Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘నాది పాషాణపాకమనే వారి బుద్ధిలోనే లోపముంది’- విశ్వనాథ

[సెప్టెంబరు 10, 2025 శ్రీ విశ్వనాథ సత్యనారాయణ జయంతి సందర్భంగా, 17 ఆగస్టు 2025 ఆదివారం నుంచి 07 సెప్టెంబర్ 2025 ఆదివారం వరకు – విశ్వనాథ సత్యనారాయణ గారిపై ప్రతి వారం ఒక ప్రత్యేక వ్యాసాన్ని అందించనున్నాము.]

నేపథ్యంః

కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి ‘రామాయణకల్పవృక్షం’ రచనను శ్రీ కొత్తసత్యనారాయణ చౌధరి గారు విమర్శించారు. ఆ తరువాత విశ్వనాథ వారికి చెన్నపురి ఆంధ్రమహాసభ వారు సన్మానం చేశారు. ఆ సభలో విశ్వనాథ వారి ప్రసంగంపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ విశ్వనాథవారు 1961 అక్టోబరు 29 ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో వ్రాసిన వ్యాసం ఇది. 1962 భారతి జనవరి సంచిక అనుబంధం నుంచి సేకరించి ప్రత్యేక వ్యాసంగా అందిస్తున్నాము.

శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరిగారు నేను ఆంధ్ర మహాసభ చెన్నపురిలో చేసిన ఉపన్యాసమునకు బదులుగా అక్టోబరు 22 ఆంధ్ర పత్రిక సారస్వతానుబంధంలో ఒక సమాధానం వ్రాశారు. ఎవరో తీసికొని వచ్చి చూపించారు. నా ఆవేదన, శ్రీ జలగం సుబ్రహ్మణ్యం నాయుడుగారు చెప్పిన మాటలు, శ్రీశ్రీ అన్న పాషాణపాకం ఇవన్నీ ఇట్లా ఉంచుదాం. నేను ‘గాడ్సేకులం’ వాణ్ణి. ఆయన ‘గాంధీకులం’ వాడు. అది కూడా అట్లా ఉంచుదాం. ‘ధర్మచింత’, పాపభీతి’ ఉగ్గుపాలతో పెట్టిన జాతి వారిది. నేమ ఆ సభలో త్రికరణశుద్ధిగా వర్ణాది భేదాలు లేవన్నది వారు నా రామాయణం ప్రకారం ఋజువు చేస్తారట. వారికే ‘ధర్మచింత’, ‘పాపభీతి’ ఉన్నవని వ్రాస్తున్నారు. నేను సభలో అన్న, నాకు పరద్వేషం లేకపోవడం అబద్ధం! వీరు ధర్మచింత మొదలైనవి తమకు కలవని వ్రాయడం నిజం! అవి రెండూ వారికి ఉండడానికి వీలులేదని వారి విమర్శ వ్యాసాలే సాక్ష్యం. ఇందులో ఒక భేదం ఉన్నది. వ్యక్తిగతంగా నాకు ఆ గుణాలు లేవన్నాను. ఆ ధర్మబుద్ధి, పాపభీతి వారి జాతి గుణాలు అని చెబుతున్నా డాయన. నన్ను గురించి నేను చెప్పుకోవచ్చు. తన జాతిని గురించి తాను పూచీ పడడం కష్టం. వారి జాతి యేమిటి? భారతీయ జాతియా? ఆంధ్ర జాతియా? ఒక జాతికి ప్రధానమైన లక్షణాలు కొన్ని ఉంటవి. జాతి మొత్తముమీద ఆ లక్షణాలు చెప్పవచ్చు తప్ప, జాతిలో పుట్టిన ప్రతివాడికి ఆ లక్షణాలు ఉండవనడం చాల కష్టం.

