[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘మౌనమేల ప్రియా!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]
నీ జ్ఞాపకాల దొంతరలు
కనుమరుగు కాకముందే
నీతో గడిపిన క్షణాలు
మంచులా కరిగిపోకముందే
నీతో చేసిన బాసలు
అడియాసలు కాకముందే
నీతో పంచుకున్న అనుభూతులు
పెను భూతాలు కాకముందే
నీతో గడిపిన స్మృతులు
గతులు తప్పకముందే
నీ మౌనం నిశీథై
నేను రోదించకముందే
నా మతి భ్రమించి
నే పాతాళానికి క్రుంగకముందే
నీ అలక మాని
నను పలకరించు ప్రియా!
నీ ఎడబాటు తట్టుకోలేక
తనని పలకరిస్తావని
పూలపాన్పు కూడా శోకిస్తోంది ప్రియా!