Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నా జీవిత యానం-3

[సూరం ప్రసూన గారి ప్రేరణాత్మక ఆత్మకథ ‘నా జీవిత యానం’ పాఠకులకు అందిస్తున్నాము.]

అమ్మమ్మ కుటుంబం:

మ్మమ్మ వాళ్లది తిరుపతి. అమ్మకు ఇద్దరు సోదరీమణులు, ఒక సోదరుడు. తాతగారు అంటే అమ్మ వాళ్ళ నాన్నగారు టీటీడీలో చాలా కాలం పని చేశారు నాకు ఊహ తెలియక ముందు. వేద పారాయణ చేసేవారు. నాకు ఊహ తెలిసిన తర్వాత తాతగారు తిరుపతి రామాలయానికి ఎక్కువగా వేదపారాయణకు వెళ్లేవారు. నక్క రాఘవయ్య గారు తాతగారు కలిసి ఎక్కడ పిలిచినా అక్కడికి వెళ్లివేద పారాయణ చేయడానికి వెళ్లేవారట. ఒకసారి నేను చాలా చిన్న పిల్లని, అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తాతగారికి అంటే అమ్మ వాళ్ళ నాన్న గారికి నాన్నకు మాట పట్టింపు వస్తేనేనేమో మా నాన్నను ఏమన్నా అంటే నిన్నుపోలీసులకు పట్టిస్తాను తాతా అన్నానట. అప్పుడు తాతగారు నా మనవరాలు నన్నుఇలా అంది అని అందరికీ చెప్పినవ్వుకునే వారట. కానీ నేనెప్పుడు అన్నానో నాకు తెలియదు. అలాగే ఇంకొకసారి తిరుపతి కి వెళ్ళినప్పుడు నన్నునాన్న అమ్మమ్మ దగ్గర వదిలి బయటికి వెళ్లారు. అప్పుడు పెద్ద వర్షం పడింది.

నాన్న ఇంటికి ఎలా వస్తాడో అని నేను పెద్దగా ఏడ్చానట. అప్పుడు అమ్మ పక్కనే ఉంది. అప్పుడు తాతగారు ఈ పిల్ల అమ్మ పక్కనే ఉన్నా నాన్న కోసం ఏడుస్తోంది ఇది అమ్మ కూతురు కాదు నాన్న కూతురు అని నాన్న వచ్చాక నాన్నకు చెప్పారు. అమ్మ వాళ్ళ పెద్ద చెల్లెలుకి అంటే పెద్ద పిన్నమ్మ కు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు. పిన్నమ్మ వాళ్ళ చిన్న కుమార్తె ప్రమీల చదువులో చాలా తెలివితేటలు గల అమ్మాయి. ఇప్పుడు తను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అమ్మమ్మ తరపు వాళ్ళల్లోఈ అమ్మాయి ఉన్నత స్థితిలో ఉంది. నాకు బాగా దగ్గర. అమ్మమ్మ దగ్గరికి వెళ్లినప్పుడు ప్రమీల అమ్మమ్మ మేనమామ ప్రమీలా వాళ్ళ అమ్మ అంటే మా పిన్నమ్మ నన్ను అందర్నీ కలిపి దేవాలయానికి సినిమాలకు తీసుకువెళ్లేవారు నాన్న. ఒక సంవత్సరం అమ్మమ్మ ప్రమీల నేను నాన్న తిరుమల వెళ్ళాము. అప్పుడు తిరుమలలో బస్‍స్టాప్ దగ్గర నుండి ధ్వజస్తంభం ఎదురుగా ఉన్న ద్వారం వరకు నేను వీల్ చైర్‌లో కూర్చుంటే నెట్టుకుంటూ తీసుకెళ్ళింది ప్రమీల. ఆ తర్వాత అక్కడినుంచి స్వామి దర్శనానికి నాన్న ఎత్తుకొని ఆ జనంలో తీసుకుని వెళ్లారు నాన్న.

తిరుపతిలో చంద్రశేఖర రావు అనే డాక్టర్ గారి దగ్గర పనిచేసే వారు మేనమామ. ఆ డాక్టర్ గారు సొంత కుమారుడిలా చూసేవారు. ఆ డాక్టర్ గారికి హాస్పిటలే కాకుండా స్కూల్ కూడా ఉండేది. డాక్టర్ గారు పుట్టపర్తి సాయిబాబా భక్తులు. ప్రతి గురువారం సాయంత్రం వాళ్ళ స్కూల్లో భజన కార్యక్రమాలు జరిగేవి. మేనమామ ఆ భజన కార్యక్రమాలకు నన్నునాన్నని రమ్మని పిలిచేవారు. నాన్న నన్నుఅక్కడికి ఎత్తుకుని తీసుకుని వెళ్ళేవారు. అక్కడ భజన కార్యక్రమాలు చాలా చక్కగా జరిగేవి.