ఇవట్లాఉంచి, శ్రీశ్రీ నా కవిత్వాన్ని పాషాణ పాకమన్నాడు. నేను సమాధానం చెప్పలేదని ఆక్షేపణ. శ్రీశ్రీ కి ఎందుకు సమాధానం చెప్పలేదో మనవి చేస్తాను. శ్రీశ్రీ ఆ సభలో దిగాలుపడి కూర్చోవలసి వచ్చింది. నేను సమాధానం కూడా చెబుతే ఆయన ఇంకా దిగజారిపోతాడని చెప్పలేదు. శ్రీశ్రీ ని నేను నలుబది యేండ్ల నుండి యెరుగుదును. ఆయన అంటే నాకొక విధమైన ప్రేమ ఉన్నది. ఓ చౌదరిగారూ! నేను వ్రాస్తే మీరంగీకరించరు. ఒప్పుకోరు. లౌక్యం కోసం వ్రాస్తున్నానని అనుకున్నా అనుకోవచ్చు. యథార్థంగా మీరన్నా కూడా నాకొక విధమైన అనురాగంవంటి భావం ఉన్నది. ముప్ఫై యేళ్ళ క్రిందట – ఇంకా ఎక్కువ ఏండ్ల క్రిందనో మీరూ, నేనూ, శ్రీ తుమ్మల సీతారామమూర్తి చౌదురిగారూ కలిసికొన్నాము. ఆనాడు చాలా స్నేహంగా మాట్లాడాము. తరువాత మనము కలిసికొన్నదీ తక్కువే. స్నేహంగా మాట్లాడుకొన్నదీ తక్కువే. మిమ్మల్ని గురించి నాటినుండి నేటివరకూ, ఆ ఆర్ద్రమైన భావమే ఉన్నది. అందరికీ ఉంటుంది లోకంలో, అల్లాగా, మీరు ఇవ్వాళ్ళ విమర్శన వ్రాస్తే మీమీద నాకు కోపం రానట్లే శ్రీశ్రీ పాషాణపాకం అన్నా కోపం రాలేదు. సాగదీస్తే శ్రీ శ్రీ కాదు, ఆరు శ్రీలున్నా నిలువడు.

ఆ రోజున శ్రీశ్రీ ఎందుకు దిగాలుపడి ఉన్నాడంటే చెబుతాను. ఆ సన్నివేశం ఆంధ్ర పత్రికా విలేఖరి వ్రాయలేదు. వెయ్యలేదు. అది ఇది. శ్రీశ్రీ “భారతం (Fact) రామాయణం (Myth)” అన్నాడు. “వాల్మీకులు చాలమంది ఉన్నారు. వాళ్ళందరూ వాల్మీకులు కారు. విశ్వనాథ ఒక్కడే వాల్మీకి” అన్నాడు. ఈ సందర్భంలో శ్రీ జలగం సుబ్రహ్మణ్యంనాయుడుగారు ఆయన సంస్కృతాంధ్రాలల్లో చక్కని పరిచయం కలవారు సుమండీ. చాలా గడుసువారు కూడాను. ఆయన శ్రీశ్రీని నిగ్గ దీశారు. “ఏమండి! భారతం (Fact) ఏ కదా? రామాయణం (Myth) ఏ కదా? భారతాన్ని ఒప్పుకుంటారు కదా! రామాయణం (Myth) ఏ కదా?” ఇల్లా నాలుగుసార్లు శ్రీశ్రీ చేత ఆ మాట అనిపించి, సభ వంక చూచి, “ఏమండీ! వింటున్నారు కదా!” అని మళ్ళీ శ్రీశ్రీ చేత ఒప్పించి, “అయ్యా! భారతము (Fact) ఐతే భారతంలో రామాయణ కథ చెప్పబడి ఉన్నది. రామాయణం (Myth) అవడం ఎలాగా? భారతంలో ఉన్నదంతా (Fact) అని మీరే అన్నారుకదా!” అని బాంబు పేల్చారు. శ్రీశ్రీ డీలాపోయినాడు. తెల్లమొహం వేశాడు. “అయినా (Myth) ఏ” అన్నాడు. నాయుడుగారు “మళ్ళీ అలా మాట్లాడుతారేం?” అన్నారు.

