Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బోలెడంత ఆశ్చర్యం, కాస్తం భయం కలిగించే ‘నగరంలో మరమానవి’

[డా. చిత్తర్వు మధు గారి ‘నగరంలో మరమానవి’ అనే సైన్స్ ఫిక్షన్ నవలని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

సాధారణంగా సైన్స్ ఫిక్షన్ రచనలు విజ్ఞానదాయకాలుగా ఉంటూ ఆశ్చర్యపరుస్తాయి. అంతరిక్షంలోని సుదూర గెలాక్సీలలోని సౌరకుటుంబాలు, వాటిలోని గ్రహాలు, అక్కడి గ్రహాంతర జీవులు ఇలా శాస్త్రీయ విజ్ఞానపు పరిధులని అధిగమిస్తూ, సమీప భవిష్యత్తులో కాకపోయినా సుదూర భవిష్యత్తులోనైనా ఇలా జరిగితే మానవజాతి ఉజ్జ్వలంగా వెలుగుతూ కొత్త ఎత్తులకు చేరుతుందనే అభిప్రాయం కలిగేది ఇటీవలి కాలం వరకూ.

అయితే, వైజ్ఞానికంగా లభ్యమవుతున్న విశ్లేషణల వల్ల, అందుతున్న ఆధారాలను బట్టి, ఇప్పట్లో మానవ జాతి సుదూర గ్రహాంతర ప్రయాణాలు, అక్కడి గ్రహాంతర కాలనీలలో నివాసాలు సాధ్యం కావనే వాస్తవం అవగతమయ్యాకా, సైన్స్ ఫిక్షన్ రచనలు ఒక కొత్త మలుపు తీసుకున్నాయి. మానవుడు పర్యావరణానికి చేస్తున్న హాని వల్ల సంభవించే దుష్పరిణామాలు, శాస్త్ర సాంకేతిక రంగాలలో విపరీతమైన పురోగతి సంభవించి, మనుషుల స్థానంలో రోబోలను, కృత్రిమ మేధను ఉపయోగించడం వల్ల – కాలక్రమంలో కృత్రిమ మేధ తన శక్తిని ద్విగుణం, త్రిగుణం చేసుకుని మానవుల తెలివితేటలని అధిగమించి, మనుషులనే నియంత్రించే రోజులు వస్తాయని, అప్పుడు సంభవించే విపరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఊహతో స్పెక్యులేటివ్ ఫిక్షన్ విభాగం జోరందుకుంది. ఇలాంటి స్పెక్యులేటివ్ ఫిక్షన్ చదువుతున్నప్పుడు కాస్త భయం వేస్తుంది.

డా. చిత్తర్వు మధు రచించిన స్పెక్యులేటివ్ ఫిక్షన్ విభాగం లోకి వచ్చే సైన్స్ ఫిక్షన్ నవల ‘నగరంలో మరమానవి’ – ఆశ్చర్యపరుస్తూనే, కాస్త భయపెడుతుంది కూడా. పుస్తక రూపంలోకి రాకముందు, సంచిక వెబ్ పత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది.

