Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మలుపులు తిరిగిన జీవితాలు-6

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘మలుపులు తిరిగిన జీవితాలు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[తాను వస్తున్నట్లు సుందరం – రామ్మూర్తికి ఉత్తరం రాస్తాడు. అది చదివాక, రామ్మూర్తి అసలు సుందరం తనకెలా పరిచయమయ్యాడో, తమ మధ్య స్నేహం ఎలా మొదలయిందో గుర్తు చేసుకుంటాడు. విజయనగరంలో టీచర్ ట్రైనింగ్ సందర్భంగా తొలిసారి కల్సిన సుందరం, రామ్మూర్తి ఒకే గదిలో ఉంటారు. ఒకరి గురించి ఒకరికి చెప్పుకుంటారు. ఓ రోజు రామ్మూర్తి వాళ్ళ అమ్మ ఉత్తరం రాస్తుంది. దాన్ని రామ్మూర్తి అపురూపంగా చదువుకుంటుంటే, సుందరం ఆశ్చర్యపోతాడు. అతనికి దుఃఖం పొంగుకొస్తుంది. తాను మాతృమూర్తి ప్రేమకి నోచుకోని అభాగ్యుడినని చెప్పి బాధపడతాడు. కొద్ది రోజుల తర్వాత, ఓ రోజు రామ్మూర్తి విచారంగా ఉండడం చూసి, కారణం అడుగుతాడు సుందరం. విషయం చెప్పక దాటవేస్తాడు రామ్మూర్తి. సుందరం పుట్టిన రెండేళ్ళకే తని తల్లి చనిపోతే, తండ్రి మరో పెళ్ళి చేసుకుంటాడు. సవతి తల్లి క్రూరత్వానికి బలై, ఇంట్లోంచి పారిపోయి ఓ అనాథాశ్రమంలో పెరిగానని తన గురించి చెప్తాడు సుందరం. తరువాత బాగా చదువుకుని టీచర్ ఉద్యోగం సాధించినట్లు చెప్తాడు. జ్ఞాపకల్లోంచి బయటకు వచ్చిన రామ్మూర్తి – ఇప్పుడు తన పెళ్ళి శుభలేఖ ఇవ్వడానికి సుందరం వస్తున్నాడని అనుకుంటాడు. – ఇక చదవండి.]

అధ్యాయం 11

నుకున్న విధంగా సుందరం తన పెళ్ళి శుభలేఖ పట్టుకుని వచ్చాడు. సుందరాన్ని చూడగానే అంతులేని ఆనందం మనస్సులో ఏదో దిగులు పోయినంత ప్రశాంతత. “నేనున్నానన్న విషయం మరిచిపోయావా? నీ పెళ్ళికి నన్ను పిలవలేదు కూడా!” నిష్ఠూరంగా అన్నాడు.

రామూర్తి మనస్సు బాధతో విలవిల్లాడింది ఒక్క క్షణం.

“నా విషయం తరువాత చెప్తాను కాని మొదట నీ గురించి చెప్పు” అన్నాడు రామూర్తి.

తను జిల్లా పరిషత్తు పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నట్లు తను ప్రేమ సమాజంలో పెరిగిన తన లాంటి అనాథనే పెళ్ళి చేసుకుంటున్నట్లు. తమ పెళ్ళికి దయాసాగర్‌ గారే పెళ్ళి పెద్ద అని చెప్పాడు సుందరం.

ఆ మాటలు రామూర్తికి ఆనందం కలిగించాయి. ఓ అనాథ ఆడపిల్లకి ఆలంబనగా ఉండడానికి జీవితాంతం ఆమెతో కలసి బ్రతకడానికి సుందరం నిర్ణయించుకోవడాన్ని ప్రశంసించాడు. ఇంతలోనే అతని మనస్సు కుంచించుకు పోయింది.

