1
నా భావనలు మిణుగురులు
అవి చీకటిలో తళుక్కుమంటున్న
సజీవ కాంతి రేణువులు
2
పట్టించుకోని చూపులకు
ఆకర్షించలేని దారిపక్కన పూల స్వరాలు
ఆదరబాదరగా గొణుగుతాయి
3
దినసమూహం జారవిడిచిన శకలాలు
మసక చీకటి మనస్సు గుహలో
కలల గూడు కట్టుకుంటాయి
4
చపలత్వపు ఆ క్షణంలో
భవిష్యత్తు ఫలాలు కాని పూరేకుల్ని
వసంతం చెదరగొడుతుంది
5
భూనిద్రనుండి విడిపడ్డ సంతోషాలు
లెక్కలేనన్ని ఆకుల్లో వేగంగా ప్రవహించి
రోజంతా గాలిలో నాట్యం చేస్తాయి
6
దిగుమతితో బరువైన నా రచనలు మునిగిపోతుంటే
అల్పమైన నా పదాలు
సమయం అలలమీద తేలికగా నర్తిస్తాయేమో
7
మనస్సు రహస్య చిమ్మటలు
పొరల్లాంటి రెక్కలతో పెరిగి
సంధ్యాకాశంలో వీడ్కోలు తీసుకుంటాయేమో
8
సీతాకోకచిలక
నెలల్ని కాదు
బోలెడంత సమయంతో
క్షణాల్ని లెక్కిస్తుంది
9
ఒకే ఒక్క నవ్వుతో
ఆశ్చర్యపు రెక్కలమీద నా ఆలోచనలు
మెరుపురవ్వల్లా సవారీ చేస్తాయి
10
చెట్టు తన అందమైన నీడని
ఎప్పటికీ అందుకోలేకపోయినా
ప్రేమగా చూసుకుంటూనే ఉంటుంది
11
సూర్యకాంతిలా నా ప్రేమ
నిన్ను చుట్టుముట్టనీ
అయినా ప్రకాశించే స్వేచ్చ నీకే ఉండనీ
12
అగాధ రాత్రి ఉపరితలం మీద
తేలే రంగుల బుడగలు
పగళ్లు
13
నా నివేదనలు
గుర్తించుకోమని కోరలేని మరీ పిరికివి కావున
నువ్వే గుర్తుంచుకోవాలేమో వాటిని
14
నా పేరు భారమనిపిస్తే
కానుకనుండి దానిని తొలగించేయ్
కానీ నా పాటని మాత్రం ఉంచు
15
ఏప్రిల్ – శిశువులా
పూలతో మట్టిమీద చిత్రలిపి రాసి
చెరిపేసి మరచిపోతుంది
(సశేషం)
శ్రీ యల్లపు ముకుంద రామారావు 9 నవంబరు 1944 నాడు పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్లో జన్మించారు. విద్యార్హతలు M.Sc, D.I.I.T, P.G.D.C.S.
కవిగా, అనువాద కవిగా, రచయితగా ప్రసిద్ధులైన ముకుంద రామారావు – వలసపోయిన మందహాసం (1995), మరో మజిలీకి ముందు (2000), ఎవరున్నా లేకున్నా (2004), నాకు తెలియని నేనెవరో (2008), నిశ్శబ్దం నీడల్లో (2009), విడనిముడి (అన్ని సంకలనాల్లోని ఆత్మీయ అనుబంధాల కవిత్వం) – (2013), ఆకాశయానం (2014), రాత్రి నదిలో ఒంటరిగా (2017) అనే స్వీయ కవితా సంపుటాలను వెలువరించారు.
అదే ఆకాశం – అనేక దేశాల అనువాద కవిత్వం (2010), శతాబ్దాల సూఫీ కవిత్వం (2011), 1901 నుండి నోబెల్ కవిత్వం (కవుల కవిత్వ – జీవిత విశేషాలు) – పాలపిట్ట వ్యాసాలు – (2013), 1901 నుండి సాహిత్యంలో నోబెల్ మహిళలు – సోపతి వ్యాసాలు – (2015), అదే గాలి (ప్రపంచ దేశాల కవిత్వం – నేపధ్యం) – మిసిమి వ్యాసాలు – (2016), భరతవర్షం – సీతాకాంత మహాపాత్ర ఒరియా కావ్యానికి తెలుగు అనువాదం. – (2017), చర్యాపదాలు (అనేక భాషల ప్రధమ కావ్యం – పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాలు) – (2019), అదే నేల (భారతీయ కవిత్వం – నేపధ్యం) – (2019), అదే కాంతి (మధ్యయుగంలో భక్తి కవిత్వం, సామాజిక నేపథ్యం) – (2022) – వీరి స్వీయ అనువాద రచనలు.
వీరి రచనలు అనేకం – పలు భారతీయ భాషలలోకి, ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి.
దేశదేశాల కప్పల కథలు – (2010), నిన్ను నువ్వు చూసుకునే అద్దం (సూఫీ, జెన్ ఇతర నీతి కథలు) – (2015), వ్యక్తిత్వ వికాసం – ఆనంద మార్గాలు (వ్యాసాలు) – (2018), అనువాదం – అనుభవాలు (మహాంద్ర భారతి ప్రచురణ) – (2019) – వీరి కథలు, ఇతర రచనలు.
తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, తాపీ ధర్మారావు పురస్కారం వంటి ఉత్కృష్ట పురస్కారాలెన్నింటినో పొందారు.