ఒకసారి అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఒక సంఘటన జరిగింది. ఒక రోజు రాత్రి అందరం భోజనాలు చేసి పడుకుంటున్నాము. పిన్నమ్మ పనులు చేసి కాస్త లేటుగా పడుకుంటుంది. ఆరోజు రాత్రి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బావి దగ్గర వేడి నీళ్లు కాచుకునే రాగి తప్పెల రెండు అల్యూమినియం పాత గిన్నెలు పెట్టి మర్చిపోయింది పిన్నమ్మ. ఆ రాత్రి అందరం నిద్రిస్తుండగా ఒక దొంగ గోడ దూకి వచ్చి రాగి తప్పెల మిగితా రెండు గిన్నెలు తీసుకొని వెళ్ళిపోయాడు. తెల్లవారిన తర్వాత లేచి చూచుకొనగా వస్తువులు లేవు. విలువైన రాగి తప్పెల పోయినందుకు అమ్మమ్మ చాలా బాధపడింది. నాన్నేమో పోలీస్ కంప్లైంట్ ఇస్తామని అంటే అందరూ వద్దు, పోలీసులు ఏమీ చేయరు, పోయిన వస్తువు ఇంక రాదు అన్నారు. కానీ నాన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు.

ఎలాగైనా మా వస్తువులు వచ్చేలా చూడమని ఎస్.ఐ.ని అభ్యర్థించారు నాన్న. అలాగే మీ వస్తువులు మీకు వచ్చేలా చూస్తాను అని అన్నారు ఎస్ ఐ. దొంగ దొరికాడు వస్తువులు దొరికాయి. అమ్మమ్మ చాలా ఆనంద పడింది. రాగి తప్పెలా పాటు పాత గిన్నెలకు బదులు కొత్త గిన్నెలు ఇచ్చారు.

అమ్మమ్మ పెంకుటిల్లు – ప్రభాకరం గారు:

అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఆవరణంలో పెంకుటిల్లు చిన్న గది ఉండేది. ఆ గదిలో ఒక ఉపాధ్యాయులు అద్దెకు ఉండేవారు. అతను అమ్మమ్మ దగ్గర పేయింగ్ గెస్ట్‌గా ఉండేవారు. అతనిని అమ్మమ్మ నా పెద్ద కుమారుడు అనేది. అతనిని నేను ప్రమీల ఇద్దరమూ మామయ్య అని పిలిచేవాళ్ళం. ఇప్పటికీ మామ అనే పిలుస్తాము. అతను అమ్మమ్మకు పెద్ద కుమారుడిగా చాలా సహాయంగా ఉండేవారు. ఆ మామయ్య టీచర్ కాబట్టి పాఠశాల నుంచి ఇంటికి వచ్చాక ఇంటి దగ్గర చాలా మంది పిల్లలకి పాఠాలు చెప్పేవారు. ప్రమీల కూడా ఆయన దగ్గరే ఎక్కువ చదువుకుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను కూడా ఆ మామయ్య దగ్గర పాఠాలు నేర్చుకునే దాన్ని.

తుమ్మగుంట పిల్లలు-ఆటలు:

తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ప్రతిసారి గోవిందరాజ స్వామి గుడిలో చెక్క బొమ్మలు చెక్క బుడ్లుపూసల దండలు గాజులు స్టీల్ బుడ్లు అలివేలు మంగాపురం వెళ్లిగాజులు తెచ్చుకునే దాన్ని. నాన్న అన్నికొని ఇచ్చేవారు.

