స్వప్నించే రెప్పలమాటున
హృద్యపు దృశ్యం నీదేగా!
కనుగీటుతు, మదిమీటుతూ
సాంధ్యరాగాలాపనల స్వరఝరి
మైమరిపించిన కవితాలాపనల
శ్రావ్యత నులివెచ్చని పరిష్వంగాల
ఙ్ఞాపకమై, మది తొలిచేస్తే
అది నులివెచ్చని నీ కరస్పర్శేగా!
కనుదోయిల నుండి మమకారపు
పుష్పాలు రాలిస్తే అది
నీ స్పర్శలోని లాలిత్యమేగా
నిదురరాని నిశిరాతిరి జోగుతూ
నను తాకిన గుర్తుచెరిపేదా!?
నిద్దురలో నీ పిలుపే చెవిసోకితే
కన్నులలో కెంపులన్ని
యెఱ్ఱనివై పూసాయని
వత్తులేసి నీకోసం
కనుకాయగ ఎదురుచూపైన
నా భుజాన చెయ్యివేసి
సిగ్గులన్ని దొంగిలించిన ..
నీ పరిష్వంగాన తలవాల్చీ సేదతీరి
మై మురిసిన జాడలు వెదికాలా ?!
ప్రేమ ఊసులన్ని నీకు చెప్పి
నే సరాగాలు పోతుండగా
దొంతరలు దొంతరలుగా నవ్వులు
దోసిళ్ళలో పెట్టి అందిస్తూ…
కనుగీటిన నీతోనే
పెంచుకున్న ప్రేమపాశంలో
మునకలైన నను భారంగా తలచి
వదిలేసీ, కలచెరిపీ
ఎడబాసిన వైనం నువ్వు మరిచినా
నేమరువలేనుగా!
అందుకే నీ ఊహల సుమాలన్నీ
దోయిలించి నీ జ్ఞాపకాలకే అంకితమిస్తూ….
ఒంటరి నక్షత్రమై నేనిలా…..
భాగవతుల భారతి గారిది ఖమ్మం. వారు గృహిణి. డబుల్ ఎం.ఎ (బిఎడ్) చేశారు. శ్రీవారు శ్రీనివాస్ గారు ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్. పాప భాగవతుల మానస.
కుటుంబ బాధ్యతల దృష్ట్యా టీచర్ ఉద్యోగం మానేసి.. నిత్యాగ్నిహోత్రమూ, వేదాధ్యయనము, స్వాధ్యాయం వైపు నడిచి… పౌరోహిత్యం నేర్చి, ఆడవాళ్లు పౌరోహిత్యం చేయకూడదా? అనే స్త్రీ సాధికారతతో పురోహితురాలు, అనే దిశగా వీరి ప్రయాణం సాగుతోంది. ఎంతోమంది విద్యార్ధులు, వీరి వద్ద మంత్రాల్నీ నేర్చుకుంటున్నారు.
పిల్లలకూ పెద్దలకూ స్వాధ్యాయం క్లాసెస్ జరుపుతూ ఉండటం. రచనలు చేయటం రెండూ రెండు కళ్ళుగా జీవన పయనం సాగిస్తున్నారు (దీనికి శ్రీనివాస్ గారు మరియు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం చాలా ఉంది.).
పద్యాలూ, పాట, వచన కవితలూ వ్యాసం, కథలూ… అనేక పత్రికలో ప్రచురణ అయినాయి. మనీతో కూడిన బహుమతులతో పాటుగా… సన్మానాలూ అందుకోవటం… మరిచిపోలేని మధురానుభూతులు. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్శిటీ లో వైస్ ఛాన్సలర్ గారి చేతుల మీదుగా సన్మానోత్సవ కార్యక్రమం మరిచిపోలేనిది.