బండి కదిలింది
కాలాన్ని వెంటేసుకుని
ముందడుగు వేస్తూ
మనిషి బతికే
గతుకుల బాటలో
ఆట కాలంతోనే ఆడేది
ఎండ వానలో చలిలో గాలిలా
బతుకు తెరచాప
ఎగిరింది చెలి కొంగు రంగులుగా
వాన వొదిగిన పైటలో తడిసింది దేహమై
అమ్మ ఆరేసింది పసిడి అంచు చీరె
ఊగిందీ కొమ్మ ఊయలై ప్రకృతి
చలన శీల బతుకంటే మనిషిదే
తల నిమిరిన చేతి చెలిమి
అమ్మ ధైర్యం ఆనవాలు
బాధల్లో సుఖం నేర్పిన
లిట్మస్ కమ్మలే
నడక నేర్చిన కాలం
నిన్నటి ఆకాశం కురిసింది
ఉరుముల మెరుపుల వాన
మట్టి తడిసింది
పొక్కిలి వాకిలి బాధ తీరింది
కొత్త ఊపిరి ఊదింది
జీవన సారమైన కాలం
ఒకప్పుడూ
చల్లగాలి నడిచింది
నీలి మేఘాల తాకుతూ
ముడి విప్పుకొన్న నీటి సంచి
జారింది జలపాతంలా
నేల నవ్వింది వాన దారుల
ప్రకృతి పులకించింది సుమ గంధమై
నడుస్తున్న ప్రవాహమైన
కాలం నడకలో దాగున్నది సుందర కావ్యం
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.