అవన్నీ తుమ్మగుంటకు తెచ్చుకునే దాన్ని. అవన్నీచూసి తుమ్మగుంట గ్రామంలో ఉన్న బ్రాహ్మణ పిల్లలు ఇంకా ఇతర కులాల వాళ్ళ పిల్లలు నాతో ఆడుకోవడానికి వచ్చేవాళ్ళు కానీ నానమ్మ తాతయ్య వాళ్లు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. తాతయ్య అంటే అందరికీ భయం. నానమ్మ తాతయ్య వాళ్లు తుమ్మగుంట నుండి వేదాయపాలెం వెళ్లినప్పుడు మాత్రమే పిల్లలు నాతో ఆడుకోడానికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే తాతయ్యకు పిల్లలు ఆడుకునేటప్పుడు పెద్దగా అరవడం గోల చేయడం పరుగెత్తడం వస్తువులు విసిరేయడం వంటి పనులు నచ్చవు. అలాంటి వాటిలో చాలా కఠినంగా ఉంటారు. ఈ పనులు పిల్లలు అయినా సరే చేయకూడదు అంటారు తాతయ్య. ఆడుకుంటే శబ్దం చేయకుండా ప్రశాంతంగా ఆడుకోవాలి అని నియమం పెట్టేవారు. ఇంకా ఎవరిని తాకకూడదు.దూరంగా ఉండే ఆడుకోవాలి. ఇంకా ఎవరైనా స్త్రీలు వచ్చినానమ్మ తో ఎక్కువ సేపు ముచ్చట్లు ఆడడం వస్తువులు, అరువు తెచ్చుకోవడం ఇలాంటివి ప్రోత్సహించేవారు కాదు. తాతయ్య ఇలా ఇంట్లో నియమ నిబంధనలు పెట్టేవారు. అందుకని తాతయ్య వాళ్లు ఇంట్లో లేనప్పుడు మాత్రమే పిల్లలు ఆడుకోవడానికి వచ్చేవాళ్ళు. నా దగ్గర ఉన్న బుడ్లుబొమ్మలు పెట్టిఆడేవాళ్ళం. అప్పుడప్పుడు బొమ్మల వివాహం పిల్లల అందరం కలిసి చేసేవాళ్ళం. బుడ్లల్లోతుమ్మ చెట్టుకు పూసే పసుపు లేత ఆకుపచ్చ పూలు తుమ్మ కాయలు ఉమ్మెత్త పూలు ఉమ్మెత్త కాయలు మందార ఆకులు రకరకాల పూలు పిల్లలందరం కలిసి తలా ఒకటి తెచ్చిబుడ్ల ల్లోవేసేవాళ్ళుఆడుకోవడానికి. నేను పాత గుడ్డలను బ్లేడుతో కత్తిరించి సూది దారంతో నా గౌన్ల ఆకారం చూసి అదేవిధంగా ఎవ్వరిని అడగకుండా నా సొంత ఆలోచనతో బొమ్మలకు గౌన్లు కుట్టేదాన్ని. నా మేనత్తలు “దీనికి చదువు కన్నా ఇలాంటివి నేర్పిస్తే చాలా బాగా చేస్తుంది” అనేవాళ్ళు. అది చూసి అందరూ చాలా మెచ్చుకునేవారు. ఇదంతా నా చిన్నతనంలోనే. ఇంకా ఆడపిల్లలు తొక్కుడు బిళ్ళ ఆట ఆడుతూ ఉంటే నేను చూసే దాన్ని. పల్లా చాట పులి మేక ఆటల్లోనేను కూడా ఉండేదాన్ని. ఇంకా పిల్లలు ఇసుకను పోగుచేసి అందులో పుల్లలు పెట్టి చుకు చుకు పుల్ల అంటూ పుల్లను వెతికేవాళ్ళు. ఇంకా మగ పిల్లలు వీధిలో గోలీలాట బొంగరాలాట ఆడుతుండగా ఆడపిల్లల మందరం గడపల మీద కూర్చుని చూసేవాళ్ళం.

ఇంకా నాన్న కాళ్లుచేతులు ఉండే జుట్టుబొమ్మలు తెచ్చేవారు. ఆ జుట్టుబొమ్మలకు నేను జడ వేసి పూసలతో పూలజడ ఇంకా నానమ్మ తాతయ్య వాళ్లువేసుకొని పడేసిన మాత్ర కాగితాలతో బొమ్మకు గాజులు దండలు కమ్మలు తయారుచేసి వేసేదాన్ని. ఇవన్నీసొంత ఊహతో చేయగలిగే దాన్ని. ఎవరి దగ్గర నేర్చుకున్నవి కావు.

