[15 జూన్ 2025 ఫాదర్స్ డే సందర్భంగా ‘నాన్నే నేటి ముఖచిత్రం’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]
“మాతృదేవోభవ పితృదేవోభవ” అన్నది మన సూక్తి. ఇదివరకు పిల్లల విషయంలో అమ్మ మొదటి స్థానాన్ని ఆక్రమిస్తే, ఇవాళ నాన్న ఆ స్థానానికి చేరుకున్నాడు. పిల్లల ప్రియమును చూసేది, ప్రేమను పంచేది తల్లి అయితే హితదృష్టితో మంచిమార్గంలో పెట్టేవాడు తండ్రి. స్వతంత్ర బుద్ధి కలిగిన మనిషిని అప్పుడప్పుడు్ దండించి అయినా సన్మార్గంలో పెట్టే వాడు తండ్రి.
అమ్మ తొమ్మిది నెలలు కడుపులో దాచి, మోసి, రూపమిచ్చి, జన్మనిచ్చి, ప్రాణమిచ్చి భూమ్మీదకు తెస్తుంది. ఒడిలో చేర్చి రక్తాన్ని పాలగా మార్చి స్తన్యమిస్తుంది. అమ్మ ఒడిని వీడి నాన్న గుండెల మీదకు చేరగానే నాన్న జీవితాంతం ప్రాణప్రదంగా పదిలంగా గుండెల్లో దాచి చూసుకుంటాడు. చిటికెనవేలు పట్టుకుని పడకుండా, తప్పటడుగు పడకుండా నడిపిస్తాడు నాన్న. కోరినదే తడవుగా అన్నీ అమర్చి పెడతాడు. కానీ హితైషి అయిన తండ్రి పిల్లలు బాగుపడాలని మంచి సంస్కారవంతులు కావాలని సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటాడు. ఎంత ప్రేమని చూపినా తప్పు చేస్తే దండించడానికి కూడా వెనుకాడడు. ఇది నేటి మారిన నాన్న రూపం.
ఒకప్పుడు బయటకు వెళ్లి సంపాదించుకు రావటమే నాన్న పని. పిల్లల ఆలనా పాలన, విద్యాబుద్ధులు పర్యవేక్షించడం సమస్తం తల్లి చూసుకునేది. కానీ నేడు తండ్రితో పాటు తల్లి కూడా బయటకు వెళ్లి ఉద్యోగం చేస్తున్నది, సంపాదిస్తున్నది. దానితో కష్ట సుఖాలు ఇద్దరు కలిసి పంచుకోవటం మొదలయింది. పిల్లల బాధ్యత ఇద్దరిదీ అయింది.
కానీ ఈనాటి పిల్లలు తల్లి కన్నా తండ్రికే ఎక్కువ చేరువ అవుతున్నారు. పసితనంలో పాలు పట్టడం దగ్గర నుంచి వయస్సు వచ్చిన తర్వాత వారి ప్రేమ వ్యవహారం వరకు తండ్రి దగ్గరే చెపుతున్నారు. తండ్రే బాధ్యత తీసుకుంటున్నాడు. వయసు వచ్చిన పిల్లలకు తండ్రి స్నేహితుడితో సమానమంటారు కదా!
అమ్మ ఒడిలో కన్నా తండ్రి భుజాలపై స్వారీ చేస్తున్నారు ఈనాటి ఈతరం పిల్లలు. ఒకప్పుడు గుడిలో దేవుడు కనపడలేదంటే తన భుజాల మీద ఎత్తుకు దేవుడిని చూపించేవాడు నాన్న. తరువాత తెలిసింది తాను దేవుడు భుజాల మీదే ఎక్కానని అది నాన్న ప్రేమ. కానీ ఇప్పుడు ఎప్పుడూ నాన్న భుజాల ఆసరానే కోరుకుంటున్నారు. తాను తిన్నా తినకున్నా అడిగినవన్నీ ఇచ్చే నాన్న ఆకలిని తెలుసుకునేదెవరు? తాను చినిగిన బట్టలు కట్టినా తన పిల్లలు ఉన్నతంగా ఉండాలని ఆలోచించే నాన్నని మించిన దైవం ‘నభూతో న భవిష్యతి’.
తనని తాను మరిచిపోయి పిల్లల కోసం తన జవసత్వాలను సర్వం త్యాగం చేస్తాడు నాన్న. ఒకప్పుడు అమ్మంటే ప్రేమ, చనువు, సాన్నిహిత్యము, నాన్నంటే తెలియని భయం గౌరవం. ఏదో తెలియని ఒక దూరముండేది. కానీ ఇవాల్టి పిల్లలకు అమ్మ కన్నా నాన్న దగ్గరే చనువు ఎక్కువ. అందునా ఆడపిల్లలకైతే మరీ ఎక్కువ. వారి అలకలు, గారాబాలు, ప్రేమలు, చనువులు అన్నింటికి నాన్నే కేంద్ర బిందువు. తమకు కావలసింది అడిగి, అలిగి మరీ ప్రేమతో సాధించుకుంటున్నారు. ప్రేమను పెంచుకుంటున్నారు. అనురాగం పంచుకుంటున్నారు. అమ్మకన్నా నాన్న దగ్గరే ధైర్యంగా ఉంటున్నారు. ఒక విధంగా పిల్లల పట్ల తండ్రి ఇంతగా బాధ్యత తీసుకోవటానికి కారణం పాశ్చాత్య ప్రభావం కూడా కొంత ఉండి ఉండవచ్చు.
అమ్మ ఒడిలో నుంచి కిందికి దిగి
నాన్న చిటికెన వేలు పట్టుకుని
బుడిబుడి అడుగులతో
ప్రపంచాన్ని చూస్తున్నారు
లోకాన్ని చుట్టేస్తున్నారు
జీవితాన్ని గెలుస్తున్నారు
నేటితరం పిల్లలకు నాన్నే ఒక రోల్ మోడల్. నాన్నే మార్గదర్శి. నాన్నే ప్రపంచం. నాన్న తోటిదే లోకం. అన్నం తినాలన్నా, ఆడుకోవాలన్నా, నాన్నే కావాలి. మనసులో మాట చెప్పుకోవాలన్నా, బాధను పంచుకోవాలన్నా, బాధ్యత తీసుకోవాలన్నా నాన్నే కావాలి. ఈనాటి పిల్లలకు నాన్న తోటిదే ప్రపంచం అయింది. నాన్నకు తెలియని విషయం లేదు. నాన్నకు సాధ్యం కానిది ఏదీ లేదు అన్నది నేటి పిల్లల నమ్మకం. నాన్న ఇచ్చిన ధైర్యమే వాళ్లకు శ్రీరామరక్ష.
నాన్నంటే ప్రేమ
నాన్నంటే ధైర్యం
నాన్నంటే స్నేహం
నాన్నంటే నమ్మకం
నాన్నే సమస్తం
నాన్నే సర్వస్వం
సంస్కారవంతుడైన తండ్రి ద్వారా సంతానం ఉత్తములుగా తయారవుతారు. అందుకే నేటితరం నాన్న ముఖచిత్రం మారిపోయింది. నాన్నే హీరో అయ్యాడు.