[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘నా కల సాకారమవునా!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఓ కల నన్నెప్పుడూ వెంటాడుతునే ఉంటుంది
తూరుపున లేసూరీడు తూరుతూ ఉన్నప్పడు
తెల్లటి పంచె, పై జుబ్బాలలో ధీమాగా నే కూర్చొని
ఆ వెలుతురులో తెల్లని కాగితంపైన ఏదో రాస్తున్నట్టు
బహూశా నా మనసు ఏదో కోరుకుంటున్నట్టుంది
అనుభవించిన భావావేశాలను అక్షరీకరించమనేమో!
మధురానుభూతులను ఓ చోట చేర్చి చూడాలనేమో!
అది నా మాట పాటించకపోయినా తన మాట నేను వినాలిగా..
ఆ మనసును ఊరట పరచాలని తలచిన నేను
అనివార్యమై మలి సంధ్యలోకి ఒదుగుతూ ఉన్నా..
అనుదినం తొలి సంధ్యను అభ్యర్థిస్తూనే ఉంటాను
ఉత్పేరకమై నా కలాన్ని ముందుకు నడిపించమని
ఆ ఉదయం నా ఆశనెప్పుడు అడియాశ చేయలేదు
ప్రతి రోజూ నన్ను సరికొత్తగా పలకరిస్తూనే ఉంటుంది
నా కోసం ఏం తీసుకొచ్చావని మురిపెంగా నేనడిగితే
భావవేశపు తావి అబ్బిన అక్షర గుచ్ఛాలని
బహూకరిస్తునే ఉంటుంది.. నిరవధికంగా!!!
భానుశ్రీ తిరుమల అనే కలం పేరుతో రచనలు చేసే నా అసలు పేరు తిరుమల రావు పిన్నింటి. నా జననం శ్రీకాకుళం జిల్లా, కవిటి తాలుకా మాణిక్యపురంలో జరిగింది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకూ సొంత ఊరిలోనే జరిగింది.
రామోజీ గ్రూప్ సంస్థలలోని ఆతిథ్య విభాగంలో అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నాను.
చిన్నప్పటి నుండి బొమ్మలు గీయడం, చిన్న చిన్న కవితలు రాయటం చేసేవాడిని. కొందరు గురువులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో ఇటీవల కొన్ని పత్రికలకు పంపిన కవితలు, కథలు అచ్చులో చూసుకొని ఆనందపడుతున్నాను. ఇప్పటి వరకు 20 చిన్న పెద్ధ కధలు,100 కవితలు రాశాను.