“కొత్త పెళ్ళి కొడుకువి ఇలా ఉండటమేంటి? మంచి హుషారుగా ఉండాలి గాని. ఎలా ఉంది మీ వైవాహిక జీవితం? ఎంత సేపూ నేను వాగడమేనా నోరు విప్పడేమేనా ఉందా? మన భావోద్వేగాలు మంచి అయినా చెడు అయినా ఒకరితో మరొకరు పంచుకోవాలి కాని ఇలా మౌనంగా బాధను దాచుకోవడం కాదు,” సుందరం అన్నాడు.

సుందరం మాటలు రామూర్తిని కదలించి వేసాయి. తన తల్లి తరువాత ఇంత ఆప్యాయతగా తన భావోద్వేగాలు పంచుకునేవాళ్ళు లేరు. సుందరం ఆప్యాయతను తట్టుకోలేక పోతున్నాడు. కడుపులో ఉన్న బాధంతా తన్నుకొస్తోంది. ఒకానొక సమయంలో సుందరం బాధను వెల్లడించడానికి ఎలా విలపించాడో అలాగే రామూర్తి కూడా భావోద్వేగంతో దుఃఖాన్ని ఆపుకోలేక ఏడుస్తున్నాడు.

ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయాడు సుందరం. వెంటనే తన కర్తవ్యం స్పురణకి వచ్చింది. వెంటనే రామూర్తిని ఆప్యాయతగా తన దగ్గరికి తీసుకుని దుఃఖాన్ని శాంత పరచడానికి ప్రయత్నిస్తున్నాడు. రామూర్తి మరి ఆగలేకపోయాడు.

తన పెళ్ళి సంఘటనలు, సుమతి వ్యవహారం తనకి మొదటి రాత్రి జరిగిన అనుభవం, తన బాల్య జీవితం అన్నీ వివరించాడు రామూర్తి.

“ఇంత విషాదాని నీ పిడికిడంత గుండెలో ఎలా దాచుకుంటున్నావు రా! నా కన్నా నీవే గ్రేట్‌!” అన్నాడు సుందరం. రామూర్తికి మనస్సు కొంచెం తేలికపడింది.

రామూర్తి సుమతి విషయం చెప్పిన తరువాత సుందరం సుమతి మనస్తత్వాన్ని విశ్లేషిస్తున్నాడు. అతనిలో అనేక అంతులేని ఆలోచన్లు. మనిషికి మొదటి శత్రువు కోపం, ద్వేషం, అసూయ దానికితోడు ఇతరులను ఆమోదించలేని విషయం. దీనికి పగతోడయితే మనిషి మనిషిలా ఉండకుండా మృగంలా మారుతాడు.

మనిషికి ఆశ ఉండచ్చు కాని దురాశ పనికి రాదు. మనిషికి ప్రశాంతత నిచ్చేవి ఆప్యాయత అనురాగం. ఆడంబరమైన జీవితానికి ప్రాధాన్యత ఇస్తే నైతిక శక్తి నాశనం అవుతుంది. ప్రతీకార ధోరణి మనిషిలోని వివేకాన్ని అణచి వేస్తుంది. ఆలోచనా శక్తిని దూరం చేస్తుంది. మనిషి పతనానికి పునాదులుగా నిలిచేవి కక్షలు. అందుకే వీటిని విడిచి పెడ్తే మనిషి ప్రశాంత వాతావరణంలో తన నైపుణ్యాలకు జీవం పోయగలుగుతాడు.

మానసిక పరిపక్వత లేకపోవడం సరియైన కుటుంబ వాతావరణం లేని వారు దురాశకు లోబడి ఇలా ప్రవర్తిస్తారు. తాము చేసిందే సరియైనది అని భావిస్తారు. ఇటువంటి వారు అంత సులువుగా మారరు.

ఇలాంటి వాళ్ళు తమ చుట్టూ ఉన్న వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరుచుకోవాలని, ఆరోగ్యకరమైన మానవ సంబంధాలు కలిగి ఉండకపోతే మనిషిలో ఒంటరితనం మొదలై అభద్రతా భావం, నిరుత్సాహం, నిరాశ, నిశ్పృహ ఏర్పడుతాయి.

