Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు-11

[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

అధ్యాయం 6 – 1956-1959 – మొదటి బాగం

జిందగీ హర్ కదమ్ ఏక్ నయీ జంగ్ హై

1956లో, ఆనంద్ ప్రకాష్ బక్షి బొంబాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెండవ ప్రయత్నం చేశారు. అక్కడ ఎదురయ్యే సవాళ్ళ గురించి తెలుసాయనకి. ‘నేను కళాకారుడిని అవుతాను లేదా టాక్సీ నడుపుతాను. కానీ గౌరవప్రదమైన జీవనోపాధి లేకుండా నేను తిరిగి వెళ్ళను.’ అని నిశ్చయించుకున్నారు. అప్పటికే ఆయనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, పైగా సైన్యంలో శిక్షణ పొందుతున్న సమయంలో సైనిక, వాణిజ్య అవసరాల కోసం రవాణా ట్రక్కులను నడిపిన అనుభవం ఉంది. టాక్సీ నడపడాన్ని పార్ట్‌టైమ్ వృత్తిగా స్వీకరించడం – సినిమాల్లో అవకాశం దొరికే వరకు బొంబాయిలో తన జీవితాన్ని నిలబెట్టుకునే ఒక మార్గంగా మారవచ్చని ఆయన భావించారు. ‘నాకు వేరే విద్యార్హతలు లేవు, కుటుంబ మద్దతు లేదు కాబట్టి నేను ఇతరులకన్నా ఎక్కువ కష్టపడి పని చేయాల్సి వచ్చింది’ అన్నారాయన.

బక్షి తొలుత దాదర్ రైల్వే స్టేషన్‌లోని వెయిటింగ్ రూమ్‌లో బస చేశారు. కొన్ని రోజుల తర్వాత, తులసి పైప్ రోడ్‌లో ఉన్న దాదర్ గెస్ట్ హౌస్‍లో ఒక గదిని అద్దెకు తీసుకున్నారు, ఆ తర్వాత ఖార్ వెస్ట్‌లోని హోటల్ ఎవర్‌గ్రీన్ (తరువాత హోటల్ గురుగా పిలవబడింది)కి మారారు. ఆయన తన సమయమంతా పాటలు రాయడంలో గడిపేవారు. ఆ హోటల్ కొంతమంది ప్రముఖ స్వరకర్తల ఇళ్లకు దగ్గరగా ఉండేది – ఎస్‌డి బర్మన్ ఖార్‌లో, రోషన్ శాంతాక్రూజ్‌లో ఉండేవారు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, ఆయన శ్రీమతి కూడా హోటల్ ఎవర్‌గ్రీన్‌ లోనే బస చేసేవారు. వారిద్దరూ తమ పనులకై ప్రతిరోజూ ఉదయమే బయలుదేరేవారు. బక్షి తక్కువ మాట్లాడేవారు, ఎక్కువ రాసేవారు. కొన్నిసార్లు తన కవితలతో, పాటలతో చుట్టూ ఉన్నవారిని అలరించేవారు. సమీపంలోని ఒక స్వీట్ షాపులో భోజనం చేసి, కిళ్ళీ తినేవారు.

బక్షి – ఉర్దూలో స్వదస్తూరీతో రాసిన ఎన్నో కాగితాలను చింపి గదిలో పారేసేవారనీ, కిళ్ళీలు తెగ తినేవారని ఆయన గదిని శుభ్రం చేసే వ్యక్తి ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూండేవాడు!

బొంబాయిలో బ్రహ్మచారి జీవితం గడిపే బక్షి,  భోజనం ముగించుకుని రాయడం ప్రారంభించేవారు. ఖార్ స్టేషన్ సమీపంలోని ఒక స్వీట్ షాపు బయట వీధి దీపం కింద నిలబడి రాసేవారు. ఆ స్వీట్ షాపు యజమానికి కవిత్వం అంటే చాలా ఇష్టం. త్వరలోనే బక్షితో స్నేహం ఏర్పడింది. కొన్ని నెలల తర్వాత, అతను బక్షితో, ‘చూడండి బక్షి, నాకు మీ కవితలు ఇష్టం, మీరంటే ఇష్టం. కాబట్టి మీకో నిజం చెప్తాను, దాన్ని మీరు ఎవరితోనూ పంచుకోకూడదు. మా రబ్డీని మందంగా చేయడానికి బ్లాటింగ్ పేపర్‌ వాడతాం. మీకు రబ్డీ అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు, అందుకే నేను మిమ్మల్ని మోసం చేయాలనుకోవడం లేదు. కాబట్టి మా రబ్డీని తినవద్దు’ అన్నాడు.

