నహీ థా (నువ్వు మనిషివా లేక దెయ్యానివా? ఈ భారీ వర్షంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది అవసరం లేదు)’ అన్నారు.
‘ఆప్నే ముఝే ములాయా థా ఆజ్ దస్ బజే, మేరీ కవితాయేఁ సున్నే కే లియే (ఈ రోజు పది గంటలకు మీరు రమ్మన్నారు, నా కవితలు వినడానికి)’
‘హాఁ, బులాయా థా, మగర్ కామ్ ఇత్నా జరూరీ నహీఁ థా (అవును, నేను నిన్ను రమ్మన్నాను, కానీ అది అంత ముఖ్యమైనది కాదు.)’
‘సాబ్, ఆప్ కే లియే జరీరీ న కో, మగర్ మేరీ లియే ఆప్ మేరీ కవితా సున్నా బహుత్ జరూరీ థా (సాబ్, బహుశా అది మీకు ముఖ్యం కాకపోవచ్చు, కానీ నా కవితలు మీరు వినేలా చేయడం నాకు చాలా ముఖ్యం.)’
బక్షి నిబద్ధతకి ముగ్ధులైన రోషన్ సాబ్, ‘సిఐడి గర్ల్’ (1959) సినిమాలో పాటల రచయితగా అవకాశం ఇచ్చారు. ఇది బక్షి జీవితంలో ఒక మలుపు. రోషన్ సాబ్తో ఆయన మొదటి పాట హిట్ అయింది. నిజానికి, బక్షి మొదటి రెండు హిట్ పాటలు ఈ సినిమా నుండే వచ్చాయి. దాంతో ఈ ఇద్దరూ కలిసి పని కొనసాగించారు: మైనే జీనా సీఖ్ లియా (1959), వారెంట్ (1961), వల్లా క్యా బాత్ హై (1962), కమర్షియల్ పైలట్ ఆఫీసర్ (1963), బేదాగ్ (1965) దేవర్ (1966) వంటి సినిమాలకు స్వరకల్పన, గీత రచన చేశారు.
రోషన్ సాబ్ లాంటి పెద్ద స్వరకర్త కొత్త కవి ఆనంద్ బక్షితో కలిసి పనిచేసిన తర్వాత, మరికొందరు స్వరకర్తలు కూడా ఆయనకి అవకాశాలివ్వసాగారు. కానీ ఆ రోజుల్లో సినీరంగాన్ని శాసిస్తున్న స్వరకర్తలకు బక్షి గురించి ఇంకా తెలియదు. చాలా సంవత్సరాల తరువాత, రోషన్ సాబ్ కుమారుడు రాజేష్ రోషన్ తన సంగీత జీవితాన్ని ప్రారంభించినప్పుడు, ఆనంద్ బక్షి దేశంలోని అగ్రశ్రేణి పాటల రచయితలలో ఒకరు, కాగా ఈసారి కొత్త వ్యక్తి రోషన్ సాబ్ కుమారుడు రాజేష్. ఈ ఇద్దరు కలిసి పని చేసిన చిత్రం ‘జూలీ’ (1975), దీనికి ఆనంద్ బక్షి పాటలు రాయగా, రాజేష్ రోషన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని పాటలు – ‘భూల్ గయా సబ్ కుచ్, యాద్ నహీ అబ్ కుచ్’, ‘దిల్ క్యా కరే జబ్ కిసీ కో, కిసీ సే ప్యార్ హో జాయే’ – బాగా ప్రాచుర్యం పొందాయి. నేటికీ వినబడుతూనే ఉంటాయి.
గీత రచయిత ఆనంద్ బక్షి ఇప్పుడు సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమా పాటలు చేస్తూ కొంత పని పొందుతున్నప్పటికీ, లక్నోలో తన కుటుంబాన్ని పోషించుకోలేకపోయారు. అతను ‘అదనపు’ పనిగా నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నించసాగారు. నటుడిగా లేదా గీత రచయితగా పని కోసం స్టూడియోల చుట్టూ తిరిగారు. ‘జో భీ కామ్ మిలే, భగవాన్ కా ప్రసాద్ (నాకు ఏ పని దొరికినా అది దేవుడి వరం లాంటిది). నాకు డబ్బు అవసరమైనప్పుడు నా స్నేహితులను, నేను కలిసి పనిచేసిన సంగీత స్వరకర్త మోహిందర్ సింగ్జీని కూడా నటనావకాశాల కోసం అడిగేవాడిని. 1966లో, నేను ‘పిక్నిక్’ అనే సినిమాలో ఒక పాట పాడే ఫకీర్గా నటించాను’.
