సుప్రసిద్ధ కథకుడు, నవలారచయిత సలీం గారి కొత్త కథాసంపుటి “మాయ జలతారు”. సలీం ఇప్పటివరకు మూడు కవితా సంపుటాలు, తొమ్మిది కథాసంపుటాలు, 18 నవలలు వెలువరించారు. ఆయన రచనలు దక్షిణాదిభాషలతో సహా ఇంగ్లీషు, హిందీ, ఒరియా, మరాఠి భాషల్లోకి అనువాదమయ్యాయి.
***
“తుప్పు పట్టింది కళలకు కాదు.. కొంతమంది కళాకారులకు…” అని చెప్పే కథ “కళ తప్పుతోంది”. మనుషుల్ని మనుషుల్లా కాకుండా రాతి విగ్రహాల్లా, నీళ్ళు చిమ్మే ఫౌంటెన్లా మార్చే వ్యవస్థపై అల్లిన కథ “సాలభంజికలు”. నిజం తెల్సినప్పటి నుండే ఒకరంటే మరొకరికి పడకుండా పోట్లాడుకుంటున్న పిల్లలిద్దరికీ “ఒక అబద్ధం” చెప్పి వాళ్ళలో మార్పు తెస్తాడో తండ్రి. నీతినే నమ్ముకున్న ప్యూన్ గురించి ఆలోచిస్తూ రాత్రంతా “అలజడి”కి గురువుతాడో అధికారి. జులాయిగా తిరిగిన వ్యక్తి మౌన బాబాగా మారిని క్రమాన్ని వివరిస్తుంది “మాయ జలతారు”.
సాధారణ బోగీలో ప్రయాణించేవారి కష్టాలు ఎలా ఉంటాయో ఓ కాబోయే రైల్వే అధికారిని స్వయంగా అనుభవించేలా చేసి, తనకి అవకాశం వచ్చినప్పుడు, తాను నిర్ణయాలు తీసుకుని అమలుచేయగలిగే స్థితికి వచ్చినప్పుడు ఈ బీదల పాట్లని గుర్తు చేసుకుని, వారికి ప్రయాణం కాస్తయినా సౌకర్యంగా ఉండేట్లు చేయాలని కోరుకుంటాడో తండ్రి “ప్రయాణం” కథలో.
విద్యని, వైద్యాన్ని తనలోకి గుంజుకున్న కార్పొరేట్ ఊబి ఇప్పుడు సమాధుల్ని కూడా తనలోకి లాక్కుంటోది అంటాడో తండ్రి “వూబి” కథలో. పావురాల కువకువలతో ఒకప్పుడు సందడిగా ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు గోరీల దిబ్బలా మారిన వైనాన్ని “లోహముద్ర” కథ చెబుతుంది. జీవితాన్ని ఉత్సవంలా జరుపుకోమంటుంది “బతుకొక పండగ” కథ. “రెండు రెళ్ళు” ఎంతో తెలిసేసరికి అనుమానాలు తీరిపోతాయో మిత్రుడికి. అపార్థాలను తొలగించే “అడవి”, దేవతల “పోలిక”లతోనే వుండడం మంచిదని చెప్పే కథ, “మాట్లాడే దేవుడి” కోసం ఓ వ్యక్తి అన్వేషణ ఆసక్తిగా చదివిస్తాయి. లియో లాంటి పుత్రుడుండడం ఎంత అదృష్టమో “కొడుకొచ్చాడు” కథ చెబుతుంది. కుటుంబ విలువలని చాటుతూ, బంధాలని మింగేస్తున్న ఆధునికతని హృద్యంగా చిత్రించిన కథ “డైనింగ్ టేబుల్”.
***
మాయ జలతారు (కథలు)
రచన: సలీం;
ప్రచురణ: జె.వి. పబ్లికేషన్స్
పేజీలు: 163.
వెల: ₹150/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు, రచయిత
సలీం, ఫ్లాట్ నెం:బి2/206, లక్ష్మీనారాయణ అపార్ట్మెంట్స్, 3-6-164, హిమాయత్నగర్, హైదరాబాద్-29.ఫోన్-75886 30243
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.