151
సృష్టి నిమిత్తం
భాగస్వామి కోసం
చీకటిని వెలుగు ఆమోదిస్తుంది
152
మురళి దాని యజమాని శ్వాస కోసం ఎదురు చూస్తుంది
యజమాని తన మురళి కోసం
153
గుడ్డి కలానికి రాస్తున్న చేయి అవాస్తవం, దాని రాత అర్థరహితం
154
చంద్రుని సమర్పణకు తనకు పూలైనా లేవని
సముద్రం దాని ఫలించని గుండెల్ని బాదుకుంటుంది
155
పండు కోసం దురాశ, పూవుని పోగొట్టుకొంటుంది
156
దేవుడు తన నక్షత్రాల గుడిలో
మనిషి కోసం ఎదురు చూస్తాడు, తనకోసం దీపం తెస్తాడని
157
చెట్టులో అణిగిన జ్వాల పూలకు రూపమిస్తుంది
సిగ్గుమాలిన జ్వాల చెఱనుండి విడుదలై, ఫలించని బూడిదలో చస్తుంది
158
చంద్రుడ్ని పట్టుకుందుకు, ఆకాశం ఏ ఉచ్చూ పన్నదు
దాని స్వేచ్ఛే దాన్ని బంధిస్తుంది
ఆకాశాన్ని నింపిన వెలుగు, పచ్చికమీద మంచుబిందువులో
దాని పరిమితిని అది వెదుక్కుంటుంది
159
సంపద పెద్దతనపు భారం
సంక్షేమం పూర్ణత్వపు ఉనికి
160
సూర్యుడ్ని ఎగతాళి చేస్తూ
గడ్డిపోచ దాని ఉత్సుకతకు గర్వపడుతుంది
161
సీతాకోకచిలుకకు
కమలాన్ని ప్రేమించేందుకు తీరికుంది
తుమ్మెదకు
తేనె సంగ్రహంలో తీరికలేదు
162
శిశువా
గాలి పిచ్చి కూతలు, నీరు,
నోరాడని పూల రహస్యాలు, మేఘాల కలలు,
ఉదయాకాశపు ఆశ్చర్య మూగ చూపులు
నువు నా హృదయానికి తీసుకొస్తావు
163
ఇంద్రధనుస్సు మేఘాల్లో గొప్పది కావచ్చు
కానీ పొదల్లో చిన్న సీతాకోకచిలుక ఇంకా గొప్పది
164
ఉదయం చుట్టూ వల అల్లి మంచు
వశపర్చుకుని దానిని గుడ్డిదానిని చేస్తుంది
165
వేగుచుక్కతో వేకువ గుసగుసలాడుతుంది
‘నువ్వు కేవలం నా కోసమే కదా’ అని
‘అవును’ అని జవాబు
‘ఆ అనామక పూవు కోసం కూడా’
(మళ్ళీ వచ్చే వారం)

శ్రీ యల్లపు ముకుంద రామారావు 9 నవంబరు 1944 నాడు పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్లో జన్మించారు. విద్యార్హతలు M.Sc, D.I.I.T, P.G.D.C.S.
కవిగా, అనువాద కవిగా, రచయితగా ప్రసిద్ధులైన ముకుంద రామారావు – వలసపోయిన మందహాసం (1995), మరో మజిలీకి ముందు (2000), ఎవరున్నా లేకున్నా (2004), నాకు తెలియని నేనెవరో (2008), నిశ్శబ్దం నీడల్లో (2009), విడనిముడి (అన్ని సంకలనాల్లోని ఆత్మీయ అనుబంధాల కవిత్వం) – (2013), ఆకాశయానం (2014), రాత్రి నదిలో ఒంటరిగా (2017) అనే స్వీయ కవితా సంపుటాలను వెలువరించారు.
అదే ఆకాశం – అనేక దేశాల అనువాద కవిత్వం (2010), శతాబ్దాల సూఫీ కవిత్వం (2011), 1901 నుండి నోబెల్ కవిత్వం (కవుల కవిత్వ – జీవిత విశేషాలు) – పాలపిట్ట వ్యాసాలు – (2013), 1901 నుండి సాహిత్యంలో నోబెల్ మహిళలు – సోపతి వ్యాసాలు – (2015), అదే గాలి (ప్రపంచ దేశాల కవిత్వం – నేపధ్యం) – మిసిమి వ్యాసాలు – (2016), భరతవర్షం – సీతాకాంత మహాపాత్ర ఒరియా కావ్యానికి తెలుగు అనువాదం. – (2017), చర్యాపదాలు (అనేక భాషల ప్రధమ కావ్యం – పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాలు) – (2019), అదే నేల (భారతీయ కవిత్వం – నేపధ్యం) – (2019), అదే కాంతి (మధ్యయుగంలో భక్తి కవిత్వం, సామాజిక నేపథ్యం) – (2022) – వీరి స్వీయ అనువాద రచనలు.
వీరి రచనలు అనేకం – పలు భారతీయ భాషలలోకి, ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి.
దేశదేశాల కప్పల కథలు – (2010), నిన్ను నువ్వు చూసుకునే అద్దం (సూఫీ, జెన్ ఇతర నీతి కథలు) – (2015), వ్యక్తిత్వ వికాసం – ఆనంద మార్గాలు (వ్యాసాలు) – (2018), అనువాదం – అనుభవాలు (మహాంద్ర భారతి ప్రచురణ) – (2019) – వీరి కథలు, ఇతర రచనలు.
తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, తాపీ ధర్మారావు పురస్కారం వంటి ఉత్కృష్ట పురస్కారాలెన్నింటినో పొందారు.