లక్నోలోని కమల పుట్టింట్లో, బక్షి మామగారు, ప్రస్తుతం రిటైర్డ్ సుబేదార్గా తన ఆర్మీ పెన్షన్తో జీవిస్తున్నారు. ఒక ప్రముఖ పిండి కుటుంబానికి చెందిన బిడ్డ, ఇప్పటికే సురక్షితమైన ఆర్మీ ఉద్యోగాన్ని వదిలి, సినిమా కెరీర్ కోసం ప్రయత్నిస్తూ, తన విలువైన డబ్బు, సమయం, ఇంకా యవ్వనాన్ని వృథా చేస్తున్నాడని తీవ్ర నిరాశ చెందారు. అంతేకాకుండా, బక్షి తన భార్యనీ, కూతురుని వారి సంరక్షణలో వదిలి, తన కుటుంబం పట్ల తన ధర్మాన్ని ఒక భ్రమ కోసం త్యాగం చేశాడని మామగారు భావించారు.
1959లో, అమర్ సింగ్ తన అల్లుడికి లేఖ రాస్తూ, అతని భార్య కమలని, కుమార్తె సుమన్లను లక్నోలోని తమ ఇంటి నుండి తీసుకెళ్లి బొంబాయిలో తనతో పాటు ఉంచుకోవాలని కోరారు. భర్తగా భార్యతో ఉండటం అతని కర్తవ్యమని అమర్ సింగ్ తన ఆజ్ఞాపించే స్వరంలో రాశారు.
‘1958లో, కమల తన వ్యక్తిగత ఖర్చులకు కోసం కటింగ్ మరియు టైలరింగ్ ట్రేడ్లో అర్హత సాధించడానికి లక్నోలోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఒక ప్రొఫెషనల్ కోర్సులో చేరింది. కనీసం మూడు నుండి నాలుగు సంవత్సరాలుగా, లక్నో వెళ్ళి వాళ్లని చూడడానికి నాకు ఆర్థిక స్తోమత లేదు. నా కుటుంబాన్ని పోషించడానికి రచయితగా ఇంకా ఉద్యోగం దొరకలేదని నేను అవమానంగా భావించాను. నా పెద్ద కూతురు తన బాల్యం, టీనేజ్లను నా అత్యంత కఠినమైన ఆర్థిక కాలంలో గడిపింది. నా నలుగురు పిల్లల్లో తనే నాకు ఎల్లప్పుడూ ఇష్టమైన బిడ్డగా ఉంటుంది.
నా కుటుంబం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కమల, ఆమె తల్లిదండ్రులు నాపై చాలా కోపంగా ఉన్నారు. దాదాపు మూడు సంవత్సరాల విరామం తర్వాత, 1960 ప్రాంతంలో నేను వాళ్ళని చూడ్డానికి వెళ్ళినప్పుడు, నా కుమార్తె సుమన్ నన్ను గుర్తుపట్టలేదు. నేను ఆమె తండ్రినా అని కమలను అడిగింది. కమల “ఆయన మీ నాన్న కాదు. మమ్మల్ని చూడటానికి వచ్చిన ఓ అపరిచితుడు” అని కోపంగా అంది. కమల ఇచ్చిన షరతులు లేని మద్దతు కారణంగా నేను గీత రచయితగా నాలుగు దశాబ్దాల పాటు ఉన్నతంగా నిలబడగలిగాను. ఆమె నా కెరీర్కు, మా కుటుంబానికి మూలస్తంభం.