తుమ్మగుంట- చలమల వెంకయ్య:

తుమ్మగుంటలో చెలమాల వెంకయ్య అని ఒక పెద్దాయన ఉండేవారు. అతను మాకు పొలం పనులకు వచ్చేవారు, అతను మా తాత దగ్గరికి సాయంత్రం పూట వచ్చేవాడు. ఆధ్యాత్మిక విషయాలు ఇద్దరు చర్చించుకునేవారు,

తాతయ్య చెలమల వెంకయ్య కలిస్తే పెద్ద ఆధ్యాత్మిక గోష్ఠి జరిగిందని చెప్పవచ్చు. చెలమల వెంకయ్య తాత కృష్ణాష్టమి వస్తే చిన్ని కృష్ణుడు వచ్చాడా మీ ఇంటికి పాపా ఏమన్నాడు అని నాతో అనేవారు.

కరీం కుటుంబం – పుల్లయ్య:

ఇంకా మా ఇంటి ఎదురుగా కరీం కుటుంబం ఉండేది. అతని భార్య పేరు సఖిన. వాళ్లకి ఇద్దరు పిల్లలు అబ్బాయి పేరు పుల్లయ్య, అమ్మాయి పేరు అమీనా. పుల్లయ్య నాతో ఆడుకోడానికి వచ్చేవాడు. పుల్లయ్య నా కంటే చాలా చిన్నవాడు. తరువాత అమీనా పుట్టింది. తర్వాత ఇద్దరూ ఆడుకోవడానికి వచ్చేవారు, నానమ్మ తాతయ్య వాళ్లునాన్న ఎప్పుడైనా ఇంట్లోలేకపోతే పుల్లయ్య నాకు తోడు వచ్చికూర్చునేవాడు. నాతోపాటు చదువుకుంటూ కూర్చునే వాడు. కరీం కొద్దిరోజులు మాకు పాలేరుగా పని చేశాడు. సఖినా కూడా పనిమనిషిగా కొద్దిరోజులు పని చేసింది. సఖినా పిల్లలిద్దర్నీచాలా క్రమశిక్షణగా పెంచేది. పుల్లయ్య ఎప్పుడైనా చదవకపోయినా ఏదైనా చిన్న తప్పు చేసినా బాగా కొట్టేది. పుల్లయ్య అమీనా ఇద్దరు బాగా చదివేవాళ్ళు. పుల్లయ్య వాళ్ళు కోడి పిల్లలను పెంచేవాళ్ళు. మా పెద్ద చిన్నాన్న వాళ్లు వచ్చినప్పుడు చిన్నాన్న పిల్లలు అంటే నా తమ్ముడు చెల్లెలు ఇద్దరూ ఆ కోడి పిల్లలకు వడ్లువేసి అవి తింటుంటే వాటిని చూసి ఆనందంగా నవ్వుకుంటూ ఆడుకునే వాళ్ళం.

కనకమ్మ:

మా ఇంటి పక్కన ఉన్న లక్ష్మీనారాయణ స్వామి గుడి ఎదురు సందులో కనకమ్మ కుటుంబం ఉండేది. కనకమ్మకు భర్త ఇద్దరు ఆడపిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ల పేర్లు శ్యామల విజయ. వాళ్ళిద్దరూ నాకంటే పెద్ద వాళ్ళు. కనకమ్మ పెద్ద కూతురు మా చిన్నత్తకు స్నేహితురాలు. వాళ్ళిద్దరూ కలిసి చదువుకునేవాళ్ళు. కనకమ్మ చిన్న కూతురు విజయ చదువులో బాగా తెలివితేటలు గలది. అప్పుడప్పుడు తాతయ్య దగ్గర నాన్న దగ్గర ఆంగ్ల వ్యాకరణం గణితము చెప్పించుకునేది. కనకమ్మ వాళ్లకు అప్పట్లో కొంత పొలం ఉండేది. అయినా కూడా మాకు పొలం పనులకు వచ్చేది. నానమ్మ తాతయ్య వాళ్లు తుమ్మగుంటలో లేనప్పుడు నాన్న నేను మాత్రమే ఇంట్లో ఉంటే కనకమ్మ వచ్చిమా ఇంట్లో ఉన్న బర్రెకు పాలు తీసి ఇచ్చేది. నాకు జడలు వేసేది. బూట్లు వేసుకొని నడక సాధన చేసే క్రమంలో నేను పడిపోయి దెబ్బలు తగిలితే కనకమ్మ వచ్చి రక్తం పోకుండా కట్టుకట్టేది. ఇంకా విజయ నాకు నోట్స్ రాసి ఇచ్చేది. నన్నుఎత్తుకొని తీసుకెళ్ళేది వాళ్ళింటికి. ఇంకా చిన్న నానమ్మ వాళ్ల ఇంటికి కూడా ఎత్తుకొని వెళ్ళేది. ఆ విధంగా కనకమ్మ వాళ్ళుమాకు చాలా సహాయంగా ఉండేవాళ్ళు. కనకమ్మ కూతురు విజయ బాగా చదువుకొని టీచర్ అయింది. ఇప్పుడు జాబ్ చేస్తోంది వాళ్ల పిల్లలకు కూడా పెళ్లిళ్లు చేసేసింది.