1950లలో, మొదటిసారి బొంబాయికి వచ్చినప్పుడు, అవకాశాలు పొందడం కష్టమైంది. రచయితలు, స్వరకర్తలు, చిత్రనిర్మాతలు – స్థిరమైన జట్లలో పనిచేసేవారు; వారికి ఇష్టమైన వ్యక్తులు ఉండేవారు, అందుకని కొత్తవాళ్ళతో ‘ప్రయోగాలు’ చేయాలనుకునేవారు కాదు. సినిమా నిర్మాణం ఎంతో వ్యయంతో కూడుకున్నది, పైగా చిత్రనిర్మాతలు చాలా మూఢనమ్మకాలు కలిగి ఉంటారనేది నా స్వీయ అనుభవం కూడా. వారు తరచుగా, గుడ్డిగా హిట్‌లను అనుసరిస్తారు, ఫ్లాప్‌లతో సంబంధం ఉన్న వ్యక్తులను దూరం పెడతారు. 50వ, 60వ దశకాలలో, స్వరకర్తలు – గీత రచయితలు చాలా సన్నిహితంగా ఉండేవారు, ఒక కొత్త వ్యక్తి స్వరకర్తల దృష్టిని సులభంగా ఆకర్షించలేకపోయేవాడు. అవకాశమివ్వమని అడగడానికి ప్రతిరోజూ ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులను కలవడం ఒక అలవాటుగా చేసుకున్నారు బక్షి. మహాలక్ష్మిలోని ప్రసిద్ధ స్టూడియోలు, దాదర్‌లోని కర్దార్ స్టూడియోలు, గోరేగావ్‌లోని ఫిల్మిస్తాన్ వంటి సినీ స్టూడియోలను కూడా ఆయన ప్రతిరోజూ సందర్శించేవారు. బక్షి తాను పాటలు కూడా పాడతానని అడగడంతో, కొంతమంది స్వరకర్తలు, గీత రచయితగా అతన్ని పట్టించుకోలేదు, బహుశా అది ఆయనకి వ్యతిరేకంగా పని చేసి ఉండవచ్చు.

హరిప్రసాద్ చౌరాసియా భార్య అనురాధ రాయ్ నాతో ఒకసారి, “50ల చివర్లో లేదా 60ల ప్రారంభంలో, నేను మావారు బస చేసిన గెస్ట్ హౌస్‌లోనే (ఎవర్‌గ్రీన్ హోటల్, ఖార్ స్టేషన్ రోడ్, ఖార్ వెస్ట్) బక్షిగారు కూడా బస చేశారు. వారి కుటుంబం లక్నోలో ఉంటోందని విన్నాను. కుటుంబాన్ని బొంబాయికి తీసుకురావడానికి స్తోమత లేకపోవడంతో ఆయన ఇక్కడ ఒంటరిగా నివసించారు. మా గదులు ఒకే అంతస్తులో ఉండేవి, కాబట్టి నేను ఆయన గదిని దాటి వెళ్తున్నప్పుడు, బక్షిజీ గదిలో చాలా నలిగిన కాగితాలు దొరికాయని స్వీపర్, తరచూ నాతో ఫిర్యాదు చేసేవాడు. బక్షిజీ ఏమి రాశారో అని నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే ఆయన ప్రతిరోజూ చాలా కాగితాలను పారేసేవారు, దాంతో పాపం స్వీపర్ పని కష్టమయ్యేది. రెండు దశాబ్దాల తర్వాత, మేము బాంద్రాలో ఒకే రెసిడెన్షియల్ బిల్డింగ్‍లో నివసించాము. మేము ఆయనకి పై అంతస్తులో ఉండేవాళ్ళం. ప్రతిరోజూ మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం – ఉత్తమ స్వరకర్తలు, నిర్మాతలు, దర్శకులు, నటులలు ఖరీదైన కార్లలో రావడం చూశాము. వారి ఇంట్లో రాత్రి 9 లేదా 10 గంటల వరకు మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగేవి. అప్పట్లో ఆ స్వీపర్‌కి తన హోటల్‌కి వచ్చిన అతిథి ఒకరోజు ఇంత పెద్ద గీత రచయిత అవుతాడని తెలియదు” అన్నారు.