~

రోబోలను మానవుల సేవలకు గత కొన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు. తొలినాళ్ళలో చూడడానికి యంత్రాల వలె ఉండి చిన్న చిన్న పనులలో సాయంగా ఉండేవి. క్రమేపీ సాంకేతికత పెరుగుతూండడంతో, రోబోలో తయారీలోనూ ఎన్నో మార్పులొచ్చాయి. వివిధ జంతువుల ఆకారాల్లో, స్త్రీ పురుషుల రూపాల్లో రోబోలను తయారు చేస్తున్నారు. రోబోల ప్రోగ్రామింగ్ లోనూ విశేషమైన పురోగతి సంభవిస్తోంది. వాటికి సింథటిక్ చర్మం ధరింపజేసి, లోపల మెదడు స్థానంలో న్యూరో నెట్‍వర్క్ పెట్టి, వాటిలో స్పందనలు ప్రవేశపెట్టి సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా చేశారు శాస్త్రవేత్తలు. ఫలితంగా వాటిలో అనుభూతులు, ఆవేశాలు చోటు చేసుకునే సంభావ్యత పెరిగింది. రోబోలను పోలీసు విభాగంలోనూ, వైద్యశాలలలోనూ, వృద్ధుల సంరక్షణలోనూ సానుకూలంగా వినియోగించుకోడం మొదలైంది. అలాగే కొందరు మనుషులు తమ స్వార్థం కోసం, రోబోలతో వికృత చేష్టలు చేసుకునేలా మతిచెడిన మనుషులకు అవకాశాలు కల్పిస్తూ – ఎమ్యూజ్‍మెంట్ పార్కుల ఏర్పాట్లు చేసి రోబోలపై లైంగిక హింస జరిపి పైశాచిక ఆనందం పొందే వీలు కల్పిస్తున్నారు. ఎందుకంటే రోబోల ప్రోగ్రామ్ ప్రకారం అవి తమ యజమానికి హాని కలిగించకూడదు. అతడేం చేసినా భరించాలి.

ఇదే కథాంశంతో డా. చిత్తర్వు మధు ‘నగరంలో మరమానవి’ నవలని రూపొందించారు. హైదరాబాద్ నగర శివార్లలో, రాజకీయ నాయకుల ప్రచ్ఛన్న నేతృత్వంలో స్థాపించబడిన సిమ్ సిటీ (సిమ్యులేటెడ్ సిటీ, కొత్త తరహా ఎమ్యూజ్‍మెంట్ పార్క్)లో రోబోల దుర్వినియోగం దారుణంగా జరుగుతుంది. చాలా రోబోలలో తిరుగుబాటు ధోరణి తలెత్తుంది. వాటిలో చైతన్యం కలిగి, సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థితికి వచ్చేస్తాయి. అలాంటి రోబోలలో ఒక ఆడ రోబో కరిష్మా. కళాధర్ అనే సంపన్నుడు సిమ్ సిటీలో కరిష్మాతో గడపడానికి అలవాటు పడతాడు. కరిష్మాలో స్పందనలు కలిగి, అతనిపై ప్రేమ పెరిగి అతన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. సిమ్ సిటీ నుంచి తప్పించుకుని నగరంలోకి వచ్చేస్తుంది.

అదే సమయంలో ఇందిరా పార్క్ సమీపంలో, కొన్ని రోబోలు సమావేశమవుతాయి. విధాత XXX 999 అనే సూపర్ రోబో – తమని హింసిస్తున్న మనుషులపై తిరుగుబాటు చేయాలన్న ఆలోచనను వాటిలో కలిగిస్తాడు. వాటి నియంత్రణని తన అధీనంలోకి తీసుకుంటాడు. నగరంలో ఉన్న అన్ని రోబోలు, కరిష్మాతో సహా, విధాతని తన నాయకుడిగా ఎన్నుకుంటాయి. ఇక్కడ నుంచి కథ వేగం పుంజుకుంటుంది. విధాత సిమ్ సిటీలోని ప్రోగ్రామర్లను, రోబో డిజైనర్లను తన ఆధీనంలోకి తీసుకుంటాడు. తొలుత సిమ్ సిటీని, అక్కడ్నించి హైదరాబాద్ నగరాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. అప్పటి దాకా సక్రమంగా పనిచేస్తున్న రోబోలన్నీ తాము పనిచేసే చోట గందరగోళం సృష్టించి భీతావహ పరిస్థితులు కల్పిస్తాయి. పోలీస్ అధికారులు త్రినేత్ర, నైమిషలు – రోగ్ రోబోల ఆటకట్టించడానికి ఉద్యుక్తులవుతారు. పోలీస్ రోబోలు ఆల్ఫా, బీటా, గామా, డెల్టాల సాయం తీసుకుని తిరుగుబాటు రోబోల పని పట్టాలనుకుంటారు.