మనం మన వాళ్ళు అనుకున్న వాళ్ళతో అపార్థాలు తలెత్తినప్పుడు కాలమే పరిష్కరిస్తుంది అని అనుకుంటే అది పెరిగి పెద్దదయి కక్షలకు దారి తీసే ప్రమాదముంది. అందుకే మనిషి తన ఆలోచనలతో శాంతి, ఆరోగ్యం, ధైర్యం, ఆశతో మనసును ప్రసన్నం చేసుకోవాలి. విసుగుదల, కోపం విడిచి పెట్టాలి. మనది అనుకున్న దానిని వదిలిపెట్టి లేని దాని గురించి ఆలోచించడం విడిచిపెట్టాలి. మన ద్వేషం ఎదుటివారిని ఏు చేయలేకపోయినా అది మన జీవితాన్నే నాశనం చేస్తుంది. ఎదుటివాళ్ళ యడల మన ఆలోచన్లు మార్చుకుంటే ఎదుటి వాళ్ళ ఆలోచన్లు సరియైనవని మనకి అనిపిస్తుంది. చెడు ఆలోచనల్లకి మనసులో తావియ్యకూడదు. మనం పొందే మనశ్శాంతి, ఆనందం మన మనోవైఖరి మీద ఆధారపడి ఉంటుంది.  మన సమస్యల గురించి మనం పట్టించుకోవాలేకాని బాధపడకూడదు. అనుకూల దృక్పథం అలవర్చుకుంటే బాధలను గురించి ఆలోచించే అవకాశం ఉండనే ఉండదు.

సుమతి గురించి విన్న తరువాత సుందరం భావోద్వేగంతో ఇలా ఆలోచిస్తున్నాడు.

రామూర్తికి తెలుసు సుందరం ఏం ఆలోచిస్తున్నాడు. ఇంతలోనే గోరు చుట్టు మీద రోకటి పోటులా తల్లికి సీరియస్‌గా ఉందని వెంటనే రమ్మనమని రామూర్తికి మామయ్య ఫోను చేశాడు.

ఇది విన్న వెంటనే రామూర్తి కళ్ళు బైర్లుకమ్మాయి. కళ్ళల్లో కన్నీరు చిప్పిల్లాడుతోంది. బాధ గుండెల్ని పిండి చేస్తోంది. ఉన్న ఆ ఒక్క ఆప్తురాలు తన నుండి దూరమవబోతుందన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నాడు.

సుందరం కూడా విన్నాడు ఆ విషయం. ‘బాధ మీద బాధ వచ్చి పడ్తుంటే వీడు తట్టుకోలేకపోతున్నాడు’ అనుకున్నాడు. ఎలా ఓదార్చాలో సుందరానికి అర్థం కావటం లేదు. తల్లి అంటే ఎంత ప్రేమో అమ్మ గురించి రామూర్తి చెప్తుంటే విన్నాడు. తనకి మాతృమూర్తి లేదు కాబట్టి అమ్మ విలువ అంతగా తెలియదు కాని అమ్మ మమకారం, ఆప్యాయతానురాగాలు చవి చూసిన రామూర్తికి తల్లికి సీరియస్‌గా ఉందంటే ఎంత బాధ కలుగుతుందో తను ఊహించగలడు.

“రామూ!”

సుందరం ఆ పిలుపు, ఆ చూపులకి తట్టుకోలేకపోయాడు. తిరిగి రామూర్తిలో దుఃఖం గట్టును తెంచుకుని పైకి ఉరుకుతున్న వరద నీటిలా బయటకు తన్నుకు వస్తోంది.

“సుందరం! అమ్మ.. అమ్మకి..!” మరి నోటి వెంబడి బాట పెగల్లేదు. సుందరం రెండు చేతులూ పట్టుకుని తిరిగి చిన్న పిల్లడిలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఎలా ఓదార్చాలో సుందరానికి అర్థం కావటం లేదు. ఇన్నాళ్ళూ ఎంత బాధనయినా తనలోనే దిగమ్రింగుకుని గంభీరంగా ఉండే రామూర్తి ఈ రోజున ఇలా బేలగా విలపించడం సుందరానికి బాధ కలిగించింది.