బొంబాయిలో కొన్ని నెలలు గడిపిన తర్వాత, ట్రక్ డ్రైవర్ లేదా కార్ డ్రైవర్‌గా పని దొరకనప్పుడు, బక్షి మోటార్ మెకానిక్ లాగా నటించి ఉద్యోగం సంపాదించారు. కానీ ఆయనకి ఆ పనిలో నైపుణ్యం లేదని – మొదటి రోజునే కార్ గ్యారేజ్ యజమానికి అర్థమైపోయింది, ఆయన్ని పంపించేశాడు.

ఈ చిన్న చిన్న దురదృష్టాలను పక్కన పెడితే, బక్షి త్వరలోనే తన మొదటి సినిమాకి రాయబోతున్నారు, దానిని ఆయన తన అతిపెద్ద సినిమాగా భావించారు! దశాబ్దాల తర్వాత వచ్చిన షోలే, దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే వంటి సినిమాల కంటే చాలా పెద్దది.

***

‘మేరీ సబ్ సే బడీ ఫిల్మ్’

అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ, దాచుకున్న డబ్బులు అయిపోతాయేమోనని భయపడుతూ, బక్షి బొంబాయిలోని అన్ని సినిమా స్టూడియోలు, పాటల రికార్డింగ్ స్టూడియోలను సందర్శించేవారు. ఎవరైనా చిత్రనిర్మాత లేదా స్వరకర్త అయినా కలుస్తారేమోనని చాలా గంటలపాటు వేచి ఉండేవారు. ఈ మాజీ సిపాయి తన గదికి తిరిగి వచ్చే ముందు ప్రతిరోజూ కనీసం ఐదుగురు వ్యక్తులను కలవాలని లక్ష్యంగా పెట్టుకుని, యుద్ధ కసరత్తులాగా, ఇదంతా వ్యూహరచన చేశారు.

అలాంటి ఒక వ్యూహాత్మక సందర్శన సమయంలో, అతను రంజిత్ స్టూడియోస్‌లో నటుడు భగవాన్ దాదా (భగవాన్ అభాజీ పాలవ్) ఆఫీస్ బయట వేచి ఉన్నారు బక్షి. ఆ రోజుల్లో భగవాన్ దాదా ఒక స్టార్ యాక్టర్, బ్రిజ్ మోహన్ నిర్మాతగా తన స్వీయ దర్శకత్వంలో ‘భలా ఆద్మీ’ అనే సినిమా తీస్తున్నారు. భక్షి ‘ఆఫీస్ బాయ్’తో స్నేహం చేశారు, ఆరోజు సాంగ్ సిటింగ్ కోసం రావల్సిన గీత రచయిత రాకపోవడంతో, ఒత్తిడికి లోనైన భగవాన్ దాదా ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారని తెలుసుకున్నారు. బక్షి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని భగవాన్ దాదాను కలిసారు – అవకాశం అడగడానికి నేరుగా ఆయన క్యాబిన్‌లోకి దూసుకెళ్లడం ద్వారా!

భగవాన్ దాదా ఆశ్చర్యపోయి, ఏమి కావాలని అడిగారు. బక్షి తాను అవకాశం కోసం చూస్తున్న గీత రచయితనని చెప్పారు. భగవాన్ దాదా, ‘నువ్వు పాట రాయగలవో లేదో చూద్దాం’ అని అన్నారు. ఆ తర్వాత అతను సినిమా కథను బక్షికి వివరించి, పాట రాయడానికి పదిహేను రోజులు సమయం ఇచ్చారు.

పదిహేను రోజుల్లోనే, బక్షి నాలుగు పాటల సాహిత్యాన్ని రాయగలిగారు. అది ఆయనకి అంత కష్టమైన పని కాదు, ఎందుకంటే సైన్యంలో ఉన్న రోజుల్లో చూడటానికి ఇష్టపడే కొన్ని చిత్రాలలోని అన్ని పాటలను, తన మాటల్లోనే, ఆయన తిరిగి రాసేవారు. భగవాన్ దాదాకు నాలుగు పాటలూ నచ్చాయి, దాంతో ఆ చిత్రానికి రెండవ గీత రచయితగా బక్షిని ఎంచుకున్నారు. అది ఒక యాక్షన్ సినిమా, నంద్ తన బాల్యపు వయసులో చూడటానికి ఇష్టపడే జానర్.

ఈ నాలుగు పాటలకుగాను ఆయనకి 150 రూపాయల పారితోషికం ఇచ్చారు. మొదటగా – ‘ధర్తి కే లాల్, నా కర్ ఇత్నా మలాల్, ధర్తీ తేరే లియే, తు ధర్తీ కే లియే’- అనే పాటని 9 నవంబర్ 1956న రికార్డ్ చేశారు.  స్వరకర్త నిసార్ బాజ్మీ కొన్ని సంవత్సరాల తర్వాత పాకిస్థాన్‌కు వలస వెళ్ళారు.