నాకు స్నేహితుడైన శ్రీశ్రీ సభలో అట్లా కాగా నాది పాషాణపాకం అన్నాడని సమాధానం చెప్పి, ఇంకా దిగులుపర్చమంటారా? నాది పాషాణపాకమన్నవాడి ఆంధ్ర సారస్వత విజ్ఞానం పాషాణ ప్రాయమంతే! అని నే ననడం బాగుండదుకదా! ఈ అహంకారాన్ని చూచి ఇతరులు వ్రాసే వ్రాతలు, వాళ్లు మాట్లాడే మాటలు వాటి పేరు “ధర్మచింత, పాపనీతి”. ఎబ్బే! వారి కసలు అహంకారమే లేదు. అయ్యో బాబూ! అనవసరమైన అహంకారాన్ని మనం చంపుకోలేమే. మాత్సర్యాదులవల్ల పుట్టిన అహంకారాన్ని మనం చంపుకోలేమే? ఎవడో ఒక పనిచేసి, అది గొప్ప పని అనుకుని – చాలామంది గొప్పపని అనడం మూలంగా కూడా, అనుకున్నాడేమో పాపం – వాడు నేను చేసిన పనిలోని గొప్పతనం ఇది ఇది అని ఇతరులకు చెబుతే అది గొప్పతనం కాకపోతే కాదను. అంతేకాని, అది వాడి అహంకారమనడ మేలా? వాడు చెప్పిన గొప్పతనం కాకపోతే వాడు వ్యర్థుడు. అహంకారమై నా గొప్పతనమేగా? ఒకడు తన గొప్పతనాన్ని గురించి అహంకార పడడం చూచి అవతలివాడు పడేదానికి పేరేమిటి? పెద్దలకు తెలియాలి.

మీరు చాలా నెలలబట్టి ఈ వ్యాసాలు వ్రాస్తున్నారు. నేనా ఒక్కవ్యాసం కూడ చదువలేదు. నాకు వర్ణ శాఖాది ద్వేషాలు లేవంటే నమ్మనివారు ఈ విషయాన్ని నమ్ముతారని నేననుకోవడం లేదు. నా పాకం పాషాణపాకం అన్న శ్రీశ్రీని అట్లాంటి మరికొందరితో కలిపి అడుగుతున్నాను. అయ్యా! నా గ్రంథాల్ని తమరు ఏవేవి చదివారు? మీరు చదివిన ఒక గ్రంథంలో ఎన్ని పద్యాలు ఉన్నవి? మీకు అర్థంకాకపోవడమే కదా, పాషాణ పాకమంటే? అందులోవన్నీ అర్థం కాలేదా? కొన్నే కాలేదా? అర్థం ఐనవెక్కువా? కానివెక్కువా? పాషాణపాకమంటే అర్థమేమిటి? పగులగొట్టడానికి వీలులేదనియేకదా? మణులు ఉన్నవి. వజ్రాలు ఉన్నవి. వెలగల రాళ్ళు ఉన్నవి. అవి కాంతిని విరజిమ్ముతూ ఉంటవి. వాటి కాంతిని చూచి ఆనందించాలి తప్ప పగులగొట్టరు. పగులగొట్టి చిన్న చిన్న రాళ్ళుగా వర్తకులమ్ముతారు. ఆ పగులగొట్టే నేర్పు వాళ్ళకు తెలుసు. అలాగే మీరన్నట్లు నేను వ్రాసిన పంద పద్యాల్లో రెండు మూడు పద్యాలు మీకు పాషాణ పాకమనిపిస్తే, వాటి కాంతి మీకు తెలిస్తే ఆనందించండి. తక్కినని మీ ద్రాక్షాపాకాలే, మీ కదళీ పాకాలే. వందలాది పద్యాలుంటవి. అవి చూచి ఆనందించండి. మేము మీ గ్రంథాన్ని తిట్టడానికే పుట్టాము. మేము చదువము అని మీరంటే మీకు నమస్కారము.