తనే ఇలా బాధపడితే రామూర్తి పరిస్థితి ఏంటి? కావల్సింది బాధపడుతూ కూర్చోడం కాదు జరగవల్సిన పని చూడడం. ఇదే విషయాన్ని రామూర్తికి చెప్పి అతనిలో ధైర్యం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు సుందరం.

“పద.. పద..! నీతో నేను కూడా వస్తాను.”

“నాతో నీవా..!”

“అవును అమ్మ గురించి నీవు అంత గొప్పగా చెప్తుంటే అమ్మ ప్రేమకి నోచుకోలేనందుకు చాలా బాధపడ్డాను. అమ్మ మీద నీకున్న ప్రేమకు ఆనందపడ్డాను. మీ అమ్మలో మా అమ్మను చూసుకుంటాను. అందుకే నేను నీతో వస్తానంటున్నాను.”

“నీవు పెళ్ళి కొడుకువి. ఇప్పుడు అలాంటి చోటికి రాకూడదని విన్నాను.”

“ఏం పరవాలేదు. మనుష్యులు ముందర. ఆ తరువాతే సెంటిమెంట్లు. మీ అమ్మను ఆ తరువాత చూడాలని ఉన్నా చూడగలనా?మరి అడ్డు చెప్పకు. బయలుదేరు” అన్నాడు సుందరం.

వెంటనే ఇద్దరు మిత్రులూ బయలుదేరారు గ్రామానికి.

అధ్యాయం 12

రామూర్తితో బయలుదేరిన సుందరం – వీళ్ళ దాంపత్య సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అని కూడా ఆలోచిస్తున్నాడు సుందరం.

మన జీవిత ప్రయాణంలో అన్ని పనులూ సాఫీగా జరగవు. అనుకోని మలుపులు ఉంటాయి. ఒక్కక్క మలుపు మన దృష్టి పెంచుతుంది. మరో మలుపు దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు తెలియ చేస్తుంది. జీవితంలో ఒక సమస్య తరువాత మరో సమస్య వస్తూనే ఉంటుంది. జీవించినంత కాలం ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఓ చిన్న సమస్య దగ్గర మనం ఆగిపోతే మనం క్రుంగిపోతాం. సమస్యను ధైర్యంగా అధిగమించాలి. అంతేకాని దానితో మమైకమయితే మనిషి ఆత్మవిశ్వాసం పోగొట్టుకుంటాడు.

సమస్య నుండి బయటకు వచ్చి బాగా ఆలోచిస్తే ఆ సమస్యకి దారి దొరుకుతుంది. అయితే ఇలా చెప్పడం సులభమే కాని ఆచరించడం కష్టం. రామూర్తి జీవన ప్రయాణంలో ఎదురయిన సమస్యల గురించి ఆలోచిస్తూ అనుకుంటున్నాడు సుందరం.

సమస్యలు వాటి గురించి ఆలోచన్లతో సంబంధం లేనట్టు మిత్రులిద్దరూ గ్రామనికి చేరుకున్నారు. వీళ్ళు ఇంటికి వెళ్ళేప్పటికి గ్రామ వైద్యుడు శాంతమ్మకి ఇంజక్షను ఇస్తున్నాడు. భుజంగరావు, సుమతి శాంతమ్మ మంచం దగ్గర నిలబడి ఉన్నారు.

శాంతమ్మ మంచంలో నీరసంగా పడుకుని ఉంది. అంతుపట్టని రోగం ఆమెను మరింత క్రుంగదీస్తోంది. ఆమె చింత ఎందుకు? కొడుకు జీవితాన్ని తనే బలవంతంగా పాడుచేశాను అన్న బాధ. కొడుక్కి ఇష్టం లేని మనసులు కలవని పెళ్ళి చేసి కొడుకు జీవితాన్ని అశాంతి పాలు చేశానన్న దిగులు, పశ్చాత్తాపం.