రెండోసారి బొంబాయి వెళ్ళిన రెండు నెలల్లోనే ఆనంద్ బక్షీ   గీత రచయితగా  సినీ రంగంలో అడుగుపెట్టాడు. ‘నేను ప్రపంచాన్ని జయించానని అనుకున్నాను! నా సమస్యలన్నీ ముగిశాయని అనుకున్నాను. అవి ఇప్పుడే ప్రారంభమయ్యాయని నేను గ్రహించలేదు!’ అన్నారాయన.

ఆ సినిమా పూర్తి కావడానికి రెండు సంవత్సరాలు పట్టింది, బాక్సాఫీస్ వద్ద విఫలమైంది, జనాలు పట్టించుకోలేదు. బక్షి పరిస్థితి కూడా అంతే. తరువాతి ఆరు సంవత్సరాలు, ఆయనకి సినీ పరిశ్రమలో పెద్దగా పని లేదు. ‘అస్సలు పని లేకపోవడం లేదా చాలా పని ఉండడం – నేను రెండింటినీ అనుభవించాను. నా కెరీర్‌లోని మొదటి ఎనిమిది సంవత్సరాలలో మాత్రమే మొదటిదాన్ని అనుభవించినందుకు నేను అదృష్టవంతుడిని’ అని ఆయన అన్నారు.

ఒక దశాబ్దం తరువాత, 1965లో ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’ సినిమా విజయం సాధించిన కొన్ని నెలల తర్వాత, భగవాన్ దాదా అనుకోకుండా ఒక సినిమా పార్టీలో గీత రచయిత ఆనంద్ బక్షిని కలిశారు. నటుడిగా తన కెరీర్‌లో ఆయన అప్పుడు గడ్డు స్థితిలో ఉన్నారు, ఆయన బక్షికి సలహా ఇచ్చారు, ‘ఆనంద్ బక్షి సాహిబ్, ఖుషీ కీ బాత్ హై, ఆప్ కా బహుత్ నామ్ హో గయా హై. మగర్ ఏక్ బాత్ యాద్ రఖ్‌నా కె యహాఁ ఇస్ దునియా మే ఆద్మీ కో నామ్ సే జ్యాదా ఉస్ కా కామ్ జిందా రఖ్‍తా హై’ (మీకంటూ ఒక పేరు తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ ప్రపంచంలో మనిషి మనుగడ సాగించడానికి కావలసింది కేవలం పేరు ఒక్కటే కాదు, మంచి పని అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి). ‘పరిశ్రమలో నాకు తొలి ఆవకాశమిచ్చిన వ్యక్తి చెప్పిన ఆ మంచి మాటలను నేను ఎప్పుడూ మర్చిపోలేదు.’ అని నాన్న మాతో అన్నారు.

పాటలు రికార్డ్ చేసిన రెండు సంవత్సరాల తర్వాత, 1958లో ‘భలా ఆద్మీ’ విడుదలైంది. బక్షికి ఇంకా సినిమాల్లో పూర్తిగా అవకాశాలు దొరకలేదు. కొన్ని నెలలకు ఒకటి లేదా రెండు పాటలు రాసేవారు; వీటిలో కొన్నింటికి పారితోషికం ఇచ్చేవారు, కానీ తెర మీద పేరు వేసేవారు కాదు.

‘నా పేరు క్రెడిట్స్‌లో చూసినప్పుడు, నేను ఆనందంతో ఏడ్చాను. ఈరోజు నన్ను విజయవంతమైన రచయిత అని పిలుస్తున్నారంటే దానికి కారణం భగవాన్ దాదా. ఒక స్టార్ యాక్టర్ మరియు నిర్మాత నాకు పని ఇవ్వడం నా కలలు, ప్రార్థనలు మరియు ఆశలకు నిదర్శనం. ‘భలా ఆద్మీ’ 1958లో విడుదలైంది, బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు, పాటలు కూడా ప్రజాదరణ పొందలేదు; కాబట్టి అది నా కెరీర్‌కు ఏమీ చేయలేదు. లేకిన్ ఫిర్ భీ, మేరే లియే వో హమేషా మేరీ సబ్సే బడి ఫిల్మ్ హై ఔర్ హమేషా రహేగీ. క్యూఁ కీ ఉస్ ఫిల్మ్ నే హి తో ఏక్ గీత్‍కార్ కో ఇస్ దునియా మే జనమ్ దియా (..అయినప్పటికీ, నాకు, అది ఎల్లప్పుడూ నా అతిపెద్ద చిత్రం అవుతుంది. ఎందుకంటే ఆ సినిమానే ఈ గీత రచయితను ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చింది).’