ఎవరో కొందరు మాత్సర్యగ్రస్తులు ఒక మాటను దేశంమీద పారవేయడం “గతానుగతికోలోక నలోక పారమార్థికః” అన్నట్లుగా తక్కినవాళ్లు దాన్ని పట్టుకొని ప్రాకులాడడం అలవాటైంది. నేను రామాయణం కాని, ఇతర కవిత్వంకాని వందలాది సభల్లో చదివాను. విన్న వాళ్ళెవరూ పాషాణపాకమనలేదు. అనలేదు సరికదా ఆనందించారు. ఈ పాషాణపాకం, అనేవాడి బుద్ధిలో ఉంది. హృదయంలో వుంది. నేను ఆవేదన పొందానని అనుకోవడం శ్రీ జలగం సుబ్రహ్మణ్య నాయుడుగారు పొరపాటు పడ్డారు. నేను నా జాతి లక్షణం చెప్పుకోలేనుగాని, నా వ్యక్తి లక్షణం ఏమంటే “గాఢంగా నేను నా చేతనైనంతలో వూహించడం, త్రికరణశుద్ధిగా మాట్లాడటం.” త్రికరణశుద్ధిగా మాట్లాడుతుంటే చాలామంది ఆవేదనే అనుకుంటారు. నేను ఆవేదనే పడితే శ్రీ చౌదరిగారి విమర్శనలకు, విమర్శలు చేసే పత్రికలు, వేయకపోయినా, ఇతర పత్రికలలో సమాధానాలు ఇంతకంటే శర పరంపరలుగా వ్రాసేవాణ్ణి.

వ్రాయడం – మాట్లాడడం రెండు విధాలు. వ్రాయడంలో ఆవేదన ఉన్నదో లేదో తెలుసుకోవడం కష్టం. మాట్లాడడం లోనూ తెలుసుకోవడం కష్టంకాని, ఇందాక మనవి చేశాను కదూ – వాడు ఆవేదన పడ్డాడని అనుకోవచ్చు. ధర్మం చెప్పేవాడిమాట ఆవేశంతో చెప్పినట్లు ఉంటుంది. ఆ ఆవేశం ఆవేశమౌనో కాదో మరుక్షణమందు తెలుస్తుంది. అది నిజంగా ఆవేశమైతే తరువాత చాలాసేపు ఉంటుంది. మరుక్షణమందు ఉండని ఆవేశము ధర్మం చెప్పడంలో ఉన్న తీవ్రత కాని ఆవేశం కాదు. ఆ శ్రీశ్రీ వ్రాసింది పాషాణపాకం. అనగా పగులగొట్టితే ఏమి ఉండదో, అది పాషాణపాకం. నా కవిత్వం పాషాణపాకమన్నది ఎవడో ఒక టెంకాయ పిచ్చి కొండ. కాలం దానికి యోగ్యం కనుక బాగా ఉన్నదన్నమాట.

అదంతా అట్లా ఉంచి శ్రీ చౌదరిగారూ! పండితుల్ని పిలువడం, సభ చేయించడం చాల పెద్ద ఎత్తు ఎత్తారు! ఇలా పూర్వం శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు వ్రాస్తుండేవారు. ఆ రాశిలో చేరుదామనా? ఈ కల్పవృక్షంమీది విమర్శతో ఒక రాశిలోనికి వచ్చారనుకోండి. పై రాశికి వెళ్ళడం కూడ మంచిదే. అయ్యా “చిద్గగన ప్రాలేయాంశువున్” అని ఉన్నది. ఇక్కడ ‘న’ కారం గురువవుతుందని మీరు వ్రాశారు. అది తప్పని, ఇటువంటివి ఇంకా పాతిక కూడా చూపించారట. తక్కినవన్నీ అట్లా ఉంచి, ఈ నకారం గురువవుతుందా? గురువవుతుంది. ఇది తప్పేను అని మీ ఇష్టము వచ్చిన పదిమంది పండితులతో దస్కతులు చేయించి పత్రికలలో వేయించండి. ఆ పది మంది పండితుల పేర్లు దేశానికి తెలుస్తవికదా? రంగయ్య, పుల్లయ్య పేర్లు పెట్టి వ్రాయించకండి.

