[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]
[సుందరం తన పెళ్ళి శుభలేఖ తీసుకుని రామ్మూర్తి ఇంటికి వస్తాడు. నీ పెళ్ళికి నన్ను పిలవనే లేదంటూ రామ్మూర్తి మీద నిష్ఠూరాలాడతాడు. తను పని చేస్తున్న బడి గురించి, చేసుకోబోతున్న అమ్మాయి గురించి చెప్తాడు. స్నేహితుడు ఆప్యాయంగా మాట్లాడుతుంటే, రామ్మూర్తికి దుఃఖం ఆగదు. తన పెళ్ళి సంఘటనలు, సుమతి వ్యవహారం తనకి మొదటి రాత్రి జరిగిన అనుభవం, తన బాల్య జీవితం అన్నీ వివరిస్తాడు. రామ్మూరి హృదయం తేలికపడేలా మాట్లాడుతాడు సుందరం. ఇంతలో తల్లికి సీరియస్గా ఉందని, వెంటనే రమ్మమని మేనమామ రామ్మూర్తికి ఫోన్ చేస్తాడు. రామ్మూర్తి తో పాటు సుందరం కూడా పల్లెకి బయల్దేరుతాడు. దారిలో రామ్మూర్తి దాంపత్యం సమస్య ఎలా పరిష్కారమవుతుందా అని ఆలోచిస్తాడు సుందరం. ఊరికి చేరిన రామ్మూర్తి తల్లిని పలకరిస్తాడు. తల్లి కొడుకుని కళ్ళారా చూసుకుంటుంది. ఒక ఉత్తరం చేతిలో పెడుతుంది. ఆమెకి ధైర్యం చెప్తాడు సుందరం. పెళ్ళి శుభలేఖలతో వచ్చిన సుందరాన్ని చూసి, ముందు శుభకార్యం జరగనున్నది కాబట్టి, ఊరెళ్ళిపోమని చెప్తాడు భుజంగరావు. రామ్మూర్తి కూడా వెళ్ళమనే అంటాడు. తర్వాత కాసేపటికి శాంతమ్మ చనిపోతుంది. విషయం తెలుసుకున్న సుందరం ఫోన్లోనే మిత్రుడిని ఓదారుస్తాడు. – ఇక చదవండి.]
అధ్యాయం 13
గ్రామాల్లో ఉండే మనుష్యులు, వాళ్ళ మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. ఏ శుభకార్యం జరిగినా, అశుభకార్యం జరిగినా భారీగా జరగాలి అని అనుకుంటారు. ఎంత ఆడంబరంగా చేస్తే అంత మంచిదనుకుంటారు. అలా చేయని వారిని వెలివేసినట్లు చూస్తారు. గుగుసలాడుతాడరు.
అయితే ఎవరు ఏు అనుకోని మనం శక్తికి మించిన పరుగులు పెట్టకూడదు అని అనుకున్న భుజంగరావు రామూర్తీ అప్పు చేయకుండా చాలా క్లుప్తంగా శ్రాద్ధ కర్మ జరిపించారు. వీళ్ళు ఇలా సాదా సీదాగా కార్యం చేయడం గ్రామంలో ఎవ్వరికీ రుచించలేదు. అయినా ఎవ్వరూ ఎదురుగా అనకపోయినా చాటుమాటుగా విమర్శించారు.
ఎవరి విమర్శలు పట్టించుకోలేదు రామ్మూర్తి. బ్రాహ్మణులు మంత్రోచ్చారణ మధ్య తల్లి అస్థికలు రామ్మూర్తి గోదావరి నదిలో కలిపాడు. గోదావరి నది అలలులో అవి నీటిపై తేలుతూ కొట్టుకుపోతున్నాయి. తల్లి యొక్క చిహ్నలు, తన కళ్ళెదుట నీటిలో కొట్టుకుపోవడం చూస్తున్న రామ్మూర్తి గాఢంగా నిట్టూర్పు విడుస్తూ అలా నిలబడి ఉండిపోయాడు.
‘ఈ రోజు నుండి నేను ఏకాకిని. అందరూ ఉన్నా లేనటే. నాకు అందరూ ఉన్నా నేను మాత్రం ఎవ్వరికీ లేను’ చాలా బాధతో అనుకుంటున్నాడు. గోదావరి నది ఒడ్డున కూర్చుని పైకి ఉబికి వస్తున్న కన్నీళ్ళను తుడుచుకుంటున్నాడు. ఒక్క క్షణం ఏదో జ్ఞాపకం. జేబు తడిమాడు తల్లి చేతిలో నుండి తను తీసిన కాగితం మడత అతని చేతికి తగిలింది. మడతలు విప్పి ఆ ఉత్తరాన్ని చదువుతున్నాడు.
