[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘నాలో నేను’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
కీర్తి రావడం అంటూ మొదలుపెడితే
దానికి శిఖరం అంటూ లేదు
ఆకాశమంతా తానే విస్తరిస్తుంది
ఒక ఆలోచన రూపు దిద్దుకుంది అంటే
అది అంతటితోఆగిపోదు
రచయితకు ఆ ప్రవాహంలో
ఎన్నో రచనలు పుట్టుకు వస్తాయి
స్నేహమనే లతకు ప్రాణం పోసేది
ఒక విత్తు లేదా వేరు కారణం అవుతుంది
అదే ఆధారం వెదుక్కుని అల్లుకుపోతుంది
ప్రతిఫలం ఆశించని చెలిమి
అంతరంగాన్ని తాకుతుంది
ఒక ప్రశంస చిన్న గుర్తింపు
ఆనందాలను పంచుతుంది
చెలిమిఅంటే మనిషిని
మనిషి అర్ధం చేసుకోడమూ
ఆలోచనలు పంచుకోడమూ
ప్రోత్సహించుకోడమూ
ఇద్దరి మధ్య వుండేస్నేహం
వారికిమాత్రమే అర్ధం అవుతుంది
మూడోమనిషికి చెప్పాల్సిన పనిలేదు
పరిపక్వత చెందిన వయసులో
జరిగే పరిచయాలు గౌరవమైనవి పవిత్రమైనవి
మనసును మాత్రమే చదువుతాయి
జీవితంలో స్నేహం ఒక్కటే ప్రత్యేకమైనది
భార్యాభర్తల బంధంకాదు
అది బాధ్యత
ఇష్టాలు వేరుగా వుంటాయి
గుండె నిండా నిండి వుండేది స్నేహం
కలుసుకుంటేనే స్నేహమవదు
ఒక చిన్నపలకరింపు చాలు
నువ్వు గుర్తు ఉన్నావని చెప్పేటందుకు
ఏ రంగంలో అయినా ఒక స్థాయికి చేరుకున్నాక
స్నేహితులు పెరుగుతారు
వారి స్వభావం నుంచి కొత్త ఆలోచనలు పుట్టుకు వస్తాయి
కొందరు రచయితలు
అందరికోసము రాయగలరు
కొందరు వారి కోసం మాత్రమే రాయగలరు
కొందరికి అదే ప్రపంచం అవుతుంది
నేను ఎందుకు రాస్తున్నాను..
అలవోకగా పుట్టుకువచ్చే
ఆలోచనకు రూపం ఇవ్వడానికి
ఏదో ఆశించికాదు సుమా
ఒకసారి రాసి చదువుకుంటే
మరో వూహ వస్తుంది
ఇది బాగానే వుందిలే..
అనుకుని పంపించాక చదివితే
విచిత్రం మరో ఆలోచన తడుతుంది
అంటే సాహిత్యం అనేది
తనివితీరని దాహం అన్నమాట
అందుకే మెదడు పనిచేసినంత కాలమూ
సాహిత్యం కూడా జీవిస్తుంది
ఎవరు రాసినా ఆకట్టుకునేలా వున్నా
చదివి తీరాలి
అప్పుడు వారి తప్పులను కూడా
మనం సరిచేయగలం
ఇలా రాస్తే ఇంకా బాగుండును
అని మనం చెబితే ‘అవును ఇలా కూడా బాగుంది’
అని ఒప్పుకునే సంస్కారం చాలామందికి ఉండదు
నేను మాత్రం ఒప్పుకుని
మెరుగుపరచుకుంటాను
ఎందుకో మరి
అసలు చదవనివారే ఎక్కువ
చదివినా రచయితతో
పంచుకునేవారు ఇంకా తక్కువ
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.