అప్పయ్య దీక్షితులు, జగన్నాథ పండితుల వాదం మీరు తెచ్చారు. ఆ ప్రసక్తి ఎందుకు? నక్క ఎక్కడ దేవలోక మెక్కడ? అముద్రిత గ్రంథ చింతామణి పేరు ఎత్తారు. ఆ విమర్శకీ, మనకు కొన్ని మైళ్ళ దూరం ఉంది. పెద్ద పేర్లు చెప్పడమెందుకు, వూరుకోండి. తక్కినవి చెప్పారు. కొంత బాగా ఉంటే బాగా ఉండవచ్చు. ఇందులో శ్రీ గిడుగు రామమూర్తి గారి పేరు కూడా ఎత్తారు. ఓ అయ్యా! రామమూర్తి పంతులుగారు వ్రాసిన వ్రాతలు కూడా చదివారా యేమి మీరు? అందుకనేవా ‘చేతురు, కోతురు’ తప్పన్నారట! గడచిన నలుబది యేండ్లుగా ఆంధ్ర భాషా పత్రికలలో జరిగేటువంటి శబ్ద స్వరూపముల యొక్కయు, అర్థముల యొక్కయు విచారణ లక్షణము మీకు తెలియదని, మీరు చూపించిన దోషాలు మా మిత్రులు చెప్పగా విని నే ననుకొన్నాను. రెండే పద్ధతులు. మీ కివన్నీ తప్పులు కావని తెలిస్తేనే వ్రాయాలె. అలా వ్రాస్తే మీకు ధర్మచింతలేదు. పాపభీతీలేదు. తెలియకుండా వ్రాస్తే దాని పేరు పాండిత్యం లేక పోవడం. అదట్లా ఉంచి, మీ ఇష్టం వచ్చిన పండితుల్ని నలుగుర్ని పిలువండి. వారు ప్రసిద్ధులైన పండితులు కావలె సుమండి. ‘చిద్గగన ప్రాలేయాంశవున్’ తప్పనే పండితులు కాకూడదు. అటువంటి పండితులను మీరు తీసుకవస్తే నేను సభకు రాను. ఇప్పటికివలెనే అప్పుడు కూడ దూరం నుంచే నమస్కారం చేస్తాను. నేను పండితుల్ని తీసుకరాను. పుస్తకాలు తీసుక వస్తాను. మీరు తప్పన్న వాటికి ప్రయోగాలు చూపిస్తాను. “భూమిపుండు” ఇందులో అశ్లీలమని వ్రాసినారట. మీరు నలుబది యేండ్ల నుండి జరుగుతున్న పత్రికలలోని సారస్వత విమర్శలు చక్కగా అనుసరించామన్నట్లు వ్రాశారే. శ్రీ తిరుపతి వేంకటకవులలో ఇలాంటి అశ్లీలాలు ఉన్నవని వారి ప్రతిపక్షులు వ్రాయడం వారు సమాధానాలు వ్రాయడం చదివే వుంటారుకదా? ఇలాంటి అశ్లీలం వ్రాయని వాడుంటాడా? అంతదాకా ఎందుకు? తమరు కూడా ఏవో పుస్తకాలు వ్రాశారని వినికిడి, మీరు ఏవి దోషాలన్నారో అవి మీ గ్రంథాల్లోనే చూపించవచ్చు. మీ సవాలు అట్లా ఉంచి ఇది నా సవాలు. ఆ సభ పెట్టించండి. మీ పటం పెట్టి మీ నెత్తినే పొడుచుకున్నట్లవుతుంది. నాకేమీ అభ్యంతరం లేదు.