‘చి॥ రామూ!
ఆశీర్వదిస్తూ అమ్మ వ్రాయునది. నేను నిన్ను ఆశీర్వదించినా, జీవితాంతం సుఖంగా ఉండమని దీవించినా వాటికి విలువ ఉండదని నాకు తెలుసు. నీ జీవితాన్ని నేనే చేజేతులారా నాశనం చేశానేమో అని నాకు అనిపిస్తుంది ఒక్కొక్క పర్యాయం. నా మాటకు కట్టుబడి సుమతి మెళ్ళో మూడు ముళ్ళూ వేశావు. ఆ మూడు ముళ్ళూ ఒక విధంగా నీకు ఉరితాడులా నీ మెడకు బిగుసుకున్నాయి. సుమతి స్వభావం నాకు తెలిసినా ఈ పెళ్ళికి నిన్ను ఒప్పించడం నేను చేసిన పెద్ద పొరపాటు.
జీవితంలో నేను ఎలాగూ సుఖపడలేదు. నాలాగే నా కొడుకువైన నీకూ సుఖం లేదు. నాకూ ఉండేది సుఖమైన జీవితం గడపాలని. అయితే మనం అనుకున్నట్టు జీవితం ఎప్పుడూ ఉండదు కదా! మనం ఒకలా జీవించాలనుకుంటాం. కాని మరోలా ఉంటుంది మన జీవితం. మరోలా జీవిస్తాం. వాస్తవ పరిస్థితులు మనకి అనుకూలించనప్పుడు జీవితం పట్ల మమకారం తగ్గుతుంది. నిరాశ అధికమవుతుంది. నిస్పృహ ఆవరిస్తుంది. ఇది మనో వైకల్యానికి దారి తీయవచ్చు.
క్రుంగుబాటు ఊబిలో చిక్కుకుంటే దాని ప్రభావం మన ఆలోచనల మీద, ప్రవర్తన మీద ఉద్వేగాల మీద, శారీరక ఆరోగ్యంపై పడుతుంది. ఈ క్రుంగుబాటు మన మనసులో పిరికి తలంపులు వచ్చి మెదడును ప్రభావితం చేస్తాయి. అందుకే నాకు ఈ అనారోగ్యం. ఏదైనా మన పెద్ద వాళ్ళంటారు ఏదైనా నిందలేనిదే బొంది పోదని. నేను చేసిన పొరబాటు వలన నిందపడవల్సి వచ్చింది.
నూతన దంపతులు మంచి ముహూర్తంలో ఆనందంగా ఐక్యమయ్యే మధుర రాత్రి మొదటి రాత్రి. ఆ రాత్రి ఆనందంగా మలుచుకోవల్సిన ఆ రాత్రి నీ జీవితంలో విషాదాన్నే మిగిల్చింది. ఆవేదనతో నీవు ఆ రోజు గదిలో నుండి బయటకు వచ్చిన నిన్ను చూడగానే అర్థం చేసుకున్నాను పరిస్థితిని. భవిష్యత్తులో నీ జీవితం ఎలా మలుపు తిరగబోతోందో అని భయం వేసింది. ఆ రోజు నేను పడ్డ బాధ పగవాళ్ళకి కూడా వద్దనిపించింది.
రామూ! ఈ లోకంలో కొంతమంది కష్టాలు అనుభవించడానికే పుడ్తారు. అలా పుట్టిన వాళ్ళమే మనం. నిన్ను ఒకటి మాత్రం కోరుతున్నాను. జీవితంలో రాజీపడి కొన్ని సందర్భాల్లో మన బ్రతుకునెట్టుకు రావాలి. ఇది మనకి నచ్చకపోయినా తప్పదు. అది మన ఆత్మగౌరవానికి భంగం అనుకోవచ్చు. కాని పరిస్థితులు బట్టి రాజీ పడడం తప్పదు. సమస్యను అలా లాగుతే ఆ సమస్యకి పరిష్కారం ఎప్పటికీ అవదు. ఎవరో ఒకరు రాజీపడాలి. సుమతిలో ఇప్పుడప్పుడే మార్పురాదు. మార్పు వచ్చే వరకూ నీవే రాజీమార్గంలో నడవాలి. ఎప్పుడకైనా సుమతిలో మార్పు వస్తుందన్న నమ్మకం నాకుంది.