వరమ్మ- కుటుంబం:

ఇంకా తుమ్మగుంటలో వరమ్మ అనే ఒక ఆమె ఉండేది. వాళ్లు వైశ్యులు. వరమ్మకి ఒక కుమారుడు ఒక కుమార్తె. ఆ అమ్మాయి పేరు కుమారి. నా దగ్గరికి ఆడుకోవడానికి వచ్చేది. కుమారి ఐదవ తరగతి వరకు తుమ్మగుంట లోనే చదువుకుంది. కానీ ఆ అమ్మాయికి తెలుగు చదవడం రాయడం రాలేదు. కుమారి వాళ్ళ అమ్మ వరమ్మ నా దగ్గరికి వచ్చికుమారికి వివాహం చేస్తే జాబు రాయడం చదవడం రాదు అందుకని తెలుగు చదవడం రాయడం వాళ్ళ అమ్మాయికి నేర్పించమని నన్నుఅడిగింది. నేను సరే అన్నాను. అప్పుడు నేను ఏడవ తరగతి రెండోసారి చదువుతున్నాను అనుకుంటా. అప్పుడు నేను కాలం వృథా కాకుండా నేను ఏ పాఠం చదువుతున్నానో (అంటే తెలుగు సాంఘిక శాస్త్రం సామాన్య శాస్త్రం లాంటివి మాత్రమే) అదే పాఠం నేను చదువుతూ ఆ అమ్మాయికి కూడా చదవడం నేర్పిస్తుండినాను. ఇలా నాకు ఎనిమిదవ తరగతి పూర్తయ్యేవరకు నేర్పించాను. ఎలాగో అప్పట్లోనాకు ఉన్నకొద్దిపాటీ పరిజ్ఞానంతో ఆ అమ్మాయికి జాబు రాయడం చదవడం నేర్పించగలిగాను. వరమ్మ చాలా సంతోషపడింది. నాకు కృతజ్ఞతలు తెలిపింది.

చంద్రయ్య – కుటుంబం:

ఇంకా మా ఇంటి పక్కన తాతయ్య వాళ్ళ చెల్లెలు స్థలం ఉండేది. అంటే మా ఇంటికి లక్ష్మీనారాయణ స్వామి గుడికి మధ్యలో తాతయ్య వాళ్ళ చెల్లెలి ఇల్లు ఉండేది అప్పట్లో. నాకు ఊహ తెలిశాక అక్కడ ఇల్లు లేదు. వాళ్ళ స్థలం మాత్రమే ఉండింది. ఆ స్థలంలో గుడిసె వేసుకొని ఒక కుటుంబం ఉండింది. ఆ కుటుంబ యజమాని పేరు చంద్రయ్య. అతని ఊరి వారందరు చంద్రిగాడు అని పిలిచే వాళ్ళం. వాళ్లు పొలాలలో ఎలుకలు పట్టేవాళ్ళు. ఎవరైనా గిన్నెలు తోమమని పిలిస్తే వెళ్ళి తోమే వాళ్ళు. అయ్యప్ప స్వామి ఆలయంలో లక్ష పూజ జరిగినప్పుడు కానీ లక్ష్మీనారాయణ స్వామి గుడిలో ఏకాంత సేవ సమారాధన జరిగినప్పుడు కానీ గిన్నెలు తోమడానికి వెళ్లేవాళ్ళు. పగలంతా పనికి వెళ్లి వచ్చి రాత్రి అయ్యేసరికి భోజనాలు చేసి పడుకొని ‘ఏమని వర్ణించను రాముడు కాదమ్మా’ అనే పాటను చాలా బాగా పాడేవాడు పెద్దగా. అతని కంఠ స్వరం చాలా బాగా ఉండేది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దానిని వెలికి తీసి చేయూతనిచ్చేవాళ్ళు ఉంటే ప్రతిభ గల వాళ్ళు రాణించగలరు. పాటలు పాడడంలో చంద్రయ్య ప్రతిభ గలవాడు అని చెప్పగలను.

