Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మూలాలని మరచి

[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘మూలాలని మరచి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

వాడు అప్రయోజకుడిగా ఉన్నప్పుడు
నాన్న నిలువెత్తు ధైర్యంగా కనిపించేవాడు.
వీడు ప్రయోజకుడైనప్పటినుండి నాన్నతో
ఇక ఏ ప్రయోజనమూ లేదని..!

వాడు బుడి బుడి అడుగుల నుండి
వడి వడి అడుగులేసి..
అందలాల వరకూ..
అన్నమై పోషించిన అన్నపూర్ణ అమ్మని,
జంఝాటమని తలచి..

అవసరాలు, ఆడంబరాల
వెదుకులాటలో..
మానవత్వాన్ని అగాధాలలోకి వదిలి..
నిస్సహాయులైన
కన్న వాళ్లను గాలి కొదిలి..
కసాయి కబేళాకు పశువును తోలుతున్నట్టు..
తన మూలాలను కోసి అనాథాశ్రమాలకో
వృధ్ధాశ్రమాలకో విసిరేస్తున్నాడు.

నాగరికత పెరుగుతున్న నేపథ్యంలో
మానవ నైజంలో..
నకరాత్మకత పెచ్చు మీరుతున్నవైనం..
ఏమో! వాని సంతతి
రేపు వీనిని కూడా..
కబేళాకు పంపిస్తుందేమో!?
అలా జరగకూడదని ఆశిస్తే..
భావితరాలైనా..
మళ్లీ విలువల వైపు
అడుగులేస్తాయేమో!
చూద్దాం మరి..!

Exit mobile version