నే నొకమాట వ్రాస్తున్నాను. వ్రాయబోయే మాటకు నేను సభకు రానని మాత్రం అర్థం చేసుకోకండి. ఆ సభలో కొంచెం పోలీసు బందోబస్తుతో రావాల్సిన అవసరం నాకు లేకుండా చేయండి. ఇంతదూరం వచ్చింది కనుక మీరు వ్రాసిన వ్యాసాలు తీరిక లేకపోయినా, చదువుతాను. మీరు చూపించిన తప్పులు తప్పులు కావని సప్రమాణంగా నిరూపిస్తాను. కాని నేను నా పుస్తకంలో కొన్ని పొరపాట్లు ఉండవచ్చు, వాటిని నే నంగీక రిస్తాను. “రాఘవేశ్వరు గృహముల్” యతిభంగమున్నదని మీరు చూపించారట. నిజమే. ఉన్నది. రతి దేవి తప్పన్నారట. అది తప్పనడంలో కూడ కొంత న్యాయమున్నది. బాగా పరిశీలించలేనివాడికి తప్పనిపించవచ్చు. కాని వాచస్పత్యంలో ఈ కారాంత స్త్రీలింగం కూడా ఉదహరించబడింది. అయినా ఇవన్నీ సభలో చెప్పవలసిన సమాధానాలుకదా? ఈ రెండైనా ఇప్పు డెందుకు వ్రాస్తున్నానంటే ఆసభ పెట్టేదీలేదు. జరిగేదీ లేదు. మీరు పిలిచేదీలేదు. వారు వచ్చేదీలేదు. బ్రహ్మశ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రులుగారు తమ ప్రత్యర్థులకు ఇటువంటి సవాళ్ళు నాలుగైదుసార్లు చేశారు. ఇప్పుడు వారి స్థానంలో నే నున్నాను. వారి ప్రత్యర్థుల స్థానంలో మీరున్నారు. ప్రత్యర్థి స్థానీయులైన తమరు ఈ సవాలు చేయడం క్రొత్త తప్ప వేరే క్రొత్త లేదు. అసలు మీ ఇంటి పేరే క్రొత్తాయె. ఇంతకూ మీ బలమేమంటే ప్రజాస్వామ్యం కావడం. ఇంకా ఉన్నవనుకోండి కొన్ని. అలా ఉంచండి. ముఖ్యంగా ఇంకొకటి కూడ చెప్పాలి. మన దేశంలో చాలమంది పత్రికాధిపతులకు విశ్వనాథ సత్యనారాయణ మీద విమర్శ ఏదైనాసరే అచ్చువేద్దామన్న ఉత్సాహమో, ఉబలాటమో, మాత్సర్యమో లాభంతో ఉండడం, విశ్వనాథ సత్యనారాయణను ఎవడైనా మెచ్చుకుంటే, దానిపేరు చెక్క భజన లట. తిడితే వారికి బాగుంటుంది. పోనీయండి నష్టమేమి? శ్రీ చౌదరిగారూ! శ్రీశ్రీ అన్నట్లుగా నా కవిత్వము పాషాణపాకమనీ, నేను కూడ అనుకునేవాన్నేమో కాని, వందలాది సభల్లో నేను చదివితే ఆనందించేవాళ్ళని చూచి నేను అనుకోలేకుండా ఉన్నాను. మీరు వ్రాసిన వన్నీ దోషాలనుకున్నా, ఇదే బాధ వచ్చింది. పలుమంది పండితులు విన్నారు. మా ఇంటికి వచ్చి విన్నారు. కొందరి ఇండ్లకు వెళ్ళి వినిపించాను. సభలలో శ్రద్ధగా కూర్చుని విన్నారు. వారు తప్పనలేదు. అందుచేత తప్పులు కావని ఒక అభిప్రాయం నా కేర్పడ్డదేమో!