ఆ సినిమా న్యూస్‌ప్రింట్ పోస్టర్ కాపీలో, ఆయన తన పేరును ఎర్రటి పెన్నుతో అండర్‌లైన్ చేసుకున్నారు. ఆయనదెంత ఉత్సాహమో! ఈ పోస్టర్‌పై, అతని ఇంటిపేరు Bakhshi కి బదులుగా ‘Bakshi’ అని తప్పుగా ముద్రించారు. అయినా ఆయన పట్టించుకోలేదు, ఎందుకంటే ఆయన ప్రాధాన్యతలు వేరే. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ‘నేను రాయడానికి మరొక అవకాశం కోసం చూస్తున్నాను’. ఇది 1950 నుండి 2002 వరకు ఆయన జీవన తాత్త్వికత.

1956లో తన మొదటి నాలుగు పాటలను రికార్డ్ చేసిన తర్వాత, 1959 వరకు ఆయనకి మళ్ళీ అవకాశం దొరకలేదు. బొంబాయిలో తన జీవితంలో  అత్యంత కష్టతరమైన దశలలో ఇదొకటని ఆయన చెప్పుకునేవారు. దాచుకున్న డబ్బులు అయిపోతున్నందుకు; చక్కగా పెన్షన్ వచ్చే సైనిక ఉద్యోగాన్ని వదిలేసినందుకు ఇంట్లోవాళ్ళు ఇప్పటికీ తిడుతూన్నందుకు – ఆయనకి ఓపిక నశించింది. మరోసారి, తనను తాను ప్రేరేపించుకోవడానికి ‘వో తద్బీరియేఁ నహీ హోతీ’ అనే కవిత రూపంలో వ్యక్తిగత ప్రకటన రాశారు. ఇది రెండు దశాబ్దాల తర్వాత, 1980లో, న్యూఢిల్లీలోని రూబీ మ్యాగజైన్‌లో ప్రచురించబడింది.

భలా ఆద్మీ’ విడుదలైన తర్వాత కూడా బక్షికి అవకాశాలు రాకపోవడం చూసి, సైన్యంలోకి తిరిగి వెళ్ళమని అయనతో ఎవరో అన్నారు.

‘సైన్యానికి నీ అవసరం ఉంది, సినిమా పరిశ్రమకు నీ అవసరం లేదు’ అని బక్షికి చెప్పారు. ఈ వ్యాఖ్య ఆయనపై విసిరిన రాయి! అయితే, ఈ వ్యాఖ్య, మరింతగా ప్రయత్నించడానికి తనలోని సిపాయిని ప్రోత్సహించింది;  తనని నిరుత్సాహపరుస్తున్న వారందరిది తప్పు అని ‘వారికి’ నిరూపించటానికి మరింత ప్రేరేపించింది. తనపై విసిరిన ప్రతి రాయిని ఉపయోగించి తాను నడిచిన మార్గాన్ని దృఢంగా మార్చుకున్నారు బక్షి. ఆ రాళ్ళతోనే తన చిన్ననాటి కలల కోటను నిర్మించారు. ‘ఏక్ దిన్ మేరే గానే రేడియో పె బజెంగే’ (ఏదో ఒకరోజు, నా పాటల్ని రేడియోలో వినిపిస్తారు) అనేవారు. మొదటిసారిగా తన పాటను ఆయన రేడియోలో 1959లో విన్నారు, ఆ  సంఘటన ఓ బజారులో జరిగింది. ఆ పాట ‘జమీన్ కే తారే’ చిత్రంలోని ‘చున్ను పతంగ్ కో కెహేతా హై కైట్, రాంగ్ హై యా రైట్’.

అప్పటికి ఆయన దగ్గరున్న డబ్బులన్నీ దాదాపుగా అయిపోయాయి. లక్నో నుండి చిన్న మొత్తాలు పంపించి రెండేళ్లుగా అండగా నిలిచిన మామగారు ఇకపై సహాయం చేయడానికి నిరాకరించారు, తన అల్లుడు తెలివితక్కువ కలను విడిచిపెట్టి, ఢిల్లీలోని తన పేరుప్రతిష్ఠలున్న తన కుటుంబం వద్దకి తిరిగి వెళ్లి, మళ్ళీ ఏదైనా గౌరవప్రదమైన ఉద్యోగం వెతుక్కోవాలని డిమాండ్ చేశారు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version