భార్యాభర్తలిద్దరూ సవ్యంగా కాపురం చేసుకోలేకపోతున్నారు. తను కన్ను మూసిన తరువాత అయినా వాళ్ళిద్దరి కాపురం చక్కబడుతుందా లేదా అన్న సందేహం. ఇవన్నీ ఆమెను రోగం కన్నా ఎక్కువుగా నీరస పరుస్తున్నాయి.

“అమ్మా!!!” పిల్చాడు రామూర్తి.

కళ్ళలో కన్నీరు పైకుబుకి వస్తోంది. దగ్గరికి రమ్మనమంటు కొడుకుని పిల్చింది శాంతమ్మ. రామూర్తి తల్లి దగ్గరకి వెళ్ళి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.

ఏదో చెప్పాలన్న ఆరాటం. నీరసం వల్ల ఏు చెప్పలేకపోచున్నాను అన్న బాధ ఆమెది. కొడుకు తల నీరసంగా, బలహీనంగా ఉన్న చేతుల్తో నిమురుతోంది.

‘తనకి తల్లి లేదు. అందుకే ఇలాంటి భావోద్వేగ సంఘటనలు తను ఎప్పుడూ చూడలేదు. తల్లీ కొడుకుల అనుబంధం ఇలా ఉంటుందా?’ ఇలా ఆలోచిస్తున్నాడు సుందరం.

“అమ్మా!” పిల్చాడు సుందరం శాంతమ్మని. అతని వేపు చూసింది శాంతమ్మ ఒక్క క్షణం.

“నేనూ రామూర్తీ మంచి స్నేహితులం. ఏ అరమరికలూ లేని స్నేహం మాది. నాకు అన్నీ తెలుసు. మీ దిగులు కూడా నాకు తెలుసు. మీ కొడుకు చక్కగా కాపురం చేస్తాడు. అలా పరిస్థితులు చక్కబడ్తాయని మీకు నేను హామీ ఇస్తున్నాను. మీరు ఏం దిగులు పెట్టుకోవద్దు,” సుందరం అన్నాడు.

అతని హామీకి ఆమె కళ్ళలో వింత వెలుగు ఆశాభావం.

రామూర్తిని డాక్టరు పక్కకి పిల్చాడు. “మా అమ్మకి ఎలా ఉండి డాక్టర్‌” రామూర్తి అడిగాడు.

“మీ అమ్మగారి పరిస్థితి ఏు బాగులేదు. ఆమె మానసికంగా బాధపడుతున్నారు. ఎన్ని మందులిచ్చినా మనస్తాపంతో బాధపడుతున్న వాళ్ళకి వైద్యం చేయలేము. ఆమె జీవించే కాలం బహు తక్కువ,” అన్నాడు.

అతను చెప్పి మాటలు వినగానే రామూర్తి నవనాడులూ క్రుంగిపోయాయి. వస్తున్న దుఃఖాన్ని ఆపుకోడానికి చేస్తున్న ప్రయత్నం వ్యర్థమవుతోంది. మృత్యువుతో హోరాహోరి పోరాడుతోంది శాంతమ్మ.

సుందరాన్ని చాటుగా పిల్చాడు భుజంగరావు “అబ్బాయ్‌! నీకు పెళ్ళంటున్నావు. ఇక్కడ పరిస్థితి విషమంగా ఉంది. శుభకార్యం చేసుకోబోయే నీవు ఇక్కడ ఉండడం మంచి కాదు. పెద్దవాడ్ని ఎందుకు చెప్తున్నానో విను” అన్నాడు.

“నాకు అలాంటి పట్టింపులు లేవు. నా తల్లి ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ఉండనా?” సుందరం అన్నాడు.

“నీకు పట్టింపులు లేకపోవచ్చు కాని మా పెద్దవాళ్ళ ఆలోచన్లు వేరేగా ఉంటాయి. మా ఆలోచన్లు భావాలు పాటించాలి కదా. ఇది గ్రామం. గ్రామస్థుల మనోభావాలు వేరే ఉంటాయి. అసలే నీ చేతిలో శుభలేఖలు కూడా ఉన్నాయి. అవి నీ పెళ్ళి శుఖలేఖలు అనుకుంటాను,” భుజంగరావు అన్నాడు. సుందరం మౌనం దాల్చాడు. రామూర్తి కూడా మామయ్య మాటనే బలపరచడం వల్ల అక్కడి నుండి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు సుందరం.