సినిమాల్లో పనిచేయాలనే నా మక్కువ కారణంగా, మా పెళ్ళయిన తొలినాళ్లలో నా భార్య, నా కూతురుతో కలిసి ఆమె పుట్టింట జీవించాల్సి రావడం నన్నెంతో బాధించింది. నేను వారిని మిస్ అయ్యాను, తరచుగా వారి ఫోటోలను చూసుకునేవాడిని, ఎందుకంటే నేను వారిని చూడడానికి వెళ్ళలేను, కనీసం వారికి ఫోన్ చేయడానికి, ఖరీదైన ఎస్టిడి కాల్స్ ద్వారా వారితో మాట్లాడటానికి సరిపడా డబ్బు ఉండేది కాదు.
నేను పాటలు రాశాను, ఎందుకంటే అది నాకు వృత్తి కంటే ఎక్కువ మక్కువ. కానీ నా కుటుంబం నా మక్కువకు భారీ మూల్యం చెల్లించుకోకుండా ఉండటానికి, దాని నుండి డబ్బు సంపాదించాలని నేను గట్టిగా కోరుకున్నాను. నా ప్రతిభకు గుర్తింపు లభించకపోవడం వల్ల నాకున్న కోపం; ఉద్యోగం లేదా ఆదాయం దొరకకపోవడం వల్ల నాకున్న నిరాశ – నన్ను మరింత దృఢ నిశ్చయంతో, ఆర్థికంగా విజయం సాధించడమే కాకుండా విజేతగా, ఉత్తమ గీత రచయితగా మారాలని మరింత దృఢ సంకల్పంతో నిలిపాయి. సైన్యంలో, మా కమాండింగ్ ఆఫీసర్ శిక్షణ పొందుతున్నప్పుడు ఈ పదాలను ఉపయోగించి మమ్మల్ని ప్రేరేపించేవారు, “సైన్యంలో రన్నరప్లు ఎవరూ లేరు. మీరు శత్రువును చంపాలి లేదా వారి ఖైదీగా మారాలి. మీరు నంబర్ 1, విజేతగా ఉండాలి.” నేను నా భార్య, కుమార్తె, పెద్ద కొడుకును – 1963 మే 13న బొంబాయిలో నాతో నివసించడానికి తీసుకురాగలిగాను. నేను ఈ తేదీని నా డైరీలో రాసుకున్నాను; అది నాకెంతో విలువైనది. పాటలు రాసేటప్పుడు వారిని నాతో ఉంచుకోవడం.. నాకెంతో బావుంది. నా జీవితాంతం, నేను ఎల్లప్పుడూ నా బెడ్రూమ్లో, నా మంచం మీద కూర్చొనే పాటలు రాశాను. నాకు ఎప్పుడూ డెస్క్ అవసరం పడలేదు. రాయడానికి ఏదైనా హోటల్లో గది కోసం నేను ఎప్పుడూ అడగలేదు. నేను వారికి డబ్బు ఆదా చేసానని నా నిర్మాతలు నన్ను ఇష్టపడ్డారు.’
నాన్నగారు రాసేటప్పుడు చాలా అరుదుగా తన పాటలు వినమని చెప్పేవారు. కొన్నిసార్లు తాను రాసిన రొమాంటిక్ పాటలోని లిరిక్స్ పాడి అమ్మకు వినిపించేవారు. ఆమె నాన్న బెడ్ రూమ్లో ఎక్కువ సమయం గడుపుతూనే తన పనులు తాను చేసుకుంటూ ఉండేది. ఆమె ఎప్పుడూ ఇంట్లో ఉండాలని లేదా మాలో ఎవరైనా ఇంట్లో ఉండాలని నాన్న కోరుకునేవారు. మాలో ఎవరమూ లేకుంటే కొన్నిసార్లు ఆయన ఆందోళన చెందేవారు. ఎవరూ లేనప్పుడు, ఎటువంటి కారణం లేకుండా నన్ను ఇంట్లోనే ఉంచినందుకు నేను బాధపడ్డ రోజులు ఉన్నాయి. ఆయన మరణించిన తర్వాత, ఆయన పర్సనల్ డైరీ చదివాకే, ఒంటరిగా ఉండటం వల్ల ఆయనకు కలిగే ఆందోళన నాకు అర్థమైంది. నాన్నను నేను బాగా అర్థం చేసుకునుంటే బాగుండేది.
(మళ్ళీ కలుద్దాం)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.