అలా మార్పు రావడానికి కొంత సమయం పట్టవచ్చు. నీ సహన శక్తికి ఇది పరీక్షా సమయం. నీవా పరీక్షలో గెలుపొందుతావని నేను అనుకుంటాను. జీవితంలో నీకు ఏ నిర్వాకం చేయని పైసా కూడా మిగల్చని అమ్మగా మిగిలిపోయాను. నీవు గొప్పవాడిగా ఎదగాలని ఎన్నో కలలు కన్నాను. కాని అవన్నీ నీటి బుడగల్లా పేలి పోయాయి. నేను ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయే లోపున నిన్నో మారు చూడాలి. నీ ఒడిలో తలపెట్టి చచ్చిపోవాలని ఉంది. నా ఆ కోరిక భగవంతుడు తీరుస్తాడో లేదో? నీ జీవితం సుఖమయం అవాలని ఆశిస్తూ, సుఖమయం చేయమని భగవంతుడ్ని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఇక వ్రాయ లేను. ఆయాసం వస్తోంది. నీకు ఏు మిగల్చకుండా పోతున్న ఈ అమ్మ. అభాగ్యురాలు.
నీ శ్రేయస్సే కోరుతున్నాను.
అమ్మ.’
ఉత్తరం చదవడం పూర్తి చేశాడు రామ్మూర్తి. అతని కళ్ళలో నుండి కన్నీటి దార క్రిందకు జారుతోంది. నిశ్శబ్దంగా రోదిస్తున్నాడు. అతని ఆ బాధని పంచుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఏ కాకిని, అనాధని, అదృష్టవిహీడ్ని. మాటిమాటికి అనుకుంటూ మోకాళ్ళలో తలదూర్చి రోదిస్తున్నాడు రామ్మూర్తి.
అతని ఆవేదనతో, రోదనతో లోకానికి ఏ సంబంధం లేదు. లోకం జాలి చూపదు. బాధాద్రష్టుల్ని మరింత క్రుంగదీస్తుంది సమాజం.
గోదావరి నది దార సుడులు సుడులు తిరుగుతూ అలలు అలలుగా ప్రవహిస్తోంది. ఆ అలల వంక రెప్ప వేయకుండా చూస్తూ కూర్చున్నాడు రామ్మూర్తి. ఆ సమయంలో ఆకలి, దప్పిక అనిపించలేదు. సూర్యుడు పశ్చిమ దిశకు చేరుకుంటున్నాడు. అతని అస్తమయ కిరణాలు నదీ జలాలపై పడి వింత శోభనిస్తున్నాయి. బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టిన అతను గాఢంగా నిట్టూర్పు విడుస్తూ లేచి నుంచున్నాడు.
అధ్యాయం 14
తల్లి చనిపోయి రోజులు గడుస్తూ ఉంటే రామ్మూర్తి కొద్ది కొద్దిగా దుఃఖాన్ని మరచిపోతున్నాడు. సెలవులు అయిపోయాయి. స్కూలు పరీక్షలు కూడా ఆరంభమవుతాయి. పరీక్షలు అయిన తరువాత వేసవి సెలవులు ఇస్తారు. సెలవులు అయిన తరువాత స్కూలు దగ్గరే ఓ పెద్ద ఇల్లు అద్దెకు తీసుకుని మామయ్యని సుమతిని తీసుకెళ్ళాలి.
సుమతికి తనకి పెళ్ళయింది. లోకం దృష్టిలో తామిద్దరూ భార్యాభర్తలు. కాని తమ ఇద్దరి మధ్య దాంపత్య బంధం ఏర్పడలేదు. ఆ బంధం ఏర్పడినప్పుడే నిజమైన భార్యాభర్తలు. ఆ బంధం ఏర్పడాలంటే తన తల్లి చెప్పినట్టు కొంత సమయం పట్టవచ్చు. అది ఎప్పుడో చెప్పలేని పరిస్థితి.
“రామం బాబూ! మామయ్యగారు ఏం బాగానేరండి. అవతల భార్య చావు, ఇవతల తోబుట్టువు చావు. దానికి తోడు ఆర్థిక పరిస్థితులు కూడా సరిగా లేవు. కట్టాలన్నీ ఒక్క మారే సుట్టుముట్టాయి. అందుకే ఆ పెద్దాయనికి శాంతి లేదు సుకం నేదు,” ఆదయ్య రామ్మూర్తితో అన్నాడు.
