[షేక్ కాశింబి గారు రచించిన ‘మనుషులిప్పుడు..’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
కనిపెంచిన తల్లిదండ్రులు
కాలం చేసినా.. కలవరపడక
కంటి చూపుక్కూడా.. రానంత
యోగులవుతున్నారు!
తోబుట్టువుల కష్టాల్ని
చూసి తట్టుకోలేక
వారున్న వైపుకే వెళ్ళనంత
సున్నిత మనస్కులవుతున్నారు!
రోడ్డు పై బడి.. రక్తమోడుతున్న
సాటి మనిషి పట్ల సానుభూతితో
సెల్ఫీ దిగి.. మరుక్షణమే పనిలో బడేంతగా
తామరాకు మీద నీటి బిందువు లవుతున్నారు!
ఎన్నికలప్పుడు మాత్రం
తరతమ భేదా లెంచని
ఉదారచిత్తులుగా వ్యవహరించి
అవధూతల్నే నివ్వెర పరుస్తున్నారు!
అయినవారెంత ఆపదలో ఉన్నా..
బంధాలకి బందీలవక
నిగ్రహం చూపేంత
పరిణత మనస్కు లవుతున్నారు!
సలహా ఎవరిదైతేనేం.. పెళ్ళయ్యాక
సులువుగా అమ్మానాన్నల్ని ఆశ్రమంలో దింపి
స్తిమితంగా చెయ్యి కడుక్కునేంత
స్థితప్రజ్ఞు లవుతున్నారు!
సొంత పరిధిని కుదించుకుని
స్వసుఖమే పరమావధిగా తలుస్తూ..
‘గీతా’సారానికి కొత్త భాష్యం చెప్పేంత
జ్ఞాన సంపన్ను లవుతున్నారు!