నేను నాస్తికురాలిని కాను. సైన్సును నమ్ముతాను. పూజలు, గుళ్ళు, మొక్కులు, ఉపవాసాలు, నమ్మకాలు లాంటి అలవాట్లు లేవు. మా నాయనమ్మ గారి వరకు ఏమైనా పాటించారేమో. నాకు మాత్రం అమ్మగారి వైపు కూడా తెలియవు.
కారణం ఏదైనా హాయిగా ప్రశాంతంగా వున్నాను. ఏది అయినా కష్టం వస్తే ‘ఇది జీవితం, తప్పవు’ అని అనుకుంటాను.
మావారిది కూడా ఇదే ఆలోచన. మేము మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఈ విషయంలో.
విచిత్రంగా, మా నాన్నగారికి పరిచయం ఉన్న శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు ఉద్యోగ విరమణ తర్వాత హైదరాబాదులో వున్నప్పుడు వారు రాసిన పుస్తకాలకు సమీక్షలు రాసేను.
అవి చదివిన ప్రసాద్ గారు చాలా సంతోషపడి మెచ్చుకోవడం జరిగింది.
ఆ విషయం నాకు ఈ-మెయిల్ ద్వారా తెలియచేసారు.
నా గురించి తెలిసి “భక్తి, నమ్మకాలు లేని నువ్వు నా పుస్తకాలు ఎలా చదివావు?” అని అడిగారు.
“ఆ పుస్తకాలు రాసిన విధానం, శైలి నన్ను చదివేలా చేశాయి” అని చెప్పాను.


నేను ఎనిమిది సంవత్సరాలుగా అమెరికాలో వున్నందువలన వారిని, గోపిక గారిని ఎప్పుడు కలుసుకునే అవకాశం రాలేదు.
ప్రసాద్ గారు పరమపదించిన రెండు నెలలకు హైదరాబాదు వచ్చి గోపిక గారిని కలిసాను.
గోపిక గారిది నాదీ పుట్టిల్లు కాకినాడ. ఇల్లు కూడా దగ్గిరే! పరిచయం వుంది.
కానీ ప్రసాద్గారు అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు గారికి P.S. గా వున్నారు. అంతటి హోదాలో ఉన్న వారిని, గోపిక గారిని కలవాలంటే మొహమాటం అనిపించేది.
తర్వాత ఒకసారి గోపిక గారిని కలవడానికి వెళ్ళినపుడు తిరుమల తిరుపతి దేవాస్థానం ఉద్యోగులు కొందరు కూడా అక్కడ వున్నారు.
శ్రీనివాసుడి ప్రసాదం లడ్లు కొన్ని తెచ్చి గోపిక గారికి సమర్పిస్తే ఆమె అందులోనుండి నాకు రెండు లడ్లు ఇవ్వడం జరిగింది.
నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుడు అనే మాట మాటాడని నేను ప్రసాద్ గారు రాసిన తిరుమల గురించిన పుస్తకాలు చదివి సమీక్ష రాయడం వలన నాకు ఆ లడ్లు లభించాయా? ఏమో….!
ప్రసాద్ గారు నమ్మే సిద్ధాంతం – “అంతా ఆ పైవాడి దయ, మనకు ప్రాప్తం” నిజం అనుకోవాలా!
కొన్ని సంఘటనలు విచిత్రంగా మన ప్రమేయం అంటూ లేకుండానే జరుగుతాయి అనడానికి నిదర్శనం ఇది.
ఆగష్టు 21వ తేదీ శ్రీ ప్రసాద్ గారి వర్ధంతి!
వారిని గుర్తు చేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.

నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.
1 Comments
RamV
Thank you madam for remembering a great soul like Sri P.V.R.K. Prasad. That is one of my favorite books on Venkateswara Swamy. Sri P.V.R.K wrote each chapter in a gripping manner with full devotion. Here is a Facebook article on translation of some of the chapters in his book to English and meeting Sriram Sir. [Link deleted]