“నాకూ తెలుసు ఆదయ్యా! మామయ్య పోలికలే లేకుండా బాగా పాడయి పోయాడు. సుమతి బయటకు రావడమే మానేసింది. నిర్వికారంగా ఎటో చూస్తూ కూర్చుంటుంది.” అన్నాడు రామ్మూర్తి.
“మామయ్యా! నీవే అలా డీలా పడితే సుమతి మరింత డీలా పడిపోతుంది. ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి ఈ వయస్సులో!” అని ఓ పర్యాయం రామ్మూర్తి అన్నాడు భుజంగరావుతో.
“మాలాంటి కాటికి కాళ్లు జాచుకుని చావు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కులాసా ఎలా వస్తుంది? ధైర్యం ఎలా వస్తుంది, ఆ భగవంతుడి పిలుపు కోసం ఎదురు చూడ్డం తప్పించి మరో దారి లేదు” భుజంగరావు నిర్వికారంగా ఎటో చూస్తూ అన్నాడు. మామయ్య అలా మాట్లాడుతూ ఉంటే రామ్మూర్తికి చాలా బాధ అనిపించింది.
ఆశా నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్న మానవ జీవితం. ఆశని నిరాశ కబళించడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ నిరాశను వెనక్కి నెట్టేసి ఆశ ముందుకు వస్తుంది. మామయ్యలో గల ఈ నిరాశా వాదాన్ని తొలగించాలి. జీవితం చాలా విలువైనది. దానిని ఉత్సాహంగా ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నించాలి. అది ఏ వయస్సు వాళ్ళు అయినా సరే. ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యల నుండి కాపాడుకుంటూ ఉన్నతంగా ఎదగాలి.
జీవితాన్ని విజయవంతంగా గడపడానికి జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొందుకు సానుకూల ప్రవర్తనను అలవరచుకోవాలి. మనిషి వివిధ పరిస్థితులను సర్దుకుపోగలగాలి. మార్పులకు అనుగుణంగా కష్టతరమైన పరిస్థితుల్లో కూడా ఆశతో కూడిన దృక్పథంతో ఉండాలి.
ఇలా అనుకుంటున్న రామ్మూర్తి తన భావాల్ని మామయ్యకు చెప్పాడు. “నీవు చెప్పింది నిజమే అవచ్చుకాని ఆచరించడమే కష్టం. నా విషయం అలా ఉంచు నా దిగులంతా సుమతి గురించి. దాని మనస్తత్వం ఏుటో అర్థంకాని పరిస్థితి. దాని మూర్ఖత్వంతో జీవితాన్ని పాడు చేసుకుంటోంది. మీ అత్తయ్య, నా మార్గదర్శకం సరిగా లేకపోబట్టే సుమతి అలా తయారయింది. దానికి అహంభావం, మూర్ఖత్వం పనికిరావు,” నుదురు కొట్టుకుంటూ అన్నాడు భుజంగరావు.
“ఎవరికైనా మార్పు సహజం. మార్పు రావడానికి కొంత సమయం పట్టవచ్చు. కాలమే ఈ సమస్యను పరిష్కరిస్తుంది.” నిర్లిప్తంగా అన్నాడు రామ్మూర్తి.
అన్నిటికి కాలమే పరిష్కరిస్తుంది అని మనం చేతులు మూడుచుకుని కూర్చుంటే సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు. మన ప్రయత్నం కూడా మనం చేయాలి,” మామయ్య మాటలకి మౌనం వహించాడు రామ్మూర్తి.
“కొడుకు చూస్తే అలా తయారయి దేశాలు పట్టిపోయాడు. కూతురు చూస్తే ఇలా తయారయింది. నా బ్రతుకా ఒంటరి బ్రతుకు అయింది. ఏుటో నా జీవితమే నాకు అర్థం కాకుండా పోయింది,” భుజంగరావు మాటల్లో ఆవేదన, అసంతృప్తి.
అతను అలా అంటుంటే మామయ్య మీద జాలిలాంటి మనోవికారం కలిగింది రామ్మూర్తికి. విధి కొంత మంది జీవితాల్తో ఆటలాడుకుంటుంది. మామయ్యది ఒక రకమైన బాధయితే తనది మరో రకమైన బాధ.