తాతయ్య-నెల్లూరు నివాసం:

తాతయ్య సొంత సేద్యం చేయకముందు నెల్లూరులో కాపురం ఉండినారట. తాతయ్య నెల్లూరులో ఉన్నప్పుడు నాన్న పెద్ద చిన్నాన్న పెద్ద అత్త వాళ్లు చిన్నవాళ్లట. తాతయ్య ఆంగ్ల వ్యాకరణ బోధన చేసేవారు. నెలకు పదహారు రూపాయలు సంపాదించేవారట. అందులో ఖర్చులు పోను రెండు రూపాయలు మిగిల్చేవారట తాతయ్య. నాన్న పెద్ద చిన్నాన్న ఒకే తరగతిలో చేర్చారట తాతయ్య. నాన్న పెద్ద చిన్నాన్న పెద్ద అత్త వి.ఆర్.సి. లో చదివారట. అప్పట్లో శ్రీరామ అయ్యంగార్ గారు వి. ఆర్. కాలేజీలో అధ్యాపకులుగా పనిచేసేవారట. వారి కుమారులు ఎం.ఎస్. రాజాజీ గారు నాన్న పెద్ద చిన్నాన్నలకు సహ విద్యార్థి స్నేహితులు. చిన్న వయసులో నాన్న చిన్నాన్న రాజాజీ గారు ఇంకా స్నేహితులు అందరూ కలసి క్రికెట్ ఆడేవారట. అది మా పెద్ద అత్త కూర్చొని చూచేదట. నాన్న చిన్నాన్న పెద్ద అత్త వేకువజామున లేచి స్నానాది కార్యక్రమాలు అయిన తరువాత భగవద్గీత శ్లోకాలను పఠించేవారట. ఇలా పఠించమని తాతయ్య చెప్పారట. ఒకసారి నెల్లూరు టౌన్ హాల్లో భగవద్గీత శ్లోకాల పోటీ జరిగిందట. ఆ పోటీలో నాన్న పెద్ద చిన్నాన్న పెద్ద అత్త ముగ్గురు పాల్గొన్నారట. వారి ముగ్గురి లోనే ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు వచ్చాయట. నాన్న చెప్పేవారు. నేదురుమిల్లి జనార్దన్ రెడ్డిగారు మా పెద్ద చిన్నాన్నకు సహ విద్యార్థి. తుమ్మగుంటలో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చేవారట జనార్ధన్ రెడ్డిగారు చిన్నాన్న వాళ్ల చిన్నతనంలో.

నాన్న- రాజాజీ గారు:

నేను పుట్టికొంచెం పెద్దయ్యాక తిరుపతికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండిన క్రమంలో ఎం.ఎస్. రాజాజీ గారు చిత్తూరు జిల్లా కలెక్టర్‍గా పదోన్నతి పొందారు. అప్పట్లో అమ్మమ్మ వాళ్ళ పెంకుటింట్లో నరసింహాచారి అనే తాతగారు అద్దెకు ఉండేవారు, ఆయనని ఆచార్లుతాత అని పిలిచే వాళ్ళం, ఆయన తిరుపతిలో ఉపాధ్యాయులుగా పదవీ విరమణ చేశారు. ఆయనకు పదవి విరమణ తరువాత పింఛను రాలేదు. ఆ విషయం నాన్నతో చెప్పగా నాన్న చిత్తూరు వెళ్లి రాజాజీ గారిని కలిసి ఆచార్లుతాతకు పింఛను వచ్చేలా చేయమని అభ్యర్థించారు నాన్న. అందుకు రాజాజీ గారు నీకేమైనా అడుగు చేస్తాను అన్నారట. అప్పుడు నాన్న నాకేమీ వద్దు, ఆచార్యులు గారికి పింఛను వచ్చేలా చూడమని అని చెప్పారట. అప్పుడు రాజాజీ గారు ఆచార్యులు గారికి పింఛను వచ్చేలా చేశారు. రాజాజీ గారిని ఇతరుల కోసం కాకుండా నాన్న కోసం తిరుపతిలో స్థలం ఏదైనా ఇప్పించమని అడిగి ఉంటే నాన్నకు చాలా విలువైన స్థలం ఉండేదని తాతయ్య నానమ్మ పెద్ద ఆత్త వాళ్లు చెప్పుకొని బాధపడేవాళ్ళు. కాలక్రమేణా రాజాజీ గారి నాన్నగారు వాళ్లు మదరాసులో స్థిరపడ్డారు. ఒకసారి నాన్న నేను నా వైద్యం కోసం మదరాసు వెళ్ళినప్పుడు శ్రీరామ అయ్యంగార్ గారి ఇంటికి నన్నుతీసుకెళ్లారు నాన్న. అప్పుడు ఆ తాతగారు నన్నుచూచి నాతో విసనకర్ర వేయనా పాపా అని ఫ్యాన్ వేశారు. నాకు ఒక డబ్బానిండా బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చారు. ఇప్పటికీ ఆ డబ్బాలో తిలకం సీసా వేసుకొని జాగ్రత్తగా వాడుకుంటున్నాను.