అయితే ఈ కష్ట సమయంలో డీలా పడిన స్నేహితుడ్ని ఓదార్చడానికి కూడా అవకాశం లేకపోతోందే అన్న బాధ సుందరానిది.

సుమతి వేపు చూశాడు సుందరం. ఏ భావం లేకుండా ఎటో చూస్తోంది సుమతి. చూడ్డానికి సౌమ్యురాలిలా ఉంది. అలాంటి సుమతి హృదయం అంత కఠినమైనదా? ఏమో! కొంతమంది పైకి అమాయకంగా అగుపడ్తారు కాని, లోలోపలే వారిటో నెగిటివ్‌ ఆలోచన్లు – అనుకుని సుందరం అక్కడ నుండి బయలుదేరాడు. వెళ్తున్న సమయంలో రామూర్తికి కొంత డబ్బు ఇచ్చి వచ్చాడు.

శాంతమ్మ కొడుక్కి ఏదో చెప్పాలనుకుంటోంది చెప్పలేకపోతోంది. ఆమె కంటి వెంబడి కన్నీరు అలా కారుతూనే ఉంది. చేతిలో మడత పెట్టిన కాగితం నలుగుతోంది. తల్లి తలను తన ఒడిలో పెట్టుకుని ఆమె చేతిలో నున్న కాగితాన్ని తీసుకున్నాడు రామూర్తి.

శాంతమ్మకి ఒక్క వాంతి అయింది. దాన్తోనే ఆమె ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది.

“అమ్మా.. అమ్మా..!” అంటూ నెత్తికొట్టుకుంటూ ఏడుస్తున్నాడు కొడుకు.

“కొడుకు కోసం ఎదురుచూసింది. అతని చేతుల్లోనే ప్రాణాలు విడిచింది” అక్కడున్నవారు అంటున్నారు. భుజంగరావు అల్లుడ్ని ఓదార్చడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. కాని అతడ్ని ఓదార్చడం సాధ్యం కావటం లేదు. అయినా అతను ఓదారుస్తూనే ఉన్నాడు.

“ఇప్పుడు మనం ఎంత ఏడ్చినా బాధపడినా అమ్మ తిరిగిరాదు. మీ  అమ్మ మాట ప్రకారం నడుచుకోవడమే ఇప్పుడే మనం చేయవల్సిన పని. అప్పుడే ఆమె ఆత్మకి శాంతి కలుగుతుంది. లే.. లే..! జరగవల్సిన మిగతా తంతు పూర్తి చేయాలి,” భుజంగరావు మేనల్లుడితో అన్నాడు.

శాంతమ్మ చనిపోయిన విషయం ఫోను ద్వారా తెలుసుకుని చాలా బాధపడ్డాడు సుందరం. తను ఈ సమయంలో అక్కడ ఉంటే ఎంత బాగుండేది. తనని అక్కడ ఉండనీయకుండా పంపిచేసేరు కాని అని అనుకున్న సుందరం ఫోనులోనే స్నేహితుడ్ని ఓదారుస్తున్నాడు.

“ఒరే సుందరం అమ్మ నన్ను వదిలి వెళ్ళి పోయిందిరా” అంటూ బోరున ఏడుస్తున్నాడు.

“ఊరుకో రామూ! ఇలాంటి సమయంలోనే మనస్సును నియత్రించుకుని ధైర్యంగా ఉండాలి,” ఎలా ఓదార్చాలో తెలియని సుందరం తనదైన శైలిలో అన్నాడు.

“ఇక్కడ జరగవల్సినవన్నీ జరిగాక దంపతులిద్దరం వస్తాం. ఈ కష్ట కాలంలో భగవంతుడే నీకు ధైర్యం ఇస్తాడు” తిరిగి ఓదార్పు మాటలు అన్నాడు సుందరం.

(ఇంకా ఉంది)

Exit mobile version