కానీ విధాత వ్యూహం ఇంకా పెద్దది. అతను చేసిన పనివల్ల మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అతనికి లొంగిపోతుంది. ఏం చేశాడు, ఎలా చేశాడన్నది పాఠకులు స్వయంగా నవల చదివి తెలుసుకోవాల్సిందే. కానీ విధాత ఉచ్చులో పడని త్రినేత్ర, నైమిష, కళాధర్‍లు తమ సొంత ఆలోచనాశక్తిని కోల్పోరు. త్రినేత్ర, నైమిష ప్లాన్ చేసి, కళాధర్ సహాయంతో, కరిష్మా ద్వారా విధాత ప్లాన్ ఏమిటో తెలుసుకుంటారు. అయితే కళాధర్ పోలీసులకి సహకరిస్తున్నాడని గ్రహించిన కరిష్మా, అతడిపై ఒత్తిడి తెస్తుంది. ఈలోపు జరుగుతున్నదంతా తెలుసుకుంటాడు విధాత. భారీ విధ్వంసానికి తెర తీస్తాడు. అయితే అదృష్టవశాత్తు, త్రినేత్ర, నైమిషల సందేశాలను నమ్మిన ఆర్మీ సకాలంలో రంగంలోకి దిగడంతో, రోబోల తిరుగుబాటు అంతమవుతుంది. కొద్దిపాటి నష్టాలు ఎదురవుతాయి. పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి కొంతకాలం పడుతుంది. కరిష్మా ఇప్పుడు కళాధర్ ఇంట్లో సాధారణ సర్వింగ్ రోబోలా ఉంటుంది.

~

రచయిత ఈ నవలలో ప్రస్తావించిన సాంకేతిక పురోగతి అబ్బురపరుస్తుంది. అదే సమయంలో, వెర్రితలలు వేసే మానవుల స్వార్థం వల్ల సంభవించగలిగే దుష్పరిణామాలు, రోబోలపై జరిపిన హింస కారణంగా అవి తిరిగి మనుషులపై దాడి చేస్తే ఎదురయ్యే సంఘటనలను చదువుతుంటే కాస్త భయమూ వేస్తుంది.

కృత్రిమ మేధని ఉపయోగించే రోబోలు, మానవుల లోని దుర్గుణాలను కాకుండా, కాస్తో కూస్తో మిగిలి ఉన్న మంచి గుణాలను స్వీకరిస్తే బాగుండుననిపిస్తుంది. బహుశా ఇటువంటి సాహిత్యం చదివినప్పుడైనా మనుషులు తమ ధోరణులని కాస్త మార్చుకుంటారనీ, తోటివారిని మనుషులుగా పరిగణించి, మానవతని నిలబెట్టగలరని అనిపిస్తుంది. మానవుల ప్రవర్తన నుంచే నేర్చుకునే రోబోలు, బహుశా అప్పుడు మంచి రోబోల్లానే నడుచుకుంటాయేమో!

మొత్తం మీద బోలెడంత ఆశ్చర్యాన్ని, కాస్తంత భయాన్ని కలిగిస్తుంది ఈ ‘నగరంలో మరమానవి’.

చివరి అట్ట మీద ప్రచురణకర్త చెప్పినట్టు, ఉత్కంఠభరితంగా సాగే ఈ సైన్స్ ఫిక్షన్ నవల ఎన్నో కొత్త విషయాలతో పాఠకులను అలరిస్తుంది.

***

నగరంలో మరమానవి (సైన్స్ ఫిక్షన్ నవల)
రచన: డా. చిత్తర్వు మధు
ప్రచురణ:  కవి పబ్లికేషన్స్,
పేజీలు: 172
ధర: ₹ 200/-
ప్రతులకు:
నవోదయో బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. 90000413413
అచ్చంగా తెలుగు బుక్స్, హైదరాబాద్. 8558899478
డా. మధు చిత్తర్వు. 9848044126
ఆన్‍లైన్‌లో:
https://www.amazon.in/Nagaramlo-maramaanavi-Science-Fiction-Novel/dp/B0DKD1L1TY

 

~
డా. చిత్తర్వు మధు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-dr-chittarvu-madhu-nm/

Exit mobile version