కొన్ని సంవత్సరాలు గడిచాక అంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎం.ఎస్.రాజాజీ గారు రామారావు గారికి ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఇప్పుడు రాజాజీ గారు మదరాసులో ఉన్నారట. చిన్నాన్న ఈ విషయం చెప్పారు శ్రీరామ అయ్యంగార్ కాలం చేశారట.

నా చదువు – రాజుపాలెంలో ఇల్లు:

ఇక నా చదువు విషయానికి వస్తే తొమ్మిదవ తరగతిలో పాఠశాలలో చేరి తుమ్మగుంట నుంచి రాజు పాలానికి బస్సులో వచ్చిచదువుకున్నాను అని ముందే రాశాను. తుమ్మగుంట నుంచి రాజుపాలానికి బస్సులో రావడం వెళ్లడం చాలా కాలం వృథా అయ్యేది. శ్రమ ఎక్కువగా ఉండేది. ఈ కారణంగా రాజుపాలెం లోనే పదవ తరగతి సంవత్సరం అంతా అక్కడే ఇల్లు తీసుకొని ఉండి నన్నుచదివించాలని నిర్ణయించుకున్నాడు నాన్న. ఇక రాజుపాలెంలో ఇల్లు వెదకడం ప్రారంభించాడు నాన్న. చిన్న గది ఉన్నా చాలు అనుకున్నాడు నాన్న.. కానీ రాజుపాలెంలో అప్పట్లో ఇల్లు కాదు కదా చిన్న గది కూడా దొరకలేదు. చివరకు ఒక పాలేరు లాంటివాళ్ళు ఉండే గుడిసె ఖాళీగా దొరికింది. దాని యజమాని రాజుపాలెంలో ఒక భూస్వామి. ఆ గుడిసెలో మట్టి నేల. ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అక్కడ వసతులు లేవు. తుమ్మగుంటలో విశాలమైన పెద్ద గదులు ఉన్న మిద్దెఇంట్లో ఉన్న మేము నా చదువు కోసం ఈ గుడిసెలో ఉండవలసి వచ్చింది. ఆ గుడిసే పాఠశాలకు కాస్త దూరమే. నేను కూరలు తరిగి ఇచ్చి చదువుకుంటుంటే నాన్న వంట చేసేవారు. అన్నిపనులు ముగించుకొని పాఠశాల తెరిచే సమయానికి వెళ్ళేవాళ్ళం. మేము రాజుపాలెం రావడంతో నానమ్మ తాతయ్య వాళ్లు కూడా పూర్తిగా తుమ్మగుంట వదిలి నెల్లూరు వేదయపాలెంలో ఉన్న ఇంట్లో ఉండిపోయారు. అప్పటికే చిన్నాన్న లందరికీ అత్తకి వివాహాలు జరిగి పిల్లలు పుట్టడం కొంచెం పెద్ద వాళ్లు అవ్వడం జరిగింది. మేము రాజుపాలెంలో ఉన్నప్పుడు రెండో చిన్నాన్న ఒకసారి మూడో చిన్నాన్న ఇంకోసారి బియ్యం తెచ్చేవాళ్ళు. రాజుపాలానికి. నాన్న వంట చేశాక అన్ని కార్యక్రమాలు ముగించుకుని పాఠశాలకు వెళ్లేముందు వండిన అన్నము కూరలు గుడిసెలో పెడితే కుక్కలు వచ్చి దొర్లిస్తాయని తీసుకెళ్లి ఇంటి యజమాని వాళ్ళ వరండాలో గంప కింద దాచిపెట్టి పాఠశాలకు వెళ్ళేవాళ్ళం. మధ్యాహ్నం పాఠశాల విడిచిన తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్లీ పాఠశాలకు వెళ్ళేవాళ్ళం. ఆ క్రమంలో ఒక రోజు మధ్యాహ్నం ఆకలితో భోజనానికి ఇంటికి వస్తే గంప కింద పెట్టిన భోజనం కుక్క దొర్లించి తినేసింది. అప్పుడు ఇంటి యజమాని వాళ్ళు భోజనం ఇచ్చారు. ఆ రోజు అలా జరగడం చాలా బాధగా అనిపించింది.