“మనిషి జీవితంలో బాధలు, కష్టాలు, నష్టాలు, కన్నీళ్ళు, సుఖ సంతోషాలు అన్నీ ఉండడం సహజం. ఇటువంటి పరిస్థితుల్లో మనోధైర్యంగా ఉండాలి. నీ కన్నా నేను చిన్నవాడ్ని. నీకు చెప్పే స్థాయి నాకు లేకపోయినా చెప్తున్నాను” రామ్మూర్తి అన్నాడు. అల్లుడు మాటలు భుజంగరావుకి కొంత ఊరట కలిగించాయి. కాని రామ్మూర్తి పిచ్చిగా నవ్వుకున్నాడు. తన మనస్సుకే శాంతిలేదు. తాను మరొకరిని ఓదార్చడమా అని అనుకున్నాడు.
అల్లుడు మామయ్యలు అలా మాట్లాడుకుంటున్న సమయంలో పూల మొక్కలకి గొప్పులు తవ్వుతోంది సుమతి. రామ్మూర్తిని చూసి ఆమె హృదయం ఏం స్పందించలేదు. నిర్వికారంగా ఎటో చూస్తోంది. చిన్నగా నిట్టూర్పు విడిచాడు రామ్మూర్తి. తన భావిజీవితం ఏ మలుపులు తిరగబోతోందో?
ఆ ఇంటిలో ఉన్న వారు ముగ్గురే కాని ముగ్గురూ మూడు విధాలుగా ఆలోచిస్తున్నారు. ఒకరి ఆలోచన్లకి మరొకరి ఆలోచన్లకి పొంతనే లేకుండా పోయింది. వారి కన్న కలల్లో తేడాలు, ఊహల్లో తేడాలు. కలలు ఫలించనప్పుడు ఊహా సౌధాలు కూలిపోయినప్పుడు మనస్సులో పేరుకున్న నైరాశ్యం కొట్టాచ్చినట్లు అగుపడుతుంది.
***
గ్రామంలో చెరువు ఒడ్డున కూర్చుని ఇసుకలో పిచ్చిగా గీతలు గీస్తున్నాడు రామ్మూర్తి. అవి సమాంతర రేఖలు. ఎక్కడా కలవని ఎంత పొడిగించినా ఎదురెదురుగా సాగిపోయే గీతలు అవి. ఒక గీత మీద తన పేరు, మరో గీత మీద సుమతి పేరు వ్రాసాడు. కలవని ఆ సమాంతర రేఖల్లా తమ జీవితాలు, మనస్సులు కలవవు. ఒకవేళ కలిసినా అంతా యాంత్రికమే. శరీరాలు కలిసినా మనస్సు భావాలూ మాత్రం ఎప్పటికీ కలవవు. ఆ రేఖల వేపు చూస్తున్న అతని మనస్సులో కలిగిన భావం గాఢంగా నిట్టూర్పుని విడిచాడు ఆ రేఖల్ని చూస్తూ.
మామయ్య కూడా చెరువు దగ్గరకి వచ్చాడు అల్లుడ్ని వెతుక్కంటూ. నేలపై గీసిన గీతలు, ఆ గీతల చెంత వ్రాయబడిన పేర్లను చూసాడు భుజంగరావు. అల్లుడు భావోద్వేగాలు, మానసిక స్థితి తెలిసింది. అల్లుడు బాధను అంచనా వేస్తున్న అతని హృదయంలో కూడా సన్నటి బాధ. ఇదే తన కూతుర్ని కాకుండా మరో అమ్మాయితో జీవితం పంచుకుంటే జీవితం ఇలా ఉండేది కాదు అని అనుకుంటున్నాడు.
ఎవరి భావాల్తో సంబంధంలేనట్లు సంధ్య చీకట్లు నలుమూలలూ తరుచుకొస్తున్నాయి.
“ఇక్కడున్నావా రామం. నీ కోసం వెతుకుతూ వస్తున్నాను. రేపు ఉదయంమే కదా నీ ప్రయాణం అన్నీ సర్దుకున్నావా?” భుజంగరావు అడిగాడు.
మౌనంగా తలూపాడు రామ్మూర్తి. మాట్లాడ్డానికి అతని మనస్సుతో పాటు మాట కూడా మూగబోయింది.
(ఇంకా ఉంది)
విజయనగరం వాస్తవ్యులైన శ్రీ గూడూరు గోపాలకృష్ణమూర్తి హిందీ ఉపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. వారు రాసిన కథలు వివిధ వార్తపత్రికల్లో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు సంకలనంగా వెలువడ్డాయి.