ఈ గోలంతా ఎందుకు? “చిద్గగన ప్రాలేయాంశువున్”లో నకారం గురువవుతుంది. ఇది తప్పేను అని నేను నలుగురి పేర్లు చెబుతాను. ఆ నలుగురిచేత దస్కృతులు చేయించి వారి ఉత్తరాలను ‘భారతి’ పత్రికాధిపతి చేతిలో పెట్టి అని ప్రకటించవలసినదని ప్రార్థన. శ్రీ తుమ్మల సీతారామమూర్తి చౌదురిగారు, శ్రీ వేలూరి శివరామశాస్త్రి గారు, శ్రీ వెంపరాల సూర్యనారాయణశాస్త్రి గారు. ఈ పాయలో ఉన్న మీ ఇష్టం వచ్చిన మరో పండితుడు. ఈ పని మీరు చేస్తే అయినాసరే, కాకపోయినా సరే మీరు చూపించినవన్నీ తప్పు అనుకుఁటాను, ఇంకొక్కటే మనని. మీరు వ్రాసిన వ్యాసాలకు తిరిగి సమాధానాలు వ్రాస్తే మీ విమర్శలు ప్రకటించే పత్రికాధిపతులతో మా సమాధానాలు ప్రకటించేదిగా సిఫార్సు చేసి పెట్టండి. మీరు దీనికి కూడా యథేచ్ఛగా మళ్ళీ వ్రాస్తే “నమోవాకం ప్రశాస్మహే”, “మాటకి మాట తెగులు, నీటికి నాచు తెగులు”. మీరు ప్రధానంగా చేయవలసింది “చిద్గగనాంతమందు” గురువుని చూపించడం. మీరు ధర్మచింత, పాపభీతి కలవారు కనుక గురు దర్శనం మీకు తప్పకుండా జరుగుతుంది. లఘుదర్శనం కలుగుతుందా? అబ్బే! ఇలాంటి వ్యాసాలు మీరు వ్రాసినా, నేను వ్రాసినా ఇలాగే ఉంటవి. మీరు ఆ పండితుల ఉత్తరాలు ప్రకటించిన తరువాత మీరు దోషాలన్నవాటికి మాత్రమే సమాధానాలు వ్రాస్తాను. ఇంక ఒక అక్షరం వ్రాయను.

అందుచేత ఇప్పుడింకొక మాట కూడా చెబుతున్నాను. నా రామాయణం నిలువదేమోనన్న భయం మీ కెందుకు? నిలువదు. ఏం నిలువకపోతే? మీరు కవుల జీవితాలు చదివేవుంటారు. ఒక్కొక్కడు పాతిక గ్రంథాలు వ్రాస్తే వాడివి రెండు మూడు గ్రంథాలే నిలువడం చదువుతూనే ఉన్నాంగా. రామాయణం నిలువకపోతుందనుకోండి. వేయి పడగలు నిలుస్తుంది. అది మత గ్రంథం కదూ! ఆ మతానుయాయులలో విలుస్తుంది. తమవంటివారి విమర్శలవలె మతానుయాయులలో నిలువవచ్చు.

ఒకటే చివరిమాట. వ్రాసిందే చివరకు గట్టిగా చెబుతున్నాను. ఆక్షేపణలు, ఎత్తిపొడుపులు, గడుసుతనం మాటలు మీరు వ్రాయవద్దు. నేనూ వ్రాయవద్దు. మీరు వ్రాసినా మళ్ళీ నేను వ్రాయనని మనవి చేస్తున్నాను. ఆ నలుగురు పండితులచేత పూర్వ నకార గురుత్వం నిరూపించండి. అప్పుడే వ్రాస్తా, లేకపోతే ఇన్ని నెలలుగా వూరుకున్నట్లే నెలలుకాదు సంవత్సరాలైనా వూరుకుంటా.

విశ్వనాథ సత్యనారాయణ

Exit mobile version