పదవ తరగతి – తెలుగు క్లాస్:

ప్రాణస్నేహితురాలు రోహిణి గారితో రచయిత్రి

అప్పుడు పదవ తరగతిలో తెలుగు మాస్టారు పేరు ఉమామహేశ్వరరావు గారు. ఒక రోజు ఆ సారు పాఠశాలకు రాలేదు. ఆ సార్ బదులు రామిరెడ్డిసార్ పాఠం చెప్పడానికి తరగతికి వచ్చారు. అప్పుడు మాకు పార్వతి తపస్సు అని పద్యభాగం ఉండింది. ఆ పాఠాన్ని రామిరెడ్డి సారు ఆ రోజు చెప్పారు. ఇందులోని పద్యాలను పాడి వివరించి చెప్పారు. ఆ పద్యం ‘ఎక్కడ లేరే వేల్పులు సమీప్సిత దాతలు’ ఇంకొక పద్యం కూడా చెప్పారు. ఆ రోజు పాఠం చెప్పి పద్యాలు కంఠస్థం చేయమని చెప్పారు పిల్లలందరికీ. ఆ తరువాత ఒకరోజు డి.ఈ.ఓ. గారి తనిఖీ ఉందని చెప్పారు. మేమందరం ఆ పద్యాలు కంఠస్థం చేసాము. మాది ఏ సెక్షన్. ఏ సెక్షన్‍లో రోహిణి బాగా తెలివిగల అమ్మాయి. బి సెక్షన్‌లో జరీనా తెలివిగల అమ్మాయి. డి.ఈ.వో. గారు ఏ సెక్షన్ కి తనిఖీకి వచ్చారు. అప్పుడు ఉమామహేశ్వరరావు సార్ గారు రోహిణిని పద్యం చెప్పమన్నారు. ఆ వెంటనే సార్ తో పద్యం నేను చెప్తాను అని అభ్యర్థించాను. అప్పుడు సార్ సరే అని చెప్పమన్నారు. అప్పుడు నేను ఎక్కడ లేరే వేల్పులు పద్యం చెప్పాను. పాపం రోహిణి చెప్పాలనుకుంది పద్యం డి ఈ ఓ గారి ముందు. ఎందుకో తెలియదు తనకు వచ్చిన అవకాశాన్ని నేను తీసుకున్నాను. నా ప్రాణస్నేహితురాలిని బాధ పెట్టకూడదన్న విషయం తెలియకుండా పోయింది. రోహిణి అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇలా చేశాను. కానీ ఆ పద్యాలు చాలా కష్టపడి నేర్చుకున్నాను.

రోహిణి వాళ్ళ కుటుంబం:

రోహిణి వాళ్ళ అమ్మానాన్నల పేర్లు బ్రమరాంబ రామయ్య గార్లు. రోహిణి వాళ్ళ నాన్నగారు రాజుపాలెం పోస్ట్‌మాస్టర్‌గా పని చేసేవారు. రోహిణికి ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారు. అక్క పేరు కుసుమ. తమ్ముడు పేరు కృష్ణ. కుసుమ అక్క మాకంటే సీనియర్ తను మా పాఠశాల లోనే చదువుకుంది. అక్క పదవ తరగతిలో పాఠశాలకు మొత్తానికి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. నేను నాన్న రోహిణి వాళ్ళ ఇంటికి తరచూ వెళ్ళేవాళ్ళం, కుసుమ అక్క నన్ను బాగా చదవమని ప్రోత్సహించేది, రోహిణి వాళ్ళ తమ్ముడు కృష్ణ మా కన్నాకాస్త చిన్నవాడు. మా పాఠశాల లోనే చదివేవాడు. రోహిణి వాళ్ళ అమ్మగారు నాన్నగారు నేను నాన్నఎప్పుడు వెళ్ళినా భోజనం చేయమని చెప్పేవారు, తినేదాకా వదిలేవాళ్ళు కాదు..

(ఇంకా ఉంది)

Exit mobile version